శ్రీవారి ఆలయం వద్ద మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆర్కేరోజా
– వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా
సాక్షి, తిరుమల: ‘ ప్రత్యేక హోదా కోసం రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా ఉద్యమాలు జరుగుతుంటే, ఏపీ సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి వెంకయ్యలు వెన్నుపోటు పొడుస్తున్నారు.’ అని నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ఆరోపించారు. గురువారం ఆమె తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఏపీకి నాడు పదేళ్లు హోదా కావాలన్న వెంకయ్య, కాదు పదిహేనేళ్లు కావాలని డిమాండ్ చేసిన చంద్రబాబులే హోదా రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. హోదా కోసం పోరాటం చేస్తున్న విద్యార్థులను జైల్లో పెడుతుండడం బాధాకరమన్నారు. జిల్లాలో ఏర్పాటైన మన్నవరం ప్రాజెక్టు తరలిపోతుంటే ఈ జిల్లాకు చెందిన సీఎం చంద్రబాబు చేతకాని దద్దమ్మలా నోరు మెదపకుండా చూస్తున్నారన్నారు. అవినీతి ఊబిలో కూరుకుపోయిన చంద్రబాబు వల్లే ప్రతిష్టాత్మకమైన మన్నవరం ప్రాజెక్టు తరలిపోతోందన్నారు.
కనీసం ప్రత్యేక హోదా అయినా వస్తే ఉన్న ప్రాజెక్టులతోపాటు కొత్త ప్రాజెక్టులు వస్తాయన్న వాస్తవాన్ని సీఎం ఎందుకు గుర్తించటం లేదని ఆమె ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి పోయిన ఆయన కేంద్రం వద్ద నోరు మెదపటం లేదన్నారు. రాష్ట్రంలో డెంగీ, విష జ్వరాలతో జనం అల్లాడుతుంటే సీఎం చంద్రబాబుతోపాటు మంత్రులు కానినేని శ్రీనివాస్, నారాయణ దోమలపై దండయాత్ర పేరుతో ప్లకార్డులు పట్టుకుని ప్రచారం చేస్తున్నారన్నారు. అనంతపురంలో హెల్త్ ఎమెర్జెనీ ప్రకటించినా అక్కడికి వైద్యశాఖ మంత్రి వెళ్లకపోవటం దారుణమన్నారు. చంద్రబాబు దత్తత తీసుకున్న అరకులోయలో గిరిజనం విషజ్వరాలతో మరణిస్తున్నా సీఎంకు చీమకుట్టినట్లైనా లేదన్నారు. విశాఖలోని బాకై ్సట్ గనులపై ఉన్న ప్రేమ గిరిజనుల ఆరోగ్యంపై లేదన్నారు.
బాబు వస్తే జాబు వస్తుందని యువత ఎదురు చూస్తోందని, అయితే బాబు వచ్చినా జాబు మాత్రం రాలేదన్నారు. హోదాతోనైనా ఫ్యాక్టరీలు, తద్వారా ఉద్యోగాలు వస్తాయనే సత్సంకల్పంతో వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి హోదా సాధన కోసం నిరంతరం పోరాటాలు సాగిస్తున్నారని ఆమె గుర్తు చేశారు. హోదా సాధించుకునేంత వరకు తమ పార్టీ ఆధ్వర్యంలో పోరాటాలు ఆపే ప్రసక్తేలేదన్నారు.