
స్వామివారి కల్యాణం నిర్వహిస్తున్న అర్చకులు
శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు చేపట్టారు.
భద్రాచలం : శ్రీసీతారామచంద్రస్వామికి సోమవారం ముత్తంగి సేవ ఘనంగా నిర్వహించారు. ఉదయం సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర సేవా కార్యక్రమాలు చేపట్టారు. పవిత్ర గోదావరి నది నుంచి తీర్థ జలాలను తెచ్చి భద్రుని గుడిలో అభిషేకం చేశారు. తర్వాత అంతరాలయంలో రామయ్యకు, సీతమ్మ తల్లికి, లక్ష్మణస్వామికి, ఆలయ ప్రాంగణంలో వేంచేసి ఉన్న శ్రీలక్ష్మీతాయారమ్మ, ఆంజనేయస్వామిని ముత్యాలతో తయారు చేసిన వస్త్రాలతో అలంకరించి.. ముత్తంగి సేవ చేశారు. తదుపరి స్వామివారి నిత్యకల్యాణ మూర్తులను ఆలయ బేడా మండపంలో వేంచేయింపజేసి.. ముందుగా విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం చేశారు. కంకణధారణ, యజ్ఞోపవీతధారణ, అమ్మవారికి కంకణధారణ, యోత్రధారణ గావించారు. అర్చకులు ఆలయ విశిష్టత గురించి, స్వామివారి, అమ్మవార్ల వంశక్రమాన్ని భక్తులకు తెలియజేశారు. వేద పండితులు వేద విన్నపాలు చేశారు. కల్యాణంలో పాల్గొన్న భక్తుల గోత్రనామాలను స్వామివారికి విన్నవించారు. అనంతరం రామయ్యకు వైభవంగా నిత్యకల్యాణం జరిపించారు. అర్చకులు స్వామివారి శేష వస్త్రాలు, తీర్థ ప్రసాదాలను భక్తులకు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, వేద పండితులు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.