
ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జాతీయస్థాయి అవార్డుకు ఎంపికై ఈ రోజు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్న ఆశారాణి
గురుబ్రహ్మ.. గురువిష్ణు.. గురుదేవో మహేశ్వరః త్రిమూర్తుల అంశతో వెలిగే జ్ఞానజ్వాల గురువు. లోకంలో ప్రతిఫలించే ఈ వెలుగంతా గురువుల నుంచి ప్రజ్వరిల్లుతున్నదే. అక్షరాల్ని దిద్దించడమే కాదు, జీవితాన్ని కూడా పక్కన ఉండి శ్రద్ధగా దిద్దుతారు గురువులు. అలాంటి ఒక గురువు సర్వేపల్లి రాధాకృష్ణన్. అలాంటి వెలుగుల వర్ణాలే ఆయన దిద్దివెళ్లిన విలువలు. నేడు ఆయన జన్మదినం. ఉపాధ్యాయ దినోత్సవం. ఈ సందర్భంగా.. మట్టిలోంచి ఒక గాయనిని మొలకెత్తించిన ‘గురుకోటి’, విశ్వాంతరాళాలపై చిన్నారులకు ఆసక్తి కలిగిస్తున్న ‘గురుకృష్ట’, అత్యుత్తమమైన ఒక టీచర్ని మలిచిన ‘గురుభువనేశ్వర’.. ఈ ముగ్గురు గురువుల, వారి వల్ల కాంతులీనుతున్న మూడు దివ్వెల వెలుగు కిరణాలివి.
‘ఓ సిరా చుక్క లక్ష మెదళ్ల కదలిక’– కాళోజీ కొటేషన్ లైబ్రరీలో ఒక వైపు గోడ మీద ఉంది. మరోవైపు ‘టు డే ఏ రీడర్, టుమారో ఏ లీడర్’ అని ఉంది. అది హైదరాబాద్ నగర శివారులో జీడిమెట్ల గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ హైస్కూలు. మరొక గోడకు ఉన్న ఫొటోలు తోలుబొమ్మలాటల్లో ఎన్ని రకాలున్నాయో చెప్తున్నాయి. మరో వైపు రకరకాల సంగీత వాయిద్యాలను పలికిస్తున్న వాద్యకారుల ఫొటోలు. బయటి ప్రపంచాన్ని బడి నాలుగు గోడల మధ్య ఉండగానే తెలియచేసే ప్రయత్నం అది. ఇక లైబ్రరీలో ఆరు రౌండ్ టేబుళ్లు, వాటి మీద కథల పుస్తకాలున్నాయి. బీరువాల్లో చక్కగా అమర్చిన మరెన్నో పుస్తకాలు... ఆ బీరువాలకు తాళాలు లేవు. ఈ లైబ్రరీని నిర్వహిస్తున్నది ఆ స్కూలు పిల్లలే. పిల్లలు తమకు కావల్సిన పుస్తకం తీసుకుని, ఓసారి టీచరుకు చూపించి, వాళ్లే రిజిస్టర్లో రాసి ఆ పుస్తకాన్ని ఇంటికి పట్టుకెళ్తారు. చదివి తెచ్చిన తర్వాత బీరువాలో పెట్టి రిజిస్టర్లో తేదీని నమోదు చేస్తారు. ఇక్కడ ఇలా ఉంటే, స్కూలు భవనానికి పక్కనే ఉన్న గదిలో మధ్యాహ్న భోజన పథకంలో వండిన భోజనాన్ని హెడ్ మాస్టర్ పరీక్షిస్తున్నారు. ‘‘ఇంత బిరుసుగా ఉంటే పిల్లలు తినేదెలా? మళ్లీ వండమ్మా’’ అని చెప్పి బయటికొచ్చి ‘‘అన్నం ఉడుకుతోంది. ఓ పది నిమిషాలు ఆగండర్రా’’ అని పిల్లలకు చెప్పి తన గదిలోకి వెళ్లిపోయారు. టీచర్లు బాధ్యతగా ఉండడం వల్లనే, అది పిల్లలకు కూడా అలవడింది. ‘‘మా స్కూల్లో ప్రతిదీ ఇంత పర్ఫెక్ట్గా ఉంటుంది. టీచర్లందరం ఇంతటి అంకితభావంతోనే పనిచేస్తాం’’ అన్నారు ఆ స్కూల్ ఇంగ్లిష్ టీచర్ ఆశారాణి. ఈ ఏడాది ఉత్తమ ఉపాధ్యాయురాలిగా జాతీయస్థాయి అవార్డుకు ఎంపికయ్యారామె. టీచర్స్ డే సందర్భంగా ఈ రోజు న్యూఢిల్లీలో రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు అందుకోనున్నారు.
ఆశారాణిది శ్రీకాకుళం జిల్లా, టెక్కలి మండలం, సీతాపురం గ్రామం. తండ్రి అప్పారావు మిలటరీ ఉద్యోగి, తల్లి సరస్వతి గృహిణి. ముగ్గురమ్మాయిల్లో ఆశారాణి పెద్దమ్మాయి. తండ్రి ఉద్యోగరీత్యా జమ్మూ–కశ్మీర్లో ఉండడంతో ఆమె ప్రాథమిక విద్యాభ్యాసం టెక్కలిలో అమ్మమ్మగారింట్లోనే పూర్తయింది. తండ్రికి బెంగళూరు ట్రాన్స్ఫర్ కావడంతో కుటుంబం బెంగళూరుకు మారింది. అక్కడ తెలుగు మీడియం ఉన్న ప్రభుత్వ పాఠశాలను వెతికి మరీ చేర్పించారాయన. ఆ సంగతులను సాక్షితో పంచుకున్నారు ఆశారాణి. ‘‘మొదటగా మా నాన్నకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆయన ఫ్రెండ్స్ నీకు మూడు ‘మైనస్’లు అని ఆటపట్టిస్తున్నా, ఆయన మాత్రం తనకు అబ్బాయిలు లేరని ఏనాడూ అసంతృప్తి చెందలేదు. పైగా తన ట్రాన్స్ఫర్లు మా చదువులకు ఇబ్బంది కలిగించకుండా, తెలుగు మీడియం ఉండే విధంగా చూసుకున్నారు. బెంగళూరు తర్వాత ఉద్యోగం పోర్ట్బ్లెయిర్ (అండమాన్ నికోబార్ దీవుల రాజధాని)లో. నాకు ప్లస్ టు పూర్తయ్యే వరకు అక్కడే ఉన్నారు. మిలటరీ క్వార్టర్స్లో పెరగడంతో తమిళ, కన్నడ, మలయాళీ, ఉత్తరాది భాషలన్నింటితోనూ పరిచయం ఉండేది. పైగా పెద్ద వాగుడుకాయని కూడా. అలాంటిది కాలేజ్కొచ్చిన తర్వాత గొంతు పెగిలేది కాదు.
ఇంగ్లిష్ భయంతో క్లాస్ ఎగ్గొట్టాను
ప్లస్ టులో మంచి ర్యాంక్ రావడంతో భువనేశ్వర్లోని రీజనల్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో సీటు వచ్చింది. అది బిఏ, బిఈడీ కలిసిన నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సు. పూర్తిగా ఇంగ్లిష్ మీడియం. అర్థం చేసుకోగలిగినా సరే, ధైర్యంగా మాట్లాడలేకపోయేదాన్ని. టీచింగ్ క్లాసులంటే చచ్చేంత భయం వేసేది. కడుపు నొప్పి అని ఒకరోజు, తలనొప్పి అని ఒకరోజు క్లాసులు ఎగ్గొట్టాను కూడా. అలాంటిది నేను ఇంగ్లిష్ టీచర్నయ్యానంటే మా ఫ్రెండ్స్ ఇప్పటికీ ఏడిపిస్తుంటారు.
ఆర్మీ స్కూల్లో తొలి ఉద్యోగం
నాన్న రిటైరైన తర్వాత మా కుటుంబం హైదరాబాద్కొచ్చింది. నేను ఉస్మానియాలో ఎం.ఎ హిస్టరీలో చేరాను. పీజీ పూర్తయ్యాక ఆర్మీ స్కూల్కి ఇంటర్వ్యూకెళ్లడం ఒక పాఠమే అయింది. ఉద్యోగం వచ్చింది కానీ సెకండ్ క్లాస్ టీచర్గా. నాకు బీఎడ్ ఉంది, పీజీ ఉంది, పెద్దక్లాసు ఇవ్వడానికి అన్ని అర్హతలూ ఉన్నాయి. అయితే ఇంగ్లిష్ అనర్గళంగా మాట్లాడలేకపోవడం వల్లనే అలా జరిగింది. అయితే అక్కడి పిల్లలతో మాట్లాడి, మాట్లాడి నాకు ఇంగ్లిష్ వచ్చేసింది. తర్వాత 1994లో డిఎస్సి రాసి సెలెక్ట్ అయ్యాను. శంకర్పల్లి మండలంలోని సంకేపల్లిలో పోస్టింగ్. ఐదు తరగతులున్న పాఠశాలకు ఇద్దరే టీచర్లం. తర్వాత రెండేళ్లకు మోఖిలాలోని అప్పర్ ప్రైమరీ స్కూల్కి బదిలీ. అక్కడ పెద్ద క్లాస్లకు ఇంగ్లిష్ చెప్పగలిగిన లాంగ్వేజ్ స్కిల్ ఉన్న వాళ్లలో నేనే బెటర్ అయ్యాను. అలా నా ప్రమేయం లేకుండా ఇంగ్లిష్ టీచర్నయ్యాను. యూనిసెఫ్ ప్రోగ్రామ్లో భాగంగా న్యూయార్క్ నుంచి డాక్టర్ కెరోల్ బెలోమీ మా స్కూలుకి వచ్చారు. ఆమెతో ఇంటరాక్ట్ అయ్యి, ట్రాన్స్లేటర్గా వ్యవహరించడం ఊహించని అవకాశం. ఆ టాస్క్ని విజయవంతంగా చేయగలిగినా సరే... ఎందుకో అసంతృప్తిగా అనిపించేది. దాంతో ఇంగ్లిష్లో ఎం.ఎ చేశాను. ఇంగ్లిష్ ఎం.ఏ ఎన్నో అవకాశాలను నా ముందుకు తెచ్చింది’’ అన్నారు ఆశారాణి.
పిల్లలకు ఎల్లలు ఉండకూడదు
2017లో కాలిఫోర్నియాలో ‘టీచింగ్ ఎక్స్లెన్స్ అండ్ అచీవ్మెంట్ ప్రోగ్రామ్’లో పాల్గొన్నారు ఆశారాణి. ఆరు వారాల పాటు అక్కడి స్కూల్స్ని విజిట్ చేయడం, మన విద్యావిధానంలోకి తీసుకోగలిగిన మంచి విధానాలను గుర్తించడం, మన దేశ కల్చర్ గురించి అక్కడి పిల్లలకు తెలియచేయడం ఆ ప్రోగ్రామ్ ఉద్దేశం. మన దగ్గర గవర్నమెంట్ స్కూల్స్లో ప్రొజెక్టర్ ఉండదని తెలుసుకున్న కాలిఫోర్నియా పిల్లలు వాళ్ల దగ్గర అదనంగా ఉన్న ప్రొజెక్టర్ని మనకు బహూకరించారు. ఆశారాణికి ఆ ప్రోగ్రామ్కు హాజరైన ఇరవై దేశాల టీచర్లతో పరిచయం అయింది. ఆ టీచర్ల సహకారంతో కజకిస్తాన్, నేపాల్ దేశాల పిల్లలను స్కైప్లో నేరేడ్మెంట్ స్కూల్ పిల్లలకు పరిచయం చేశారు. ‘‘భాష, ప్రాంతం, దేశం అనే ఎల్లలు లేకుండా పిల్లలు యూనివర్సల్గా పెరగాలి. జ్ఞానం ఎక్కడ ఉన్నా సరే ఆ జ్ఞానాన్ని అందుకోవడానికి పిల్లలే వారధులు కాగలగాలి’’ అన్నారామె.
ఆ కాలేజే నడిపించింది
ఇంగ్లిష్ టీచర్గా కుత్బుల్లాపూర్, శంకరపల్లిలోని ప్రొద్దుటూరుతోపాటు ఈ స్కూల్లో (జీడిమెట్ల స్కూలు) ఐదేళ్లు చేశాను. 2009 నుంచి 2018 వరకు నేరేడ్మెట్ స్కూల్లో పని చేసి మళ్లీ ఇక్కడికి వచ్చాను. అప్పుడు నా దగ్గర చదువుకున్న పిల్లలు పెద్దయి ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నేను వచ్చానని తెలిసి స్కూలుకి వచ్చి పలకరిస్తుంటారు. ఒకసారి పనిచేసిన స్కూల్కి మళ్లీ వస్తే స్వీట్ మెమొరీ అవుతుందని వచ్చిన తర్వాతే తెలిసింది. వృత్తికి అంకితమై పోయి, పిల్లలతో మమేకం అవడాన్ని భువనేశ్వర్ కాలేజ్ నేర్పించింది. కేంద్రీయ, నవోదయ విద్యాలయాల్లో టీచర్లలో ఎక్కువ మంది ఆ కాలేజ్ వాళ్లే ఉంటారు. నేను జూనియర్ లెక్చరర్గా వెళ్లకుండా గవర్నమెంట్ స్కూలు పిల్లలకు చదువు చెప్పాలని నిర్ణయించుకోవడం వెనుక ఉన్నది కూడా మా కాలేజ్ నేర్పించిన సామాజిక బాధ్యతే. మా స్కూళ్లలో చాలామంది పిల్లలకు... తల్లిదండ్రులు హయ్యర్ స్టడీస్ గురించి గైడెన్స్ ఇవ్వగలిగిన స్థితిలో ఉండరు. దాంతో ఆ బాధ్యత కూడా మేమే తీసుకోవాలి. టీచర్ బాధ్యత పిల్లలకు చదువు చెప్పడంతో పూర్తి కాదు, మంచి పౌరులుగా తీర్చిదిద్దడానికి వాళ్ల మీద ప్రభావం చూపించాలి. అందుకే నేను ఉపాధ్యాయ వృత్తిని అంతగా ఆరాధిస్తాను.– ఆశారాణి, ఉత్తమ ఉపాధ్యాయిని
ఆశారాణికి ఉపాధ్యాయినిగా ఇరవై నాలుగేళ్లు నిండాయి. పిల్లలకు పాఠాలతోపాటు పదిహేడేళ్లు టీచర్లకు ట్రైనింగ్ ఇచ్చారామె. 1997లో ఢిల్లీలోని సీసీఆర్టీలో తోలు బొమ్మలతో పాఠాలు చెప్పడంలో శిక్షణ పొందిన ఆశారాణి ప్రైమరీ స్కూలు పిల్లలకు బొమ్మలతో పాఠాలు చెప్పేవారు. ‘‘అంకితభావంతో పని చేస్తే ఫలితాలు తప్పకుండా కనిపిస్తాయి. టీచర్కి ప్రొఫెషన్ మీదున్న నిబద్ధత పిల్లల ఫలితాల్లో కనిపిస్తుంది. పాఠాలు చెప్పేసి ఉద్యోగం అయిపోయిందనుకోకుండా ఇన్నేసి బాధ్యతలను తలకెత్తుకోవడానికి నేను సింగిల్ కావడం కూడా ఒక కారణం కావచ్చు’’ అన్నారామె నవ్వుతూ.– వాకా మంజులారెడ్డిఫొటోలు: దత్తు గుంటుపల్లి
Comments
Please login to add a commentAdd a comment