తుళ్లూరులో ఫుడ్ ఇన్స్పెక్టర్ దాడులు
Published Wed, Aug 3 2016 8:39 PM | Last Updated on Thu, Oct 4 2018 5:08 PM
తుళ్లూరు : నిషిద్ధమైన ఆహార పదార్థాలను విక్రయిస్తే ఆయా దుకాణాలను శాశ్వతంగా మూసివేయడంతో పాటు బాధ్యులపై కేసులు నమోదు చేస్తామని గుంటూరు డివిజన్ ఫుడ్ ఇన్స్పెక్టర్ ఎన్.పూర్ణచంద్రరావు హెచ్చరించారు. బుధవారం ఆయన 15 మంది బృందంతో తుళ్ళూరులోని పాన్ షాపులు, బేకరీలు, టీ దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఎక్కువ మోతాదులో రంగులు వినియోగించి తయారు చేసిన కేక్లు, టీ పౌడర్, స్వీట్లను ఆయన డ్రై నేజీ కందకంలో పారబోయించారు. పాన్ షాపుల్లో పలుచోట్ల లభ్యమైన నిషేధిత పాన్పరాగ్, గుట్కా ప్యాకెట్లను నిర్వీర్యం చేశారు. ఈ సందర్భంగా పూర్ణచంద్రరావు విలేకరులతో మాట్లాడుతూ మొదటిసారిగా తుళ్లూరులో ఈ దాడులు చేస్తున్నట్లు చెప్పారు. రాజధాని ప్రాంతం కావడంతో ఇకపై తరచూ ఈ తరహా దాడులు ఉంటాయని తెలిపారు. దుకాణాల్లో హానికరమైన, నాణ్యతలేని ఆహార పదార్థాలు తయారుచేసినా, విక్రయించినా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తొలిసారి కావడంతో హెచ్చరించి వదిలేస్తున్నామని, మరోసారి నిషేధిత ఆహార పదార్థాలను విక్రయిస్తే దుకాణాలను సీజ్ చేయడంతో పాటు క్రిమిన ల్ కేసులు పెడతామని హెచ్చరించారు.
Advertisement
Advertisement