దేశాన్ని కాషాయీకరణ చేసేందుకు కుట్ర : పీసీసీ
సాక్షి, హైదరాబాద్ :
మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశాన్ని కాషాయీకరణ చేసేందుకు కొన్ని శక్తులు కుట్ర పన్నుతున్నాయని పీసీసీ ఉపాధ్యక్షులు మాదాసు గంగాధరం పేర్కొన్నారు. సోమవారం ఇందిర భవన్లో స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసి వందన సమర్పణ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ మొదటి నుంచి లౌకిక వాదానికి కట్టుబడి ఉందన్నారు. కొన్ని స్వార్థశక్తులు తమ స్వలాభం కోసం కుట్రలు పన్నుతూ భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఆ నాడు దేశం కోసం పోరాడిన స్పూర్తితోనే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా కోసం పోరాడాల్సి వస్తోందన్నారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాల అమలు, ఏపీకి ప్రత్యేక హోదా కావాలని రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు ప్రవేశ పెట్టిన ప్రైవేట్ మెంబర్ బిల్లుకు జాతీయ స్థాయిలో అన్ని పార్టీల వారు మద్దతు తెలపడం సంతోషకరం అన్నారు. బడుగు, బలహీన వర్గాల గుండెల్లో కాంగ్రెస్ పార్టీకి సుస్థిర స్థానం ఉందని, ఎన్ని కష్టాలు ఎదురైనా మున్ముందు పటిష్టం చేసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు కేవీపీ రామచంద్రారావు, ప్రధాన కార్యదర్శులు జంగా గౌతం, గిడుగు రుద్రరాజు, ఉపాధ్యక్షులు సాకే శైలజానాథ్, ఎన్.తులసిరెడ్డి, సూర్యానాయక్, కిసాన్ సెల్ చైర్మన్ రవిచంద్రారెడ్డి పాల్గొన్నారు.
విజయవాడ ఆంధ్రరత్న భవన్లో....
సాక్షి, అమరావతి:
విజయవాడలోని ఆంధ్రరత్న భవన్లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పీసీసీ ప్రధాన కార్యదర్శి నరహారశెట్టి నరసింహారావు పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం స్వాంతంత్య్రం కోసం పోరాడిన మహనీయుల త్యాగ ఫలితాలను స్మరించుకున్నారు. తర్వాత విద్యార్థినీ, విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు. మహాత్మా గాంధీ బ్రిటీష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించి సత్యాగ్రం, అహింసా మార్గంలో దేశానికి స్వాతంత్య్రం అందించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మల్లాది విష్ణు, మీసాల రాజేశ్వరరావు, టీజేఆర్ సుధాకర్ బాబు, కొలనుకొండ శివాజీ, అన్వర్ హుస్సేన్, చంటిబాబు, కొరగంజి భాను, అశోక్ తదితరులు పాల్గొన్నారు.