నగదు రహిత బదిలీ అమలు చేయాలి
జాయింట్ కలెక్టర్ సత్యనారాయణ
కాకినాడ సిటీ : నగదు రహిత బదిలీలను మీ–సేవా కేంద్రాల్లో అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎస్.సత్యనారాయణ ఆదేశించారు. గురువారం జిల్లా శిక్షణ కేంద్రం ఆద్వర్యంలో మీ–సేవా ఆపరేటర్లకు వివిధ అంశాలపై శిక్షణ నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ ప్రభుత్వ సేవలు త్వరిత గతిన అందించేందుకు ఏర్పాటు చేసిన మీ–సేవా కేంద్రాల ద్వారా నిర్ణీత సమయంలో ఆయా సేవలను నిర్ధేశించిన రేట్లకే అందించాలన్నారు. నగదు రహిత సేవలకు సంబంధించి స్వైపింగ్ మెషీన్లు, యాప్లను వినియోగించాలన్నారు. ప్రభుత్వ సేవలను విస్తృతంగా ప్రజలకు అందించాలని, సర్వీసులు ఎక్కువైన తరువాత దుర్వినియోగానికి పాల్పడినా, నిర్ణయించిన చార్జీల కంటే ఎక్కువ వసూలు చేసినా జరిమానా విధింపు, విధుల నుంచి తొలగింపు వంటి చర్యలు ఉంటాయని హెచ్చరించారు. జాయింట్ కలెక్టర్–2 రాధాకృష్ణమూర్తి మాట్లాడుతూ శిక్షణలో పాల్గొన్న ఆపరేటర్లు అన్ని విషయాలు సమగ్రంగా నేర్చుకోవాలన్నారు. జిల్లా ట్రైనింగ్ కో ఆర్డినేటర్ ఎన్వీఎస్ సూరపురాజు, ఎన్ఐసీ డీఐవో ఉస్మాన్ పాల్గొన్నారు.