- పర్వతారోహణకు దరఖాస్తుల ఆహ్వానం
- అర్హతలుంటే ఈ అవకాశం మీకే..
కిలిమంజారో పర్వతాన్ని అధిరోహిస్తారా!
Published Wed, Feb 15 2017 11:05 PM | Last Updated on Tue, Sep 5 2017 3:48 AM
కాకినాడ రూరల్ :
షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన అభ్యర్థులు ఆఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించే అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువజన సర్వీసులశాఖ ద్వారా కల్పిస్తోందని, అర్హులు దరఖాస్తు చేసుకోవాలని సెట్రాజ్ సీఈవో వై. శ్రీనివాసరావు అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన రమణయ్యపేటలోని సెట్రాజ్ కార్యాలయంలో విలేకర్లతో మాట్లాడారు. దరఖాస్తులు చేసే అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్లో జన్మించి, ఇక్కడే నివసిస్తున్నవారై ఉండాలన్నారు. 18 – 35 ఏళ్ల మధ్య వయసు ఉండాలన్నారు. ఎంపిక విధానం రెండు దశల్లో పూర్తవుతుందన్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన కమిటీ ద్వారా ప్రాథమిక ఎంపిక జరుగుతుందన్నారు.
ఫిట్నెస్ సర్టిఫికెట్
అభ్యర్థులు తప్పనిసరిగా ప్రభుత్వ డాక్టరతో నిర్ణీత సమూనాలో జారీ చేయబడిన మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్ను దరఖాస్తుతో సమర్పించాలని శ్రీనివాసరావు తెలిపారు. జిల్లా కమిటీ ఎంపిక చేసిన అభ్యర్థులను రాష్ట్రస్థాయిలో ఎంపిక కోసం పంపిస్తామన్నారు. ఆసక్తి కలవారు శుక్రవారం (ఈనెల 17వ తేదీ) ఉదయం 8 గంటలకు కాకినాడ జిల్లా స్పోర్ట్స్ స్టేడియంలో నిర్వహించే ఎంపిక కార్యక్రమానికి ఆధార్కార్డు, కుల, విద్యార్హత ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు.
శారీరక సామర్థ్యం
ఆరోగ్యశాఖ బీఎంబీ చార్టు ప్రకారం ఎత్తుకు తగిన బరువు ఉండాలి.
100 మీటర్ల పరుగును పురుషులు 16 సెకన్లు, స్త్రీలు 18 సెకన్లు, 2.4 కిలోమీటర్ల పరుగును పురుషులు 10 నిమిషాలు, స్త్రీలు 13 నిమిషాల్లోను పూర్తిచేయాలి.
పురుషులు 3.65 మీటర్లు, స్త్రీలు 2.7 మీటర్ల్ల లాంగ్జంప్లో అర్హత సాధించాలి.
Advertisement
Advertisement