
3 రోజుల నష్టాలకు చెక్
స్వల్ప లాభాలతో సరి
సెన్సెక్స్ 34 పాయింట్లు ప్లస్
నెలన్నర రోజుల కనిష్టం నుంచి మార్కెట్ కోలుకుంది. అయితే రోజు మొత్తం స్వల్ప ఒడిదుడుకుల కులోనై చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. సెన్సెక్స్ 34 పాయింట్లు లాభపడి 27,831 వద్ద ముగియగా, నిఫ్టీ 15 పాయింట్లు బలపడి 8,356 వద్ద నిలిచింది. బుధవారం ట్రేడింగ్లో చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ కనిపించింది. వెరసి బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు మార్కెట్ను మించుతూ 1% చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,665 లాభపడితే, 1268 నష్టపోయాయి.
వినియోగ వస్తు రంగం అప్
ప్రధానంగా వినియోగవ స్తు రంగం అత్యధికంగా 2.5% పుంజుకోగా, బ్యాంకింగ్ 1% లాభపడింది. బజాజ్ ఎలక్ట్రికల్స్, టైటన్, వీఐపీ, పీసీ జ్యువెలర్ 5-3% మధ్య జంప్ చేశాయి. బ్యాంకింగ్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఎస్బీఐ, బీవోబీ, పీఎన్బీ 5-2% మధ్య పురోగమించాయి.
ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో ఓఎన్జీసీ, టాటా పవర్, టాటా మోటార్స్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ 2.5-1.5% మధ్య పురోగమించాయి. మరోవైపు భెల్, గెయిల్, హెచ్యూఎల్, బజాజ్ ఆటో, ఎల్అండ్టీ, సన్ ఫార్మా 2-1% మధ్య నీరసించాయి. కాగా బీఎస్ఈ-500లో ష్నీడర్ ఎలక్ట్రిక్ 14% దూసుకెళ్లగా, కల్పతరు పవర్, బజాజ్ హిందుస్తాన్, ఎస్కేఎస్ మైక్రో, గీతాంజలి, ప్రాజ్, పిపావవ్ డాక్, ఎల్ఐసీ హౌసింగ్ 11-6% మధ్య లాభపడ్డాయి.