దర్యాప్తు ముమ్మరం | Grandfather And Grandson Death Mystery in Vizianagaram | Sakshi
Sakshi News home page

దర్యాప్తు ముమ్మరం

Sep 12 2019 1:01 PM | Updated on Sep 12 2019 1:01 PM

Grandfather And Grandson Death Mystery in Vizianagaram - Sakshi

సంఘటనాస్థలంలో తనిఖీలు చేస్తున్న సీఐ, క్లూస్‌టీం, జ్ఞానేశ్వర్‌ తల్లితండ్రులు

విజయనగరం, బాడంగి: మండలంలోని ముగడ గ్రామంలో తాతా, మనవడు మంగళవారం సజీవ దహనమైన సంఘటనకు సంబంధించి పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. బొబ్బిలి సీఐ బీఎండీ ప్రసాద్, ఎస్సై సురేంద్రనాయుడు, తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిసరాలను పరిశీలించారు. అక్కడకు కొద్దిసేపటికి విజయనగరం నుంచి వేలిముద్రల నిపుణుల ఎస్సై భరత్‌కుమార్, ఏఎస్సై రమణరా జుల బృందం వచ్చి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆ ప్రదేశంలో ఉన్న కొన్ని వస్తువులను సేకరించారు. గ్రామానికి దక్షిణం వైపున్న కోనేరు సమీపంలోని నీలగిరి, గోగుతోట మధ్యలో తాతా,మనవళ్లు మృతి చెందారు. అక్కడున్న ఆనవాళ్లను బట్టి ముందుగా మనవడు జ్ఞానేశ్వర్‌పై తాత తిరుపతిరావు కిరోసిన్‌ వేసి నిప్పుపెట్టినట్లు... ఆ తర్వాత తాను కూడా కిరోసిన్‌ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే మనవడిని తాత ఎందుకు కిరోసిన్‌ పోసి తగులబెట్టాడో అర్థం కావడం లేదు.

వారం రోజుల కిందటే రాక.
 వారం రోజుల కిందటే చిన్నారి జ్ఞానేశ్వర్‌ తన మూగ తల్లి పార్వతితో కలిసి స్వగ్రామమైన బంకురువానివలస నుంచి తాతగారి ఊరైన ముగడ వచ్చాడు. మంగళవారం ఉదయం జ్ఞానేశ్వర్‌ ఇంటి వద్ద అల్లరి చేస్తుండగా.. తాత తిరుపతిరావు ఎత్తుకుని తిప్పాడు. తర్వాత టీవీఎస్‌ వాహనంపై ఎక్కించుకుని పొలం వైపు తీసుకెళ్లినట్లు స్థానికులు చెబుతున్నారు. అయితే సాయంత్రమైనా తాతా, మనవడు రాకపోయేసరికి మృతుడు తిరుపతిరావు కుమారుడు గణేష్, తదితరులు వెతుకులాట ప్రారంభించారు. ఇందులో భాగంగా కోనేరు సమీపంలో వెతుకుతుండగా.. టీవీఎస్‌ వాహనం కనిపించింది. వెంటనే తోటలోకి వెళ్లి చూడగా జ్ఞానేశ్వర్, తిరుపతిరావుల కాలిన మృతదేహాలు కనిపించాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సోమవారం సంఘటనా స్థలానికి వివరాలు సేకరించారు. బొబ్బిలి సీఐ ప్రసాద్, ఎస్సైలు నవీన్‌పడాల్, సురేంద్రనాయుడు, కొండలరావులు శవపంచనామ చేపట్టి మృతదేహాలకు పోస్టుమార్టం చేయించి బంధువులకు అప్పగించారు.

ఆస్పత్రి వద్ద బంధువుల హాహాకారాలు
స్థానిక సీహెచ్‌సీ వద్దకు చేరుకున్న బంకురువానివలస, ముగడ గ్రామాలకు చెందిన వారు చేరుకున్నారు. బాలుడి తల్లిదండ్రులు పార్వతి, చంద్రశేఖరరావు, నానమ్మ రమణమ్మ, తాత కృష్ణ, తదితరులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement