
‘బస్టాండ్’ చదువులు..!
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామంటూ చెబుతున్న అధికారులు, పాలకుల హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి.
♦ రెండేళ్లుగా బస్టాండే పాఠశాల..
♦ నిధులు మంజూరుకాక అర్థాంతరంగా నిలిచిపోయిన పాఠశాల
♦ నిర్మాణ పనులు
మెదక్: ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో అన్ని మౌలిక వసతులు కల్పిస్తామంటూ చెబుతున్న అధికారులు, పాలకుల హామీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. రెండేళ్లుగా ఓ గిరిజన తండాలో ప్రాథమిక పాఠశాల బస్టాండ్లోనే కొనసాగుతోంది. ప్రభుత్వ పాఠశాలల తీరుకు అద్ధం పడుతున్న ఈ దుస్థితి మెదక్ మండలం వాడి పంచాయతీ పరిధి మెట్టుతండాలోని ప్రాథమిక పాఠశాలకు ఎదురైంది. సుమారు 25మంది గిరిజన విద్యార్థులు 1 నుంచి 5 వరకు చదువుతున్నారు.
తండాలో పాఠశాల లేకపోవడంతో బస్టాండ్లోనే పాఠశాల నిర్వహిస్తున్నారు. దీంతో వానకు తడుస్తూ..ఎండకు ఎండుతూ విద్యార్థులు బస్టాండ్లో చదువులు కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా మెట్టుతండాలో గత ఏడాది క్రితం ప్రాథమిక పాఠశాల నిర్మాణం కోసం ఆర్వీఎం కింద రూ.20లక్షలు మంజూరయ్యాయి. పనులు చేజిక్కుంచుకున్న సదరు కాంట్రాక్టర్ నిర్మాణ పనులు చాలా వరకు పూర్తికానిచ్చారు. కాని కేవలం రూ.5లక్షలు మాత్రమే ఇప్పటి వరకు విడుదలయ్యాయని, నిధులు వస్తేనే పనులు చేస్తామని కాంట్రాక్టర్ తెలిపారు.