
న్యూఢిల్లీ: శానిటైజర్లు అన్నవి.. సబ్బులు, యాంటీ బ్యాక్టీరియల్ ద్రావకాలు, డెట్టాల్ మాదిరే ఇన్ఫెక్షన్ కారకాలను నిర్మూలించేవని, కనుక వీటిపై 18 శాతం జీఎస్టీ అమలవుతుందని కేంద్ర ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. శానిటైజర్లలో వినియోగించే పలు రకాల రసాయనాలు, ప్యాకింగ్ సామగ్రిపైనా జీఎస్టీ 18 శాతం అమల్లో ఉందంటూ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. ‘‘శానిటైజర్లపై జీఎస్టీని తగ్గించినట్టయితే అది విలోమ సుంకాల విధానానికి (తుది ఉత్పత్తిపై జీఎస్టీ కంటే దాని తయారిలో వినియోగించే సరుకులపై అధిక జీఎస్టీ ఉండడం) దారితీస్తుంది. అప్పుడు దిగుమతి చేసుకునే హ్యాండ్ శానిటైజర్లు చౌకగా మారతాయి. దీంతో దేశీయ తయారీ దారులకు ప్రతికూలంగా మారుతుంది’’ అంటూ కేంద్ర ఆర్థిక శాఖ తన ప్రకటనలో వివరించింది.