
'వైఎస్ జగన్ ప్రభంజనంతో గెలిచి తీరుతాం'
హైదరాబాద్: వరంగల్ ఎంపీ స్థానం అక్కడి ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే కట్టబెడతారని వైఎస్ఆర్సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజల్లో తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఉన్న ప్రభంజనం ముందు ఏ పార్టీ నిలవలేదని చెప్పారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏమేం చేశాడో ప్రజలందరికీ తెలుసని, అందుకే ఆయనకు రెండుసార్లు ముఖ్యమంత్రి పట్టంకట్టారని చెప్పారు.
వైఎస్ఆర్ పేదల, మైనార్టీలకోసం పనిచేసిన మహామనిషి అని ఆయన తర్వాత ముఖ్యమంత్రులుగా వచ్చిన ఇద్దరు వ్యక్తులు కూడా చాలా చెత్తగా పరిపాలన చేశారని చెప్పారు. అందుకే వైఎస్ఆర్ మాదిరిగానే ఆయన కుమారుడు, తమ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 16, 17,18,19 తేదీల్లో వరంగల్ ఎంపీ స్థానంలో ఉన్న ప్రతి సెగ్మెంట్లలో జరిగే ప్రచారంలో పాల్గొని ప్రతి ఒక్కరికీ భరోసా కల్పిస్తారని చెప్పారు. వైఎస్ జగన్ ప్రచారంతో తమ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. వరంగల్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్ఆర్ సీపీ తరుపున నల్లా సూర్యప్రకాశ్ నామినేషన్ వేసిన విషయం తెలిసిందే.