
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా కల్లోలంతో మిలియన్ల మంది అమెరికన్లు తమ ఉద్యోగాలను కోల్పోతున్న సమయంలో రీటైల్ దిగ్గజం వాల్ మార్ట్ శుభవార్త చెప్పింది. రానున్నకాలంలో దాదాపు 50వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని భావిస్తున్నట్టు వెల్లడించింది.కరోనా వైరస్, లాక్ డౌన్ సమయంలో వినియోగదారుల నుండి కిరాణా, గృహ అవసరాలకు డిమాండ్ పెరిగిన నేపథ్యంలో ఈ నియామకాలని వాల్మార్ట్ శుక్రవారం ప్రకటించింది. లక్షా 50 వేల మందిని నియమించుకోవాలన్న తమ మునుపటి లక్ష్యాన్ని ఆరువారాలముందే చేరుకున్నామని, సగటున రోజుకు 5,000 మంది చొప్పున తీసుకున్నామని వెల్లడించింది. (కరోనా : అమెజాన్లో 75 వేల ఉద్యోగాలు)
తాజాగా వాల్మార్ట్ దుకాణాలు, క్లబ్బులు, కార్పొరేట్ కార్యాలయాలు, ఇతర పంపిణీ కేంద్రాలలో 50 వేల మంది కార్మికులను నియమించుకో నున్నామని వాల్మార్ట్ యుఎస్ ప్రెసిడెంట్ జాన్ ఫర్నర్ తెలిపారు. తమ ఉద్యోగలు మాస్క్ లు, శానిటైజేషన్ లాంటి నిబంధనలు పాటించాల్సి అవసరం వుందని పేర్కొన్నారు. అలాగే కంపెనీ అత్యవసర సెలవు విధానాన్ని మే చివరి దాకా పొడిగిస్తున్నట్టు వెల్లడించారు.
కాగా కరోనా మహమ్మారి వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో ప్రపంచ వ్యాప్తంగా కఠినమైన ఆంక్షలు కొనసాగుతున్నాయి. లాక్ డౌన్ కారణంగా ఆర్థిక కార్యకలాపాలు నిలిచిపోయాయి. అత్యవసర సేవలు తప్ప మిగిలిన సేవలు ఎక్కడిక్కడ రద్దు అయ్యాయి. దీంతో వినిమయ డిమాండ్ క్షీణించి ఆర్థిక వ్యవస్థలు అతలాకుతవుతున్నాయి. దీంతో చాలా కంపెనీలు మూతపడే క్రమలో ఉన్నాయి. మరికొన్ని ఖర్చులను నివారించు కునేందుకు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో ఉన్నాయి. అయితే ఆహారం, హ్యాండ్ శానిటైజర్, టాయిలెట్ పేపర్, ఇతర గృహోపకరణాలకు డిమాండ్ భారీగా పుంజుకోవడంతో అమెజాన్ సంస్థ వేలాది మందిని నియమించున్నట్టు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment