
నేటి నుంచి జనభేరి
సాక్షి ప్రతినిధి, అనంతపురం : సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాకు వస్తోండటంతో ఆ పార్టీ శ్రేణుల్లో నూతనోత్సహం నెలకొంది. రెండేళ్ల తర్వాత జిల్లాకు జననేత వస్తోండటంతో ఆయనను చూసేందుకు జనం ఆతృతతో ఎదురు చూస్తున్నారు. సహకార, పంచాయతీ, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ హవా సాగిన నేపథ్యంలో ఇప్పటికే ప్రత్యర్థి పార్టీలు వణికిపోతున్నాయి. ఈ నేపథ్యంలో అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలో పర్యటిస్తే.. వైఎస్సార్సీపీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవిస్తుందని..
సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీని ఎదుర్కోలేమని టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. మంగళవారం గుత్తి, పామిడి, వజ్రకరూరు, ఉరవకొండ, ఆత్మకూరుల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించనున్నారు. వైఎస్ జగన్ ఎప్పుడు వస్తారా అని వేయికళ్లతో జిల్లా ప్రజానీకం ఎదురు చూస్తున్న తరుణంలో ఆయన సభలు జనసంద్రంతో పోటెత్తడం ఖాయమన్నది రూఢీ అవుతోంది.
ఇది టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సహకార ఎన్నికల్లో ఘన విజయం, మున్సిపల్, ప్రాదేశిక ఎన్నికల్లో సైతం వైఎస్సార్సీపీ జయకేతనం ఎగురవేయడం ఖాయమని తేలిన తరుణంలో జననేత పర్యటనతో సార్వత్రిక ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఎదుర్కోవడం సాధ్యం కాదని టీడీపీ, కాంగ్రెస్ నేతలు ఆందోళన చెందుతున్నారు.