
'చంద్రబాబు ఎలా దారి చూపిస్తే అలా నడుస్తా'
విజయవాడ: ఇకపై క్రియాశీలక రాజకీయాల్లో ఉంటానని సినీనటి, సికింద్రాబాద్ మాజీ ఎమ్మెల్యే జయసుధ చెప్పారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే పార్టీ మారినట్టు చెప్పారు. ఏపీ సీఎం చంద్రబాబు సమక్షంలో శనివారం సాయంత్రం ఆమె టీడీపీలో చేరారు. పార్టీ కండువాతో ఆమెను చంద్రబాబు స్వాగతించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ... చంద్రబాబు ఎలా దారి చూపిస్తే అలా నడుస్తానని చెప్పారు. తెలుగు మాట్లాడేవారందరికీ తానేంటో తెలుసునని అన్నారు. బంధుత్వ పరంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ తో తనకు అనుబంధం ఎక్కువని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సికింద్రాబాద్ నుంచి పోటీ చేశానని గుర్తు చేశారు. జీహెచ్ ఎంసీ ఎన్నికల్లో టీడీపీ గెలుస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. టీడీపీ గెలుపుకు ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు.