క్రీడాకారులు నైపుణ్యం పెంచుకోవాలి
క్రీడాకారులు తాము ఎంచుకున్న ఆటలో నైపుణ్యం పెంచుకుని సత్తాచాటాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ ఇండియా జట్టు కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్–17, 19 జూనియర్ బ్మాడింటన్ మెయిన్ పోటీలు శుక్రవారం హన్మకొండ సుబేదారిలోని ఆఫీసర్స్ క్లబ్లో ప్రారంభమయ్యాయి. పోటీలను గోపిచంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు
-
బ్యాడ్మింటన్ ఇండియా జట్టు కోచ్ గోపిచంద్
-
రాష్ట్రస్థాయి జూనియర్ బ్యాడ్మింటన్ పోటీలు ప్రారంభం
వరంగల్ స్పోర్ట్స్ : క్రీడాకారులు తాము ఎంచుకున్న ఆటలో నైపుణ్యం పెంచుకుని సత్తాచాటాలని పద్మశ్రీ అవార్డు గ్రహీత, బ్యాడ్మింటన్ ఇండియా జట్టు కోచ్ పుల్లెల గోపిచంద్ అన్నారు. తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ వరంగల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి అండర్–17, 19 జూనియర్ బ్మాడింటన్ మెయిన్ పోటీలు శుక్రవారం హన్మకొండ సుబేదారిలోని ఆఫీసర్స్ క్లబ్లో ప్రారంభమయ్యాయి. పోటీలను గోపిచంద్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు.
అనంతరం బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి పింగిళి రమేష్రెడ్డి అధ్యక్షతన జరిగిన సమావేశంలో గోపిచంద్ పాల్గొని మాట్లాడారు. క్రీడల్లో జరిగే తప్పిదాలను సవరించుకునేందుకు టోర్నమెంట్లు వేదికగా నిలుస్తాయన్నారు. 1989లో మొదటిసారిగా తాను హన్మకొండ ఆఫీసర్స్ క్లబ్లో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొన్నానని తెలిపారు. తర్వాత 1994లో మరోసారి జరిగిన పోటీలకు హాజరైనట్లు చెప్పారు. చిన్న, చిన్న టోర్నమెంట్లలో తెలియని ఆనందం ఉంటుందన్నారు. టోర్నమెంట్లు అనుభవ పాఠాలను నేర్పడంతోపాటు మధుర జ్ఞాపకాలను అందిస్తాయన్నారు. ఆఫీసర్స్ క్లబ్లో నిర్వహిస్తున్న అండర్–17, 19 జూనియర్ టోర్నమెంట్ ప్రారంభానికి రావడం సంతోషంగా ఉందన్నారు. వరంగల్ వాతావరణం క్రీడాకారులకు మంచి ఎనర్జీని ఇవ్వడంతోపాటు పాజి టివ్ దృక్పథాన్ని అందిస్తుందన్నారు. పోటీల్లో ఓటమి చెందిన క్రీడాకారులు నిరుత్సాహానికి గురికాకుండా విజయానికి బాటలు వేసుకోవాలని సూచించారు.
అనంతరం తెలంగాణ రాష్ట్రంలో మొదటి చాంపియన్షిప్ కోసం తలపడుతున్న జట్లకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. సమావేశంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్, ఆఫీసర్స్ క్లబ్ సెక్రటరీ గండ్ర సత్యనారాయణ రెడ్డి, టోర్నమెంట్ అబ్జర్వర్ పాణిరావు, జిల్లా అధ్యక్షుడు టి. రవీందర్రావు, కోశాధికారి నాగకిషన్, బాడ్మింటన్ జాతీయ అంపైర్ కొమ్ము రాజేందర్, అంపైర్లు శ్రీధర్, కిశోర్, హన్మంతరావు, శ్యామ్, మల్లికార్జున్, పీవీఎల్ కుమార్, పీసీఎస్ రావు తదితరులు పాల్గొన్నారు.
ప్రత్యేక ఆకర్షణగా గోపిచంద్ కూతురు
అండర్–17 విభాగంలో కోచ్ పుల్లెల గోపిచంద్ కూతురు గాయత్రి రంగారెడ్డి జిల్లా తరపున పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రంగారెడ్డి వర్సెస్ నిజామాబాద్ జిల్లా (పూర్వీసింగ్ క్రీడాకారిణి)తో ఆమె సింగిల్స్లో తలపడింది. కాగా, గోపిచంద్ కూతురును ఆటను క్రీడాభిమానులు ఆసక్తిగాతిలకించారు.