
ర్యాలీ అనుమతి కోసం దరఖాస్తు చేశాం
ఆధారమిదిగో.. ఆంగ్ల మీడియాతో జగన్
సాక్షి, హైదరాబాద్ : ప్రత్యేక హోదా సాధన కోసం విశాఖపట్టణంలో తలపెట్టిన కొవ్వొత్తుల ర్యాలీ కోసం తమను ఎవరూ సంప్రదించలేదని పోలీసు అధికారులు చెప్పడంలో నిజం లేదని తాము ఈ నెల 23వ తేదీనే అనుమతి కోరుతూ దరఖాస్తు చేశామని ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ఆయన బుధవారం ఆంగ్ల మీడియా ప్రతినిధులడిగిన ప్రశ్నలకు సమాధానంగా కొవ్వొత్తుల ర్యాలీకి అనుమతి కోరుతూ పోలీసులకు చేసుకున్న దరఖాస్తు ప్రతిని స్వయంగా చూపించారు. తాను విశాఖ ర్యాలీలో పాల్గొని తీరతానని ఆయన స్పష్టం చేశారు. అన్ని విధాలా గ్రోత్ ఇంజన్గా, ఉమ్మడి రాష్ట్రానికి రాజధానిగా ఉన్న హైదరాబాద్ను ఆంధ్రప్రదేశ్ కోల్పోతున్నందుకే ప్రత్యేక హోదా ఇస్తామని ఆనాడు పార్లమెంటులో హామీ ఇచ్చారని జగన్ పేర్కొన్నారు.
90 శాతానికి పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలన్నీ హైదరాబాద్లోనే కేంద్రీకృతం అయి ఉన్నాయని అంతే కాక పారిశ్రామిక తయారీ రంగం, సేవారంగాలు కూడా 70 శాతానికి పైగా హైదరాబాద్లోనే ఉన్నాయని ఆయన అన్నారు. ఈ స్థాయిలో ఏపీ కూడా అభివృద్ధి చెందాలంటే అనివార్యంగా ప్రత్యేక హోదా ఇవ్వాల్సిందేనని ఆయన అభిప్రాయపడ్డారు. ఫార్మారంగం కూడా హైదరాబాద్లోనే ఉందన్నారు. జల్లికట్టు కోసం తమిళనాడు ముఖ్యమంత్రి మొత్తం రాజకీయ పక్షాలను ఢిల్లీకి తీసుకెళ్లారని, హోదా కోసం చంద్రబాబు కూడా అలాగే చేయాలని ఆయన అన్నారు.