
సాధారణంగా కృష్ణుడు అనగానే చేతిలో పిల్లనగ్రోవి ఊదుతూ జగత్తును సమ్మోహనపరుస్తూ కనిపిస్తాడు. అయితే వైఖానసాగమం, పాంచరాత్ర ఆగమం ఎనిమిది మంది కృష్ణ రూపాలను వివరించాయి. వాటిలో బాలకృష్ణుడు, నవనీత కృష్ణుడు, కాళీయ మర్దన కృష్ణుడు, గోవర్ధనధరుడు, మదన గోపాలమూర్తి, పార్థసారథి, త్రైలోక్య మోహనుడు, జగన్మోహనుడు మొదలైన రూపాలు విశేషమైనవి. శ్రీ కృష్ణుడి రూపాలలో విశిష్టమైనది మదన గోపాలుని రూపం. ఈ స్వామి 16 చేతులతో దర్శనమిస్తాడు. రెండు చేతులతో వేణువును ఊదుతూ, మరో రెండు చేతులతో శంఖ చక్రాలను, మిగిలిన చేతులలో పాశ అంకుశాలను, పద్మం చెరకుగడను ధరించి దర్శనమిచ్చే ఈ స్వామిని రాజగోపాలుడు అని కూడా పిలుస్తారు ఈ స్వామి దర్శనంతో సకల అభీష్టాలు నెరవేరుతాయి.
మహాభారత యుద్ధంలో అర్జునుడికి మార్గదర్శకుడిగా రథసారధిగా శ్రీ కృష్ణుడు కనిపిస్తాడు ఈ స్వామి రూపం పార్థసారథిగా ప్రసిద్ధి పొందింది. ఈ స్వామి ఒక చేతితో చండ్రకోలును, మరో చేతితో శంఖాన్ని ధరించి దర్శనమిస్తాడు. ఈ స్వామి జ్ఞాన ప్రదాయకుడు. భగవద్గీతను అనుగ్రహించింది ఈయనే. జగన్మోహనస్వామి రూపం బృందావనంలో రత్న కిరీటాన్ని ధరించి గరుడుని భుజంపై కూర్చుని ఎడమవైపు లక్ష్మీదేవిని కూర్చుండబెట్టుకొని ఎనిమిది చేతులతో దర్శనమిస్తాడు.
చెన్నై నగరంలో పార్ధసారధి స్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది విశిష్టమైనది కూడా. ఇక్కడి స్వామి వారి రూపం సాధారణంగా కనిపించే కృష్ణ వంటిది కాదు. స్వామి వారు ఇక్కడ మీసాలతో దర్శనమిస్తారు. ఆగమ శిల్ప శాస్త్రాలలో ఎక్కడా కూడా దేవతలకు గడ్డం మీసం మొదలైనవి కనబడకపోగా ఇక్కడి స్వామి మీసాల కృష్ణుడిగా ప్రసిద్ధుడు. ఈ స్వామిని దర్శిస్తే అన్ని భయాలు తొలగి సకల ఐశ్వర్యాలు కలుగుతాయని ప్రతీతి.
– డాక్టర్ ఛాయా కామాక్షీదేవి