
కోస్తా నుంచి గంజాయి అక్రమ రవాణా
జిల్లాలో గంజాయి మాఫియా రోజు రోజుకూ చాప కింద నీరులా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు గంజాయి ధర చాలా తక్కువగా ఉండటంతో ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. జిల్లా నుంచి అరబ్ దేశాలకు కూడా అక్రమ రవాణా జరుగుతుండటంతో వీటి ధర ఒక్కసారిగా నాలుగింతలు పెరిగింది. గతంలో కోస్తాలో కిలో గంజాయి రూ.2 వేలకు తీసుకొని వచ్చి ఇక్కడ రూ. 3 వేలకు విక్రయించేవారు.
ప్రొద్దుటూరు క్రైం: జిల్లాలో గంజాయి మాఫియా రోజు రోజుకూ చాప కింద నీరులా అన్ని ప్రాంతాలకు విస్తరిస్తోంది. కొన్నేళ్ల క్రితం వరకు గంజాయి ధర చాలా తక్కువగా ఉండటంతో ఎవ్వరూ పట్టించుకునే వారు కాదు. జిల్లా నుంచి అరబ్ దేశాలకు కూడా అక్రమ రవాణా జరుగుతుండటంతో వీటి ధర ఒక్కసారిగా నాలుగింతలు పెరిగింది. గతంలో కోస్తాలో కిలో గంజాయి రూ.2 వేలకు తీసుకొని వచ్చి ఇక్కడ రూ. 3 వేలకు విక్రయించేవారు. ఇప్పుడు కిలో సుమారు 8 వేల వరకు పలుకుతున్నట్లు తెలుస్తోంది. ఒక సారి 20 కిలోల లోడ్ తెప్పిస్తే వ్యాపారులకు రూ.1 లక్షకు పైగా ఆదాయం వస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తక్కువ పెట్టుబyì తో భారీ ఆదాయం వస్తుండటంతో ఈ వ్యాపారం చేసే వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. జిల్లాలోని కడపతోపాటు ప్రధాన పట్టణాలు మొదలు, గ్రామాల వరకు వ్యాపారం జోరుగా జరుగుతోంది. జిల్లాలో నలుగురైదుగురు ప్రధాన వ్యాపారులతోపాటు 60 మంది దాకా అక్రమ దందా కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక్కడి నుంచి కర్నూలు, అనంతపురం జిల్లాకు సరఫరా
కోస్తా జిల్లాల నుంచి కడప జిల్లాకు నిత్యం గంజాయిని తరలిస్తున్నారు. పట్టపగలే లారీల ద్వారా మూటెలను తీసుకొస్తున్నారు. కోస్తాలోని తూర్పుగోదావరి, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి దిగుమతి అవుతోంది. ఇటీవల ఇక్కడి వ్యాపారులు తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరానికి చెందిన వ్యక్తి ద్వారా ఒప్పందం కుదుర్చుకున్నారు. అతని అకౌంట్లో డబ్బు వేసిన మరుక్షణమే గంజాయిని లారీల ద్వారా ఇక్కడికి పంపిస్తునట్లు సమాచారం. మైదుకూరు, ప్రొద్దుటూరు ప్రాంతాల వ్యాపారులు నంద్యాల జాతీయ రహదారిలోని ఇడమడక సమీపంలో మూటెలను దించుకుంటున్నారు. రెండు రోజులకు ఒక మారు తెప్పిస్తున్నారు. జిల్లా సరిహద్దులోని ఇడమడక నుంచి మోటార్ బైక్ల్లో ఆయా వ్యాపారులకు తరలిస్తున్నారు. కాగా జిల్లా నుంచి కర్నూలు, అనంతపురం జిల్లా సరిహద్దు ప్రాంతాలకు గంజాయి పెద్ద ఎత్తున తరలుతున్నట్లు తెలుస్తోంది. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతంలో సుమారు 12 మంది వ్యాపారులు ఉన్నట్లు సమాచారం. వీరిలో కొందరు ఎక్సైజ్ రికార్డుల్లో ఉన్న వారు కూడా ఉన్నారు. ప్రొద్దుటూరుతోపాటు మైదుకూరు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కడప, రాజంపేట, జమ్మలమడుగు, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో గంజాయి మాఫియా పాగా వేసింది.
నిద్రపోతున్న నిఘా వ్యవస్థ
గంజాయి వ్యాపారం చేస్తున్న వారందరూ దాదాపుగా కేసుల్లో ఉన్న వారే. వీరి కదలికలు ఎక్సైజ్ అధికారులకు తెలియంది కాదు. కోస్తా నుంచి తెప్పించిన గంజాయిని ఎక్కడ నిల్వ చేస్తారనే విషయం కూడా వారికి తెలిసే ఉంటుంది. ఎక్సైజ్ పోలీసులు వీరిని పట్టించుకోలేదో లేక పూర్తిగా వదిలేశారో గానీ పాత నేరగాళ్లు విచ్చలవిడిగా వ్యాపారం చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు, స్క్వాడ్ సిబ్బంది మద్యం వ్యాపారాలు పెంచడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం వల్లనే గంజాయి వ్యాపారం జోరుగా జరుగుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ప్రొద్దుటూరులో అయితే చిన్న కాగితపు పొట్లాల్లో ఉంచి రూ.50, రూ.100లకు బహిరంగంగా విక్రయిస్తున్నారు. శనివారమైతే ప్రొద్దుటూరులో గంజాయి ఓపెన్ మార్కెట్లో దొరుకుతుంది.
కొన్ని కేసులు..
గతేడాది డిసెంబర్లో సాయికుటీర్ రోడ్డులో ఎక్సైజ్ పోలీసులు దాడులు చేసి 60 కిలలో గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఏడాది ప్రథమార్థంలో ముద్దనూరుకు చెందిన ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 17 కిలోల గంజాయి, మోటర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. మూడు రోజుల క్రితం చాపాడు మండలంలోని సిద్దారెడ్డిపల్లెలో ఇద్దరు వ్యాపారులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 10 కిలోలు స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి జిల్లాలో గంజాయి వ్యాపారం జోరుగా సాగుతున్నట్లు తెలుస్తోంది.
నిఘా పెట్టాం..
గంజాయి అక్రమ రవాణాపై నిఘా ఉంచాం. ప్రధాన రహదారుల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నాం. జిల్లా సరిహద్దుల వద్ద కూడా మా సిబ్బంది నిఘా ఉంచారు. పాత నేరగాళ్ల కదలికలపై దృష్టి సారించాం.
– ఫణీంద్ర, ఎక్సైజ్ సీఐ