
ప్రతీకాత్మక చిత్రం
ముంబై : రోజురోజుకు మనుషుల్లో కోపం, అసహనం ఎంతలా పెరుగుతున్నాయో ఈ సంఘటన చూస్తే అర్థం అవుతుంది. కనీసం 18 ఏళ్లు కూడా నిండని ముగ్గురు మైనర్లు కారు త్వరగా దిగలేదన్న కోపంతో కారులోని వారిపై దాడి చేయడమే కాక ఒకరి మృతికి కారకులయ్యారు. దేశ వాణిజ్య రాజధాని ముంబైలో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సురేంద్ర సింగ్(30) అనే వ్యక్తి మరో ఇద్దరు స్నేహితులతో కలిసి కాబ్లో చెంబూరు వెళ్దామని కాబ్ మాట్లాడుకుని, అందులో ఎక్కి కూర్చున్నారు. ఇంతలో మరో నలుగురు యువకులు అక్కడకు వచ్చి కారులో ఉన్న సురేంద్ర, అతడి స్నేహితులను వెంటనే కాబ్లోంచి దిగమన్నారు. అందుకు సురేంద్ర, అతని స్నేహితులు నిరాకరించడంతో ఘర్షణ ప్రారంభమయ్యింది. అది కాస్తా పెద్దదిగా మారడంతో ఆ నలుగురు యువకులు సురేంద్ర, అతని స్నేహితులను విచక్షణారహితంగా కొట్టారు.
ఈ గొడవలో సురేంద్ర తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని వెంటనే సమీప రాజవాడి ఆస్పత్రికి తరలించారు. కానీ ఈలోపే సురేంద్ర మరణించాడు. విషయం తేలుసుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలికి చేరుకుని నలుగురు యువకులపై కేసు నమోదు చేశారు. ‘నిందితుల్లో ముగ్గురు మైనర్లు, ఒకరు మాత్రమే మేజర్. వీరి నలుగురి మీద హత్యానేరం మోపబడింది. ముగ్గురు మైనర్లను డొంగ్రిలోని జూవైనల్ హోమ్కు తరలించాము. మరో వ్యక్తి క్రిష్ణ పొమన్న బొయన్న(18)ను చెంబూరు కాంప్ ఏరియాకు తరలించామ’ని పోలీసు డిప్యూటీ కమిషనర్(6 జోన్) షహాజీ ఉంపా తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment