ధర్మవరం : ‘నమస్తే అన్నా.. మీ ఊరికి తీసుకెళ్లిన రెయిన్గన్లు.. స్రింక్లర్ పైపులు నిన్ననే తీసుకువస్తామని చెప్పారన్నా.. ఇంకా గోడౌన్కు చేర్చలేదేమన్నా? పై అధికారులు ఫోన్మీద ఫోన్ చేస్తున్నారన్నా.. ఎలాగైనా.. ఈ రోజు సాయంత్రంలోపు మీ ఊరికి ఇచ్చిన సామాన్లన్నీ గోడౌన్కు చేర్పించన్నా.. మర్చి పోద్దన్నా..ప్లీజ్..’ ఇది ఓ వ్యవసాయాధికారి వేడుకోలు.
‘ఏమయ్యా ఏవో.. రెయిన్ గన్లు.. స్ప్రింక్లర్లు వెనక్కి తీసుకు రమ్మంటున్నావంటా.. ఉన్నీలే.. మావోల్లేలే! జిల్లాలో అన్ని చోట్లా వెనక్కి ఇచ్చినప్పుడు.. మావోళ్లూ తెచ్చిస్తారులే... లాస్ట్ వరకు చూడు... వాళ్లనేం బలవంత పెట్టొద్దు’ ఇది అదే వ్యవసాయాధికారికి ఓ ప్రజాప్రతినిధి జారీ చేసిన హుకుం!
ఖరీఫ్ సీజన్లో సాౖVð న వేరుశనగ పంటను కాపాడేందుకు రక్షక తడులు అందించాలంటూ జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ వ్యవసాయాధికారుల ద్వారా రెయిన్గన్లు, స్రింక్లర్లు, హెచ్డీ పైపులు, డీజిల్ ఇంజన్లు అందజేసిన సంగతి తెలిసిందే. అవి ఏమేరకు పంటను రక్షించాయన్నమాట అటుంచితే. వాటిని అధికార పార్టీ నేతల నుంచి వెనక్కి తెప్పించేందుకు అధికారులకు తలప్రాణం తోకకొస్తోంది. ప్రస్తుతం కంది పంటకు కూడా రక్షక తడులు ఇచ్చేలా ఉత్తర్వులు జారీ అయినే నేపథ్యంలో వాటిని రికవరీ చేయకపోతే అధికారుల నుంచి చీవాట్లు.. గట్టిగా ఒత్తిడి చేసి తీసుకురమ్మని చెబితే నేతల నుంచి ఒత్తిళ్లు.. అడకత్తెరలో పోకచక్కలా తయారైంది వ్యవసాయాధికారుల పరిస్థితి.
టీడీపీ నేతల ఆధీనంలోనే
జిల్లా వ్యాప్తంగా 63 మండలాల్లో ఎండిపోతున్న వేరుశనగ పంటను కాపాడేందుకు రక్షకతడులు అందజేసేందుకు గాను 4,621 రెయిన్గన్లు, 4,279 స్ప్రింక్లర్ సెట్లు, 2,859 డీజిల్ ఇంజన్లు, 1.28 లక్షల హెచ్డీ పైపులను ప్రభుత్వం సమకూర్చింది. అయితే రైతులకు ఉపయోగపడాల్సిన ఈ సామగ్రి... పంచాయతీల వారీగా జన్మభూమి కమిటీ సభ్యులు, టీడీపీ నేతలు, కార్యకర్తలు పంచుకున్నారు.
ఇళ్లలోనే సామగ్రి
పంట పొలాల్లో రక్షక తడులు అందించాల్సిన రెయిన్గన్ల సామగ్రి నేతల ఇళ్లలోనే మూలుగుతున్నాయి. చాలా గ్రామాల్లో కనీసం ఒక్క ఎకరాకు రక్షక తడులు అందించేందుకు కూడా వినియోగించకుండా నేరుగా ఆయా గ్రామాల నాయకులు తమ ఇళ్లలో వాటిని భద్రంగా దాచిపెట్టారు. వీటిలో కొన్ని చోరీకి గురికాగా, మరికొన్ని శిథిలమైనట్లు తెలుస్తోంది.
ధర్మవరం నియోజకవర్గంలో పరిస్థితి ఇలా..
- బత్తలపల్లి మండలంలో 102 రెయిన్ గన్లు పంపిణీ చేయగా 25 రికవరీ అయ్యాయి. స్రింక్లర్లు 132గాను 35 మాత్రమే వెనక్కి తెచ్చిచారు. ఆయిల్ ఇంజిన్లు 87కు గాను 57 మాత్రమే వ్యవసాయాధికారుల వద్దకు తిరిగి చేరాయి. మొత్తం పరికరాల్లో 8,700గాను 3,700 మాత్రమే వెనక్కి వచ్చాయి.
- తాడిమర్రి మండలంలో 103 రెయిన్ గన్లు, 96 ఆయిల్ ఇంజన్లు, 5,011 పైపులు, 60 స్ప్రింక్లర్ సెట్లకు గాను 55 ఆయిల్ ఇంజిన్లు, 60 స్ప్రింక్లర్లు మాత్రమే వ్యవసాయ కార్యాలయానికి చేరాయి.
- ముదిగుబ్బ మండలంలో 124 రెయిన్గన్లు, 124 స్ప్రింక్లర్ సెట్లు, 118 ఆయిల్ ఇంజన్లు, 9,554 హెచ్డీ పైపులు పంపిణీ చేయగా వాటిలో 50 శాతం సామగ్రి మాత్రమే వెనక్కి చేరింది.
- ధర్మవరం మండలంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.