మైదుకూరు ఎమ్మెల్యే రాజీనామా
- స్పీకర్కు ఫ్యాక్స్ ద్వారా లేఖ
- పదే పదే ప్రొటోకాల్ ఉల్లంఘనతో మనస్తాపం
- పలుమార్లు స్పీకర్కు ఫిర్యాదు చేసినా స్పందించని వైనం
సాక్షి ప్రతినిధి, కడప: అధికారులు పదే పదే ప్రొటోకాల్ను ఉల్లంఘించి అవమానిస్తున్నారని వైఎస్ఆర్ జిల్లా మైదుకూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్పీకర్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో మనస్తాపంతో ఆయన శుక్రవారం తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని కోరుతూ లేఖను స్పీకర్కు ఫ్యాక్స్ చేశారు. కొరియర్ ద్వారా కూడా పంపారు. శుక్రవారం మైదుకూరులో చోటుచేసుకున్న ప్రొటోకాల్ ఉల్లంఘనతోపాటు గతంలో జరిగిన సంఘటనలను ఆయన తన రాజీనామా లేఖలో వివరించారు. ఆ వివరాలు.. శుక్రవారం నిర్వహిస్తున్న రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా మైదుకూరు ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డిని జమ్మలమడుగు ఆర్డీఓ ఆహ్వానించారు.
మైదుకూరు హైస్కూల్లో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యేను తొలుత వేదికపైకి పిలవాల్సింది పోయి ఆ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి పుట్టా సుధాకర్ యాదవ్ను ఆహ్వానించారు. ఇలా ఆహ్వానించడం ప్రొటోకాల్ నిబంధనలకు విరుద్ధమని తెలిసినప్పటికీ అధికారులు పట్టించుకోలేదు. దీంతో ఆయన అక్కడి నుంచి వెనుదిరిగారు. జిల్లాలో అధికారులు ప్రొటోకాల్ పాటించకపోవడం ఇది తొలిసారి కాదు. పలుమార్లు జరిగింది.దీన్ని స్పీకర్ కార్యాలయం దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదు. ఈ నేపథ్యంలో తీవ్రంగా మనస్తాపం చెందిన ఎమ్మెల్యే రఘురామిరెడ్డి తన పదవికి రాజీనామా చేశారు.