
30 నుంచి సూపర్జంబో విమానాలు
న్యూఢిల్లీ: ఒకేసారి 471 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చే ఎయిర్బస్ ఏ-380 విమానాలు ఈ నెల 30వ తేదీ నుంచి భారత్కు రాకపోకలు ప్రారంభించనున్నాయి. సూపర్జంబోలుగా పిలిచే వీటిని భారత్లో తొలిసారిగా ఢిల్లీ, ముంబై నగరాలకు సింగపూర్ ఎయిర్లైన్స్ నడపనుంది. ఈ రెండు నగరాలతో పాటు హైదరాబాద్, బెంగళూరుల నుంచి ఈ విమానాలు నడపడానికి ప్రభుత్వం గత జనవరిలో అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ, ముంబై నగరాలకు రోజూ రాకపోకలు సాగిస్తున్న బోయింగ్ 777 విమానాల స్థానంలో ఏ-380లను ప్రవేశపెడుతున్నామని సింగపూర్ ఎయిర్లైన్స్ జనరల్ మేనేజర్ (ఇండియా) డేవిడ్ లౌ మంగళవారం న్యూఢిల్లీలో మీడియాకు తెలిపారు.
ఏ-380 విమానంలో ఫస్ట్క్లాస్ సూట్స్, బిజినెస్ క్లాస్, ఎకానమీ క్లాస్లలో మొత్తం 471 సీట్లుంటాయని వివరించారు. భారత్కు ఏ-380 విమాన సర్వీసులు నడపాలని తాము ఎంతో ఆసక్తితో ఎదురుచూశామనీ, ఇప్పుడు తమకు అనుమతి లభించిందనీ చెప్పారు. ఢిల్లీ, ముంబైల నుంచి సింగపూర్ ఎయిర్లైన్స్లో వారానికి ఆరువేల సీట్లు అందుబాటులో ఉంటాయని అన్నారు.
సింగపూర్ ఎయిర్లైన్స్ 10 శాతం డిస్కౌంట్
ముంబై: విమాన ప్రయాణికులపై ఆఫర్ల వర్షం కురుస్తోంది. వచ్చే నెల నుంచి ఏ380 విమానాన్ని నడపనున్న సింగపూర్ ఎయిర్లైన్స్ కంపెనీ ప్రీమియం క్లాస్ టికెట్లపై 10 శాతం డిస్కౌంట్ను ఆఫర్ చేస్తోంది. దేశీయ విమాన ప్రయాణికులకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. తరుచుగా విమాన ప్రయాణాలు చేసే- క్రిస్ప్లైయర్కు 10 శాతం బోనస్ మైల్స్ను కూడా ఆఫర్ చేస్తోంది.
ఇక తరుచుగా ప్రీమియం క్లాస్లో ప్రయాణించే వారికి ఏ380 విమానంలో సూట్స్ టికెట్ల కొనుగోళ్లపై 10 శాతం అదనపు డిస్కౌంట్ను ఇస్తామని, ఈ ఆఫర్ ఈ నెల 1 నుంచి 15 లోపు బుక్ చేసుకునే టికెట్లకే వర్తిస్తుందని వివరించింది. జూన్ 1 నుంచి జూలై 15 ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది. ఈ కంపెనీ ఈ నెల 30 నుంచి ముంబై-న్యూఢిల్లీ రూట్లలో ఏ380ను నడపనున్నది.