లోక కల్యాణార్థం ఘనంగా వేద సదస్యం
ఘనంగా మూడో రోజు కార్యక్రమాలు
అప్పనపల్లి(మామిడికుదురు) : బాలబాలాజీ స్వామి వారి దివ్య తిరు కల్యాణోత్సవాల్లో మూడో రోజు మంగళవారం భక్తుల కోలాహలంతో ఆలయం సందడిగా మారింది. దేవస్థానం ప్రధానార్చకులు మద్దాలి తిరుమలశింగరాచార్యులు ఆధ్వర్యంలో ఉదయం సుప్రభాత సేవ, శ్రీవారికి సహస్ర నామార్చన, బాల బోగ నివేదన, చతుస్థానార్చనలు, వేద పారాయణ, హోమాలు, బలిహరణ, మంగళశాసనాలు, తీర్థ ప్రసాద గోష్టి, సదస్యం (పండిత సన్మానం) వేద పారాయణ, నిత్య హోమం, బలిహరణ, తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. సదస్యంలో భాగంగా ఉభయ గోదావరి జిల్లాల్లోని ప్రముఖ ఆలయాలు అంతర్వేది, వాడపల్లి, మురముళ్ల, భీమవరం, ఆచంట, ద్వారకా తిరుమల, మందపల్లి, దవళేశ్వరం తదితర ఆలయాల నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం, జగత్ రక్షణ కోసం వేద సదస్యం కార్యక్రమాన్ని వైభవోపేతంగా నిర్వహించారు.
ఆకట్టుకున్న కార్యక్రమాలు
సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కళాకారులు ఆలపించిన ఆధ్యాత్మిక గీతాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెదపట్నం గ్రామానికి చెందిన పుచ్చల తాతారావు, మొగలికుదురుకు చెందిన ఉప్పులూరి సుబ్బారావు ఆలపించిన భక్తి గీతాలు భక్తులను ఆనంద పరవశులను చేశాయి. ధర్మకర్తల మండలి చైర్మన్ మొల్లేటి శ్రీనివాస్, ఆలయ ఈఓ పొలమూరి బాబూరావు ఆధ్వర్యంలో కార్యక్రమాలు జరిగాయి.
నేటి కార్యక్రమాలు...
ఉదయం ఐదు గంటలకు శ్రీవారికి సుప్రభాత సేవ, ఆరు గంటలకు శ్రీవారికి సహస్రనామార్చన, ఏడు గంటలకు శ్రీవారికి బాల భోగ నివేదన, 7.30 గంటలకు వేదపారాయణ, నిత్యహోమం, పూర్ణాహుతి, బలిహరణ, 10 గంటలకు శ్రీవారికి చక్రస్నానం, తీర్థ ప్రసాద గోష్ఠి, సాయంత్రం ఏడు గంటలకు ధ్వజా అవరోహణ, మంగళాశాసనం, తీర్థ ప్రసద గోష్ఠి