
అమితాబ్కు అక్కినేని జాతీయ పురస్కారం
క్రీడలు
సానియా జోడీకి పసిఫిక్ ఓపెన్ టైటిల్
సానియామీర్జా, కారాబ్లాక్ (జింబాబ్వే) జోడీ డబ్ల్యూటీఏ టోరే పాన్ పసిఫిక్ ఓపెన్ టైటిల్ను గెలుచుకుంది. టోక్యోలో సెప్టెంబర్ 20న జరిగిన ఫైనల్లో ఈ జంట గాబ్రిన్ మగురుజా-కార్లా సురెజ్ నవారో (స్పెయిన్)పై విజయం సాధించారు.
ఇంచియాన్లో ప్రారంభమైన
17వ ఆసియా క్రీడలు
దక్షిణ కొరియాలోని ఇంచియాన్లో 17వ ఆసియా క్రీడలు సెప్టెంబర్ 17న ఆరంభమయ్యాయి. అక్టోబర్ 4 వరకు కొనసాగుతాయి. ఒలింపిక్స్ తర్వాత రెండో అతిపెద్ద క్రీడలివే. 45 దేశాల నుంచి 13,000 మంది క్రీడాకారులు పాల్గొనగా వీరిలో భారత్ నుంచి 516 మంది ఉన్నారు. 36 క్రీడాంశాల్లో 439 ఈవెంట్లు జరుగుతాయి. ప్రారంభోత్సవ కార్యక్రమంలో భారత బృందానికి హాకీ జట్టు కెప్టెన్ సర్దార్ సింగ్ త్రివర్ణ పతాకంతో సారథ్యం వహించాడు. జీతూరాయ్కి తొలిస్వర్ణం: 50 మీటర్ల పిస్టల్ ఈవెంట్లో భారత షూటర్ జీతూరాయ్ స్వర్ణం గెలిచాడు. ఆసియా క్రీడల్లో భారత్కు షూటింగ్లో తొలి స్వర్ణం కూడా ఇదే. 2018 ఆసియా క్రీడలు ఇండోనేసియా రాజధాని జకార్తాలో జరగనున్నాయి.
షూటింగ్ ప్రపంచ చాంపియన్షిప్లో
ప్రదీప్కు కాంస్యం
స్పెయిన్లోని గ్రనడా వేదికగా జరిగిన షూటింగ్ ప్రపంచ చాంపియన్ షిప్లో యువ షూటర్ ప్రదీప్ 25 మీటర్ల స్టాండర్డ్ పిస్టల్ పోటీ జూనియర్ విభాగంలో కాంస్యం సాధించాడు. ఈ టోర్నీలో భారత్కిది రెండో పతకం. ఇంతకు ముందు 50 మీటర్ల పిస్టల్ పోటీలో జీతూరాయ్ రజతం గెలిచాడు.
జాతీయం
నేషనల్ ఆయుష్ మిషన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం
నేషనల్ ఆయుష్ మిషన్ (ఎన్ఏఎమ్) ను ప్రారంభించేందుకు కేంద్ర కేబినెట్ సెప్టెంబర్ 15న ఆమోదించింది. అ్గ్ఖఏ అనే ఈ పదం మొదటి అక్షరాలైన ఆయుర్వేదం, యోగ అండ్ నేచురోపతి, యునాని, సిద్ధ, హోమియోపతిలను సూచిస్తుంది. సుదూర ప్రాంతాలలో నివసించేవారి ఆరోగ్య అవసరాలను తీర్చడమే ఆయుష్ లక్ష్యం.
శిశు మరణాల్లో భారత్ అగ్రస్థానం
శిశు మరణాల విషయంలో గతం కంటే పరిస్థితి మెరుగుపడినా భారత దేశమే అగ్రస్థానంలో ఉంది. 2013లో ప్రపంచ వ్యాప్తంగా సంభవించిన అయిదేళ్లలోపు శిశుమరణాలపై ఐక్యరాజ్యసమితి సెప్టెంబర్ 16న నివేదికను విడుదల చేసింది. 2013లో దేశంలో ప్రతి వెయ్యిమంది శిశువుల్లో 41 మరణాలు నమోదయ్యాయని ఐరాస తెలిపింది.
శిశుమరణాల తగ్గింపునకు ప్రత్యేక కార్యాచరణ
శిశుమరణాలు తగ్గించే లక్ష్యంతో భారత నవజాత శిశు కార్యాచరణ ప్రణాళిక (ఐఎన్ఏపీ)ను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సెప్టెంబర్ 18న ప్రారంభించారు. ప్రస్తుతం ప్రతి 1000 జననాలకు 29 గా ఉన్న శిశు మరణాలను, 2030 నాటికి ఒక అంకెలోకి తీసుకువచ్చేందుకు దీన్ని చేపట్టారు. కేరళలో నవజాత శిశుమరణాల రేటు 7గా ఉంది. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్లలో దేశవ్యాప్తంగా మరణించే వారి సంఖ్యలో 56 శాతం సంభవిస్తున్నాయి.
టీసీఎస్లో అత్యధిక మహిళా ఉద్యోగులు
దేశంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మహిళలకు అత్యధిక ఉద్యోగాలు కల్పిస్తోంది. ఈ సంస్థలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగుల సంఖ్య లక్షకు దాటింది. దీంతో మహిళలు పనిచేస్తున్న అతిపెద్ద దేశీయ ప్రైవేటు సంస్థగా టీసీఎస్ గుర్తింపు పొందింది.
రాష్ట్రీయం
అందరికీ విద్యుత్ ఒప్పందంపై కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ఒప్పందం
అందరికీ విద్యుత్తు (పవర్ ఫర్ ఆల్-పీఎఫ్ఏ) అందించే కార్యక్రమానికి సంబంధించిన ఒప్పందంపై కేంద్రం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు సెప్టెంబర్ 16న హైదరాబాద్లో సంతకాలు చేశాయి. ఎన్టీపీసీ రూ. 20వేల కోట్లతో 4,000 మెగావాట్ల అల్ట్రా మెగా సూపర్ క్రిటికల్ థర్మల్ ప్రాజెక్టును విశాఖ పట్టణం జిల్లా పుడిమడకలో నెలకొల్పనుంది. ప్రపంచంలో అతిపెద్ద సౌరవిద్యుత్తు కేంద్రం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయనున్నారు. కేంద్రానికి చెందిన సోలార్ ఎనర్జీ కార్పోరేషన్తో ఒప్పందం జరిగింది. ఈ సౌర విద్యుత్తు కేంద్రాలను కడప, కర్నూలు,అనంతపురాల్లో ఏర్పాటు చేస్తారు. చిత్తూరు జిల్లా మాదన్నపాలెంలో హీరో మోటోకార్ప్ ఆటోమోబైల్ ప్రాజెక్టును స్థాపించనుంది.
తె లంగాణ ప్రభుత్వానికి ప్రతిభా పురస్కారం
శాస్త్ర సాంకేతికతను వినియోగించుకొని అనూహ్య ఫలితాలను సాధించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం ప్రతిభా (మెరిట్) పురస్కారాన్ని అందజేసింది. ‘కనిష్ట ప్రభుత్వం - గరిష్ట పాలన’ పేరుతో నేషనల్ ఇన్ఫర్మేటిక్ సెంటర్ రూపొందించిన ఈ-పీడీఎస్ సాఫ్ట్వేర్ను తెలంగాణ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ వినియోగించుకొంది. దీంతో ఆధార్ కార్డుల సీడింగ్ను చేపట్టి మూడు నెలల వ్యవధిలో 10.13 లక్షల కార్డులను రద్దు చేసి 16.54 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఆదా చేసింది. ఈ-పీడీఎస్ సాఫ్ట్వేర్ను వినియోగించి అనూహ్య ఫలితాన్ని సాధించినందుకు కేంద్రం ఆర్డర్ ఆఫ్ మెరిట్ పేరుతో అవార్డును సెప్టెంబర్ 20న ఢిల్లీలో అందించింది.
వార్తల్లో వ్యక్తులు
కేంబ్రిడ్జ్లో న్యాయ శాస్త్ర అధ్యాపకురాలిగా భారత సంతతి యువతి
భారత సంతతికి చెందిన అంటారా హల్దార్ (28) ప్రతిష్టాత్మక కేంబ్రిడ్జ్ విశ్వ విద్యాలయంలో న్యాయ శాస్త్ర అధ్యాపకురాలిగా సెప్టెంబర్ 15న బాధ్యతలు చేపట్టారు. దీంతో కేంబ్రిడ్స్ చరిత్రలో న్యాయశాస్త్ర అధ్యాపక హోదాలో నియమితులైన తొలి ఐరోపాయేతర వ్యక్తిగా అరుదైన ఘనత సాధించారు. ఆమె ముంబయికి చెందిన వారు.
మమ్ముట్టి ట్రీ ఛాలెంజ్
ఐస్ బకెట్...రైస్ బకెట్ ఛాలెంజ్ తరహాలో మలయాళ హీరో మమ్ముట్టి ట్రీ ఛాలె ంజ్ పేరుతో పర్యావరణ కార్యక్రమం చేపట్టారు. ఫేస్బుక్ ద్వారా విస్తృత ప్రచారం కల్పిస్తున్నారు.
నైతిక విలువల కమిటీ చైర్మన్గా అద్వానీ
లోక్సభ నైతిక విలువల కమిటీ అధ్యక్షుడిగా బీజేపీ అగ్రనేత ఎల్.కె. అద్వానీని నియమిస్తూ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఉత్తర్వులిచ్చారు. కమిటీలో చైర్మన్తోపాటు 11 మంది సభ్యులు ఉంటారు. లోక్సభ సభ్యుల నైతిక ప్రవర్తనను కమిటీ పరిశీలిస్తుంది.
భారత్లో అమెరికా రాయబారి
రిచర్డ్ రాహుల్ వర్మ
భారత సంతతికి చెందిన రిచర్డ్ రాహుల్ వర్మ (45)ను భారత్లో అమెరికా రాయబారిగా ఆ దేశ అధ్యక్షుడు బరాక్ ఒబామా సెప్టెంబర్ 18న నియమించారు. భారత సంతతి వ్యక్తిని అమెరికా రాయబారిగా నియమించడం ఇదే తొలిసారి.
ఐఈఏ అధ్యక్షుడిగా కౌశిక్బసు
ఇంటర్నేషనల్ ఎకనమిక్ అసోసియేషన్ (ఐఈఏ) అధ్యక్షుడిగా ప్రముఖ ఆర్థిక వేత్త కౌశిక్బసు నియమితులయ్యారు. ప్రస్తుతం ఆయన ప్రపంచ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరిస్తున్నారు. ఐఈఏకు అధ్యక్షత వహించనున్న రెండో భారతీయుడు కౌశిక్బసు. దీనికి గతంలో పనిచేసిన వారిలో నోబెల్ బహుమతి గ్రహీతలైన రాబర్డ్ సోలో, ఆమర్త్యసేన్, జోసెఫ్ స్టిగ్లిట్జ్లు ఉన్నారు.
ఫార్చ్యూన్ అత్యంత శక్తిమంతమైన
బిజినెస్ ఉమెన్ జాబితా
ఈ ఏడాది ఫార్చ్యూన్ అత్యంత శక్తిమంతమైన మహిళా వ్యాపార వేత్తల జాబితాలో ఐబీఎమ్ చైర్పర్సన్, సీఈఓ జిన్నీ రోమెట్ అగ్రస్థానంలో నిలిచారు. పెప్సీకో ముఖ్య కార్యనిర్వహణాధికారి ఇంద్రానూయీకి మూడో స్థానం లభించింది. రెండో స్థానంలో జనరల్ మోటార్స్ సీఈఓ మేరీబరా నిలిచారు.
జాతీయ మహిళా కమిషన్ సారథిగా
లలితా కుమార మంగళం
జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్గా లలితా కుమార మంగళంను సెప్టెంబర్ 17న కేంద్ర, మహిళా శిశు అభివృద్ధి శాఖ నియమించింది. తమిళనాడుకు చెందిన ఆమె ప్రకృతి అనే స్వచ్చంద సంస్థను నడుపుతున్నారు.
అవార్డులు
వ ర్దీకి ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్ అవార్డు
విశ్వంలో ప్రతీ పదార్ధానికి ద్రవ్యరాశి ఉంటుందని భావిస్తున్న దైవకణం (హిగ్స్ బోసాన్) ఉనికిని కనిపెట్టడంలో కీలకపాత్ర పోషించిన ప్రవాస భారత శాస్త్రవేత్త తేదీందర్ వర్దీ ప్రతిష్ఠాత్మక ప్రొఫెషనల్ ఆఫ్ ద ఇయర్ -2014 అవార్డుకు ఎంపికయ్యారు. లండ న్లో ఏసియన్ అచీవర్స్ అవార్డుల కార్యక్రమంలో దీన్ని అందుకున్నారు.
అమితాబ్కి అక్కినేని నాగేశ్వరరావు
జాతీయ పురస్కారం
అక్కినేని నాగేశ్వరరావు జాతీయ పురస్కారం -2013ను బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్కు ప్రకటించారు. అవార్డుల కమిటీ అధ్యక్షుడు టి సుబ్బరామిరెడ్డి సెప్టెంబర్ 20న తెలిపారు.
భారత యువ ఆర్కిటెక్టుకు టైమ్ పత్రిక గౌరవం
భారత్కు చెందిన ఆర్కిటెక్టు అలోక్ శెట్టి (28)ని రేపటి యువనేత (యంగ్ లీడర్ ఆఫ్ టుమారో)గా టైమ్ పత్రిక పేర్కొంది. మురికివాడల్లో నివసించే పేదల కోసం వరదలను తట్టుకునే చౌకైన ఇళ్లను డిజైన్ చేస్తున్నందుకు ఈ గౌరవం లభించింది. కొలంబియా విశ్వవిద్యాలయం నుంచి ఆర్కిటెక్చర్లో మాస్టర్స్ డిగ్రీ పొందిన అలోక్ బెంగళూరుకు చెందిన స్వచ్చంద సంస్థ పరిణామ్ ఫౌండేషన్లో పనిచేస్తున్నాడు.
అంతర్జాతీయం
గ్రేట్ బ్రిటన్తో కలిసి ఉండేందుకే స్కాట్లాండ్ ప్రజల ఓటు
స్కాట్లాండ్లో నిర్వహించిన రెఫరెండమ్లో గ్రేట్ బ్రిటన్ నుంచి విడిపోయేందుకు ప్రజలు తిరస్కరించారు. సెప్టెంబర్ 18న నిర్వహించిన రెఫరెండంలో 55.3 శాతం మంది స్కాట్లాండ్ వాసులు బ్రిటన్తో కలిసి ఉండేందుకు ఓటు వేశారు. 44.7 శాతం మంది స్వతంత్రంగా ఉండేందుకు మొగ్గు చూపారు. ఈ తీర్పును బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్ స్వాగతించారు. స్కాట్లాండ్ స్వాతంత్య్రం కోసం ప్రచారం నిర్వహించిన స్కాట్లాండ్ నేషనల్ పార్టీ నాయకుడు, మంత్రి అలెక్స్ సాల్మండ్ ఓటమిని అంగీకరిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. బ్రిటన్, స్కాట్లాండ్ల మధ్య అసమానతలు, ఆర్థిక, సంక్షేమ రంగాల్లో వివక్ష, పెరుగుతున్న నిరుద్యోగం, స్కాట్లాండ్లో భారీగా చమురు నిల్వలు స్వతంత్రం కోరుకునేందుకు ప్రేరేపించాయి. స్కాట్లాండ్కు మరిన్ని అధికారాలు కల్పిస్తామన్న ప్రధాని డేవిడ్ కామెరూన్ హామీ, విభజనతో కలిగే నష్టాలు కలిసి ఉండేందుకు తోడ్పడ్డాయి.
అపర కుబేరుల జాబితాలో భారత్ది ఆరోస్థానం
అపర కుబేరుల (బిలియనీర్) ప్రపంచ జాబితాలో భారత్ ఆరోస్థానంలో నిలిచింది. వెల్త్-ఎక్స్, యూబీఎస్ బిలియనీర్ సెన్సెస్-2014 సెప్టెంబర్ 17న వివరాలను వెల్లడించింది. భారత్లో ఈ ఏడాది 100 మంది బిలీయనీర్లు ఉన్నట్లు తేల్చింది. ఈ వంద మంది మొత్తం ఆస్తుల విలువ రూ. 10,50,000 కోట్లు (175 బిలియన్ డాలర్లు). అమెరికా, చైనా యునెటైడ్ కింగ్డమ్ తొలి మూడు స్థానాల్లో ఉన్నాయి.
పన్నుల సమాచార మార్పిడికి
జి-20 దేశాల నిర్ణయం
జి-20 దేశాలు ఆటోమాటిక్గా ఆయా దేశాల మధ్య పన్నుల సమాచారం మార్పిడి వ్యవస్థను 2017 నాటికి రూపొందించేందుకు నిర్ణయించాయి. సెప్టెంబర్ 21న కెయిర్న్స్లో ముగిసిన రెండు రోజుల జి-20 ఆర్థిక మంత్రుల, సెంట్రల్ బ్యాంక్ గవర్నర్ల సమావేశంలో దీన్ని ఆమోదించారు. ఈ నిర్ణయం విదేశాల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తెప్పించేందుకు భారత్కు తోడ్పడతుంది.
చైనాతో భారత్ 12 ఒప్పందాలు
చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ మూడు రోజుల భారత పర్యటనలో సెప్టెంబర్ 18న ప్రధాని నరేంద్ర మోడీతో ఉన్నతస్థాయి చర్చలు జరిపారు. ఇరుదేశాల మధ్య సరిహద్దు సమస్యలు పరిష్కారం కావాలని మోడీ జిన్పింగ్కు తెలిపారు. భారత్లో రానున్న ఐదేళ్లలో రూ. 1.21 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు చైనా హామీ ఇచ్చింది. చర్చల సందర్భంగా 12 ఒప్పందాలు కుదిరాయి. వీటితోపాటు గుజరాత్లోని అహ్మదాబాద్, చైనాలోని గ్యాంగ్, ఝూ నగరాలను సోదర నగరాలుగా అభివృద్ధి చేయడానికి ఒప్పందం కుదిరింది.
అఫ్గానిస్థాన్ అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీ
అఫ్గానిస్థాన్ కొత్త అధ్యక్షుడిగా అష్రాఫ్ ఘనీని సెప్టెంబర్ 21న ప్రకటించారు. గత జూన్లో జరిగిన ఎన్నికల్లో ఆర్థికమంత్రిగా ఉన్న అష్రాఫ్ ఘనీ, ప్రతిపక్ష నేత అబ్దుల్లా అబ్దుల్లా ఎవరికి వారు విజయం సాధించినట్లు ప్రకటించుకున్నారు. దీంతో దేశంలో సంక్షోభం తలెత్తింది. దీనికి ముగింపు పలుకుతూ ఇద్దరి మధ్య కుదిరిన ఒప్పందం ప్రకారం ఘనీ అధ్యక్షుడిగా కొనసాగుతారు. ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పదవికి అబ్దుల్లా నామినేట్ అవుతారు.
మూడోసారి న్యూజిలాండ్ ప్రధానిగా జాన్ కీ
న్యూజిలాండ్ ప్రదానమంత్రిగా జాన్కీ వరుసగా మూడోసారి ఎన్నికయ్యారు. ఆయనకు చెందిన నేషనల్ పార్టీ 121 స్థానాలకు గాను 61 సీట్లను గెలుచుకుంది. ప్రధాన ప్రతిపక్షం లేబర్పార్టీ రెండో స్థానంలో నిలిచింది.