పట్టభద్రులు... పాడి రైతులు | youth depend on dairy | Sakshi
Sakshi News home page

పట్టభద్రులు... పాడి రైతులు

Published Sat, Sep 17 2016 11:47 PM | Last Updated on Mon, Sep 4 2017 1:53 PM

పట్టభద్రులు... పాడి రైతులు

పట్టభద్రులు... పాడి రైతులు

  • పొట్టనింపని పీజీ, డిగ్రీ పట్టాలు
  • పాడితో ముందడుగు వేస్తున్న యువత
  • హుస్నాబాద్‌: ‘ఉద్యోగం పురుష లక్షణం..’ అన్నది పెద్దల మాట. అయితే ఉన్నత చదువులు చదివి.. చేతిలో డిగ్రీ పట్టాలు ఉన్నా కనీసం ప్రైవేట్‌ ఉద్యోగం దొరకని పరిస్థితి. అయితే కొలువు కోసం ఎదురుచూడకుండా సొంతంగా ఆలోచించారు. కుటుంబపోషణకు పాడిపరిశ్రమను ఉపాధి మార్గంగా ఎంచుకున్నారు హుస్నాబాద్‌ మండలం మల్లంపల్లికి చెందిన యువకులు. ఆర్థికంగా నిలదొక్కుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు.
     
    ప్రస్తుత పరిస్థితుల్లో పీజీ, డిగ్రీ పట్టాలందుకున్న నిరుద్యోగ యువకులు పాడిని నమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. మండలంలోని మల్లంపల్లికి చెందిన మ్యాక సంపత్‌(ఎమ్మెస్సీ, బీఈడీ), గూళ్ల రంజిత్‌ కుమార్‌(బీఏ, బీఈడీ), గిరిమల్ల రాజు(బీఎస్సీ), ఆల్ల మల్లేష్‌ (బీఏ,బీఈడీ), పిరిశెట్టి జయంత్‌కుమార్‌ (ఎమ్మెస్సీ, బీఈడీ), ఎండీ.సాదిక్‌ (బీఏ), కందారపు సతీశ్‌(బీఏ), వేముల శ్యాం(బీఏ)తోపాటు దాదాపు మరో 10మంది నిరుద్యోగులు పట్టభద్రులై పాడిపరిశ్రమతో కుటుంబపోషణ సాగిస్తున్నారు. వీరి కుటుంబ నేపథ్యమంతా వ్యవసాయమే. ఉద్యోగాల కోసం నోటిఫికేషన్లు రాకపోవడంతో కుటుంబపోషణ కష్టసాధ్యంగా మారింది. చదివినా ఉద్యోగాలు దొరకని పరిస్థితుల్లో వ్యవసాయానికి అనుబంధంగా ఉన్న పాడి దిక్కైంది. ఉన్నతచదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో దిగాలు చెందక గేదేలు, ఆవులను పెంచిపోషించుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు ఈ యువకులు.
     
    ఉద్యోగాలు దొరకకా..
    –మ్యాక సంపత్, ఎమ్మెస్సీ, బీఈడీ
    తల్లిదండ్రులు ఎంతో కష్టపడి చదివించారు. మేము ఉన్నత ఉద్యోగాలు చేస్తారని ఆశలు పెట్టుకున్నారు. తీరా పీజీ పట్టా సాధించిన నిరుద్యోగిగా మారిన. తల్లిదండ్రులు వృద్ధాప్యంతో ఆర్థిక భారం మీద పడింది. ఏం చేయాలో ఆలోచిస్తున్న సమయంలో మూడుగేదెలు కొన్నా. పాలతో రోజుకు రూ.300 సంపాదిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నా.
     
    కుటుంబ పోషణ భారమై...
    –గూళ్ల రంజిత్‌ కుమార్, బీఏ, బీఈడీ
    ఉన్నత చదువులు చదివినా ఉద్యోగాలు రాకపోవడంతో కుటుంబపోషణ భారమైంది. డిగ్రీ పట్టా పట్టుకుని ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ప్రైవేట్‌ ఉద్యోగం సైతం దొరకలేదు. దీంతో నాలుగు గేదెలను కొనుగోలు చేసి పాడిని అభివృద్ధి చేస్తున్నా. రోజుకు 8 లీటర్ల పాలు డెయిరీలో పోస్తున్నా. రోజుకు రూ.400 వస్తున్నాయి.
     
    పాల ద్వారా ఉపాధి..
    –గిరిమల్ల రాజు, బీఎస్సీ
    చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయా. అన్నయ్య, అక్కయ్య ప్రోద్బలంతో డిగ్రీ వరకు చదువుకున్నా. పై చదువులు చదువుదామంటే ఆర్థిక స్థోమత లేక ఫుల్‌స్టాప్‌ పెట్టా. డిగ్రీ పట్టాతో ఏదైనా ఉద్యోగం చేయాలని తిరిగినా. అయినా దొరకక ఇబ్బందులకు గురయ్యా. పాల ద్వారా ఉపాధి దొరుకుతుందని ఆశించి మూడు ఆవులను కొనుగోలు చేసి ఆర్థికంగా నిలదొక్కుకుంటున్నా. పాలద్వారా వచ్చే డబ్బులతో కుటుంబాన్ని పోషించుకుంటున్న.
     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement