tata power
-
2030 నాటికి రూ. 1.46 లక్షల కోట్ల పెట్టుబడులు
న్యూఢిల్లీ: 2030 నాటికి నిర్వహణ సామర్థ్యాలను రెట్టింపు స్థాయికి పెంచుకోవడంపై టాటా పవర్ దృష్టి పెట్టింది. 31.9 గిగావాట్ల విద్యుదుత్పత్తి సామరర్థ్యాన్ని సాధించే దిశగా రూ. 1.46 లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేయనుంది. కంపెనీ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా ఈ విషయాలు వెల్లడించారు. 2024 ఆర్థిక సంవత్సరంలో టాటా పవర్ స్థాపిత సామర్ధ్యం 15.6 గిగావాట్లుగా ఉంది. ఇందులో పునరుత్పాదక విద్యుత్ విభాగం వాటా 6.7 గిగావాట్లుగా ఉండగా.. ఇది 2030 నాటికి నిర్దేశించుకున్న విద్యుదుత్పత్తి సామర్ధ్యంలో 23 గిగావాట్లకు పెరగనుంది. మరోవైపు, ట్రాన్స్మిషన్ విభాగాన్ని కూడా పటిష్టం చేసుకుంటున్నట్లు సిన్హా చెప్పారు. గత ఆర్థిక సంవత్సరం 4,633 సీకేఎంగా (సర్క్యూట్ కిలోమీటర్స్) ఉన్న ట్రాన్స్మిషన్ లైన్ల సామర్థ్యాన్ని 10,500 సీకేఎంకి పెంచుకోనున్నట్లు వివరించారు. అలాగే కస్టమర్ల సంఖ్యను 1.25 కోట్ల నుంచి 4 కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు సిన్హా చెప్పారు. దీర్ఘకాలిక ప్రణాళికల్లో భాగంగా ఈ ఆర్థిక సంవత్సరం రూ. 21,000 కోట్లు, వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 26,000 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు ఆయన వివరించారు. ప్రస్తుతం రూ. 61,542 కోట్లుగా ఉన్న ఆదాయాన్ని 2030 నాటికి రూ. 1 లక్ష కోట్లకు, నికర లాభాన్ని రూ. 4,100 కోట్ల నుంచి రూ. 10,000 కోట్లకు పెంచుకోవాలని నిర్దేశించుకున్నట్లు సిన్హా చెప్పారు. -
టాటా సంస్థల త్రైమాసిక ఫలితాలు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టాటా టెక్నాలజీస్ నికర లాభం సుమారు రెండు శాతం తగ్గి రూ.157 కోట్లకు పరిమితమైంది. గత క్యూ2లో ఇది రూ.162 కోట్లు. సమీక్షాకాలంలో ఆదాయం రూ.1,269 కోట్ల నుంచి రూ.1,296 కోట్లకు పెరిగింది. మొత్తం వ్యయాలు రూ.1,086 కోట్ల నుంచి రూ.1,095 కోట్లకు పెరిగాయి. సీక్వెన్షియల్ ప్రాతిపదికన సర్వీసుల వ్యాపార విభాగం పుంజుకుందని, 2 శాతం ఆదాయ వృద్ధి నమోదు చేసిందని సంస్థ సీఈవో వారెన్ హ్యారిస్ తెలిపారు. ఆర్డర్ బుక్ పటిష్టంగా ఉందని, ప్రథమార్ధంతో పోలిస్తే ద్వితీయార్ధం మరింత మెరుగ్గా ఉండగలదని ఆయన వివరించారు. టాటా పవర్.. ఫర్వాలేదుటాటాపవర్ సెప్టెంబర్ త్రైమాసికంలో మెరుగైన పనితీరు చూపించింది. కన్సాలిడేటెడ్ నికర లాభం క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చి చూస్తే 8 శాతం పెరిగి రూ.1,093 కోట్లకు చేరింది. క్రితం ఏడాది ఇదే కాలంలో లాభం రూ.1,017 కోట్లుగా ఉంది. ఆదాయం స్వల్ప వృద్ధితో రూ.16,029 కోట్ల నుంచి రూ.16,211 కోట్లకు చేరింది. ‘ఉత్పత్తి, సరఫరా, పంపిణీ, రెన్యువబుల్ వ్యాపారం స్థిరమైన వృద్ధిని కొనసాగించాయి. అన్ని విభాగాలు చెప్పుకోతగ్గ మేర పనితీరు చూపించాయి. దీంతో వరుసగా 20వ త్రైమాసికంలోనూ నికర లాభాన్ని నమోదు చేశాం. భారత్లో తయారీ లక్ష్యానికి అనుగుణంగా తమిళనాడులో మేము చెపట్టిన 4.3 గిగావాట్ సెల్ అండ్ మాడ్యూల్ ప్లాంట్ ఏర్పాటులో భాగంగా.. 2 గిగావాట్ సెల్ తయారీ సెప్టెంబర్ క్వార్టర్లో మొదలైంది. వచ్చే నెల చివరికి పూర్తి స్థాయి సామర్థ్యానికి తయారీ పెరగనుంది’ అని టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా తెలిపారు.ఇదీ చదవండి: గూగుల్ ఆస్తులమ్మినా తీరని జరిమానా!పూర్తి ఆర్థిక సంవత్సరానికి 20,000 కోట్ల మూలధన వ్యయాల ప్రణాళిక ప్రకటించగా.. ఏప్రిల్–సెప్టెంబర్ కాలంలో రూ.9,100 కోట్లను వెచ్చించినట్లు తెలిపారు. విద్యుత్ సరఫరా, పునరుత్పాదక విద్యుత్ తయారీ, హైడ్రో ప్రాజెక్టులపై తాము చేస్తున్న పెట్టుబడులతో దేశ ఇంధన సామర్థ్యం బలోపేతం అవుతుందన్నారు. బీఎస్ఈలో టాటా పవర్ 1 శాతం లాభపడి రూ.445 వద్ద ముగిసింది. -
పచ్చని కొలువులు తోడుంటే..!
2070 నాటికి కర్బన ఉద్గార రహిత (నెట్ జీరో) దేశంగా అవతరించాలనేది భారత్ లక్ష్యం. ఈ దిశగా ఇప్పటికే వడివడిగా అడుగులు పడుతున్నాయి. దిగ్గజ కంపెనీలు పునరుత్పాదక ఇంధన రంగంలో భారీ ప్రాజెక్టులకు తెరతీయడంతో.. గ్రీన్ జాబ్స్కు ఫుల్ డిమాండ్ నెలకొంది.పునరుత్పాదక ఇంధన (రెన్యూవబుల్ ఎనర్జీ) కంపెనీలు ఇప్పుడు నిపుణులకు రారామ్మంటూ రెడ్ కార్పెట్ వేస్తున్నాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు తోడు మరిన్ని కొత్త ప్రాజెక్టులు జతవుతుండటంతో భారీగా సిబ్బంది కొరత నెలకొన్నట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ, టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ, విక్రమ్ సోలార్, జెన్సాల్ గ్రూప్ తదితర సంస్థలు నియామకాల జోరు పెంచిన వాటిలో ఉన్నాయి. ముఖ్యంగా డేటా సైన్స్, వాతావరణ విశ్లేషణ, సోలార్ సెల్–మాడ్యూల్ తయారీ, కార్యకలాపాలు, సరఫరా వ్యవస్థ నిర్వహణ, మెయింటెనెన్స్ వంటి విభాగాల్లో నిపుణులకు భారీగా అవకాశాలున్నాయనేది పరిశ్రమ ఎగ్జిక్యూటివ్లు, హెచ్ఆర్ ఏజెన్సీల మాట! సౌర, పవన విద్యుత్తో పాటు జల, అణు విద్యుత్ ఇతరత్రా హైబ్రీడ్ ప్రాజెక్టులు రెన్యూవబుల్ ఎనర్జీలోకి వస్తాయి. అదానీ.. 50 గిగావాట్లు బహుముఖ రంగాల్లో దూసుకుపోతున్న అదానీ గ్రూప్.. పునరుత్పాదక ఇంధనంపై భారీగా పెట్టుబడులు పెడుతోంది. సౌర, పవన, హైబ్రీడ్ ప్రాజెక్టుల విస్తరణకు అనుగుణంగా అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రధాన కార్యకలాపాలు, మెయింటెనెన్స్లో నిపుణుల నియమాకాలపై దృష్టి పెట్టినట్లు కంపెనీ ప్రతినిధి పేర్కొన్నారు. 2030 నాటికి 50 గిగావాట్ల (జీడబ్యూ) రెన్యూవబుల్ ఎనర్జీ సామర్థ్యాన్ని సాధించాలని అదానీ లక్ష్యంగా పెట్టుకుంది. డేటా సైంటిస్టులు, ఎలక్ట్రికల్–సివిల్ ఇంజినీర్లు, బిజినెస్ ఇంటెలిజెన్స్, డిజిటల్ టెక్నాలజీలు, సరఫరా వ్యవస్థల స్పెషలిస్టులతో పాటు పరికరాల ప్రొక్యూర్మెంట్లో అనుభవం గల వారికి కూడా కంపెనీ పెద్దపీట వేస్తోంది.హైరింగ్లో టాటా ‘పవర్’ ఇక టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ; సౌర, పవన విద్యుత్ ప్రాజెక్టుల నిర్వహణ, ఆపరేషన్స్–మెయింటెనెన్స్, ఇంజినీరింగ్–టెక్నాలజీ తదితర ఉద్యోగాల భర్తీలో తలమునకమైంది. భారీ ప్రాజెక్టులకు తోడు, రూఫ్టాప్ సోలార్ పవర్, ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ కేంద్రాల ఏర్పాటులో కూడా శరవేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ఈ సంస్థలో 2,500 పైగా సిబ్బంది ఉన్నారు. ‘పునరుత్పాదక విద్యుత్కు సంబంధించి ప్రాజెక్టులు ఫాస్ట్ట్రాక్లో నడుస్తున్నాయి. ఈ మేరకు అనేక ఎంఓయూలు కుదుర్చుకున్నాం. గుజరాత్లో 10,000 మెగావాట్ల రెన్యూవబుల్ ఎనర్జీ ప్రాజెక్టులు రానున్నాయి. వీటిద్వారా అనేక ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ భారీ విస్తరణ, వృద్ధికి అనుగుణంగా హైరింగ్ జోరు పెంచుతున్నాం’ అని టాటా పవర్ చీఫ్ హెచ్ఆర్ ఆఫీసర్ హిమల్ తివారీ పేర్కొన్నారు. ఇక జెన్సాల్ గ్రూప్ బ్యాటరీలు, డేటా ఎనలిటిక్స్, ప్రాజెక్ట్–ల్యాండ్ డెవలప్మెంట్, పర్యావరణం, ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ తదితర విభాగాల్లో నిపుణుల వేటలో ఉంది. 2024–2032 మధ్య కాలంలో పునరుత్పాదక ఇంధన మార్కెట్ వార్షికంగా 8.7 శాతం వృద్ధి (సీఏజీఆర్) చెందుతుందని అంచనా. → 2030 నాటికి 500 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిని సాధించాలనేది భారత్ లక్ష్యం. → ప్రస్తుతం భారత్లో గ్రీన్ ఎనర్జీ (భారీ జలవిద్యుత్, అణు విద్యుత్తో సహా) ఉత్పత్తి సామర్థ్యం 208 గిగావాట్లు. మొత్తం విద్యుదుత్పత్తిలో ఇది దాదాపు 46%. గత 9 ఏళ్లలో 400 శాతం ఎగబాకడం విశేషం. → సౌర విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం గత 9 ఏళ్లలో 30 రెట్లు ఎగసి 89.4 గిగావాట్లకు చేరింది. → పవన విద్యుత్ సామర్థ్యం 2014 నుంచి ఇప్పటిదాకా రెట్టింపునకు పైగా ఎగసి 47.19 గిగావాట్లకు చేరుకుంది. – సాక్షి, బిజినెస్ డెస్క్ -
చైనా నిపుణులకు వీసాల జోరు పెంచండి
న్యూఢిల్లీ: చైనా నిపుణుల కొరత దేశీ కంపెనీలను వేధిస్తోంది. ముఖ్యంగా టాటా పవర్ సోలార్, రెన్యూ ఫోటోవోల్టాయిక్ , అవాడా ఎలక్ట్రో వంటి సోలార్ మాడ్యూల్ తయారీదారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. దీంతో చైనా ఇంజినీర్లు, సాంకేతిక నిపుణుల వీసా అప్లికేషన్లను వేగంగా అనుమతించాలంటూ ఆయా కంపెనీలు ప్రభుత్వాన్ని కోరినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. చైనా నుంచి నిపుణుల రాక ఆలస్యం కావడంతో పునరుత్పాదక ఇంధన లక్ష్యాలకు అనుగుణంగా కార్యకలాపాలను పెంచలేకపోతున్నామని కంపెనీలు గగ్గోలు పెడుతున్నాయి. ఈ మూడు కంపెనీలు తమ సోలార్ మాడ్యూల్ ప్లాంట్లలో అవసరమైన 36 మంది చైనా నిపుణుల కోసం బిజినెస్ వీసాల కోసం ఈ ఏడాది జనవరిలో దరఖాస్తు చేయగా.. ఇప్పటిదాకా వాటికి అనుమతులు రాలేదని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందులో టాటా పవర్ సోలార్ అత్యధికంగా 20 మంది చైనా నిపుణుల కోసం వీసాలివ్వాల్సిందిగా కోరింది. ఈ కంపెనీ తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో 4 గిగావాట్ల (జీడబ్ల్యూ) గ్రీన్ఫీల్డ్ సోలార్ సెల్, 4 జీడబ్ల్యూ సామర్థ్యం గల సోలార్ మాడ్యూల్ తయారీ ప్లాంట్ను నెలకొల్పుతోంది. దీనికోసం సుమారు రూ. 3,000 కోట్ల పెట్టుబడి పెడుతోంది. ఇక రెన్యూ పవర్ గుజరాత్లోని ధోలెరాలో, అవాడా కంపెనీ ఉత్తర ప్రదేశ్లోని గౌతమబుద్ధ నగర్లో సోలార్ సెల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేస్తున్నాయి. 500 జీడబ్ల్యూ లక్ష్యం.. 2030 నాటికి దేశంలో సౌరశక్తి, గాలి వంటి పునరుత్పాదక వనరుల ద్వారా 500 జీడబ్ల్యూ విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని నెలకొల్పాలని భారత్ లక్ష్యంగా నిర్దేశించుకుంది. దీనికి అధునాతన పరికరాలు, సాంకేతికత కోసం చైనా దిగుమతులపైనే ఎక్కువగా ఆధారపడాల్సి వస్తోంది. ఎందుకంటే సోలార్ ప్యానెల్స్ తయారీ ఎగుమతుల్లో చైనా ప్రపంచంలోనే టాప్లో ఉంది. చైనాతో సరిహద్దు వివాదాలు ముదరడంతో పాటు కోవిడ్ మహమ్మారి విరుచుకుపడటంతో కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకున్న సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా పలు చైనా యాప్లను నిషేధించింది. పెట్టుబడులపై కూడా డేగకన్ను వేస్తోంది ప్రభుత్వం. చైనీయులు భారత్లో రాకపోకలను కూడా కఠినతరం చేసింది. దీనివల్ల ప్రాజెక్టులు పూర్తి చేయడంలో తీవ్ర జాప్యంతో పాటు వ్యయాలు పెరిగిపోయేందుకు దారితీస్తుందని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. -
టాటా పవర్ భారీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ ఈ ఆర్థిక సంవత్సరం(2024–25)లో భారీ పెట్టుబడులు వెచ్చించనుంది. కంపెనీ 105వ వార్షిక సాధారణ సమావేశంలో చైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ వాటాదారులకు పెట్టుబడి సంబంధిత అంశాలను వెల్లడించారు.వీటి ప్రకారం కంపెనీ ఈ ఏడాది రూ. 20,000 కోట్ల పెట్టుబడి వ్యయాలకు సిద్ధంగా ఉంది. వీటిలో అధిక శాతం పెట్టుబడులను పునరుత్పాదక ఇంధన పోర్ట్ఫోలియోకు కేటాయించనుంది. మిగిలిన నిధులను విద్యుత్ ప్రసారం, పంపిణీ బిజినెస్పై వెచ్చించనుంది. గతేడాది కేటాయించిన రూ. 12,000 కోట్లతో పోలిస్తే తాజా పెట్టుబడులు దాదాపు 67 శాతం అధికంకావడం గమనార్హం!కంపెనీ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్ల తయారీలోగల అవకాశాలను అన్వేషించనున్నట్లు టాటా సన్స్కు సైతం చైర్మన్గా వ్యవహరిస్తున్న చంద్రశేఖరన్ పేర్కొన్నారు. వీటికి ప్రభుత్వం అవసరమైన అనుమతులను మంజూరు చేసిన అనంతరం ఇందుకు సన్నాహాలు చేపట్టనున్నట్లు తెలియజేశారు. కంపెనీ ఐదేళ్లలో క్లీన్ ఎనర్జీ పోర్ట్ఫోలియోను 15 గిగావాట్లకు పెంచుకునే లక్ష్యంతో ఉంది. ప్రస్తుతం 9 గిగావాట్ల సామర్థ్యాన్ని కలిగి ఉంది. ప్రస్తుత, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల ద్వారా లక్ష్యాన్ని చేరుకోనుంది.అంతేకాకుండా తమిళనాడులో 4.3 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంటును ఏర్పాటుకు కసరత్తు చేస్తోంది. మరోపక్క ఈవీ చార్జింగ్ విభాగంపై దృష్టి పెట్టిన కంపెనీ 530కుపైగా పట్టణాలలో 5,500 పబ్లిక్, సొంత అవసరాల చార్జర్లను ఏర్పాటు చేసింది. ఈ బాటలో 86,000కుపైగా హోమ్ చార్జర్లను సైతం నెలకొల్పింది. వాటాదారులకు కంపెనీ బోర్డు షేరుకి రూ. 2 చొప్పున డివిడెండ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. -
రూ.1000 కోట్లు దాటిన టాటా కంపెనీ లాభం
న్యూఢిల్లీ: టాటా పవర్ చివరి త్రైమాసికం కన్సాలిడేటెడ్ నికర లాభం 11% పుంజుకుని రూ. 1,046 కోట్ల ను తాకింది. మొత్తం ఆదాయం రూ. 13,325 కోట్ల నుంచి రూ. 16,464 కోట్లకు జంప్చేసింది. షేరుకి రూ. 2 చొప్పున తుది డివిడెండ్ ప్రకటించింది.ఇందుకు జులై 4 రికార్డ్ డేట్. పూర్తి ఏడాదికి టాటా పవర్ నికర లాభం రూ. 3,810 కోట్ల నుంచి రూ. 4,280 కోట్లకు బలపడింది. ఆదాయం సైతం రూ. 56,547 కోట్ల నుంచి రూ. 63,272 కోట్లకు ఎగసింది. ఇది కంపెనీ చరిత్రలోనే అత్యధికం.కంపెనీ ప్రకటన ప్రకారం కంపెనీ మార్కెట్ క్యాప్ రూ.1.4 లక్షల కోట్లను అధిగమించింది. 2023-24 ఆర్థిక సంవత్సరంలో కంపెనీ రూ. 61,542 కోట్ల అత్యధిక ఆదాయాన్ని, రూ. 12,701 కోట్ల ఎబిటాను సాధించింది. -
ఒక్క నిర్ణయం.. ఈవీ ఛార్జింగ్ సమస్యలకు చెక్!
భారతదేశంలో ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది, పెరుగుతున్న వాహనాలకు కావలసినన్ని 'ఛార్జింగ్ స్టేషన్స్' మాత్రం అంతంత మాత్రంగానే ఉన్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ లిమిటెడ్ (TPEVCSL).. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL)తో ఒప్పందం కుదుర్చుకుంది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. టాటా పవర్ అనుబంధ సంస్థ TPEVCSL దేశంలో ఛార్జింగ్ స్టేషన్స్ సంఖ్యను పెంచడానికి IOCLతో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం ఈ రెండూ కలిసి దేశవ్యాప్తంగా సుమారు 500 కంటే ఎక్కువ హైస్పీడ్, అల్ట్రా-ఫాస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేయనున్నాయి. త్వరలో ఇన్స్టాల్ చేయనున్న ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్ ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు, అహ్మదాబాద్, పూణే, కొచ్చి వంటి ప్రధాన నగరాల్లో మాత్రమే కాకుండా.. ముంబై-పూణె ఎక్స్ప్రెస్వే, సేలం-కొచ్చి హైవే, గుంటూరు-చెన్నై హైవే వంటి ప్రధాన రహదారులపై ఉన్న 'ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్' అవుట్లెట్లలో ప్రారంభించనున్నారు. ఎలక్ట్రిక్ వాహనాల్లో లాంగ్ జర్నీ చేయాలనుకునే వారికి ఈ కొత్త ఛార్జింగ్ స్టేషన్లు చాలా ఉపయోగకరంగా ఉంటాయని, 'టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్' యాప్ ద్వారా లేదా 'ఇండియన్ ఆయిల్ ఈ-ఛార్జ్' మొబైల్ యాప్ ద్వారా ఛార్జింగ్ స్టేషన్స్ గురించి సమాచారం తెలుసుకోవచ్చని టాటా పవర్ బిజినెస్ డెవలప్మెంట్-ఈవీ చార్జింగ్ హెడ్ వీరేంద్ర గోయల్ తెలిపారు. ఇదీ చదవండి: కోకా కోలా నుంచి మద్యం.. రేటెంతో తెలుసా? ఎలక్ట్రిక్ వాహనాల వృద్ధి పెరుగుతున్న సమయంలో ఛార్జింగ్ స్టేషన్ల సంఖ్య కూడా పెరగాల్సి ఉంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుమారు 6000 కంటే ఎక్కువ ఛార్జింగ్ స్టేషన్స్ ఉన్నట్లు, వీటి సంఖ్యను 2024 నాటికి 10000 చేర్చడానికి కంపెనీ కృషి చేస్తున్నట్లు సమాచారం. అనుకున్నవన్నీ సక్రమంగా జరిగితే రానున్న రోజుల్లో ఎలక్ట్రిక్ వాహనాలకు ఛార్జింగ్ సమస్యలు దాదాపు తొలగిపోతాయని స్పష్టంగా తెలుస్తోంది. -
టాటా పవర్, ఐవోసీ జట్టు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 500 ఫాస్ట్, అల్ట్రా ఫాస్ట్ ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసే దిశగా టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్, ప్రభుత్వ రంగ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) చేతులు కలిపాయి. ఇందుకు సంబంధించి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందం ప్రకారం (ఎంవోయూ) ఐవోసీ రిటైల్ అవుట్లెట్స్లో టాటా పవర్ చార్జింగ్ పాయింట్లను ఇన్స్టాల్ చేస్తుంది. ముంబై, ఢిల్లీ, కోల్కతా, బెంగళూరు వంటి పెద్ద నగరాలతో పాటు గుంటూరు–చెన్నై హైవే, సేలం–కొచ్చి హైవే వంటి జాతీయ రహదారుల వెంట వీటిని నెలకొల్పుతుంది. దీనితో సుదూర ప్రయాణాలు చేసే ఎలక్ట్రిక్ వాహనదారులు రేంజి (మైలేజి)పరంగా ఆందోళన చెందాల్సిన అవసరం తప్పుతుందని టాటా పవర్ హెడ్ (బిజినెస్ డెవలప్మెంట్ – ఈవీ చార్జింగ్) వీరేంద్ర గోయల్ తెలిపారు. చార్జర్ల లభ్యత గురించి టాటా పవర్ ఈజెడ్ చార్జ్, ఇండియన్ఆయిల్ ఈ–చార్జ్ మొబైల్ యాప్ల ద్వారా తెలుసుకోవచ్చని పేర్కొన్నారు. 2024 నాటికి 10,000 పైచిలుకు ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు ఐవోసీ ఈడీ సౌమిత్ర శ్రీవాస్తవ పేర్కొన్నారు. -
బ్రిడ్జ్స్టోన్ డీలర్షిప్లలో ఈవీ చార్జర్లు
న్యూఢిల్లీ: టైర్ల తయారీ సంస్థ బ్రిడ్జ్స్టోన్ ఇండియా తమ డీలర్షిప్లలో ఎలక్ట్రిక్ వాహనాల (ఈవీ) చార్జర్ల ఏర్పాటు కోసం టాటా పవర్తో చేతులు కలిపింది. ఈ ఒప్పందం ప్రకారం గంట వ్యవధిలోనే కార్లు వంటి నాలుగు చక్రాల వాహనాలను చార్జింగ్ చేసే సామర్ధ్యం ఉండే ఫాస్ట్ చార్జర్లను టాటా పవర్ ఇన్స్టాల్ చేస్తుంది. తద్వారా ఒక్కో చార్జరుతో రోజులో 20–24 వాహనాలను చార్జింగ్ చేయడానికి వీలవుతుందని బ్రిడ్జ్స్టోన్ ఇండియా చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ రాజర్షి మొయిత్రా తెలిపారు. బ్రిడ్జ్స్టోన్ కస్టమర్లతో పాటు ఎలక్ట్రిక్ వాహనదారులందరికీ దేశవ్యాప్తంగా తమ డీలర్షిప్లలో ఈ చార్జర్లు 24 గంటలూ అందుబాటులోకి ఉంటాయన్నారు. ఇన్స్టాలేషన్, చార్జింగ్, మెయింటెనెన్స్, ఈ–పేమెంట్స్ మొదలైన వాటికి సంబంధించి టాటా పవర్ సహాయ, సహకారాలు అందిస్తుంది. -
జూమ్కార్, టాటా పవర్ ఈవీ జోడీ
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు టాటా పవర్ ఈవీ చార్జింగ్ సొల్యూషన్స్ తాజాగా కార్ షేరింగ్ కంపెనీ జూమ్కార్తో భాగస్వామ్యం కుదుర్చుకుంది. జూమ్కార్ ప్రస్తుత, కొత్త ఈవీ కస్టమర్లు టాటా పవర్ ఈజీ చార్జ్ పాయింట్లను వినియోగించుకోవచ్చు. వచ్చే అయిదేళ్లలో దేశవ్యాప్తంగా 25,000 చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేయాలని టాటా పవర్ లక్ష్యంగా చేసుకుంది. భారత్, ఇండోనేíÙయా, ఈజిప్ట్లో జూమ్కార్కు 20,000 పైచిలుకు వినియోగదార్లు ఉన్నారు. -
అమెజాన్ను మించి.. ఆకర్షణీయ ఎంప్లాయర్ బ్రాండ్ ఏంటో తెలుసా?
ముంబై: దేశీయంగా అత్యంత ఆకర్షణీయమైన ఎంప్లాయర్ (ఉద్యోగాలు కల్పించే సంస్థ) బ్రాండ్గా టాటా పవర్ కంపెనీ అగ్రస్థానంలో నిల్చింది. ఈ–కామర్స్ దిగ్గజం అమెజాన్, ఉక్కు దిగ్గజం టాటా స్టీల్ వరుసగా రెండు, మూడో స్థానాలు దక్కించుకున్నాయి. మానవ వనరుల సర్వీసుల సంస్థ రాండ్స్టాడ్ ఇండియా తమ వార్షిక నివేదిక ‘రాండ్స్టాడ్ ఎంప్లాయర్ బ్రాండ్ రీసెర్చ్ (ఆర్ఈబీఆర్) 2023‘లో ఈ అంశాలు వెల్లడయ్యాయి. ఆర్థిక స్థితి, మంచి పేరు, కెరియర్లో పురోగమించేందుకు అవకాశాలు కల్పించడం వంటి మూడు అంశాల ప్రాతిపదికగా రాండ్స్టాడ్ ర్యాంకులు ఇచ్చింది. దీని ప్రకారం 2022లో 9వ స్థానంలో ఉన్న టాటా పవర్ తాజాగా నంబర్ వన్ స్థానానికి చేరింది. నివేదిక ప్రకారం ఉద్యోగులు అత్యంత ఆకర్షణీయమైన రంగంగా ఆటోమోటివ్కు (77 శాతం) ఓటేశారు. ఐటీ, ఐటీఈఎస్, టెలికం (76 శాతం) .. ఎఫ్ఎంసీజీ, రిటైల్, ఈ–కామర్స్ (75 శాతం) తర్వాత స్థానాల్లో ఉన్నాయి. మరిన్ని విశేషాలు.. టాప్ 10 కంపెనీల్లో నాలుగో స్థానంలో టీసీఎస్.. ఆ తర్వాత వరుసగా మైక్రోసాఫ్ట్, శాంసంగ్ ఇండియా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఐబీఎం, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. అత్యంత ఆకర్షణీయ స్టార్టప్ ఎంప్లాయర్గా బిగ్ బాస్కెట్ నిల్చింది. ఎంప్లాయర్ను ఎంచుకునేటప్పుడు ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం, కంపెనీకి ఉన్న పేరు ప్రతిష్టలు, ఆకర్షణీయమైన జీతభత్యాలకు ఉద్యోగార్థులు ప్రాధాన్యం ఇస్తున్నారు. మహిళలు ఎక్కువగా ఉద్యోగ–వ్యక్తిగత జీవితం మధ్య సమతూకాన్ని పరిగణనలోకి తీసుకుంటున్నారు. అదనపు ఆదాయం కోసం వేరే అసైన్మెంట్లు లేదా అదనంగా మరో ఉపాధి మార్గాన్ని ఎంచుకునేందుకు అనుమతించే కంపెనీలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయని 91 శాతం మంది ఉద్యోగులు పేర్కొన్నారు. సిబ్బంది ఆధారంగానే వ్యాపారంలో విజయం సాధించగలమని, పెట్టుబడి ఒక్కటే సరిపోదని ప్రపంచవ్యాప్తంగా సంస్థలు గుర్తిస్తున్నాయి. అలాగే, ఉద్యోగులు కూడా తాము ఏ బ్రాండుతో కలిసి పని చేయాలి, దీర్ఘకాలికంగా పని–వ్యక్తిగత జీవితం మధ్య సమతౌల్యం ఎలా ఉంటుంది అనే అంశాలపై మరింతగా ఆలోచిస్తున్నారు. -
టాటా పవర్ లాభం ప్లస్
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం దాదాపు రెట్టింపై రూ. 1,052 కోట్లను అధిగమించింది. గతేడాది (2021–22) ఇదే కాలంలో రూ. 552 కోట్లు మాత్ర మే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 11,019 కోట్ల నుంచి రూ. 14,402 కోట్లకు ఎగసింది. ఈ కాలంలో హరిత ఇంధనం, విద్యుత్ ప్రసారం, పంపిణీ తదితర విభిన్న బిజినెస్లలో ప్రస్తావించదగ్గస్థాయిలో అడుగులు వేసినట్లు కంపెనీ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా పేర్కొన్నారు. పునరుత్పాదకాలు, ఒడిషా వి ద్యుత్ పంపిణీలలో పెట్టుబడులకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేశారు. రూఫ్టాప్ సోలార్, ఈవీ చార్జింగ్ విభాగాలను మరింత పటిష్టం చేస్తున్నట్లు తెలియజేశారు. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ రూ. 15,440 కోట్ల విలువైన 3.9 గిగావాట్ల థర్డ్పార్టీ ప్రాజెక్టులతో కలిపి ఆర్డర్లను కలిగి ఉన్నట్లు వెల్లడించారు. ఫలితాల నేపథ్యంలో టాటా పవర్ షేరు ఎన్ఎస్ఈలో 0.4 శాతం నీరసించి రూ. 206 వద్ద ముగిసింది. -
టాటా పవర్ నిధుల సమీకరణ
ప్రయివేట్ రంగ దిగ్గజం టాటా పవర్ మార్పిడిరహిత డిబెంచర్ల(ఎన్సీడీలు) జారీ ద్వారా రూ. 1,000 కోట్లు సమీకరించింది. ప్రయివేట్ ప్లేస్మెంట్లో భాగంగా 10,000 అన్సెక్యూర్డ్, రీడీమబుల్, ట్యాక్సబుల్, లిస్టెడ్, రేటెడ్, ఎన్సీడీలను జారీ చేసినట్లు కంపెనీ పేర్కొంది. రూ. 500 కోట్ల విలువైన సిరీస్–1 ఎన్సీడీలకు 2030 జనవరి 8న, మరో రూ. 500 కోట్ల విలువైన సిరీస్–2 ఎన్సీడీలకు 2032 డిసెంబర్ 29న గడువు ముగియనున్నట్లు తెలియజేసింది. ఈ బాండ్లను బీఎస్ఈలో లిస్ట్ చేయనున్నట్లు వెల్లడించింది. ఎన్సీడీల జారీ వార్తల నేపథ్యంలో టాటా పవర్ షేరు ఎన్ఎస్ఈలో 1 శాతం నీరసించి రూ. 206 వద్ద ముగిసింది. -
టాటా పవర్.. డబుల్ ధమాకా!
న్యూఢిల్లీ: ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) తొలి త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన ఏప్రిల్–జూన్(క్యూ1)లో నికర లాభం 90 శాతం జంప్చేసి రూ. రూ. 884 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 466 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం రూ. 10,310 కోట్ల నుంచి రూ. 14,639 కోట్లకు ఎగసింది. అయితే మొత్తం వ్యయాలు రూ. 9,480 కోట్ల నుంచి రూ. 14,660 కోట్లకు భారీగా పెరిగాయి. ఈ ఏడాది రూ. 14,000 కోట్ల పెట్టుబడులను వెచ్చించనున్నట్లు కంపెనీ ఫలితాల విడుదల సందర్భంగా వెల్లడించింది. వీటిలో రూ. 10,000 కోట్లను పునరుత్పాదక ఇంధన విభాగంపై ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. సోలార్ సెల్ ప్లాంట్ 4 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ ప్లాంటు ఏర్పాటుకు తమిళనాడు ప్రభుత్వంతో అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు టాటా పవర్ తాజాగా తెలియజేసింది. ఇందుకు రూ. 3,000 కోట్ల పెట్టుబడులు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ప్రస్తుతం కంపెనీ పునరుత్పాదక ఇంధన సామర్థ్యం 5,524 మెగావాట్లుకాగా.. దీనిలో స్థాపిత సామర్థ్యం 3,634 మెగావాట్లు. మరో 1,890 మెగావాట్ల యూనిట్లు వివిధ అభివృద్ధి దశలలో ఉన్నాయి. మరోవైపు వివిధ రాష్ట్రాలలో 75,000 సోలార్ పంపులను ఏర్పాటు చేసింది. విద్యుత్ ప్రసారం, పంపిణీ విభాగంలో ఎన్ఆర్ఎస్ఎస్ ట్రాన్స్మిషన్ను(100 శాతం వాటా) సొంతం చేసుకుంది. ఫలితాల నేపథ్యంలో టాటా పవర్ షేరు ఎన్ఎస్ఈలో 3 శాతం నష్టంతోరూ. 226 దిగువన ముగిసింది. చదవండి: అక్రమ నిర్మాణం..వందల కోట్లకు ఇంటిని అమ్మేసిన మార్క్ జుకర్ బర్గ్! -
టాటా పవర్ విండ్ ప్రాజెక్టులు
న్యూఢిల్లీ: దేశీయంగా తీరప్రాంత పవన్ విద్యుత్(ఆఫ్షోర్ విండ్) ప్రాజెక్టుల అభివృద్ధివైపు టాటా పవర్ తాజాగా దృష్టి సారించింది. దీనిలో భాగంగా జర్మన్ కంపెనీ ఆర్డబ్ల్యూఈ రెనెవబుల్స్ జీఎంబీహెచ్తో కలసి పనిచేయనున్నట్లు పేర్కొంది. ఇందుకు పూర్తి అనుబంధ సంస్థ టాటా పవర్ రెనెవబుల్ ఎనర్జీ లిమిటెడ్ ద్వారా అవగాహనా ఒప్పందాన్ని(ఎంవోయూ) కుదుర్చుకున్నట్లు వెల్లడించింది. వెరసి ఆఫ్షోర్ విండ్ ఎనర్జీకి ప్రపంచంలోని అత్యుత్తమ సంస్థలలో ఒకటైన ఆర్డబ్ల్యూఈతో భాగస్వామ్యాన్ని ఏర్పాటు చేసుకున్నట్లు టాటా పవర్ తెలియజేసింది. దేశీయంగా 7,600 కిలోమీటర్ల పొడవైన తీరప్రాంతం ఉండటంతో ఆఫ్షోర్ విండ్ ప్రాజెక్టుల అభివృద్ధికి అత్యంత వీలున్నట్లు వివరించింది. 2030కల్లా 30 గిగావాట్ల ఆఫ్షోర్ విండ్ సామర్థ్య ఏర్పాటును లక్ష్యంగా పెట్టుకున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు తమ ఎంవోయూ మద్దతివ్వనున్నట్లు తెలియజేసింది. రెండు సం స్థలకుగల సామర్థ్య వినియోగం ద్వారా దేశీయంగా పోటీపడేస్థాయిలో ఆఫ్షోర్ విండ్ మా ర్కెట్ను అభివృద్ధి చేయనున్నట్లు పేర్కొంది. ఎన్ఎస్ఈలో టాటా పవర్ షేరు 0.5 శాతం నీరసించి రూ. 225 వద్ద ముగిసింది. -
సత్తా చూపిన టాటా పవర్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ ఆకర్షణీయ ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 74 శాతం జంప్చేసి రూ. 552 కోట్లను తాకింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 318 కోట్లు మాత్రమే ఆర్జించింది. వెరసి వరుసగా 9వ క్వార్టర్లోనూ కంపెనీ నికర లాభాల్లో వృద్ధిని సాధించింది. ఇక మొత్తం ఆదాయం సైతం 42 శాతం ఎగసి రూ. 11,015 కోట్లకు చేరింది. ఇందుకు ఒడిశా డిస్కమ్ల విస్తరణ, టాటా పవర్ సోలార్ సిస్టమ్స్(టీపీఎస్ఎస్ఎల్) పూర్తిచేసిన అధిక ప్రాజెక్టులు వంటి అంశాలు ప్రభావం చూపినట్లు కంపెనీ పేర్కొంది. సోలార్ సెల్ తయారీ అనుబంధ సంస్థ టీపీఎస్ఎస్ఎల్ 4 గిగావాట్ల సోలార్ సెల్, మాడ్యూల్ తయారీ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్లు టాటా పవర్ సీఈవో, ఎండీ ప్రవీర్ సిన్హా పేర్కొన్నారు. ఇందుకు రూ. 3,400 కోట్లు ఇన్వెస్ట్ చేయనున్నట్లు వెల్లడించారు. పునరుత్పాదక ఇంధనం, పంపిణీ, రూఫ్టాప్ సోలార్, ఈవీ చార్జింగ్ తదితర వృద్ధికి వీలున్న కీలక విభాగాలపై దృష్టి సారించినట్లు పేర్కొన్నారు. కంపెనీ తాజాగా 289 మెగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని జత చేసుకుంది. దేశవ్యాప్తంగా 1200కుపైగా ఈవీ చార్జింగ్ పాయింట్లను ఏర్పాటు చేసింది. జేవీలు, అనుబంధ సంస్థలతో కలిపి కంపెనీ మొత్తం 13,171 మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. చదవండి: ఎలక్ట్రిక్ కారు కొనేవారికి టాటా పవర్ తీపికబురు -
ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన ప్రియులకు టీవీఎస్, టాటా పవర్ శుభవార్త!
న్యూఢిల్లీ: దేశంలో ద్విచక్ర వాహన ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్లను నిర్మించడం కోసం టీవీఎస్ మోటార్ కంపెనీ, టాటా పవర్ వ్యూహాత్మక భాగస్వామ్యం ఒప్పందం కుదుర్చుకున్నాయి. ఈ ఎమ్ఒయులో భాగంగా భారతదేశం అంతటా టీవీఎస్ మోటార్ ప్రదేశాలలో ఎలక్ట్రిక్ వేహికల్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్(ఈవీసీఐ) నిర్మించడం కోసం రెండు కంపెనీలు అంగీకరించాయి. భారతదేశంలో ఎలక్ట్రిక్ మొబిలిటీని వేగవంతం చేయడం కోసం పెద్ద డెడికేటెడ్ ఎలక్ట్రిక్ టూ వీలర్ ఛార్జింగ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ సృష్టించడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. టీవిఎస్ మోటార్ కస్టమర్ కనెక్ట్ యాప్, టాటా పవర్ ఈజెడ్ ఛార్జ్ యాప్ ద్వారా దేశంలో విస్తృతంగా ఏర్పాటు చేయనున్న ఛార్జింగ్ నెట్ వర్క్ స్టేషన్లు దగ్గరలో ఎక్కడ ఉన్నాయి అనేది ద్విచక్ర ఎలక్ట్రిక్ వాహన వినియోగదారులు తెలుసుకోవచ్చు. ఈ ఎలక్ట్రిక్ టూ వీలర్ల కోసం రెగ్యులర్ ఎసీ ఛార్జింగ్ నెట్ వర్క్, డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ నెట్ వర్క్ ఏర్పాటు చేయడం ఈ భాగస్వామ్యం లక్ష్యం. ఎలక్ట్రిక్ వాహనాలను కొనుగోలుచేయాలని చూసేవారికి ఈ భాగస్వామ్యం మరింత సహాయపడుతుంది. రోజు రోజుకి పెరుగుతున్న కాలుష్య నేపథ్యంలో సౌర శక్తి ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఈ ఉద్దేశ్యంతోనే రెండు కంపెనీలు తమ ప్రయాణంలో ఎంపిక చేసిన ఛార్జింగ్ స్టేషన్ల వద్ద సౌర శక్తి ద్వారా పవర్ ఉత్పత్తి చేసే అవకాశాలను కూడా అన్వేషిస్తున్నాయి. (చదవండి: ఫేస్బుక్ యూజర్లకు మరో భారీ షాక్..!) -
ఎలక్ట్రిక్ వెహికల్ ప్రియులకు హెచ్పీసీఎల్ శుభవార్త!
ముంబై: ఎలక్ట్రిక్ వెహికల్ ప్రియులకు హెచ్పీసీఎల్ శుభవార్త తెలిపింది. రాబోయే మూడేళ్లలో 5,000 ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రభుత్వ యాజమాన్యంలోని హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) యోచిస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం, దేశవ్యాప్తంగా 84 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేసింది. గత కొన్ని నెలలుగా హెచ్పీసీఎల్ తన రిటైల్ అవుట్ లెట్లలో ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కల్పించడం కోసం కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఇఎస్ఎల్), టాటా పవర్, మెజెంటా ఈవీ సిస్టమ్స్ అనే మూడు సంస్థలతో జతకట్టింది. రూ.65,000 కోట్ల పెట్టుబడులు.. "హెచ్పీసీఎల్ గ్రీన్ పవర్, గ్రీన్ హైడ్రోజన్ అవకాశాలకు సంబంధించి సమీక్షిస్తోంది" అని హెచ్పీసీఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ ఎంకె సురనా కంపెనీ వార్షిక సర్వసభ్య సమావేశంలో తెలిపారు. వివిధ ప్రాజెక్టుల కింద వచ్చే ఐదేళ్లలో సుమారు రూ.65,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు పేర్కొన్నారు. ఈ ఏడాది మార్చిలో హెచ్పీసీఎల్ తన స్టార్ట్-అప్ అభివృద్ధి కార్యక్రమం కింద మెజెంటా ఈవీ సిస్టమ్స్ సహకారంతో మొట్టమొదటి ఈవీ(ఎలక్ట్రిక్ వేహికల్) ఛార్జర్ కేంద్రాన్ని ప్రారంభించింది. "ఛార్జ్ గ్రిడ్ ఫ్లేర్" అని పేరుతో పిలిచే ఈ ఈవీ ఛార్జర్ తక్కువ ధరకు ఛార్జింగ్ సౌకర్యాలను కలిపిస్తుంది. దేశ వ్యాప్తంగా ఎంపిక చేసిన రిటైల్ అవుట్ లెట్లలో "ఛార్జ్ గ్రిడ్ ఫ్లేర్" శ్రేణి ఛార్జర్లను ఇన్ స్టాల్ చేయాలని హెచ్పీసీఎల్ యోచిస్తోంది.(చదవండి: అథర్ బంపర్ ఆఫర్.. ఏ స్కూటర్కైనా ఛార్జింగ్ ఫ్రీ) ఈ-మొబిలిటీ వాహనాల కొనుగోలుకు వినియోగదారులను ప్రోత్సహించడం కోసం, ఈవీ రంగంలో ద్విచక్ర, కార్ల వాహన యాజమానుల బ్యాటరీ ఛార్జింగ్ సమస్యలను పరిష్కరించడం కోసం హెచ్పీసీఎల్ మౌలిక సదుపాయాలను అప్ గ్రేడ్ చేస్తోంది. ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్(ఈఈఎస్ఎల్) యాజమాన్యంలోని సబ్సిడరీ అయిన సీఇఎస్ఎల్తో హెచ్పీసీఎల్ ఒప్పందం చేసుకుంది. రాబోయే 10 సంవత్సరాలలో ముంబై, న్యూఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై, కోల్ కతా, పూణేతో వంటి నగరాల్లో ఎంపిక చేసిన రిటైల్ అవుట్ లెట్లలో ఎలక్ట్రిక్ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయనుంది. -
సోలార్ పవర్ ప్రాజెక్టులో దూసుకెళ్తున్న టాటా పవర్
సోలార్ పవర్ ప్రాజెక్టు నిర్మాణ పరంగా టాటా పవర్ దూసుకెళ్తుంది. టాటా పవర్ ఆర్మ్ టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ లిమిటెడ్(టీపీఆర్ఈఎల్) రాజస్థాన్లోని లోహర్కి గ్రామంలో 150 మెగావాట్ల సోలార్ పవర్ ప్రాజెక్టును నిర్మించింది. రాజస్థాన్లోని ఈ ప్రాజెక్టుతో టాటా పవర్ మొత్తం పునరుత్పాదక వ్యవస్థాపన సామర్థ్యం 2,947 మెగావాట్ల(2,015 మెగావాట్ల సోలార్, 932 మెగావాట్ల విండ్ పవర్)కు చేరుకుంది. ఇంకా 1,084 మెగావాట్ల పునరుత్పాదక టాటా పవర్ ప్రాజెక్టు పనులు ఇంకా నిర్మాణ దశలో ఉన్నాయి. 756 ఎకరాల భూమిలో విస్తరించి ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా సంవత్సరానికి 350 మిలియన్ యూనిట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని భావిస్తున్నారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రతి ఏడాది 3.34 లక్షల టన్నుల కార్బన్ ఉద్గారం తగ్గే అవకాశం ఉంది. ఈ ప్రాజెక్టు కోసం సుమారు 6.5 లక్షల మాడ్యూల్స్, 48 ఇన్వర్టర్లు, 720 కిలోమీటర్ల డీసీ కేబుల్, 550 మ్యాన్ పవర్ ఉపయోగించారు. "రాజస్థాన్లోని లోహర్కిలో నిర్మించిన 150 మెగావాట్ల ప్రాజెక్టు, సౌర విద్యుత్ ఉత్పత్తిలో దేశంలోని ప్రముఖ పునరుత్పాదక ఇంధన సంస్థలో ఒకటిగా మా స్థానాన్ని సుస్థిరం చేసింది. భారతదేశంలో పునరుత్పాదక శక్తి వృద్ధిని ఇదేవిధంగా మేము కొనసాగిస్తాము" అని టాటా పవర్ సీఈఓ, ఎండి డాక్టర్ ప్రవీర్ సాహా తెలిపారు. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ద్వారా టీపీఆర్ఈఎల్ ఈ ప్రాజెక్టును నిర్ణీత సమయంలోనే పూర్తి చేసినట్లు పేర్కొన్నారు.(చదవండి: డిసెంబరే టార్గెట్.. ఎయిరిండియాను అమ్మేయడానికే) -
అత్యంత ఎత్తులో పవర్ స్టేషన్... టాటా వరల్డ్ రికార్డు
సాక్షి, వెబ్డెస్క్: ఇప్పటికే ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్న టాటా మరో రికార్డుపై కన్నేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ప్రదేశంలో సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి సిద్ధమైంది. దీంతో పాటు బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ని ఏర్పాటు చేయనుంది. సోలార్లోకి టాటా కాలుష్య రహిత గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తికి కేంద్రం ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో కార్పోరేటు కంపెనీలు సౌర విద్యుత్తుపై దృష్టి సారించాయి. అందులో భాగంగా టాటా సంస్థ సైతం దేశంలో వివిధ ప్రాంతాల్లో సోలార్ పవర్ స్టేషన్లు నిర్మాణం చేపడుతోంది. మన అనంతపురంలో 150 మెగావాట్ల పవర్ ప్లాంటుతో పాటు కేరళలోని కాసర్గోడ్లో 50 మెగావాట్లు, ఒడిషాలోని లపంగాపలో 30 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్ల నిర్మాణం టాటా పవర్ చేపట్టింది. అయితే వీటి లేని ప్రత్యేకత తాజాగా చేపట్టబోయే ప్రాజెక్టులో చోటు చేసుకోనుంది. వరల్డ్ రికార్డు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన పీఠభూముల్లో ఒకటైన లదాఖ్లో కొత్తగా సోలార్ పవర్ ప్లాంటును నిర్మించనుంది టాటా పవర్ సంస్థ, లదాఖ్ ప్రధాన పట్టణమైన లేహ్ సమీపంలో లైంగ్ అనే గ్రామం సమీపంలో భూమి నుంచి 3,600 మీటర్ల ఎత్తులో ఈ సోలార్ పవర్ స్టేషన్ను నిర్మించనుంది. ప్రస్తుతం ప్రపంచంలో అత్యంత ఎత్తైన ప్రదేశంలో నెలకొల్పిన సోలార్ పవర్ స్టేషన్గా స్విట్జర్లాండ్లోని జుంగ్ఫ్రాజోక్ గుర్తింపు ఉంది. 1991లో ఈ పవర్ స్టేషన్ని భూమి నుంచి 3,454 మీటర్ల ఎత్తులో నెలకొల్పారు. ముప్పై ఏళ్లుగా ఇదే రికార్డుగా కొనసాగుతోంది. 2023 మార్చికి పూర్తి లేహ్ సమీపంలో నిర్మించే సోలార్ పవర్ స్టేషన్ నిర్మాణం 2023 మార్చి నాటికి పూర్తి కానుంది. పవర్ స్టేషన్కు అనుసంధానంగా 50 మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్ని సైతం టాటా పవర్ నెలకొల్పనుంది. దీని కోసం రూ.386 కోట్లు వెచ్చించనుంది. ఇండియా వేగంగా గ్రీన్ ఎనర్జీ ఉత్పత్తి దిశగా అడుగులు వేస్తోందని అనడానికి లేహ్లో చేపడుతున్న కొత్త సోలార్ పవర్ ప్రాజెక్టు ఉదాహరణ అని టాటా పవర్ సీఈవో ప్రవీర్ సిన్హా అన్నారు. -
హెచ్పీసీఎల్ బంకుల్లో చార్జింగ్ స్టేషన్లు
న్యూఢిల్లీ: ఎలక్ట్రిక్ వాహనాలకు (ఈవీ) సంబంధించి వాణిజ్య ప్రాతిపదికన చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసేందుకు హిందుస్తాన్ పెట్రోలియంతో (హెచ్పీసీఎల్) టాటా పవర్ జట్టు కట్టింది. హెచ్పీసీఎల్ రిటైల్ అవుట్లెట్స్తో పాటు దేశవ్యాప్తంగా ఇతరత్రా ప్రాంతాల్లో కూడా ఈవీ చార్జింగ్ స్టేషన్స్ను ప్రారంభించేందుకు ఇరు సంస్థలు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయని టాటా పవర్ వెల్లడించింది. దీని ప్రకారం ఎలక్ట్రిక్ కార్లు, రిక్షాలు, బైక్లు, బస్సులు మొదలైన వాహనాల చార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అనువైన ప్రదేశాల్లో ఏర్పాటు చేయడం, అభివృద్ధి చేయడం, నిర్వహించడం తదితర అంశాల్లో ఇరు సంస్థలు కలిసి పనిచేస్తాయి. ప్రతిపాదిత చార్జింగ్ స్టేషన్స్ ద్వారా దేశీయంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం మరింతగా పెరిగేందుకు తోడ్పడగలమని టాటా పవర్ సీఈవో సిన్హా తెలిపారు. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి చార్జింగ్ సమస్యలే ప్రధాన అవరోధంగా ఉంటున్నాయని, చార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుతో ఈ సమస్య పరిష్కారం కాగలదని హెచ్పీసీఎల్ ఈడీ రజనీష్ మెహతా పేర్కొన్నారు. -
టాటా పవర్ లాభం రూ.612 కోట్లు
న్యూఢిల్లీ: టాటా పవర్ కంపెనీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసిక కాలంలో రూ.612 కోట్ల నికర లాభం సాధించింది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలానికి సాధించిన నికర లాభం, రూ.619 కోట్లతో పోల్చితే 1 శాతం తగ్గిందని టాటా పవర్ తెలిపింది. ఆదాయం 6 శాతం వృద్ధితో రూ.7,096 కోట్లకు పెరిగిందని కంపెనీ సీఈఓ, ఎమ్డీ అనిల్ సార్దానా పేర్కొన్నారు. పునరుత్పాదన విద్యుదుత్పత్తి విభాగం లాభం రూ.14 కోట్ల నుంచి రూ.72 కోట్లకు పెరిగిందని వివరించారు. అన్ని అనుబంధ విభాగాలతో కలుపుకొని ఈ క్యూ3లో మొత్తం 12,402 మిలియన్ యూనిట్ల విద్యుత్ను ఉత్పత్తి చేశామని తెలిపారు. అంతేకాకుండా తమ మొత్తం విద్యుదుత్పత్తికి 227 మెగావాట్ల సౌర విద్యుత్తు, 5.4 మెగావాట్ల థర్మల్ విద్యుదుత్పత్తి జత అయ్యాయని వివరించారు. పునరుత్పాదన విద్యుదుత్పత్తి వ్యాపారంపై ప్రధానంగా దృష్టి పెడుతున్నామని పేర్కొన్నారు. ఆర్థిక ఫలితాల నేపథ్యంలో బీఎస్ఈలో టాటా పవర్ షేర్ 0.2 శాతం లాభపడి రూ.87 వద్ద ముగిసింది. -
రూపాయికే 51 శాతం వాటా!
♦ ముంద్రా పవర్ ప్రాజెక్టులో ♦ ఆఫర్ చేస్తున్న టాటా పవర్ న్యూఢిల్లీ: నష్టాలు, రుణభారంతో కుదేలవుతున్న ముంద్రా పవర్ ప్రాజెక్టును గట్టెక్కించేం దుకు టాటా పవర్ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా ఈ ప్రాజెక్టులో 51% వాటాలను రూ.1 కే విక్రయిస్తామంటూ తమ దగ్గర్నుంచి విద్యుత్ కొనుగోలు చేసే గుజరాత్ తదితర రాష్ట్రాలకు ఆఫర్ ఇచ్చింది. మరికాస్త అధిక రేటుకు విద్యుత్ను కొనుగోలు చేసే హామీ లభిస్తే కేవలం 49% వాటా మాత్ర మే ఉంచుకుని, నిర్వహణకు మాత్రమే తాము పరిమితం అవుతామని ప్రాజెక్టును నిర్వహిస్తున్న టాటా పవర్ విభాగం కోస్టల్ గుజరాత్ పవర్ (సీజీపీఎల్) పేర్కొంది. గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్కి ఈ మేరకు లేఖ రాసింది.రూ. 2.26కే యూనిట్ను విక్రయించేలా 2006లో ప్రాజెక్టును టాటా దక్కించుకుంది. అయితే, బొగ్గు విషయంలో అంచనాలు తప్పడంతో అధిక ధర కోసం ప్రయత్నాలు చేసినప్పటికీ ఫలితం దక్కలేదు. ప్రస్తుతం ముంద్రా నష్టాలు రూ. 6,457 కోట్లు కాగా, రుణభారం రూ. 10,159 కోట్లు. కంపెనీ చెల్లింపు మూలధనం రూ. 6,083 కోట్లు. -
రూపాయికే ముంద్రా ప్లాంట్ వాటా విక్రయం
ముంబై: తీవ్ర నష్టాల్లతో టాటా పవర్ను ఇబ్బందుల్లోకి నెట్టేసిన ముంద్రా ప్లాట్ విషయంలో సంచలనం నిర్ణయం తీసుకుంది. ఈ ప్లాంట్లోని వాటా విక్రయం విషయంపై ప్రభుత్వానికి లేఖ రాసింది. 4 వేల మెగావాట్ల ముంద్రా యూపీఎంపీ (అల్టా మెగా పవర్ ప్రాజెక్టు)లో 51 శాతం ఈక్విటీ వాటాను కేవలం ఒక్క రూపాయికి విక్రయించాలని నిర్ణయించింది. ఈ మేరకు వాటాను కొనుగోలు చేయాలని గుజరాత్ ఊర్జా వికాస్ నిగమ్ లిమిటెడ్ కు టాటా పవర్ అధికారులు లేఖ రాశారు. ఈ ప్రతిపాదన లేఖ కాపీలను విద్యుత్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, ప్రధాన మంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, గుజరాత్ ప్రభుత్వం ముఖ్య కార్యదర్శికి కోస్టల్ గుజరాత్ పవర్ లిమిటెడ్కూడా అందించింది. ఈ లేఖలో రెండు ఆప్షన్స్ ను ప్రస్తావిస్తూ, విద్యుత్ కొనుగోలు ఒప్పందాన్ని పునఃసమీక్షించాలని, లేకుంటే ఈక్విటీని కొనుగోలు చేసి ప్లాంటును నిర్వహించుకోవాలని కోరినట్టు సమాచారం. ప్లాంటు నిర్వహణ పెనుభారం కావడంతో నష్టాల నుంచి కోలుకునేందుకు ప్రభుత్వమే ముందుకు రావాలని, 49 శాతం వాటాదారుగా, ప్లాంటుకు అవసరమైన అన్ని రకాల అవసరాలనూ తీర్చేందుకు తాము సిద్ధంగా ఉంటామని ఈ లేఖలో టాటా పవర్ అధికారులు పేర్కొన్నారు. 2008లో వేసిన అంచనా వ్యయాల ప్రాతిపదికన ఇప్పుడు ప్లాంటును నడిపించడం ఎలా సాధ్యమని టాటా సన్స్ బోర్డు ప్రశ్నిస్తూ, ముంద్రా ప్లాంటు విస్తరణ పెట్టుబడులను అడ్డుకున్న వేళ, టాటా పవర్ ఈ లేఖను రాయడం గమనార్హం. కాగా టాటా పవర్ ముంద్రా యుఎంపిపి ప్రాజెక్టు కోసం రూ.18,000 కోట్లు పెట్టుబడి పెట్టగా 2013-14లో ఈ ప్రాజెక్టుపై టాటా పవర్ రూ.1,500 కోట్ల నష్టాలు చవి చూసింది. ఈ ప్లాంటుకు మొత్తం సేకరించిన మొత్తం రు. 15000-16000 కోట్లు. ముంద్రా ప్లాంట్ బ్యాంకుల నుండి రూ .10,000 కోట్లు, టాటా గ్రూపు నుంచి 5000 కోట్ల రూపాయలను తీసుకుంది. మొత్తం రుణ 42,000-43,000 కోట్ల రూపాయలుగా ఉంది. మరోవైపు విద్యుత్తు కొనుగోలు ఒప్పందం చేసుకున్న ఐదు రాష్ట్రాలతో (రాజస్థాన్, హర్యానా, పంజా, మధ్యప్రదేశ్, గుజరాత్) దీనికి అనుమతించాల్సి ఉంది. -
టాటా గ్రూపులో మరో కీలక నియామకం
ముంబైటాటా -మిస్త్రీ బోర్డ్ వార్ లో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. టాటా పవర్ ఛైర్మన్ గా ఎస్.పద్మనాభన్ నియమితులయ్యారు. 34 సంవత్సరాలుగా టాటా గ్రూప్ తో అనుబంధం ఉన్న పద్మనాభన్ ను ఈ కీలక పదవికి టాటా గ్రూపు నామినేట్ చేసింది. ఈ రోజునుంచే (జనవరి 4 2017) ఈ నియామకాలు అమల్లోకి రానున్నట్టు టాటా పవర్ ప్రకటించింది. కంపెనీ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సమావేశంలో టాటా పవర్ అడిషనల్ డైరెక్టర్ గా ఉన్న పద్మనాభన్ ను నామినేట్ చేసినట్టుగా టాటా పవర్ బిఎస్ఇ ఫైలింగ్ లో చెప్పింది. కాగా గత డిసెంబర్ లో పద్మనాభన్ ను టాటాపవర్ అదనపు డైరెక్టర్ నియమించింది.టాటా పవర్ బోర్డ్ లో చేరక మునుప ఆయన టాటా బిజినెస్ ఎక్స్లెన్స్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్ గా ఉన్నారు. మరోవైపు ఇటీవల టాటా సన్స్ గ్రూప్ హెచ్ ఆర్ హెడ్ అదనపు బాధ్యతను టాటా అప్పగించింది. సంగతి తెలిసిందే. గత ఏడాది డిసెంబర్లో కంపెనీ డైరెక్టర్ గా సైరస్ మిస్త్రీకి ఉద్వాసన పలింకింది టాటా గ్రూపు. అనంతర పరిణామాల నేపథ్యం, తన పోరాటాన్ని మరింత ఉధృతం చేసే యోచనలో టాటా గ్రూపులోని ఆరు లిస్టెడ్ కంపెనీలకు సైరస్ మిస్త్రీ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. -
నాకు సపోర్టు ఇవ్వండి ప్లీజ్ : మిస్త్రీ
న్యూఢిల్లీ : టాటా గ్రూప్ చైర్మన్ పదవి నుంచి అర్థాంతరంగా ఉద్వాసనకు గురైన సైరస్ మిస్త్రీపై గ్రూప్ కంపెనీలు కూడా వేటువేస్తున్న సంగతి తెలిసిందే. కంపెనీల చైర్మన్గా బోర్డు సభ్యుడిగా ఆయన్ని పీకేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సైరస్ మిస్త్రీ ఇక షేర్హోల్డర్స్ మద్దతుపై దృష్టిసారించారు. టాటా పవర్ బోర్డు నుంచి తనను పీకేయకుండా ఉండేందుకు వారి మద్దతును కోరారు. బోర్డు నుంచి తనను వైదొలగించే ప్రతిపాదనను వ్యతిరేకించాలని అభ్యర్థిస్తూ ఆయన షేర్హోల్డర్స్కు ఓ లేఖ రాశారు. తన కాలంలో టాటా పవర్, పోటీదారులకంటే మెరుగైన ప్రదర్శనను కనబరిచిందని మిస్త్రీ ఆ లేఖలో పేర్కొన్నారు. గత మూడేళ్లలో ఈబీఐటీడీఏలు మెరుగుపడ్డాయని, దేశీయ పవర్ సెక్టార్లో కంపెనీకి పునఃరేటింగ్ కల్పించానని చెప్పారు. 2006లో మిస్త్రీ సన్స్ బోర్డులో చేరారు. తర్వాత 2012 డిసెంబర్లో బోర్డు చైర్మన్గా ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన టాటా పవర్ చైర్మన్గా ఉన్నారు. కాగ, సైరస్ మిస్త్రీని బోర్డు నుంచి తొలగించడానికి టాటా పవర్ కంపెనీ 2016 డిసెంబర్ 26న అసాధారణ జనరల్ మీటింగ్ నిర్వహిస్తోంది. ఈ భేటీలో సైరస్ మిస్త్రీని బోర్డు నుంచి వైదొలగించే ప్రతిపాదనను తీసుకొస్తోంది. -
మిస్త్రీని తొలగించండి..
• టాటా పవర్ను కోరిన టాటా సన్స్ • డిసెంబర్ 23న టాటా కెమికల్స్ ఈజీఎం న్యూఢిల్లీ: టాటా గ్రూపును పూర్తిగా తన ఆధిపత్యంలోకి తెచ్చుకునే చర్యలను మాతృసంస్థ టాటా సన్స ఉధృతం చేసింది. సైరస్ మిస్త్రీని డెరైక్టర్గా తొలగించేందుకు వాటాదారుల సమావేశం నిర్వహించాలని గ్రూపు కంపెనీ టాటా పవర్ను తాజాగా కోరింది. అదే సమయంలో సైరస్ మిస్త్రీ, నుస్లీ వాడియాలను డెరైక్టర్లుగా తొలగించేందుకు టాటా కెమికల్స్ వచ్చే నెల 23న వాటాదారుల అసాధారణ సమావేశం (ఈజీఎం) నిర్వహించనుంది. టాటా గ్రూపు చైర్మన్గా సైరస్ మిస్త్రీని టాటా సన్స గత నెలలో తప్పించగా, గ్రూపు కంపెనీలు కొన్నింటికి ఆయన చైర్మన్గా, డెరైక్టర్గా కొనసాగుతున్నారు. దీంతో మిస్త్రీని పూర్తిగా గ్రూపు నుంచి పంపించే చర్యలను టాటా సన్స ముమ్మరం చేసింది. ఇందుకోసం ఈజీఎంలను నిర్వహించాలని గ్రూపు కంపెనీలను కోరింది. మిస్త్రీని డెరైక్టర్గా తొలగించే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకునేందుకు ఈజీఎం నిర్వహించాలని ప్రమోటర్ టాటా సన్స నుంచి ప్రత్యేక నోటీసు అందుకున్నట్టు టాటా పవర్ బీఎస్ఈకి తెలియజేసింది. -
నిరాశపర్చిన టాటాపవర్
ముంబై: ముంబైకి చెందిన ప్రయివేట్ రంగ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ మంగళవారం క్యూ1 ఫలితాలను ప్రకటించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన నికర లాభాల్లో 76 శాతం, ఆదాయంలో 5శాతం క్షీణతను నమోదు చేసింది. ఇది గత ఏడాది రూ.303కోట్ల తోపోలిస్తే నికర లాభాలో భారీగా క్షీణించాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం(ఏప్రిల్-జూన్)లో నికర లాభం రూ. 72.5 కోట్లను ప్రకటించింది. ఆదాయం కూడా రూ. 7184 కోట్ల నుంచి రూ. 6838 కోట్లకు తగ్గింది. నిర్వహణ లాభం(ఇబిటా) రూ. 1636 కోట్లకు చేరగా, ఇతర ఆదాయం 54 శాతం తగ్గి రూ.112 కోట్లకు పరిమితమైంది. ఈ కాలంలో రూ. 312 కోట్లమేర వన్టైమ్ నష్టం నమోదైనట్లు కంపెనీ తెలియజేసింది. ఈ నిరుత్సాహకర ఫలితాలతో టాటా పర్ షేరు దాదాపు 3శాతానికిపైగా క్షీణించింది. అయితే నికర లాభాలు రూ.335 కోట్లు, ఆదాయాన్ని రూ.9,270కోట్లుగా ఉండనుందని ఎనలిస్టులు అంచనావేశారు -
టాటా పవర్ రూ. 10 వేల కోట్ల భారీ డీల్
రూ.10వేల కోట్ల భారీ డీల్ న్యూఢిల్లీ : వెల్స్ పన్ ఎనర్జీ రెన్యూవబుల్స్ ఆస్తులను టాటా పవర్ భారీ డీల్కు చేజిక్కించుకుంది. దాదాపు రూ.10 వేల కోట్లకు గ్రీన్ ఎనర్జీలో వెల్స్పన్ ఆస్తులను కొనుగోలు చేసింది. ఆదివారం రాత్రి ఈ ఒప్పందంపై సంతకాలు జరిగినట్లు టాటా పవర్ రెన్యూవబుల్ ఎనర్జీ ఓ ప్రకటనలో తెలిపింది. షేర్ కొనుగోలు ఒప్పందంపై వెల్స్పన్ రెన్యూవబుల్ ఎనర్జీల 1.1 జీడబ్ల్యూ రెన్యూవబుల్ పోర్ట్ ఫోలియోను కొనుగోలు చేసినట్టు తెలిపింది. విలీనం, కొనుగోలు ఒప్పందాల్లో దేశంలో జరిగిన అతి పెద్ద ఒప్పందం ఇదేనని ప్రకటించింది. దేశంతో పాటు ఆసియాలోనూ ఇదే అతి పెద్ద డీల్ అని పేర్కొంది. వెల్స్పన్ ఎనర్జీలో వెల్స్పన్ రెన్యూవబుల్స్ 100 శాతం సబ్సిడీ ఇస్తున్నాయి. 1,140 మెగా వాట్ ల రెన్యూవబుల్ పవర్ ప్రాజెక్టులను ఈ కంపెనీ కలిగిఉంది. వాటిలో 990 మెగావాట్ల సోలార్ పవర్ కూడా ఉంది. దేశంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్ట్స్ గా ఇవి పేరు తెచ్చుకున్నాయి. 150 మెగా వాట్ల విండ్ పవర్ను దేశం మొత్తం మీద పది రాష్ట్రాల్లో విస్తరించాయి. అయితే ఈ ఒప్పంద ఫైనాన్షియల్ వివరాలను బయటకు పొక్కనీయలేదు. కేవలం రూ.10 వేల కోట్లకు మాత్రమే కొనుగోలు చేసినట్టు ప్రకటించాయి. ఈక్విటీ కాంపొనెంట్ కింద రూ. 3,650 కోట్లను టాటా పవర్ చెల్లించనుంది. మిగతా బాకీని రుణదాతల సమ్మతితో రీఫైనాన్స్ చేయాలని టాటా పవర్ చూస్తోంది. -
3 రోజుల నష్టాలకు చెక్
స్వల్ప లాభాలతో సరి సెన్సెక్స్ 34 పాయింట్లు ప్లస్ నెలన్నర రోజుల కనిష్టం నుంచి మార్కెట్ కోలుకుంది. అయితే రోజు మొత్తం స్వల్ప ఒడిదుడుకుల కులోనై చివరికి స్వల్ప లాభాలతో సరిపెట్టుకుంది. సెన్సెక్స్ 34 పాయింట్లు లాభపడి 27,831 వద్ద ముగియగా, నిఫ్టీ 15 పాయింట్లు బలపడి 8,356 వద్ద నిలిచింది. బుధవారం ట్రేడింగ్లో చిన్న, మధ్య తరహా షేర్లకు డిమాండ్ కనిపించింది. వెరసి బీఎస్ఈలో మిడ్, స్మాల్ క్యాప్ ఇండెక్స్లు మార్కెట్ను మించుతూ 1% చొప్పున పుంజుకున్నాయి. ట్రేడైన షేర్లలో 1,665 లాభపడితే, 1268 నష్టపోయాయి. వినియోగ వస్తు రంగం అప్ ప్రధానంగా వినియోగవ స్తు రంగం అత్యధికంగా 2.5% పుంజుకోగా, బ్యాంకింగ్ 1% లాభపడింది. బజాజ్ ఎలక్ట్రికల్స్, టైటన్, వీఐపీ, పీసీ జ్యువెలర్ 5-3% మధ్య జంప్ చేశాయి. బ్యాంకింగ్లో బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఎస్బీఐ, బీవోబీ, పీఎన్బీ 5-2% మధ్య పురోగమించాయి. ఇక సెన్సెక్స్ దిగ్గజాలలో ఓఎన్జీసీ, టాటా పవర్, టాటా మోటార్స్, సిప్లా, డాక్టర్ రెడ్డీస్ 2.5-1.5% మధ్య పురోగమించాయి. మరోవైపు భెల్, గెయిల్, హెచ్యూఎల్, బజాజ్ ఆటో, ఎల్అండ్టీ, సన్ ఫార్మా 2-1% మధ్య నీరసించాయి. కాగా బీఎస్ఈ-500లో ష్నీడర్ ఎలక్ట్రిక్ 14% దూసుకెళ్లగా, కల్పతరు పవర్, బజాజ్ హిందుస్తాన్, ఎస్కేఎస్ మైక్రో, గీతాంజలి, ప్రాజ్, పిపావవ్ డాక్, ఎల్ఐసీ హౌసింగ్ 11-6% మధ్య లాభపడ్డాయి. -
మార్కెట్లో కొత్త రికార్డులు
అంతటా సానుకూల పరిణామాలతో దేశీ స్టాక్మార్కెట్లు రికార్డు పరుగులు కొనసాగిస్తున్నాయి. సెన్సెక్స్ 28,500 మార్కును, నిఫ్టీ 8,500 మార్కును అధిగమించాయి. ప్రస్తుత శీతాకాల సమావేశంలో మరిన్ని సంస్కరణలు ఉండొచ్చన్న ఆశలు ఒకవైపు.. చైనా, యూరప్లో అదనంగా ఆర్థిక సహాయక ప్యాకేజీలు రావొచ్చన్న అంచనాలు మరోవైపు ఇందుకు దోహదపడ్డాయి. చైనా అనూహ్యంగా వడ్డీ రేట్లను తగ్గించడం మరో కారణంగా నిల్చింది. సెన్సెక్స్ ఇంట్రాడేలో ఆల్ టైం గరిష్టమైన 28,541.96 స్థాయిని, నిఫ్టీ 8,534.65 పాయింట్ల స్థాయిని తాకాయి. చివరికి 164.91 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 28,499.54 వద్ద, 52.80 పాయింట్ల లాభంతో నిఫ్టీ 8,530.15 వద్ద ముగిశాయి. సెన్సెక్స్ వరుసగా మూడు ట్రేడింగ్ సెషన్లలో 467 పాయింట్ల (1.66 శాతం) మేర పెరిగినట్లయింది. ‘డిజిన్వెస్ట్మెంట్’లో ఇన్వెస్ట్: ఎల్ఐసీ ఇదిలావుండగా... కేంద్రం ప్రభుత్వ రంగ సంస్థల్లో డిజిన్వెస్ట్మెంట్ (వాటాల విక్రయం) మొదలెట్టిన పక్షంలో తాము మరిన్ని షేర్లను కొనుగోలు చేస్తామని ఫిక్కీ నిర్వహించిన ఒక సదస్సులో ఎల్ఐసీ చైర్మన్ ఎస్కే రాయ్ తెలిపారు. ఐపీవో బాటలో 13 సంస్థలు న్యూఢిల్లీ: ఇన్వెస్టర్ల సెంటిమెంటు మెరుగుపడుతున్న నేపథ్యంలో దాదాపు డజను పైగా కంపెనీలు ఐపీవో బాట పట్టాయి. ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా వైజాగ్ స్టీల్, వీడియోకాన్ డీ2హెచ్ సహా 13 కంపెనీలు ప్రాస్పెక్టస్ ముసాయిదాను సెబీకి సమర్పించాయి. అటు ఎస్ఎంసీ గ్లోబల్ సెక్యూరిటీస్..ఫాలో ఆన్ పబ్లిక్ ఆఫర్కి అనుమతుల కోసం దరఖాస్తు చేసుకుంది. ఇవన్నీ మే లో ఎన్నిక ఫలితాల అనంతరం సెబీకి పత్రాలు సమర్పించాయి. వీటిలో లావాసా కార్పొరేషన్, యాడ్ల్యాబ్స్, ఓర్టెల్ కమ్యూనికేషన్స్, మాంటెకార్లో ఫ్యాషన్స్ సంస్థల ఐపీఓలకు సెబీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. -
నెల రోజుల గరిష్టం
128 పాయింట్లు ప్లస్ 26,881కు చేరిన సెన్సెక్స్ మళ్లీ 8,000 దాటిన నిఫ్టీ చివర్లో పెరిగిన కొనుగోళ్లతో మార్కెట్లు నష్టాల నుంచి బయటపడి లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 128 పాయింట్లు పుంజుకుని 26,881 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ సైతం 36 పాయింట్లు లాభపడి 8,028 వద్ద నిలిచింది. తద్వారా మళ్లీ 8,000 మైలురాయికి ఎగువన ముగిసింది. ఈ ఏడాది ఆర్థిక వృద్ధి 5.6%కు చేరుతుందన్న ప్రపంచ బ్యాంకు అంచనాలు, ఆసియా, యూరప్ మార్కెట్ల లాభాలు దేశీయంగా సెంటిమెంట్కు జోష్నిచ్చాయని విశ్లేషకులు తెలి పారు. ఇదికాకుండా అక్టోబర్ నెల డెరివేటివ్ కాంట్రాక్ట్ల ముగింపు నేపథ్యంలో జరిగిన షార్ట్ కవరింగ్ కూడా మార్కెట్లకు బలాన్నిచ్చినట్లు పేర్కొన్నారు. సన్ ఫార్మా జోష్ సెన్సెక్స్ దిగ్గజాలలో సన్ ఫార్మా 4.3% పుంజుకోగా, సిప్లా, టాటా పవర్, ఎస్బీఐ, గెయిల్, ఐసీఐసీఐ 3-2% మధ్య పురోగమించాయి. అయితే మరోవైపు హీరోమోటో, భారతీ, హెచ్యూఎల్, రిలయన్స్, డాక్టర్ రెడ్డీస్, ఓఎన్జీసీ, మారుతీ, బజాజ్ ఆటో, యాక్సిస్ బ్యాంక్ 1.5-0.5% మధ్య నష్టపోయాయి. -
‘మహా’ రైళ్లకు గుజరాత్ విద్యుత్
సాక్షి, ముంబై: విద్యుత్ కొరతతో అవస్థలు పడుతున్న పశ్చిమ రైల్వే జోన్ అధికారులు ఆ సమస్యకు విరుగుడు కొనుగొనేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు గుజరాత్ నుంచి విద్యుత్ కొనుగోలు చేయాలని నిర్ణయించారు. దీనికి సం బంధించి ఇప్పటికే అక్కడి అధికారులకు లేఖ రాయగా, వారు సూత్రప్రాయంగా అంగీకరించినట్లు తెలిసింది. రైల్వేల నిర్వహణకు సంబంధిం చి ఆయా జోన్లకు కేంద్రం పూర్తి అధికారాలు దఖ లుపర్చింది. ఈ నేపథ్యంలోనే ఈ సమస్యను పరి ష్కరించేందుకు పక్కరాష్ట్రం నుంచి విద్యుత్ కొనాలని అధికారులు నిర్ణయించారు. ముంబై సబర్బన్లో రైళ్లను నడిపేందుకు చవక ధరలో విద్యుత్ కొనుగోలు చేయాలన్నది అధికారుల ప్రతిపాదన. ప్రస్తుతానికి వారు మహారాష్ట్ర ప్రభుత్వానికి చెం దిన విద్యుత్ పంపిణీ సంస్థ , టాటా పవర్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారు. అయితే గత రెండేళ్లుగా విద్యుత్ కొనుగోళ్ల వ్యయం విపరీతంగా పెరుగుతోంది. దీంతో ఈ భారాన్ని అదు పు చేసేందుకు గుజరాత్ నుంచి కేవలం యూని ట్కు ఐదు రూపాయల చొప్పున కరెంటును కొనాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలుత 50 మెగావాట్లను గుజరాత్ నుంచి కొనుగోలు చేయాలని, ఆ తరువాత దీన్ని మరింత పెంచాల ని భావిస్తున్నారు. గుజరాత్లోని టిట్వాలా విద్యు త్ ప్రాజెక్టు త్వరలోనే వినియోగంలోకి రానున్నందున, అక్కడ ఉత్పత్తి అయ్యే కరెంటును తాము కొనుగోలుచేస్తామని పశ్చిమ రైల్వే ప్రతి పాదించింది. ఈ మేరకు ఇప్పటికే సంప్రదింపులు కూడా పూర్తి చేసినట్లు సమాచారం. -
ఆదుకున్న ఐటీ
రోజంతా ఒడిదుడుకులు చివరికి స్వల్ప లాభాలు ఒక దశలో 25,711కు సెన్సెక్స్ 25,584 వద్ద ముగింపు తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు ఆపై అధిక భాగం నష్టాలకు లోనయ్యాయి. చివర్లో తిరిగి కోలుకుని స్వల్ప లాభాలతో గట్టెక్కాయి. ఉదయం సెషన్లో 25,711 పాయింట్ల వద్ద కొత్త చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకిన సెన్సెక్స్ మిడ్ సెషన్లో అమ్మకాలు పెరగడంతో కనిష్టంగా 25,347కు చేరింది. ఈ స్థాయి నుంచి 236 పాయింట్లు కోలుకుంది. వెరసి 3 పాయింట్ల లాభంతో 25,584 వద్ద ముగిసింది. ఇక నిఫ్టీ కూడా ెహ చ్చుతగ్గులను చవిచూసి చివరికి 2 పాయింట్లు పెరిగి 7,656 వద్ద స్థిరపడింది. ఇవి సరికొత్త రికార్డులుకాగా, మార్కెట్లను 2% స్థాయిలో పుంజుకున్న ఐటీ, హెల్త్కేర్ రంగాలు ఆదుకున్నాయి. మరోవైపు రియల్టీ ఇండెక్స్ 3% పతనమైంది. ఎఫ్ఐఐల పెట్టుబడులు సోమవారం రూ. 537 కోట్లను ఇన్వెస్ట్చేసిన ఎఫ్ఐఐలు తాజాగా మరో రూ. 682 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేయగా, దేశీయ ఫండ్స్ రూ. 1,215 కోట్ల అమ్మకాలను చేపట్టాయి. సెన్సెక్స్లో ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, విప్రో, టీసీఎస్ 3-2% మధ్య పుంజుకోగా, హెల్త్కేర్ షేర్లు సిప్లా, డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా 3-1% చొప్పున లాభపడ్డాయి. అయితే మరోవైపు భెల్, ఓఎన్జీసీ, టాటా స్టీల్, హీరోమోటో, సెసాస్టెరిలైట్ 2.5% స్థాయిలో డీలాపడగా, యాక్సిస్, ఎస్బీఐ, ఎన్టీపీసీ 1.5% చొప్పున నష్టపోయాయి. ఇక రియల్టీ షేర్లు శోభా, ఇండియాబుల్స్, ఒబెరాయ్, డీఎల్ఎఫ్, యూనిటెక్ 6-3% మధ్య నీరసించాయి. ట్రేడైన షేర్లలో 1,834 లాభపడగా, 1,272 నష్టపోయాయి. -
బెస్ట్కు ‘టాటా’..!
సాక్షి, ముంబై: నగరవాసులకు విద్యుత్ సరఫరా చేస్తున్న బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్(బెస్ట్)కు టాటా చెప్పేందుకు నగరవాసులు సిద్ధమవుతున్నారు. కారణం సుప్రీంకోర్టు ఆదేశాలతో నగరవాసులకు త్వరలో ‘టాటా పవర్’ అందుబాటులోకి రానుంది. ప్రత్యేకించి దక్షిణ ముంబై వాసులకు ఈ టాటా పవర్ అతిత్వరలో అందుబాటులోకి రానుంది. ఇప్పటిదాకా విద్యుత్ బిల్లుల విషయంలో బెస్ట్ ఆడిందే ఆట పాడిందే పాటగా కొనసాగుతోంది. బెస్ట్ సంస్థ ఒక్కటే సరఫరా చేస్తుండడంతో చార్జీలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. తమ పరిధిలోని ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాకు ఎవరికీ అనుమతి ఇవ్వొద్దని కోరుతూ బెస్ట్ దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. బెస్ట్తోపాటు ఇక్కడ ఎవరైనా(టాటా) విద్యుత్ సరఫరా చేసుకోవచ్చని తీర్పునివ్వడంతో బెస్ట్కు చుక్కెదురైంది. సరఫరాదారుల మధ్య ఇకపై పోటీ పెరుగుతుందని, టాటా పవర్ తక్కువ ధరకే లభించనుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో నగరవాసులపై విద్యుత్ భారం కూడా కొంతమేర తగ్గడమేకాకుండా నాణ్యమైన విద్యుత్ అందుబాటులోకి రానుంది. టాటావైపు మొగ్గు... ముంబైలో విద్యుత్ సరఫరా చేసే బెస్టుకు ప్రత్యామ్నాయంగా టాటా విద్యుత్ అందుబాటులోకి రానున్న నేపథ్యంలో అందరూ అటువైపే మొగ్గుచూపుతున్నారు. భారీ ఎత్తున విద్యుత్ను వినియోగించే షాపింగ్ మాల్స్, మల్టీప్లెక్స్, హోటల్స్, కార్యాలయాలు కూడా టాటా విద్యుత్వైపు మొగ్గుచూపుతున్నట్టు తెలిసింది. ప్రస్తుతం విద్యుత్ చార్జీలను పరిశీలించినట్టయితే.. బెస్ట్ చార్జీలకంటే టాటా పవర్ కంపెనీ విద్యుత్ చార్జీలు యూనిట్కు సుమారు రూ. 1.25 నుంచి రూ. 3.00 వరకు తక్కువగా ఉన్నాయి. ప్రస్తుతం గృహ వినియోగదారులకు బెస్ట్ మొదటి 100 యూనిట్ల వరకు రూ.3.20 చొప్పున ప్రతి యూనిట్కు వసూలు చేస్తుండగా టాటా పవర్ కంపెనీ మొదటి 100 యూనిట్ల వరకు ప్రతి యూనిట్కు కేవలం రూ.2.49 మాత్రమే వసూలు చేస్తోంది. ఇక 100 నుంచి 300 యూనిట్ల వరకు బెస్ట్ ప్రతి యూనిట్కు రూ.6.38 వసూలు చేస్తుండగా టాటా కేవలం రూ.4.13 వసూలు చేస్తోంది. 500 యూనిట్లు ఆపై వినియోగదారుల నుంచి బెస్ట్ ప్రతి యూనిట్కు రూ.11.40 వసూలు చేస్తుండగా టాటా మాత్రం కేవలం రూ. 9.09 మాత్రమే వసూలు చేస్తోంది. ఈ నేపథ్యంలో టాటా విద్యుత్ అందుబాటులోకి రానుండడంతో అటువైపే నగరవాసులు ఆకర్షితులు అయ్యే అవకాశముందని చెబుతున్నారు. బెస్ట్కు మరిన్ని ఇబ్బందులు..? సుప్రీం కోర్టు తీర్పుతో భవిష్యత్తులో బెస్ట్ సంస్థకు మరిన్ని ఇబ్బందులు ఎదురయ్యే అవకాశముంది. సంస్థ ఆర్థిక వ్యవస్థపై ఈ తీర్పు ప్రభావం చూపనుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటి వరకు ఏకఛత్రాధిపత్యం వహిస్తున్న బెస్ట్ను టాటా రాకతో అనేక మంది వినియోగదారులు వీడడం ఖాయంగా కన్పిస్తోంది. బస్సు సేవల్లో బెస్ట్కు ప్రతి సంవత్సరం సుమారు రూ.600 నుంచి రూ.700 కోట్ల నష్టం వస్తోంది. ఈ నష్టాన్ని పూడ్చుకునేందుకు బెస్ట్ విద్యుత్ వినియోగదారులపై ప్రతి యూనిట్పై రూ.0.55 నుంచి రూ. రూ.2.00 అదనపు భారాన్ని మోపుతోంది. దీంతో విద్యుత్ విభాగం పెద్ద ఎత్తున లాభాలబాటలో ఉంది. అయితే బెస్ట్ విధించే చార్జీలు దేశంలోనే అత్యధికంగా ఉన్నాయని చెబుతున్నారు. దీంతో చౌకగా అందుబాటులోకి రానున్న టాటా విద్యుత్ వైపు వినియోగదారులు ఆసక్తి చూపినట్లయితే బెస్ట్ బడ్జెట్పై తీవ్ర ప్రభావం పడనుంది. దీంతో రాబోయే రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు తప్పవని సంస్థలోని సీనియర్ అధికారులు చెబుతున్నారు. చార్జీలు పెంచుతాం: బెస్ట్ బెస్ట్ అభ్యర్థనను తిరస్కరిస్తూ ఏ సంస్థకైనా విద్యుత్ను సరఫరా చేసేందుకు అవకాశం కల్పిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై నగరవాసులు హర్షం వ్యక్తం చేశారు. అయితే నగరవాసులు సంతోషాన్ని ఆవిరి చేస్తూ బెస్ట్ శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ నష్టాలను భర్తీ చేసుకోవడానికి 300 లోపు యూనిట్ల వినియోగదారుల చార్జీలు పెంచనున్నట్లు ప్రకటించింది. టాటా పవర్ సరఫరా కావడానికి సమయం పడుతుందని చెప్పింది. -
కాగ్ మాట వినాల్సిందే!
న్యూఢిల్లీ: కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ఆడిటింగ్ సహకరించాలన్న ఏకసభ్య ధర్మాసనం ఆదేశాలను కచ్చితంగా పాటించాలని ఢిల్లీ హైకోర్టు డిస్కమ్లకు స్పష్టం చేసింది. ఈ మేరకు టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ (టీపీడీడీఎల్), రిలయన్స్ అడాగ్కు చెందిన బీఎస్ఈఎస్ రాజధాని పవర్ లిమిటెడ్, బీఎస్ఈఎస్ యమునా పవర్ లిమిటెడ్ను తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి బీడీ అహ్మద్, న్యాయమూర్తి ఎస్ మృదుల్తో కూడిన బెంచ్ ఆదేశించింది. కాగ్ ఆడిటింగ్ నిలిపివేతపై స్టే మంజూరు చేయాలన్న మూడు డిస్కమ్ల విజ్ఞప్తి తోసిపుచ్చింది. ఈ కంపెనీల అభ్యర్థనలు, వీటికి కాగ్ ఆడిటింగ్ కోరుతూ ఒక స్వచ్ఛందసంస్థ దాఖలు చేసిన పిటిషన్లంటిపై మే ఒకటిన విచారణ నిర్వహిస్తామని ప్రకటించింది. ఇందుకోసం అఫిడవిట్లు, కౌంటర్ అఫిడవిట్లు, వాదనలను అప్పటి వరకు సిద్ధం చేసుకోవాలని సూచించింది. కాగ్ ఆడిటింగ్ను నిలిపివేయడానికి తిరస్కరిస్తూ జనవరి 24న ఏకసభ్య ధర్మాసనం వెలువరించిన ఆదేశాలను సవాల్ చేస్తూ ఈ మూడు డిస్కమ్లు పిటిషన్ దాఖలు చేశాయి. కాగ్ అడిగిన పత్రాలన్నింటినీ తప్పకుండా అందజేయాలని కూడా దిగువకోర్టు స్పష్టం చేసింది. అయితే కోర్టు అనుమతి లేకుండా నివేదికను విడుదల చేయవద్దని న్యాయమూర్తి కాగ్ను ఆదేశించారు. తమ ఖాతాలకు కాగ్ అడిటింగ్ కోసం రాష్ట్ర ప్రభుత్వమే ఆదేశాలు జారీ చేసింది కాబట్టి స్వచ్ఛంద సంస్థ, నివాసుల సంక్షేమ సంఘా సంయుక్త కార్యాచరణ కమిటీ దాఖలు చేసిన పిటిషన్ను తిరస్కరించాలని డిస్కమ్లు కోరాయి. దీనికి కమిటీ తరఫు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ డిస్కమ్లు ఆడిటింగ్ రద్దు కోరుతున్నాయని కాబట్టి తమ పిటిషన్ను అనుమతించాలని విజ్ఞప్తి చేశారు. విద్యుత్ పంపిణీ సంస్థల ఖాతాల్లో అవకతవకలు ఉన్నట్టు ఢిల్లీ విద్యుత్ నియంత్రణ మండలి (డీఈఆర్సీ) స్వయంగా ప్రకటించిందని, బాధ్యులపైనా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కాగ్ తరఫు న్యాయవాది మాట్లాడుతూ ఆడిటింగ్ ప్రక్రియకు డిస్కమ్లు సహకరించడం లేదని కోర్టుకు ఫిర్యాదు చేశారు. ఈ వాదనతో విభేదించిన డిస్కమ్లు, తాము అన్ని విధాలా సహకరిస్తున్నామని స్పష్టీకరించాయి. ఆడిటింగ్ కోసం కాగ్కు ఇప్పటికే 10 వేల పత్రాలు సమర్పించామని తెలిపాయి. వీటి ఖాతాల్లో పలు అవకతవకలు ఉన్నందున సీబీఐ దర్యాప్తు లేదా స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ప్రశాంత్ భూషణ్ న్యాయస్థానానికి విన్నవించారు. నష్టాలు వచ్చాయంటూ డిస్కమ్లు చూపించిన కాకిలెక్కలను నమ్మిన షీలా దీక్షిత్ ప్రభుత్వం, కరెంటు టారిఫ్ పెంపునకు అనుమతించిందని నివాసుల సంక్షేమ సంఘాల సంయుక్త కార్యాచరణ కమిటీ ఆరోపించింది. రాజధానిలో విద్యుత్ పంపిణీ వ్యవస్థను ప్రైవేటీకరించాలని షీలా దీక్షిత్ ప్రభుత్వం నిర్ణయించడంతో 2002 నుంచి ఈ మూడు డిస్కమ్లు కరెంటు పంపిణీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నాయి. ఇవి ఖాతాలను తారుమారు చేసి దొంగ లెక్కలు చూపిస్తున్నాయని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సహా ప్రతిపక్ష పార్టీలు విమర్శించాయి. డీఈఆర్సీ సైతం ఈ వాదనను సమర్థిస్తూ టారిఫ్ తగ్గించవచ్చని తెలిపింది. తాము అధికారంలోకి వస్తే డిస్కమ్ల ఖాతాలకు ఆడిటింగ్ జరిపిస్తామని ఆప్ జాతీయ సమన్వయకర్త అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించడం తెలిసిందే. ఈ మేరకు ఆప్ ప్రభుత్వం డిస్కమ్ల ఖాతాలపై కాగ్ ఆడిటింగ్కు ఆదేశాలు జారీ చేయడంతోపాటు, విద్యుత్ బిల్లులపై 50 శాతం ప్రకటించింది. ఇదిలా ఉంటే..డిస్కమ్లు ఇటీవల ఇంధన సర్దుబాటు చార్జీలను కూడా భారీగా పెంచడంతో నగరవాసిపై భారం మరింత పెరిగింది. ఇదిలా ఉంటే తాము ఆడిటింగ్కు సహకరించడంతో లేదంటూ కాగ్ మరోసారి సోమవారం హైకోర్టుకు ఫిర్యాదు చేయడంపై బీఎస్ఈఎస్ రాజధాని విస్మయం వ్యక్తం చేసింది. కాగ్ ఆడిటర్లకు అన్ని విధాలా సహకరిస్తున్నామని, ఇందుకోసం తరచూ సమావేశాలు నిర్వహిస్తున్నామని తెలిపింది. -
టాటా పవర్
ఎందుకంటే: ప్రైవేట్ రంగ దిగ్గజ విద్యుత్ కంపెనీల్లో ఒకటైన ఈ కంపెనీ షేర్ రూ.142 స్థాయిల నుంచి రూ.80కు పడిపోయింది. పలు అనుకూలమైన అంశాలు సమీప భవిష్యత్తులో ఈ కంపెనీ షేర్ పెరుగుదలకు దోహద పడనున్నాయి. ఇండోనేసియా బొగ్గు గనుల్లో 30% వాటా విక్రయించాలని యాజమాన్యం నిర్ణయించడం దీంట్లో మొదటిది. ఈ వాటా విక్రయం కారణంగా కంపెనీకి రూ.3,000 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా. దీంతో కంపెనీ రుణ భారం గణనీయంగా తగ్గనున్నది. ఏడాదికి వడ్డీ భారం రూ.300 కోట్లు తగ్గుతాయి. రైట్స్ ఇష్యూ ద్వారా రూ.2,000 కోట్లు సమీకరించాలని గత వారంలో కంపెనీ డెరైక్టర్ల బోర్డ్ నిర్ణయించింది. ఇది రెండోది. ఈ నిధుల కారణంగా కూడా రుణ భారం తగ్గనున్నది. ముంద్రా ప్రాజెక్ట్ విషయంలో సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్(సెర్క్) ఇచ్చిన ఉత్తర్వులు ఈ కంపెనీకి ప్రయోజనం కలిగించడం మూడవది. ఫలితంగా వచ్చే ఆర్థిక సంవత్సరంలో కంపెనీ ఆర్థిక ఫలి తాలు అంచనాలను మించనున్నాయి. ప్రస్తుతం 9,000 మెగావాట్లుగా ఉన్న కంపెనీ కెపాసిటీ ఐదేళ్లలో 25 వేల మెగావాట్లకు పెరగనున్నది. వీటన్నింటి దృష్ట్యా ప్రస్తుత ధర వద్ద కొనుగోళ్లకు ఈ షేర్ ఆకర్షణీయంగా ఉందని భావిస్తున్నాం. ఏడాది కాలానికి టార్గెట్ ధరను నిర్ణయించాం. -
ఫార్మా షేర్ల కి డిమాండ్
దేశీ స్టాక్స్లో ఎఫ్ఐఐల కొనుగోళ్లు కొనసాగడంతోపాటు, ఫార్మా దిగ్గజాలకు డిమాండ్ పెరగడంతో సెంటిమెంట్ బలపడింది. దీంతో వారం ఆరంభంలోనే సెన్సెక్స్ 111 పాయింట్లు లాభపడి 20,811 వద్ద ముగిసింది. ఇది నెల రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా 36 పాయింట్లు పుంజుకుని 6,186 వద్ద ముగిసింది. ఫార్మా షేర్లు క్యాడిలా హెల్త్, ర్యాన్బాక్సీ, డాక్టర్ రెడ్డీస్, లుపిన్, గ్లెన్మార్క్ 5-2% మధ్య ఎగశాయి. వెరసి డాక్టర్ రెడ్డీస్(రూ. 2,795), లుపిన్(రూ. 956), క్యాడిలా(రూ. 995) చరిత్రాత్మక గరిష్ట స్థాయిల వద్ద ముగిశాయి. గత వారం రూ. 2,500 కోట్లను ఇన్వెస్ట్ చేసిన ఎఫ్ఐఐలు తాజాగా రూ. రూ. 267 కోట్ల విలువైన షేర్లను కొనుగోలు చేశారు. దేశీయ ఫండ్స్ యథాప్రకారం రూ. 249 కోట్ల విలువైన అమ్మకాలను చేపట్టాయి. ఎన్టీపీసీ డౌన్, టాటా పవర్ అప్ కేంద్ర విద్యుత్ నియంత్రణ సంస్థ(సీఈఆర్సీ) విద్యుత్ టారిఫ్లకు సంబంధించి కొత్తగా ప్రకటించిన నిబంధనల కారణంగా ప్రభుత్వ రంగ దిగ్గజం ఎన్టీపీసీ బీఎస్ఈలో 11%పైగా పతనమై రూ. 117 వద్ద ముగిసింది. ఇది 52 వారాల కనిష్టంకాగా, రెండు ఎక్స్ఛేంజీలలోనూ కలిపి దాదాపు 3.5 కోట్ల షేర్లు చేతులు మారాయి. ఉత్పత్తినిబట్టి కాకుండా అమ్మకపుస్థాయి(ఆఫ్టేక్) ఆధారంగా టారిఫ్ నిర్ణయంకానుండం ఇందుకు కారణమైంది. అయితే ముంద్రా ప్రాజెక్ట్లో ఉత్పత్తయ్యే విద్యుత్పై నష్టపరిహారంకింద యూనిట్కు రూ. 50 పైసలను అదనంగా వసూలు చేసుకునేందుకు సీఈఆర్సీ అంగీకరించడంతో టాటా పవర్ 5% జంప్చేసి రూ. 83 వద్ద ముగిసింది. అమెరికా మార్కెట్ల దూకుడు న్యూయార్క్: అమెరికా స్టాక్ మార్కెట్లు జోరుమీదున్నాయి. కేటర్పిల్లర్, మెర్క్ అండ్ కంపెనీ వంటి దిగ్గజాలు ఏడాది గరిష్టానికి చేరడంతో ఎస్అండ్పీ-500 సూచీ చరిత్రాత్మక గరిష్ట స్థాయిని తాకింది. ఇంతక్రితం జనవరి 15న సాధించిన 1,848 పాయింట్ల లైఫ్టైమ్ హైను అధిగమించి 1,857 వద్ద కదులుతోంది. ఇక నాస్డాక్ 14 ఏళ్ళ గరిష్టమైన 4,309కు చేరగా, డోజోన్స్ 184 పాయింట్లు ఎగసి 16,287 వద్ద ట్రేడవుతోంది. -
ఐటీ, మెటల్ షేర్లలో అమ్మకాలు
ప్రపంచ మార్కెట్ల బలహీనత, లాభాల స్వీకరణ కారణంగా స్టాక్ సూచీలు వరుసగా ఐదో రోజూ నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్ మంగళవారం 94 పాయింట్ల నష్టంతో మూడు వారాల కనిష్టస్థాయి 20,693 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 29 పాయింట్లు కోల్పోయి 6,162 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 477 పాయింట్లు కోల్పోయింది. ఎఫ్ఐఐలు వరుసగా రెండురోజుల పాటు విక్రయాలు జరపడంతో సెంటిమెంట్ బలహీనపడినట్లు మార్కెట్ వర్గాలు తెలిపాయి. హెవీవెయిట్ షేర్లు ఇన్ఫోసిస్, టీసీఎస్, ఎస్బీఐ, రిలయన్స్ ఇండస్ట్రీస్ తగ్గడంతో సూచీలు క్షీణించాయి. మెటల్, రియల్టీ షేర్లలో అమ్మకాలు అధికంగా జరిగాయి. టాటా స్టీల్, సేసా స్టెరిలైట్, హిందాల్కోలు 2-3% తగ్గగా, డీఎల్ఎఫ్, జేపీ అసోసియేట్స్ షేర్లు 1-2% పడిపోయాయి. అమెరికాలో వడ్డీ రేట్లు పెరగవచ్చన్న అంచనాలు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లలో (ఎఫ్ఐఐలు) ఏర్పడుతున్నాయని, ఈ కారణంగా వారు ఇటీవల వర్ధమాన మార్కెట్లలో లాభాల స్వీకరణ జరుపుతున్నట్లు బ్రోకింగ్ వర్గాలు తెలిపాయి. మంగళవారం ఎఫ్ఐఐలు మరో రూ. 567 కోట్ల పెట్టుబడుల్ని వెనక్కు తీసుకున్నారు. కొద్ది నెలల నుంచి అదేపనిగా అమ్మకాలు జరుపుతున్న దేశీయ సంస్థలు మాత్రం తాజాగా రూ. 59.44 కోట్ల నికర కొనుగోళ్లు జరపడం విశేషం. రిలయన్స్ కౌంటర్లో పెరిగిన ఓపెన్ ఇంట్రస్ట్: ఐదు రోజుల నుంచి వరుస నష్టాలు చవిచూస్తున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) భారీగా పెరిగింది. మూడు నెలలుగా మద్దతునిస్తున్న రూ. 840 సమీపస్థాయిలోనే రిలయన్స్ ముగిసింది. ఫ్యూచర్ కాంట్రాక్టు క్రితంరోజులానే రూ. 7 ప్రీమియంతో క్లోజయ్యింది. ఈ నేపథ్యంలో ఫ్యూచర్ ఓఐలో 7.12 లక్షల షేర్లు యాడ్కాగా, మొత్తం ఓఐ 1.32 కోట్ల షేర్లకు పెరిగింది. ఆర్ఐఎల్ కౌంటర్లో ఓపెన్ ఇంట్రస్ట్ ఇంతభారీగా పెరగడం అరుదు. రూ. 860 స్ట్రయిక్ వద్ద పెద్ద ఎత్తున కాల్ రైటింగ్ జరగడంతో 2.65 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 6.12 లక్షల షేర్లకు పెరిగింది. అలాగే రూ. 840 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడంతో ఈ పుట్ ఆప్షన్లో 83 వేల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 3.05 లక్షల షేర్లకు చేరింది. ఫ్యూచర్ కాంట్రాక్టులో గరిష్టస్థాయి ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ) వున్నందున, సమీప భవిష్యత్తులో ఈ షేరు ఏదో ఒకవైపు వేగంగా కదలవచ్చు. అయితే రూ. 860 స్థాయిని అధిగమించలేకపోతే రిలయన్స్ దిగువవైపుగా ప్రయాణించవచ్చని, ఆ స్థాయిని అధిక ట్రేడింగ్ పరిమాణంతో దాటితే ర్యాలీ జరపవచ్చని ఆప్షన్ రైటింగ్ సూచిస్తున్నది. -
2013 ముగింపు సానుకూలం
పాజిటివ్ ముగింపుతో 2013 సంవత్సరానికి స్టాక్ మార్కెట్ వీడ్కోలు పలికింది. మంగళవారం మందకొడిగా జరిగిన ట్రేడింగ్లో బీఎస్ఈ సెన్సెక్స్ 27 పాయింట్ల స్వల్పలాభంతో 21,170 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 13 పాయింట్లు పెరిగి 6,304 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. ఐటీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ షేర్ల మద్దతుతో ఈ ఏడాదిలో సెన్సెక్స్ 9 శాతం ర్యాలీ జరపగా, ఎన్ఎస్ఈ నిఫ్టీ 6.5 శాతం ఎగిసింది. సంస్థాగత ఇన్వెస్టర్ల ట్రేడింగ్ కార్యకలాపాలు మందగించడంతో తాజా ట్రేడింగ్ సెషన్లో హెవీవెయిట్ షేర్లు స్వల్పశ్రేణిలో హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. టాటా పవర్, ఐడీఎఫ్సీ, జేపీ అసోసియేట్స్ షేర్లు 3-4 శాతం మధ్య పెరగ్గా, రిలయన్స్ ఇండస్ట్రీస్, యాక్సిస్ బ్యాంక్, విప్రోలు 1-2 శాతం మధ్య ఎగిసాయి. అయితే మిడ్క్యాప్ షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. అమెరికా టైర్ల కంపెనీ కూపర్ డీల్ నుంచి వైదొలిగిన ఫలితంగా అపోలో టైర్స్ భారీ ట్రేడింగ్ పరిమాణంతో 6 శాతం ర్యాలీ జరిపింది. నగదు విభాగంలో ట్రేడయ్యే మిడ్, స్మాల్ క్యాప్ షేర్లలో యూబీ హోల్డింగ్స్, టీసీఐ, మీర్జా ఇంటర్నేషనల్, తాజ్ జీవీకే, డెన్ నెట్వర్క్స్, రిలాక్సో ఫుట్వేర్ షేర్లు 10-20 శాతం మధ్య పెరిగాయి. విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు రూ. 309 కోట్ల నికరపెట్టుబడులు చేయగా, దేశీయ సంస్థలు రూ. 280 కోట్ల నికర అమ్మకాలు జరిపాయి. ఐటీ ఇండెక్స్ టాప్ : 2013లో ప్రధాన సూచీలను అధిగమించి బీఎస్ఈ ఐటీ సూచి భారీగా 59 శాతం పెరిగింది. ఫార్మా ఇండెక్స్ 22 శాతం పెరుగుదలతో ద్వితీయస్థానాన్ని ఆక్రమించగా, ఆటో, ఎఫ్ఎంసీజీ ఇండెక్స్లు 7-11 శాతం మేర పెరిగాయి. బీఎస్ఈ రియల్టీ సూచీ 32 శాతం పతనమయ్యింది. బ్యాంకింగ్, మెటల్ ఇండెక్స్లు 9 శాతం చొప్పున క్షీణించాయి. బ్లూచిప్ షేర్లతో కూడిన ప్రధాన సూచీలు సెన్సెక్స్, నిఫ్టీలు పెరిగినా, మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ షేర్లు మాత్రం ఈ ఏడాది విలవిలలాడాయి. జపాన్ నికాయ్ రికార్డు : అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ బ్యాంకింగ్ వ్యవస్థలోకి విడుదల చేసిన భారీ నిధుల ఫలితాన్ని అన్ని దేశాల సూచీలు అందిపుచ్చుకున్నా, జపాన్ నికాయ్ ఇండెక్స్ అన్నింటికంటే ఎక్కువగా 57 శాతం ర్యాలీ జరిపింది. 2013లో అమెరికా డోజోన్స్, ఎస్ అండ్ పీ, నాస్డాక్లు మూడూ 25 శాతంపైగా పెరిగాయి. 1996వ సంవత్సరం తర్వాత డో, ఎస్ అండ్ పీలు ఒకే ఏడాది ఇంత భారీగా పెరగడం ఇదే ప్రధమం. ప్రధాన యూరప్ దేశాల ఇండెక్స్లు 12-35 శాతం మధ్య పెరిగాయి. వర్థమాన దేశాల సూచీల్లో అత్యధికంగా అర్జింటీనా సూచీ 89 శాతం ర్యాలీ చేసింది. నిఫ్టీలో లాంగ్ బిల్డప్ : కొద్ది రోజుల నుంచి చిన్న శ్రేణికి పరిమితమైన ఎన్ఎస్ఈ నిఫ్టీ కొత్త సంవత్సరం తొలిరోజుల్లో ర్యాలీ జరపవచ్చన్న అంచనాలతో మంగళవారం నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ బిల్డప్ జరిగింది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం క్రితంరోజుకంటే 7 పాయింట్లు పెరగడం, 6,300 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడం వంటివి లాంగ్ బిల్డప్ను సూచిస్తున్నాయి. నిఫ్టీ 6,304 వద్ద ముగియగా, ఫ్యూచర్ 51 పాయింట్ల ప్రీమియంతో 6,355 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం రోజున ఈ ప్రీమియం 44 పాయింట్లే. ఫ్యూచర్ కాంట్రాక్టు ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో తాజాగా 4.94 లక్షల షేర్లు యాడ్కావడంతో మొత్తం ఓఐ 1.97 కోట్ల షేర్లకు పెరిగింది. 6,300 స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరగడంతో ఈ పుట్ ఆప్షన్ ఓఐలో 3.59 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇదే స్ట్రయిక్ కాల్ ఆప్షన్ నుంచి 19 వేల షేర్లు కట్ అయ్యాయి. 6,300 స్థాయిపైన స్థిరపడితే నిఫ్టీ క్రమేపీ ర్యాలీ జరపవచ్చని, ఈ స్థాయిని ముగింపులో కోల్పోతే బలహీనపడవచ్చని ఈ డేటా సూచిస్తున్నది. -
పునరుత్పాదక విద్యుత్కు చేయూతనివ్వాలి
‘సాక్షి’ ఇంటర్వ్యూ టాటా పవర్ ఎండీ అనిల్ సర్దానా.. చౌక టెక్నాలజీల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సాహం అవసరం... ఈ వ్యవస్థ పటిష్టం కావడం ఆర్థిక వృద్ధికి కీలకం.. హైదరాబాద్, బిజినెస్ బ్యూరో 2020 నాటికి 26వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యాన్ని సాధించాలని ప్రైవేట్ విద్యుత్ దిగ్గజం టాటా పవర్ నిర్దేశించుకుంది. ఇందులో నాలుగోవంతు వాటా పునరుత్పాదక విద్యుత్ది ఉండాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ నేపథ్యంలోనే సంప్రదాయేతర విద్యుదుత్పత్తి విభాగం పనితీరు, ఎదుర్కొంటున్న సవాళ్లు వంటి విషయాల గురించి టాటా పవర్ ఎండీ అనిల్ సర్దానా ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కిచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. వివరాలు ఆయన మాటల్లోనే... జోరుగా స్థల సమీకరణ టాటా పవర్లో భాగమైన సంప్రదాయేతర విద్యుత్ ఉత్పాదక విభాగం సామర్థ్యం ప్రస్తుతం 1,106 మెగావాట్లుగా ఉంది. 2020 నాటికల్లా టాటా పవర్ 26,000 మె.వా. విద్యుదుత్పాదన సామర్థ్యం సాధించాలని లక్ష్యంగా పెట్టుకోగా... అందులో సుమారు 20-25 శాతం కాలుష్యరహితమైన సంప్రదాయేతర వనరుల ద్వారా ఉండాలని నిర్దేశించుకున్నాం. ప్రస్తుతం పవన విద్యుత్కి సంబంధించి 398 మె.వా. సామర్థ్యం ఉంది. మరో 160 మె.వా. ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తున్నాం. ఇక సౌర విద్యుత్కి సంబంధించి 28 మె.వా. పైగా సామర్థ్యం ఉంది. మరిన్ని ప్రాజెక్టులను చేపట్టే దిశగా మహారాష్ట్ర, రాజస్థాన్, గుజరాత్, కర్ణాటక రాష్ట్రాల్లో స్థల సమీకరణ ప్రక్రియ జరుగుతోంది. విద్యుదుత్పత్తి విధానాన్ని బట్టి భౌగోళికంగా పరిస్థితులు అనువుగా ఉన్న ప్రాంతాలను ఎంచుకుంటున్నాం. రెండింటికీ ప్రాధాన్యం.. సౌర, పవన విద్యుత్.. రెండింటికీ ప్రాధాన్యం ఇస్తున్నాం. అయితే, దేశీయంగా పవన విద్యుత్ రంగ విధానాలు గడిచిన ఇరవై ఏళ్లుగా అభివృద్ధి చెందాయి. కానీ, సౌర విద్యుత్ రంగం ఇంకా ప్రాథమిక స్థాయిలోనే ఉంది. దీనికి సంబంధించిన విధి విధానాలు ఇంకా పూర్తి స్థాయిలో రూపొందాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలోనే.. మొత్తం మీద ఏటా 150-200 మె.వా. మేర పవన విద్యుత్, 30-50 మె.వా. మేర సౌర విద్యుత్ సామర్థ్యాన్ని సమకూర్చుకోవాలని నిర్దేశించుకున్నాం. ఇతర దేశాల్లో విస్తరణ.. అంతర్జాతీయంగా నాలుగు కీలక ప్రాంతాలను ఎంచుకున్నాం. ఇందులో ఆఫ్రికా, ఆగ్నేయాసియా, మధ్యప్రాచ్యం, సార్క్ దేశాలు ఉన్నాయి. ఆయా దేశాల్లో మార్కెట్ పరిస్థితులను, అవకాశాలను అధ్యయనం చేస్తున్నాం. దక్షిణాఫ్రికా, ఇండొనేషియా వంటి దేశాల్లో ఇతర కంపెనీలతో కలిసి ఇప్పటికే ప్రాజెక్టులు చేపట్టాం. అవకాశాలు, రిస్కులు, రివార్డులు మొదలైన అంశాల ప్రాతిపదిక గా ఆయా దేశాలను ఎంచుకుంటున్నాం. సంప్రదాయేతర విద్యుదుత్పత్తికి సవాళ్లు.. ఈ రంగం ప్రధానంగా కొనుగోలుదారులపరమైన సమస్య ఎదుర్కొంటోంది. చాలా మటుకు పంపిణీ సంస్థల ఆర్థిక పరిస్థితులు బాగా లేవు. దీంతో అవి కొనుక్కునే విద్యుత్ చెల్లింపుల్లో జాప్యాలు జరుగుతున్నాయి. మరోవైపు, వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు వివిధ రకాల విధానాలు పాటిస్తుండటం వల్ల ఇలాంటి ప్రాజెక్టులు సమస్యలు ఎదుర్కొంటున్నాయి. స్థల సమీకరణలో జాప్యం, అటవీ శాఖ అనుమతుల్లో జాప్యం, పునరావాస కల్పన లాంటివి వీటికి తోడవుతున్నాయి. ఇక పవన విద్యుత్కి అనువైన పరిస్థితులు ఉన్న కొన్ని రాష్ట్రాలు.. ఇప్పటికే తమకు సరిపడేంత విద్యుత్ ఉండటంతో కొత్తగా మరింత సామర్థ్యాన్ని పెంచేందుకు అంతగా ఇష్టపడటం లేదు. ఇందుకు టారిఫ్లను తగ్గించేయడం, విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు కుదుర్చుకోకపోవడం వంటి మార్గాలు ఎంచుకుంటున్నాయి. పంపిణీ సంస్థలు తప్పనిసరిగా పునరుత్పాదక విద్యుత్ను కొనుగోలు చేయాలన్న నిబంధనను అమలు చేయకపోవడం వల్ల సంప్రదాయేతర విద్యుత్ ఉత్పత్తి వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ప్రభుత్వ సహకారం కావాలి.. ఎకానమీ వృద్ధిలో కీలక పాత్ర పోషించే విద్యుత్ రంగానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ రంగం ఎదగడానికి అడ్డుగా ఉంటున్న సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి. అలాగే ప్రభుత్వం విద్యుదుత్పత్తి, పంపిణీ వ్యాపారాల్లో డిజిన్వెస్ట్ చేసి, పెట్టుబడులు రావడానికి ఊతమివ్వాలి. ప్రైవేట్ సంస్థలు ప్రజల అవసరాలకు తగిన విధంగా స్పందించేలా చూసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. విద్యుదుత్పత్తి పరిమాణంలోనే కాకుండా నాణ్యతలో కూడా ప్రపంచస్థాయి ప్రమాణాలు కలిగి ఉండేలా చూడాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం గట్టిగా తల్చుకుంటే ఇది సాధ్యమే. పునరుత్పాదక విద్యుత్ కొనుగోలు(ఆర్పీవో) వ్యవస్థను ప్రభుత్వం పటిష్టం చేస్తే ఈ రంగానికి గట్టి ఊతం లభిస్తుంది. పునరుత్పాదక వనరులు దేశవ్యాప్తంగా ఒకే స్థాయిలో ఉండవు కనుక అవి పుష్కలంగా ఉన్న చోట్లలో భారీఎత్తున ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ఆర్పీవోల వల్ల భరోసా కలుగుతుంది. ఇక, సౌర విద్యుదుత్పత్తికి ఉపయోగించే టెక్నాలజీపైనా (సీఎస్టీ లేదా పీవీ) ఆంక్షలు పెట్టకుండా దాన్ని డెవలపర్లకే విడిచిపెట్టాలి. విద్యుదుత్పత్తి వ్యయాలను తగ్గించే టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు ప్రోత్సాహమివ్వాలి. -
ఆర్బీఐ ఎఫెక్ట్.. 248 పాయింట్ల ర్యాలీ
మార్కెట్ ను ఆశ్యర్యపరుస్తూ రిజర్వుబ్యాంక్ పాలసీ సమీక్షలో వడ్డీ రేట్లను యథాతథంగా వుంచడంతో బుధవారం స్టాక్ సూచీలు ర్యాలీ జరిపాయి. వరుసగా ఆరు రోజుల పతనానికి బ్రేక్వేస్తూ బీఎస్ఈ సెన్సెక్స్ 20,917 పాయింట్ల గరిష్టస్థాయి వరకూ ర్యాలీ సాగించింది. చివరకు క్రితం ముగింపుకంటే 248 పాయింట్ల పెరుగుదలతో 20,860 పాయింట్ల వద్ద ముగిసింది. ఇదేబాటలో ఎన్ఎస్ఈ నిఫ్టీ 78 పాయింట్లు ఎగిసి 6,217 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. అధిక ద్రవ్యోల్బణం కారణంగా ఈ దఫా సమీక్షలో వడ్డీ రేట్ల పెంపు తప్పదన్న అంచనాలతో మార్కెట్ వరుస క్షీణతను నమోదుచేస్తున్నది. ఆరు ట్రేడింగ్ సెషన్లలో సెన్సెక్స్ 714 పాయింట్లు పతనమయ్యింది. తాజా ర్యాలీలో రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, పవర్ షేర్లు జోరుగా పెరిగాయి. డీఎల్ఎఫ్, బీహెచ్ఈఎల్, టాటా పవర్లు 4-6 శాతం మధ్య పెరిగాయి. రిలయన్స్, హెచ్డీఎఫ్సీ, హెచ్డీఎఫ్ సీ బ్యాంక్, ఎస్బీఐలు 2-3% మధ్య పెరిగాయి. బ్యాంకింగ్ షేర్లలో లార్జ్క్యాప్స్కంటే మిడ్సైజ్ పీఎస్యూ బ్యాంకు షేర్లు పెద్ద ర్యాలీ జరిపాయి. రంగాలవారీగా అన్నింటికంటే ఎక్కువగా రియల్టీ ఇండెక్స్ 3.5% ర్యాలీచేయగా, బ్యాంకింగ్ ఇండెక్స్ 1.4% పెరిగింది. ఎఫ్ఐఐలు రూ. 1,196 కోట్ల నిధుల్ని కుమ్మరించగా, డీఐఐలు రూ. 413 కోట్లు వెనక్కు తీసుకున్నాయి. టెస్కో వాటా కొనుగోలుచేయడంతో ట్రెంట్ 10% ఎగిసింది. ఫెడ్ నిర్ణయం కోసం ఎదురుచూపు... ఇన్వెస్టర్ల అంచనాలకు భిన్నంగా వడ్డీ రేట్లు పెంపునకు బ్రేక్వేసినప్పటికీ, ఆర్బీఐ చర్యకు మార్కెట్ తగినంతగా పెరగలేదని మార్కెట్ వర్గాలు అభిప్రాయపడ్డాయి. రేట్ల పెంపు అంచనాలతో గతవారం రోజుల్లో 3 శాతంపైగా క్షీణించిన సూచీలు, ఆర్బీఐ నిర్ణయం తర్వాత 1.2 శాతమే పెరిగాయి. రానున్న ఫెడ్ నిర్ణయం నేపథ్యంలో ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యవహరించడమే చిన్నర్యాలీకి కారణమని ఆ వర్గాలు విశ్లేషించాయి. ఆర్థిక ఉద్దీపన ప్యాకేజీ ఉపసంహరణను ప్రారంభించనున్నట్లు ఫెడ్ ప్రకటిస్తే ఇక్కడ వడ్డీ రేట్లు హఠాత్తుగా పెరిగే అవకాశం వుందన్న భయాలు ఇన్వెస్టర్లలో నెలకొన్నాయని, టాపరింగ్ వాయిదాపడితే గురువారం సూచీలు మరికొంత పెరిగే ఛాన్స్ వుందని ఆ వర్గాలు వివరించాయి. నిఫ్టీలో లాంగ్ బిల్డప్ ఆర్బీఐ గవర్నర్ రఘురామ్ రాజన్ మ్యాజిక్ ఫలితంగా నిఫ్టీ ఫ్యూచర్ కాంట్రాక్టులో లాంగ్ బిల్డప్ జరిగినట్లు డెరివేటివ్ డేటా వెల్లడిస్తున్నది. డిసెంబర్ ఫ్యూచర్స్, ఆప్షన్స్ కాంట్రాక్టుల ముగింపునకు మరో ఐదురోజులే గడువు ఉన్నా, తాజాగా నిఫ్టీ ఫ్యూచర్ ఓపెన్ ఇంట్రస్ట్ (ఓఐ)లో 1.76 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. మొత్తం ఓఐ 2.20 కోట్లకు చేరింది. స్పాట్ నిఫ్టీతో పోలిస్తే ఫ్యూచర్ ప్రీమియం 32 పాయింట్లకు పెరిగిపోయింది. స్పాట్ నిఫ్టీ 6,117 పాయింట్ల వద్ద ముగియగా, ఫ్యూచర్ 6,249 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. క్రితం రోజు ఈ ప్రీమి యం 21 పాయింట్లే. డెరివేటివ్ కాంట్రాక్టుల ముగింపు దగ్గరపడుతున్నా, ఇలా ప్రీమియం పెరిగిపోవడం భారీ షార్ట్ కవరింగ్ను, లాంగ్ బిల్డప్ను సూచిస్తుంది. అలాగే ఫెడ్ నుంచి ప్రతికూల నిర్ణయం ఏదైనా వెలువడితే తప్ప, నిఫ్టీ 6,200 దిగువకు తగ్గకపోవొచ్చన్న అంచనాలతో ఈ స్ట్రయిక్ వద్ద పుట్ రైటింగ్ జరిగింది. దాంతో 6,200 పుట్ ఆప్షన్ ఓఐలో 16.18 లక్షల షేర్లు యాడ్ అయ్యాయి. ఇదే సమయంలో 6,300 స్ట్రయిక్ వద్ద స్వల్పంగా కాల్ రైటింగ్ జరగడంతో 80 వేల షేర్లు యాడ్ అయ్యాయి. సాధారణ పరిస్థితుల్లో 51 లక్షల షేర్ల పుట్ బిల్డప్ కలిగిన 6,200 స్థాయి నిఫ్టీకి మద్దతునివ్వవచ్చని, 71.50 లక్షల షేర్ల కాల్ బిల్డప్ వున్న 6,300 స్థాయి నిఫ్టీ పెరుగుదలను నిరోధించవచ్చని ఆప్షన్ రైటింగ్ విశ్లేషిస్తున్నది. -
వొకేషనల్ సెంటర్ ప్రారంభం
సాక్షి, న్యూఢిల్లీ: టాటా పవర్ ఢిల్లీ డిస్ట్రిబ్యూషన్ లిమిటెడ్ వొకేషనల్ సెంటర్ను రోహిణి సెక్టార్-3లోని జేజే కాలనీలో ఢిల్లీ పీడబ్ల్యూడీ మంత్రి చౌహాన్ శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సామాజిక సేవాకార్యక్రమాల్లోనూ టీడీడీపీఎల్ పాలుపంచుకోవడం సంతోషంగా ఉందన్నారు. విద్యార్థులకు ఏడో తరగతి వరకు ఎలక్ట్రీషియన్ కోర్సులతోపాటు ట్యూ షన్లు నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎలక్ట్రీషియన్లో రెండు నెలల షార్ట్టర్మ్ కోర్సుతోపాటు ఆరునెలల లాంగ్టర్మ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయన్నారు. దీనిలో ఏడాదికి 220 మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఏఎన్కే అనే స్వచ్ఛందసంస్థ సంయుక్త ఆధ్వర్యంలో దీన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మంగోల్పురిలో ఐటీఐ భవన నిర్మాణం కొనసాగుతున్నట్టు చౌహాన్ పేర్కొన్నారు. నూతన భవన ప్రారంభంతో స్థానికులతోపాటు, పిరాడిగఢి, ఉద్యోగ్నగర్, రాణిభాగ్, రోహిణి, బుద్ధవిహార్, సుల్తాన్పురి, మదీనాపురి ప్రాంతాల్లోని విద్యార్థులకు సాంకేతిక విద్య అందుబాటులోకి వస్తుందన్నారు. ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతోందన్నారు. పేద, మధ్యతరగతి విద్యార్థులకు విద్యుత్ టారిఫ్ల్లో 73 శాతం సబ్సిడీ ఇస్తున్నామని చౌహాన్ అన్నారు. కార్యక్రమంలో టీడీడీపీఎల్ కార్యనిర్వాహణ అధికారి పర్వీర్ సిన్హా, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
చివర్లో రివ్వున పైకి
తొలుత లాభాలతో మొదలైన మార్కెట్లు మధ్యలో కొంతమేర వెనక్కు తగ్గినప్పటికీ చివర్లో మళ్లీ పుంజుకున్నాయి. వెరసి సెన్సెక్స్ చివరి అర్థగంటలో పెరిగిన కొనుగోళ్లతో 200 పాయింట్లు ఎగసి గరిష్టంగా 20,013ను తాకింది. ఆపై స్వల్పంగా వెనక్కుతగ్గి 158 పాయింట్ల లాభంతో 19,962 వద్ద ముగిసింది. ఇది వారం రోజుల గరిష్టంకాగా, నిఫ్టీ కూడా ఇంట్రాడేలో 5,900ను అధిగమించింది. చివరికి 49 పాయింట్లు జమ చేసుకుని 5,899 వద్ద స్థిరపడింది. బీఎస్ఈలో ప్రధానంగా రియల్టీ, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాలు 2-1.3% మధ్య బలపడ్డాయి. అమెరికా కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ సమావేశాలపై దృష్టిపెట్టిన ఆపరేటర్లు, ఇన్వెస్టర్లు ట్రేడింగ్ పట్ల పెద్దగా ఆసక్తిని చూపకపోవడంతో మార్కెట్లు అక్కడక్కడే సంచరిస్తున్నాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. అయితే యూరప్ మార్కెట్లు ప్రోత్సాహకరంగా ట్రేడవుతుండటంతో సెంటిమెంట్ సానుకూలంగా మారిందని తెలిపారు. 24 షేర్లు లాభాల్లోనే : సెన్సెక్స్-30లో 24 షేర్లు లాభాలతోనే ముగియగా, ఎన్టీపీసీ, టాటా పవర్ 3%పైగా పురోగమించాయి. మిగిలిన దిగ్గజాలలో ఎస్బీఐ, డాక్టర్ రెడ్డీస్, హెచ్యూఎల్, ఎల్అండ్టీ, మారుతీ, ఆర్ఐఎల్, ఐటీసీ, ఐసీఐసీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.4-1.2% మధ్య లాభపడ్డాయి. మరోవైపు భెల్ దాదాపు 5% పతనంకాగా, హీరోమోటో 2.8%, సెసా గోవా 1.6% చొప్పున క్షీణించాయి. మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.5% బలపడగా, ట్రేడైన షేర్లలో 1,221 లాభపడ్డాయి. 1,112 నష్టపోయాయి.