
న్యూఢిల్లీ : కొత్త ఫోన్ని అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఉండే కిక్కే వేరు. ఎంతో ముచ్చటపడి కొనుకున్న ఫోన్ని తొలిసారి చేతిలోకి తీసుకున్నప్పుడు ఎవరైనా కాస్తా ఎగ్జైటింగ్గానే ఫీలవుతారు. అలాంటిది దాదాపు 500 మంది.. ఒకేసారి ఒకే మోడల్ ఫోన్ని అన్బాక్స్ చేస్తే ఆ ఫిలింగే వేరు. ఫీలింగ్ సంగతి ఏమో గాని ఇది మాత్రం రికార్డే అంటున్నారు గిన్నిస్ బుక్ అధికారులు. ఈ అరుదైన ఘనత సాధించిన ఫోన్ వన్ప్లస్ 6టీ. అత్యంత తక్కువ సమయంలోనే బెస్ట్ సెల్లింగ్ స్మార్ట్ఫోన్గా వన్ప్లస్ తన రికార్డులను బద్దలు కొడుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే పలు స్మార్ట్ఫోన్లను లాంచ్ చేసిన వన్ప్లస్, నిన్న (నవంబరు 1) ఇండియాలో వన్ప్లస్ 6టీ స్మార్ట్ఫోన్ను లాంచ్ చేసింది. తొలుత ఈ ఫోన్ అమెజాన్, వన్ ప్లస్ ఇండియా ఆన్లైన్ స్టోర్స్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే నవంబర్ 3వ తేదీ నుంచి రిలయన్స్ డిజిటల్ సహా వన్ప్లస్ ఆఫ్లైన్ స్టోర్లు, క్రోమా స్టోర్స్లోనూ వన్ప్లస్ 6టీ లభ్యం కానుంది. అయితే లాంచ్ అయిన మరుసటి రోజే వనప్లస్ 6టీ అరుదైన రికార్డ్ సాధించి గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కింది. అమెజాన్లో వనప్లస్ 6టీ స్మార్ట్ఫోన్ని ఆర్డర్ చేసిన వందలాది మంది వన్ప్లస్ కమ్యూనిటీ మెంబర్స్ని ముంబైలోని ‘రిచర్డ్సన్ అండ్ క్రుడ్డాస్’కు రావాల్సిందిగా వన్ప్లస్ అధికారులు కోరారు.
ఇలా దాదాపు 559 మంది ఇక్కడకు చేరుకున్నారు. వీరందరికి ఒకేసారి.. ఒకే వేదిక మీద వనప్లస్ 6టీ ఫోన్ని డెలివరీ చేసింది అమెజాన్. ఫోన్ని అందుకున్న వారంతా ఒకేసారి దాన్ని అన్బాక్స్ చేశారు. ఇంతవరకూ ప్రపంచంలో ఇంత మంది ఒకే వేదిక మీద.. ఒకేసారి ఒకే మోడల్ ఫోన్ని అన్బాక్స్ చేయలేదు. దాంతో ఈ ఘనత సాధించిన తొలి మొబైల్గా వన్ప్లస్ 6టీ రికార్డ్ సృష్టించి.. గిన్నిస్ వరల్డ్ రికార్డులోకెక్కింది. ఈ విషయం గురించి వన్ప్లస్ అధికారులు ‘వన్ప్లస్ కమ్యూనిటీ శక్తిని, ఉత్సాహాన్ని చూసి మేం ఆశ్యర్యానికి గురయ్యాము. వన్ప్లస్కు ఇండియాలో ఎంత పాపులారిటీ ఉందో వీరిని చూస్తే అర్థం అవుతోంది’ అన్నారు. అమెజాన్ సహకారంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు.