రాష్ట్రస్థాయి 9వ ఆహ్వాన నాటిక పోటీలు ఆరంభం
తెనాలి: పోలేపెద్ది నరసింహమూర్తి, తుమ్మల వెంకట్రామయ్య, నందమూరి తారక రామారావు కళా పరిషత్ల ఆధ్వర్యంలో 9వ రాష్ట్రస్థాయి ఆహ్వాన నాటికల పోటీలు సోమవారం తెనాలిలో ఘనంగా ప్రారంభమయ్యాయి. రామలింగేశ్వరపేటలోని మున్సిపల్ ఓపెన్ ఆడిటోరియంలో సాయంత్రం 6 గంటలకు పోటీలు మొదలయ్యాయి. తొలుత విశాఖపట్నం, మాతృశ్రీ కళానికేతన్ కళాకారులు సంగమేశ్వరరావు దర్శకత్వంలో 'మాకొద్దీ నాగరికత' నాటికను ప్రదర్శించారు. తర్వాత గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక కళాకారులు వెనిగళ్ల దర్శకత్వంలో 'మధురస్వప్నం' నాటికను ప్రదర్శించారు. చివరగా వెలగనేరు థియేటర్ ఆర్ట్స్ కళాకారులు 'ఎవరికి ఎవరు' నాటికను ప్రదర్శించారు. ప్రారంభ సభకు కళా పరిషత్ కన్వీనర్ షేక్ జానిబాషా అధ్యక్షత వహించారు. అలపర్తి వెంకటేశ్వరరావు స్వాగత వచనం పలికారు. కౌన్సిలరు ముదిగొండ శైలజ జ్యోతి ప్రజ్వలన చేశారు. జేఎస్ఆర్ కృష్ణయ్య, కౌన్సిలర్ గుమ్మడి రమేష్, అభ్యుదయ కళాసమితి ప్రధాన కార్యదర్శి గరికపాటి సుబ్బారావు, క్యాపిటల్ స్టూడియో అధినేత ఎన్.మల్లికార్జునరావు పాల్గొన్నారు.