
దేశీయ పసిడి ఫ్యూచర్లలో శుక్రవారం లాభాల స్వీకరణ చోటు చేసుకుంది. ఫలితంగా నేటి ఉదయం సెషన్లో 10గ్రాములు పసిడి ధర రూ.350ల నష్టాన్ని చవిచూసింది. అంతర్జాతీయ మార్కెట్లో పసిడి పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతుండటం కూడా పసిడి ఫ్యూచర్ల విక్రయాలకు కొంత కారణమైంది. ఉదయం 10గంటకు ఆగస్ట్ కాంటాక్టు 10గ్రాముల పసిడి ధర నిన్నటి ముగింపు(రూ.47414)తో పోలిస్తే రూ.265లు నష్టపోయి రూ.47140 వద్ద ట్రేడ్ అవుతోంది. అంతర్జాతీయంగా పసిడి ధర వారం గరిష్టానికి తాకడం, ఈక్విటీల్లో భారీ పతనంతో ఇన్వెస్టర్ల రక్షణాత్మక సాధనమైన పసిడి కొనుగోళ్లకు మొగ్గుచూపారు. దీంతో నిన్నరాత్రి ఎంసీఎక్స్ మార్కెట్ ముగిసే సరికి రూ.788 లాభపడి రూ. 47414 వద్ద స్థిరపడింది.
అంతర్జాతీయంగా పరిమిత శ్రేణిలో:
అంతర్జాతీయ మార్కెట్లో పసిడి ఫ్యూచర్స్ ధర పరిమిత శ్రేణిలో ట్రేడ్ అవుతోంది. పసిడి ధరను ప్రభావితం చేసే డాలర్ బలపడటం ఇందుకు కారణమవుతోంది. ఆసియా ట్రేడింగ్లో ఔన్స్ పసిడి ఫ్యూచర్స్ ధర 4డాలర్లు క్షీణించి 1735డాలర్ల వద్ద ట్రేడ్ అవుతోంది. ఇటీవల రోజుల్లో పసిడి ఫ్యూచర్లు చెప్పుకొదగిన ర్యాలీ చేసిన నేపథ్యంలో కొంతమేర లాభాల స్వీకరణకు జరిగినట్లు బులియన్ పండితులు చెబుతున్నారు. ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లను కనిష్టస్థాయిలో యథాతథంగా ఉంచుతున్నట్లు ప్రకటించడంతో నిన్నటి ట్రేడింగ్ వారం గరిష్టాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. మార్చి నెల మధ్యలో పసిడి ధర 3నెలల కనిష్టాన్ని తాకిన నాటి నుంచి పసిడి ధర 20శాతం ర్యాలీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment