
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రాపర్టీ కొనాలన్నా, విక్రయించాలన్నా అంత తేలికేమీ కాదు. సవాలక్ష సందేహాలుంటాయి. మెట్రో నగరాల్లో అయితే మరీ ఎక్కువ!!. ఎంపిక చేసిన ప్రాపర్టీకి ఎలాంటి లీగల్ చిక్కులున్నాయో? వాస్తవానికి ఆయా ప్రాంతంలో ధర ఎంత ఉందో? ఒకవేళ కొన్నాక నిర్మాణానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వస్తాయో రావో..? బ్యాంక్ గృహ రుణం ఎంతవరకు ఇస్తుందో? .. ఇలా ప్రతి దశలోనూ సందేహాలే. వీటన్నింటికీ ముందే... అది కూడా చిటికెలో పరిష్కారం చూపిస్తే? అదే ‘మై ఓఎస్ ప్రాపర్టీ.కామ్’ (మేక్ యువర్ ఓన్ స్పేస్ ప్రాపర్టీ.కామ్) ఘనత.
ఈ యాప్ను హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ ‘ఓల్యూబిల్లీస్ ప్రాపర్టీ’ అభివృద్ధి చేసింది. మైఓఎస్ ప్రాపర్టీ యాప్కు మెంటార్గా ఉన్న జేఎన్టీయూ స్కూల్ ఆఫ్ ఫైన్ ఆర్డ్స్ సీనియర్ ఫ్యాకల్టీ మెంబర్ డాక్టర్ డి. విజయ్ కిశోర్ ఈ యాప్ గురించి ‘స్టార్టప్ డైరీ’కి వివరించారు. ఇప్పటివరకు యాప్ డెవలప్మెంట్ కోసం రూ.2 కోట్ల వరకు ఖర్చు చేశామని, ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్స్, వెబ్ అప్లికేషన్స్ మూడూ అందుబాటులో ఉన్నాయన్నా రు. మరిన్ని వివరాలు ఆయన మాటల్లోనే...
12 నగరాల్లో జియో ట్యాగ్..
ప్రస్తుతం హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ, కాన్పూర్, చెన్నై, బెంగళూరు, పుణే, ముంబై, అహ్మదాబాద్, సూరత్, జైపూర్ నగరాల్లో సేవలందిస్తున్నాం. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రోపాలిటన్స్, కార్పొరేషన్లు, స్పెషల్ అథారిటీ తాలూకు బిల్డింగ్ రూల్స్, మాస్టర్ప్లాన్స్ను డెవలప్మెంట్ కంట్రోల్ రెగ్యులేషన్స్(డీసీఆర్) సాంకేతికతతో డీ–కోడింగ్ చేశాం. ఆయా ప్రాపర్టీలకు జియో ట్యాగింగ్ చేశాం. దీంతో ప్రాపర్టీ రెసిడెన్షియల్ జోన్లో ఉందా? కమర్షియల్ జోన్లో ఉందా? ధర ఎం త? వంటివన్నీ సెలక్ట్ చేయగానే వచ్చేస్తాయి.
ఎలా పనిచేస్తుందంటే...
స్మార్ట్ఫోన్లో మైఓఎస్ ప్రాపర్టీ.కామ్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలి. గూగుల్ లొకేషన్స్లో మన ప్రాపర్టీ తాలూకు లొకేషన్, హద్దులను, రోడ్లను మ్యాపింగ్ చేయాలి. అంతే!! క్షణాల్లో ప్రాపర్టీ త్రీడీ రూపంలో ప్రత్యక్షమవుతుంది. అంతేకాదు... ఆయా ప్రాంతంలో ప్రభుత్వం నుంచి ఎన్ని అంతస్తులకు పర్మిషన్ ఉంది? ప్రాపర్టీ విలువ ఎంత? వంటి అన్ని వివరాలు వచ్చేస్తాయి. వీటితో పాటూ ఆర్కిటెక్ట్, ప్లానర్స్, ఇంజనీర్ల వివరాలు, న్యాయపరమైన సలహాల కోసం లీగల్ నిపుణులు, రుణాల కోసం ఆర్ధిక సంస్థలు, బ్యాంక్ల వివరాలు, అనుమతులకు సంబంధించిన ప్రభుత్వ విభాగాలు, ఏజెన్సీలు... ఇలా అన్ని వివరాలూ వచ్చేస్తాయి.
ప్రవాసుల కోసం ల్యాండ్గార్డ్..
ప్రత్యేకంగా ప్రవాసులు(ఎన్నారైల) కోసం ల్యాండ్గార్డ్ అనే మరో ఫీచర్ను అభివృద్ధి చేశాం. ఇదేంటంటే... ప్రవాసులు మెట్రో నగరాల్లో స్థలాలు, ప్రాపర్టీలను కొంటుంటారు. ఆయా ప్రాపర్టీల్లో ఏం జరుగుతోంది? చుట్టుపక్కల ప్రాంతంలో ఎలాంటి అభివృద్ధి జరుగుతోంది? ఎవరైనా కబ్జా చేశారా? వంటి రకరకాల టెన్షన్స్ ఉంటాయి. ఇందుకోసం ల్యాండ్గార్డ్ ఫీచర్లో ప్రతి నెలా ప్రాపర్టీల ప్రత్యక్ష ఫొటోలు తీసి.. వాటిని జియో ట్యాగింగ్ చేసి సదరు ప్రాపర్టీ యజమానులకు పంపిస్తుంటాం. 1100 మంది ఎన్ఆర్ఐలు ఈ సేవలను వినియోగిస్తున్నారు.
100 కోట్ల వ్యాపారం లక్ష్యం..
మైఓఎస్ ప్రాపర్టీ యాప్ మీద సుమారు 50 మంది నిపుణులు పనిచేస్తున్నారు. ఈ ఏడాది చివరికి సుమారు 10 లక్షల డౌన్లోడ్స్కు చేరుతాం. వచ్చే ఏడాది కాలంలో 100 నగరాలకు, రూ.100 కోట్ల టర్నోవర్కు చేరుకోవాలన్నది మా లక్ష్యం.
అద్భుతమైన స్టార్టప్ల గురించి అందరికీతెలియజేయాలనుకుంటే startups@sakshi.com కు మెయిల్ చేయండి...
Comments
Please login to add a commentAdd a comment