
న్యూఢిల్లీ: భారత్ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని ప్రపంచబ్యాంక్ పేర్కొంది. 2018–2019 (ఏప్రిల్–మార్చి) ఆర్థిక సంవత్సరంలో దేశం 7.3 శాతం వృద్ధి సాధిస్తుందని, అటు తర్వాత రెండు ఆర్థిక సంవత్సరాల్లో వరుసగా 7.5 శాతం వృద్ధి నమోదవుతుందని అంచనా వేసింది. ‘‘వృద్ధిలో భారత్ వెనకబడే పరిస్థితులు పోయాయి’’ అని ప్రపంచబ్యాంక్లో వృద్ధి పరిశీలనా వ్యవహారాల విభాగం డైరెక్టర్ అహ్యాన్ కోష్ పేర్కొన్నారు. వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారత్ మొదటి స్థానంలో ఉంటుందన్నది తమ అంచనా అని వివరించారు. ప్రపంచ ఆర్థిక వృద్ధికి సంబంధించి విడుదల చేసిన 2018 జూన్ నివేదికలో బ్యాంక్ పొందుపరచిన అంశాల్లో ముఖ్యమైనవి..
►ప్రైవేటు వినియోగం పెరగడం, పెట్టుబడులు పటిష్టత, కేంద్రం చేపడుతున్న ఆర్థిక, ద్రవ్య సంస్కరణలు భారత్ వృద్ధికి ప్రధానంగా దోహదపడే అంశాలు.
► దక్షిణాసియా వృద్ధి 2018లో 6.9 శాతంకాగా, 2017లో 7.1 శాతంగా ఉంటుంది. దీనికి భారత్ వృద్ధి పటిష్టత కారణం.
►2017లో చైనా 6.9 శాతం వృద్ధి సాధిస్తుందన్నది అంచనాకాగా, 2018 (6.5 శాతం), 2019 (6.3 శాతం), 2020 (6.2 శాతం)ల్లో ఈ రేటు మరింత తగ్గుతుంది.
► భారత్ వృద్ధిలో మహిళల భాగస్వామ్యం పెరగాలి. వారికి ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఉత్పాదకత మెరుగుకూ ఇది అవసరం.
Comments
Please login to add a commentAdd a comment