హరితహారంలో విస్తారంగా పెంపకం | dfo interview in sakshi special about harithaharam | Sakshi
Sakshi News home page

హరితహారంలో విస్తారంగా పెంపకం

Published Tue, Jun 14 2016 8:42 AM | Last Updated on Mon, Sep 4 2017 2:23 AM

హరితహారంలో విస్తారంగా పెంపకం

హరితహారంలో విస్తారంగా పెంపకం

వర్షాలు మొదలు కావడమే ఆలస్యం
గత ఏడాది వర్షాభావం దెబ్బతీసింది
ఈసారి లక్ష్యాన్ని సాధిస్తాం
‘సాక్షి’ ఇంటర్వ్యూలో డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు

 మెదక్: అడవుల శాతం పెరిగితేనే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని మెదక్ డీఎఫ్‌ఓ శ్రీధర్‌రావు తెలిపారు. ఇందుకోసం హరితహారంలో భాగంగా జిల్లాలో ఈ యేడు 3 కోట్ల మొక్కలు నాటేందుకు సన్నద్ధమవుతున్నట్టు చెప్పారు. గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేక పోయామన్నారు. ఈసారి వాతావరణం అనుకూలించే అవకాశం ఉన్నందున కచ్చితంగా 3 కోట్ల మొక్కలను నాటుతాం. వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలు పెడతామన్నారు. సోమవారం ఆయన తన కార్యాలయంలో హరితహారంపై ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు ఇలా..

 ప్రశ్న: జిల్లాలో ఎన్ని హెక్టార్లలో అడవులున్నాయి?

 జవాబు: అధికారిక లెక్కల ప్రకారం 97,690 హెక్టార్లలో అడవులు విస్తరించి ఉన్నాయి.

 ప్ర: భూభాగంతో పోలిస్తే అడవుల శాతం ఎంత ఉండాలి?

 జ:భూభాగంతో పోల్చుకుంటే 33 శాతం అడవులు ఉంటేనే విస్తారంగా వర్షాలు కురుస్తాయి.

 ప్ర: ప్రస్తుతం మన జిల్లాలో ఉన్నదెంత?

 జ: కేవలం 9.5శాతం మాత్రమే  అడవులున్నాయి. అందులో ఓపెన్ జంగల్ 0.5 శాతం మాత్రమే ఉంది. అందులో పూర్తిగా అడవులు క్షీణించి ఉండగా కేవలం 9శాతం మాత్రమే జిల్లాలో అడవులు ఉన్నాయి. ఈ లెక్కన మరో 24 శాతం మేర అడవులు పెరగాల్సి ఉంది.

 ప్ర:హరితహారంలో భాగంగా ఈ యేడు జిల్లా వ్యాప్తంగా ఎన్ని మొక్కలు నాటుతున్నారు?

 జ:అటవీశాఖలోని టెరిటోరియల్‌తోపాటు సోషల్ ఫారెస్ట్, డ్వామా, ఈజీఎస్, ఎక్సైజ్ శాఖల ఆధ్వర్యంలో 3 కోట్ల మొక్కలు నాటేందుకు సన్నద్ధమవుతున్నాం.

 ప్ర: గతంలో ఎన్ని మొక్కలు నాటారు?

 జ:గతంలో 3.52 కోట్ల మొక్కలు నాటాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 1.50 కోట్ల మొక్కలు నాటడం జరిగింది.

 ప్ర:అటవీ శాఖ ఆధ్వర్యంలో ఎన్ని మొక్కలు నాటుతున్నారు?

 జ:అటవీ శాఖలోని టెరిటోరియల్ విభాగంలో 38 లక్షల మొక్కలు నాటడం జరుగుతుంది.

 ప్ర: ఏయే ప్రాంతాల్లో మొక్కలు నాటుతారు?

 జ:అడవుల్లో గుంతలు తీసి, గుట్టలపై సైతం నాటేందుకు చర్యలు చేపడుతున్నాం. జిల్లాలోని రేగోడ్ మండలంలో గల గుట్టల ప్రాంతం మొక్కల పెంపకానికి అనువైనది గుర్తించాం.

 ప్ర:ఎన్ని కిలో మీటర్ల మేర మొక్కలు

 నాటుతారు?

 జ:గత ఏడాది 500 కిలోమీటర్ల మేర మొక్కలు నాటేందుకు నిర్ణయించాం. వర్షాభావ పరిస్థితుల వల్ల కేవలం 200 కిలో మీటర్ల మేర మాత్రమే నాటాం. మిగతా 300 కిలో మీటర్ల మేర ఈ యేడు నాటుతాం.

 ప్ర: కిలోమీటర్‌కు ఎన్ని మొక్కలు నాటుతారు?

 జ: కిలో మీటరుకు సుమారు 6 వేల నుంచి 6,500 వరకు మొక్కల నాటడం జరుగుతుంది.

 ప్ర: అటవీ ప్రాంతంలో నీటి నిల్వల కోసం ఎలాంటి చర్యలు చేపడుతున్నారు?

 జ: జిల్లాలోని అడవుల్లో 170 కందకాలు, 20 మినీ చెక్‌డ్యాంలు, 30 కుంటలు ఉన్నాయి. వాటిలో వర్షపు నీరు వచ్చి చేరుతుంది.

 ప్ర: సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ఏయే మొక్కలు, ఎన్ని, ఎక్కడ నాటుతున్నారు?

 జ: సోషల్ ఫారెస్ట్ ఆధ్వర్యంలో ఈ యేడు 39 లక్షల మొక్కలు నాటడం జరుగుతుంది. ముఖ్యంగా రోడ్లకు ఇరువైపులా నాటుతాం.

 ప్ర: ఎక్సైజ్ అధికారులు ఏయే మొక్కలు నాటుతున్నారు?

 జ: ఎక్సైజ్‌శాఖ అధికారులు ఉపాధి హామీలో భాగంగా పండ్ల మొక్కల పెంపకానికి ప్రాధాన్యమిస్తున్నారు.

 ప్ర: అడవుల్లో ఏయే మొక్కలు నాటేందుకు ప్రాధాన్యతనిస్తున్నారు?

 జ:అడవుల్లో అన్ని రకాల మొక్కలు నాటుతాం. అడవులు ఎక్కువగా పెరిగేందుకు గచ్చకాయ, కానుగ వంటి మొక్కలకు ప్రాధాన్యత ఇస్తున్నాం.

 ప్ర: ఏ వయస్సు మొక్కలు నాటాలి?

 జ: నర్సరీల్లోని 16 నెలల మొక్కలు నాటితే మంచి ఫలితం ఉంటుంది. చిన్న వయస్సు మొక్కలు నాటినా... పెద్ద వయస్సు మొక్కలు నాటినా అవి అంతగా పెరగవు.

 ప్ర: జిల్లాలో 3 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయా?

 జ: గత ఏడాది ఏర్పాటు చేసిన నర్సిరీల్లో సుమారు 1.5 కోట్ల మొక్కలు సిద్ధంగా ఉన్నాయి. మిగతా మొక్కలను నర్సరీల్లో పెంచడం జరుగుతుంది.

 ప్ర:ఎప్పుడు నాటుతారు?

 జ: వర్షాలు ప్రారంభం కాగానే మొక్కలు నాటే కార్యక్రమాన్ని మొదలు పెడతాం.

 ప్ర: గత ఏడాది వర్షాభావ పరిస్థితుల వల్ల నాటిన మొక్కల పరిస్థితి ఏమిటి?

 జ: గత ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల కొన్ని మొక్కలు ఎండుముఖం పట్టగా, చాలా వరకు మొక్కలను నీరుపోసి రక్షించాం. ముఖ్యంగా గజ్వేల్ నియోజకవర్గంలోని మక్త మాసాన్‌పల్లిలో గత ఏడాది నాటిన మొక్కలు చాలావరకు పెరిగాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement