రైల్వే లైన్లో గృహాలు నిర్మిస్తే చర్యలు
రాపూరు: రాపూరు: కృష్ణపట్నం-ఓబులాపురం రైల్వేలైన్ మార్గంలో నూతనంగా గృహాలు నిర్మిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని నెల్లూరు ఆర్డీఓ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. వెలుగోనులో రైల్వేలైన్ వెళ్లే మార్గంలోని గృహాలను గురువారం ఆయన పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ గతంలో వెలుగోనులో సర్వే చేసి రైల్వే లైన్ కోసం సేకరించిన భూములు, అందులోని నిర్మాణాలకు పరిహారం అందంచడం జరిగిందన్నారు. కొన్ని గృహాల యజమానులు అధికారులు సక్రమంగా సర్వే చేయలేదని ఫిర్యాదు చేయడంతో పరిశీలిస్తున్నట్లు తెలిపారు. గ్రామంలో సుమారు 10 గృహాలకు నష్టపరిహారం అందించాల్సి ఉందన్నారు. మరోసారి సర్వే చేసి అర్హులందరికి నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. నివాస స్థలాలను కోల్పోయే వారికి ప్రభుత్వ భూమి కేటాయిస్తామన్నారు. గ్రామస్తులు మాట్లాడుతూ సగం పోయే గృహాల మొత్తానికి పరిహారం అందజేయాలని కోరారు. అలాగే రైల్వే లైన్లో పోగా గ్రామంలో మిగిలిన రెండు మూడు ఇళ్లకు పరిహారం అందజేసి నివేశన స్థలాలు కేటాయించాలని విన్నవించారు. వెలుగోను నుంచి తూమాయి గ్రామానికి గతంలో రోడ్డు మార్గం ఉండేదని రైల్వే అధికారులు రైల్వే కట్టతో రోడ్డు మూసుకుపోయే అవకాశం ఉందని ప్రత్యామ్నాయంగా రోడ్డును ఏర్పాటు చేయాలని కోరారు. ఆయన వెంట రైల్వే వికాస్ నిఘం లిమిటేడ్ జీఎం సుబ్రహ్మణ్యం, తహసీల్దార్ నిర్మలానందబాబా, సర్వేయర్ రాజా, సర్పంచ్ మనోహర్రెడ్డి, రైల్వే కాంట్రాక్టర్ అశోక్ ఉన్నారు.