
న్యూఢిల్లీ: దేశీ ఉత్పత్తుల కొనుగోళ్లకు ఊతమిచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న నేపథ్యంలో పలు టెండర్లను ఉపసంహరించింది. ఇందుకు సంబంధించి మార్చిన నిబంధనల కారణంగా దాదాపు రూ. 13,000 కోట్ల విలువ చేసే టెండర్లను ఉపసంహరించడమో, రద్దు చేయడమో లేదా కొత్తగా మరోసారి జారీ చేయడమో జరిగిందని అధికార వర్గాలు తెలిపాయి. ఇందులో రూ. 8,000 కోట్ల యూరియా ప్లాంటు ప్రాజెక్టు, రూ. 5,000 కోట్ల రైలు కోచ్ల ప్రాజెక్టు ఉన్నాయని పేర్కొన్నాయి.
ముందుగా జారీ చేసిన టెండర్లలో విదేశీ కంపెనీలకు ప్రాధాన్యమిచ్చేలా నిబంధనలు ఉన్నట్లు తెలిపాయి. అయితే, ప్రభుత్వ ప్రాజెక్టులకు కొనుగోళ్ల విషయంలో మేడిన్ ఇండియా ఉత్పత్తులకు ప్రాధాన్యమివ్వడంపై దృష్టి పెట్టిన పారిశ్రామిక విధానం, ప్రోత్సాహక విభాగం (డీఐపీపీ) రంగంలోకి దిగిన అనంతరం ఆయా టెండర్లను సవరించాల్సి వచ్చినట్లు సంబంధిత వర్గాలు వివరించాయి.