ప్రతిపక్షనేతకు ఇదేనా గౌరవం.?
వైస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిఉదయభాను
జగ్గయ్యపేట అర్బన్:
ప్రతిపక్ష నేత, ప్రజాప్రతి నిధులను ప్రభుత్వం పుష్కరాల సందర్భంగా అవమానించిందని వైస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సామినేని ఉదయభాను అన్నారు. శనివారం ఆయన గృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆహ్వానిం చేందుకు పుష్కరాల ప్రారంభం రోజున ఆయన ఊర్లో లేని సమయంలో మంత్రి రావెల కిషోర్బాబు వెళ్లటం బాధాకరమన్నారు. పైగా తమకు అవమానం జరిగిందని ఆరోపణలు చేయటం తగదన్నారు. ముందుగా పిలవకుండా పుష్కరాలు ప్రారంభమైన తరువాత ఆహ్వానించటం పద్ధతేనా అని ప్రశ్నించారు. ఘాట్ల వద్ద కనీస వసతులు లేవని, మంచినీరు, టెంట్లు పూర్తిస్థాయిలో ఏర్పాటుచేయకపోవటంతో భక్తులు, యాత్రికులు ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. పుష్కర భక్తులను కిలోమీటర్ల దూరం నుంచి నడిపిస్తున్నారని తెలిపారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్లు తన్నీరు నాగేశ్వరరావు, ఎండీ అక్బర్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఇంటూరి రాజగోపాల్(చిన్నా), జిల్లా అధికార ప్రతినిధి మదార్సాహెబ్, పట్టణ ప్రధాన కార్యదర్శి తుమ్మల ప్రభాకర్, కౌన్సిలర్ నరసింహారావు పాల్గొన్నారు.