
న్యూయార్క్ : అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలోని మ్యాన్హట్టన్లో బుధవారం తెల్లవారుజామున(భారత కాలమానం ప్రకారం) ట్రక్కు బీభత్సం సృష్టించింది. ఈ ఘటనలో ఎనిమిది మంది అక్కడికక్కడే మృతి చెందగా.. 15 మందికి గాయాలయ్యాయి. వరల్డ్ ట్రేడ్ సెంటర్ మెమోరియల్ దగ్గరలో సైకిళ్లు, పాదాచారులు వెళ్లే పాత్పైకి ట్రక్కు దూసుకెళ్లింది. ఆ తర్వాత ఆగి ఉన్న స్కూల్ బస్సును కూడా ట్రక్కుతో ఢీ కొట్టి పారిపోతున్న దుండగుడిని అమెరికన్ పోలీసులు తుపాకీతో కాల్చారు.
పొత్తికడుపులో బుల్లెట్ తగలడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసులు అతన్ని ఆసుపత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ట్రక్కు నుంచి దిగి పారిపోతూ అల్లా హూ అక్బర్ అని వ్యక్తి అరిచినట్లు సమాచారం. కాగా, ఘటనపై స్పందించిన న్యూయార్క్ రాష్ట్ర మేయర్ ఉగ్రదాడేనని ప్రకటించారు. సెప్టెంబర్ 2011 తర్వాత న్యూయార్క్ రాష్ట్రంలో ఇదే అతి పెద్ద దాడిగా న్యూయార్క్ పోలీసులు అభివర్ణించారు.
దాడికి పాల్పడిన వ్యక్తి ఉజ్బుకిస్థాన్కు చెందిన సైపోవ్గా అధికారులు గుర్తించారు. 2010లో అమెరికాకు వచ్చిన అతనికి గ్రీన్ కార్డు కూడా ఉందని చెప్పారు. ట్రక్కును న్యూజెర్సీలోని ఓ డిపోట్ నుంచి అద్దెకు తీసుకుని దాడికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.