పాదయాత్రలో ఎమ్మెల్యేలు డీకే అరుణ, సంపత్కుమార్, నడిగడ్డ ప్రాంతవాసులు
గద్వాల : జిల్లాల పునర్విభజనలో గద్వాలకు అన్యాయం జరిగితే ముఖ్యమంత్రి కేసీఆర్ జోగుళాంబ అమ్మవారి ఆగ్రహానికి గురికావాల్సి ఉంటుందని మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే డీకే అరుణ అన్నారు. గద్వాల జిల్లా సా«దన కోసం మంగళవారం మండల పరిధిలోని జమ్ములమ్మ ఆలయం నుంచి అలంపూర్లోని జోగుళాంబ ఆలయం వరకు ఎమ్మెల్యే డీకే అరుణ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్తో కలిసి మొదటిరోజు 14 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు. ఈ సందర్భంగా జమ్ములమ్మ ఆలయం, జమ్మిచేడు గ్రామాల్లో ప్రజలనుద్దేశించి అరుణ మాట్లాడారు. ప్రజలను అయోమయానికి గురిచేసే విధంగా ప్రభుత్వం కొత్త జిల్లాల పేర్లను ప్రకటిస్తూ గందరగోళానికి గురి చేస్తోందని మండిపడ్డారు.
ముఖ్యమంత్రి కేసీఆర్కు రాజకీయ సపర్యలు చేసే వారికే అందలమెక్కిస్తున్నారని అలంపూర్ ఎమ్మెల్యే సంపత్కుమార్ విమర్శించారు. పాదయాత్రలో భాగంగా ఆయన ప్రజలనుద్దేశించి మాట్లాడారు. ప్రజల ఆకాంక్షలను పెడచెవిన పెట్టి స్వార్థపూరితంగా సీఎం కేసీఆర్ వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నియమ, నిబంధనలకు అనుగుణంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేయదలిస్తే మొట్టమొదటగా గద్వాలకే అవకాశం ఉంటుందన్నారు. కార్యక్రమంలో పీసీసీ నాయకుడు విజయ్కుమార్, చైర్పర్సన్ పద్మావతి, వైస్ చైర్మన్ శంకర్, నాయకులు గడ్డం కృష్ణారెడ్డి, వేణుగోపాల్, బండల వెంకట్రాములు, పట్టణ, గ్రామ ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.