నిప్పులకొలిమి
- పెరుగుతున్న ఉష్ణోగ్రతలు
- అల్లాడుతున్న ప్రజలు
- అవుకులో గరిష్టంగా 43.98 డిగ్రీలు నమోదు
- ఎమ్మిగనూరులో 14.93 కిలోమీటర్ల వేగంతో వడగాల్పులు
కర్నూలు(అగ్రికల్చర్): రోజురోజుకు పెరుగుతున్న ఎండలతో జిల్లా ప్రజలు విలవిలలాడుతున్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. గరిష్టంగా అవుకులో 43.98 డిగ్రీల నమోదైంది. కర్నూలు నగరంతో సహా జిల్లా మొత్తం దాదాపు ఇదే స్థాయిలో ఎండలు ఉన్నాయి. మరో వైపు వడగాలుల తీవ్రత పెరిగింది. ఎమ్మిగనూరులో 14.93 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీచడంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. గోనెగండ్లలో 12.35, కొలిమిగుండ్లలో 11.19, కర్నూలు (దిన్నెదేవరపాడు)లో 11.17 కిలోమీటర్ల వేగంతో వడగాలులు వీచాయి. ఒకవైపు పెరిగిపోతున్న ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాలుల తీవ్రతతో వడదెబ్బకు గురయ్యే వారిసంఖ్య పెరిగిపోతోంది. వదడెబ్బ మృతులు పెరిగిపోతున్నారు. మొన్నటి వరకు ఉష్ణోగ్రతలు గరిష్టంగా 42.8 డీగ్రీలు ఉన్నాయి. శనివారం ఒక్కరోజులోనే ఒక డిగ్రీకి పైగా ఉష్ణోగ్రతలు పెరిగిపోయాయి. రోజురోజుకు ఎండల తీవ్రత పెరిగిపోతుండటంతో వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు అల్లాడుతున్నారు.
ఉష్ణోగ్రతలు పెరిగిపోతుండటంతో భూగర్భ జలాలు వేగంగా పడిపోతున్నాయి. జిల్లా సగటున ఫిబ్రవరి నెలలో 9.19 మీటర్లలోతులో ఉన్న భూగర్భ జలాలు 10.69 మీటర్ల అడుగుకు పడిపోయాయి. నెల రోజుల వ్యవధిలోనే ఒకటిన్నర మీటర్ల మేర భూగర్బ జలాలు పడిపోయాయి. భూగర్భ జలాలు పడిపోతుండటంతో నీటి సమస్య తీవ్రం అవుతోంది. వారానికి ఒక రోజు కూడ నీళ్లు సరఫరా కాని గ్రామాలు వందల్లో ఉన్నాయి. నీటి ఎద్దడి ఏర్పడటంతో మినరల్ వాటర్కు డిమాండ్ పెరిగింది. గ్రామాల్లో మినరల్ వాటర్ అమ్మకాలు మూడు, నాలుగు రెట్లు పెరగడం గమానార్హం.
జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతల తీవ్రత ఇలా
మండలం ఉష్ణోగ్రతలు
అవుకు 43.98
కోవెలకుంట్ల 43.93
మద్దికెర 43.47
చాగలమర్రి 43.28
సి.బెలగల్ 43.17
రుద్రవరం 43.17
ఆళ్లగడ్డ 43.01
సంజామల 42.88
పగిడ్యాల 42.71
మిడుతూరు 42.69
ఎమ్మిగనూరు 42.66
కర్నూలు 42.20