శ్రీవారి సన్నిధిలో కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం | koil alwar-thirumanjanam-tirumala-temple | Sakshi
Sakshi News home page

శ్రీవారి సన్నిధిలో కోయిల్‌ అళ్వార్‌ తిరుమంజనం

Published Tue, Dec 26 2017 4:17 PM | Last Updated on Tue, Dec 26 2017 4:32 PM

సాక్షి, తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం వైభవంగా నిర్వహించారు. ఏడాదిలో నాలుగుసార్లు.. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠం ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారాల్లో తిరుమంజనంలో భాగంగా  ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహించటం సంప్రదాయం. ఈ నేపథ్యంలో 29న వైకుంఠం ఏకాదశి సందర‍్భంగా  ఈ రోజు ఈ వైదిక కార్యక్రమం నిర్వహించారు. ఉదయం 6 నుండి ఉదయం 11 గంటల వరకు శ్రీవారి దర్శనం నిలిపివేసి.. అర్చకులు ఆగమోక్తంగా శుద్ధి కార్యక్రమాన్ని జరిపారు. ఆలయ మహద్వారం మొదలు గర్భాలయం వరకు, ఉప దేవాలయాలు, గోడలు, పైకప్పు, పూజాసామగ్రిని సంప్రదాయంగా శుద్ధి చేశారు. సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర మిశ్రమాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేశారు. ప్రత్యేకపూజ, నైవేద్యం కార్యక్రమాలు నిర్వహించి.. అనంతరం భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతించారు. 

29న వైకుంఠ ఏకాదశి పూజలు
ఈనెల 29వ తేది వైకుంఠ ఏకాదశి పర్వదినం పురస్కరించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఆ రోజు అర్థరాత్రి 12.01  నుండి 5 గంటలవరకు ఆలయంలో ధనుర్మాస పూజలు నిర్వహిస్తారు. తిరుప్పావైతో మేల్కొలిపి, ధనుర్మాస కైంకర్యాలు, అభిసేకం, తోమాల, అర్చన ఏకాంతంగా నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత భక్తులకు స్వామి దర్శనానికి అనుమతిస్తారు. అదే రోజు ఉదయం 9 గంటలకు శ్రీవారి స్వర్ణరథంపై శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామివారు దర్శనమివ్వనున్నారు. 

30న తీర్థ ముక్కోటి.. పుష్కరిణిలో చక్రస్నానం
ఈనెల 30వ తేదిన వైకుంఠ ద్వాదశి సందర్భంగా  తీర్థ ముక్కోటి ఉత్సవం శ్రీవారి పుష్కరిణిలో నిర్వహించనున్నారు. ఆ రోజు ఉదయం 4.30 నుండి 5.30 గంటల మధ్య సుదర్శన చక్రత్తాళ్వారు పుష్కరిణి వద్ద అభిషేకం, పూజా కార్యక్రమాలు నిర్వహించి, చక్రస్నానం చేస్తారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement