ప్రీ డేటా ఓకే, కానీ క్వాలిటీ....
న్యూఢిల్లీ: మార్కెట్లో టెల్కోలను హడలెత్తిస్తున్న రిలయన్స్ జియోను తట్టుకునేందుకు, దిగ్గజ కంపెనీలన్నీ ఆఫర్ల మీద ఆఫర్లు ప్రకటిస్తున్నాయి. జియో తాకిడిని తట్టుకునేందుకు, ఎయిర్ టెల్ ఇటీవలే తన ప్రీపెయిడ్ కస్టమర్ల కోసం, పోస్టుపెయిడ్ కస్టమర్ల కోసం ఉచిత డేటా ప్రయోజనాలు ప్రకటించింది. పోస్ట్ పెయిడ్ కస్టమర్లకైతే ఏకంగా 30జీబీ వరకు ఉచిత డేటా అందించనున్నట్టు ప్రకటించింది. ఇలా ఇతర కంపెనీలు కూడా డేటా ప్రయోజనాలను తమ కస్టమర్ల కోసం తీసుకొచ్చాయి. ఉచిత డేటాలనైతే కంపెనీలు ప్రకటిస్తున్నప్పటికీ, ఎక్కడా కూడా ఏ కంపెనీ కూడా సర్వీసుల క్వాలిటీ గురించి ఊసైనా ఎత్తడం లేదు. ప్రమోసనల్ స్కీమ్స్ పై ఏ మేర క్వాలిటీ సర్వీసులు అందిస్తాయో కనీస గ్యారెంటీ ఇవ్వడం లేదు.
ఆపరేటర్లు అందించే స్కీమ్ లకు, వారు అందించే డెలివరీకి చాలా గ్యాప్ ఉంటుందని, వాటిని సమీక్షించడానికి కనీసం ఎలాంటి మెకానిజం లేదని వాలంటరీ ఆర్గనైజేషన్ ఇన్ ఇంటరెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వ్యవస్థాపకుడు ఎస్ఆర్ ఖన్నా ఆందోళన వ్యక్తంచేశారు. ఈ విషయాన్ని టెలికాం రెగ్యులేటరీ ట్రాయ్ కూడా సీరియస్ గా తీసుకుంటోంది. ప్రమోషనల్ ఆఫర్లో కూడా ఒకే విధమైన క్వాలిటీ సర్వీసులు అందించే విషయంపై ఆపరేటర్లతో చర్చించడానికి ట్రాయ్ ఈ వారంలో వారితో సమావేశమవుతోంది. ప్రమోషనల్ ఆఫర్లలో క్వాలిటీ సర్వీసులు ఆందోళనను కలిగిస్తున్నాయని, ఉచితంగా సర్వీసులు అందించడమంటే నాసిరకంగా అందించడం కాదని ట్రాయ్ అధికారి అన్నారు. త్వరలోనే ఆపరేటర్లతో మీటింగ్ నిర్వహించి దీనిపై చర్చించనున్నామని చెప్పారు. అయితే ప్రమోషనల్ ఆఫర్లలో సర్వీసుల క్వాలిటీ నాసిరకంగా ఉన్నాయనే దాన్ని టెల్కోలు ఖండిస్తున్నాయి.