
మహబూబ్ బాషా
‘‘కాంతం, నాకు ఛాతిలో నొప్పిగా అన్పిస్తే డాక్టర్ దగ్గరికెళ్లాను. ఈసీజీ, స్కానింగ్, బ్లడ్ టెస్టులు చెయ్యాలన్నాడు. దానికో రెండు వేలు కావాలి, ఇస్తావా?’’ భార్యను వేడుకుంటూ అడిగాడు రాంబాబు.మీకున్న నొప్పి ఏమిటో నాకు బాగా తెలుసు. ఒక్కరోజు తాగకపోతే మీకు ఒళ్లంతా నొప్పులొస్తాయి. అయినా ప్రతి దానికి భార్య ముందు చెయ్యి చాపటానికి మీకు సిగ్గు లేదూ? ఇక నుంచి దేనికీ డబ్బు అడక్కండి. ఏదోఒక ఉద్యోగం వెదుక్కొని మీ అవసరాలు మీరే తీర్చుకోండి’’ నిష్ఠూరంగా అనేసి వంటింట్లోకి వెళ్లిపోయింది కాంతం.భార్య ధోరణి చూసి రాంబాబుకి కడుపు మండింది. అప్పటికప్పుడే ఆమె గొంతు పిసికి చంపెయ్యాలన్నంత కోపమొచ్చింది. కానీ గత్యంతరం లేక కోపాన్ని దిగమింగుకున్నాడు.ఏడాది క్రితం ఉద్యోగంలోంచి డిస్మిస్ అయ్యేవరకు రాంబాబు రాజాలా బతికాడు. పోలీస్ ఇన్స్పెక్టర్గా ఉద్యోగం చేస్తూ రెండు చేతులా సంపాదించేవాడు. విచ్చలవిడిగా డబ్బు ఖర్చుపెట్టేవాడు. రోజూ రాత్రి మందు కొట్టేవాడు. ఇంట్లో అందమైన భార్య ఉన్నా కొత్తదనం కోసం బయట కాల్గర్ల్స్తో మజా చేసేవాడు. కానీ ఏడాది క్రితం లంచం తీసుకుంటూ ఎసీబీకి పట్టుబడి ఉద్యోగం పోగొట్టుకున్నాడు. అప్పటి నుంచి అతని విలాసాలకు బ్రేక్ పడింది.
కానీ అలవాటు పడిన ప్రాణం ఎలా ఊరుకుంటుంది? విలాసాల కోసం కొన్నాళ్లు అప్పులు చేశాడు. తర్వాత అప్పుపుట్టకపోవడంతో భార్య ముందు చెయ్యిచాపాడు. కాంతం తల్లిదండ్రులు రెండేళ్ల క్రితం కారు ప్రమాదంలో మరణించారు. కాంతంకి తోబుట్టువులెవరూ లేకపోవడంతో తండ్రి యావదాస్తి ఆమెకే వచ్చింది. భర్త ఉద్యోగం పోయాక ఇంటి ఖర్చులన్నీ తనే భరిస్తోంది. అప్పుడప్పుడు రాంబాబు జేబు ఖర్చులకు కూడా కొంత డబ్బు ఇస్తోంది. కానీ అతని విలాసాలకు చిల్లిగవ్వ ఇవ్వటం లేదు. ఏదైనా ఉద్యోగం చేసి సంపాదించమంటోంది.కానీ అవినీతి ముద్ర పడిన రాంబాబుకి ఉద్యోగం ఎవరిస్తారు? వ్యాపారం చెయ్యాలన్నా దానికి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాలి. సవాలక్ష దురలవాట్లున్న భర్త కోసం పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం కాంతంకి ఇష్టం లేదు.
ఇదే కారణం వల్ల రాంబాబు భార్యపై ద్వేషం పెంచుకున్నాడు. తన సమస్యలన్నీ తీరాలంటే కాంతంని అడ్డు తొలగించుకోవటమొక్కటే మార్గమనుకున్నాడు. కాంతం చనిపోతే ఆమె పేరిట వున్న ఆస్తిపాస్తులన్నీ తనకొచ్చేస్తాయి. అప్పుడు ఉద్యోగం లేకపోయినా జీవితాంతం జల్సాగా బతకొచ్చనుకున్నాడు. ఈ విషయం గురించి బుర్రకి పదును పెట్టి దీర్ఘంగా ఆలోచించాడు. తన సర్వీసులో చూసిన రకరకాల కేసుల్ని గుర్తుకు తెచ్చుకున్నాడు.మొత్తానికి భార్యను చంపటానికి నాలుగు మార్గాలు కన్పించాయి రాంబాబుకి. 1. అనారోగ్యం, 2.ప్రమాదం, 3.ఆత్మహత్య, 4 హత్య!తొలి పద్ధతి ఏమంటే కాంతంని విషప్రయోగంతో చంపి దాన్ని గుండెపోటు మరణంగా చూపాలి. కానీ కాంతం వయసు ముప్ఫై ఐదేళ్లే! ఇంత చిన్న వయసులో ఆమెకు ఎటాక్ వచ్చిందంటే ఎవరూ నమ్మరు గనుక ఆ ఆలోచన విరమించుకున్నాడు రాంబాబు.
కాంతంని కరెంట్ షాక్తో లేదా గ్యాస్ సిలిండర్ పేల్చటం ద్వారా హతమార్చి దాన్ని ప్రమాదంగా చిత్రించటం రెండో పద్ధతి. కానీ ఆమె చావకుండా గాయాలతో బయటపడితే తన గుట్టు రట్టవుతుందని భయపడ్డాడు. ఇక మూడో ప్లాన్ ప్రకారం కాంతం చేత అధిక మోతాదులో బలవంతంగా నిద్రమాత్రలు మింగించి చంపి దాన్ని ఆత్మహత్యగా చూపించాలి. కానీ కాంతంకి ఆత్మహత్య చేసుకోవాల్సినన్ని తీవ్ర సమస్యలేం లేవు. అందువల్ల పోలీసులు తనని అనుమానించవచ్చు. అందుకే ఆ ప్రయత్నం కూడా మానుకున్నాడు.ఇక నాలుగో ప్లాన్ ప్రకారం భార్యను ‘హత్య’ చెయ్యటమొక్కటే సరైన మార్గమనుకున్నాడు రాంబాబు. తను ఊర్లో లేనప్పుడు అర్థరాత్రి పూట తన ఇంట్లో దూరిన దొంగ ఒంటరిగా ఉన్న కాంతాన్ని చంపి దోపిడీ చేసి పారిపోతాడు. ఇలా జరిగితే తనని పోలీసులు అనుమానించరు. కాకపోతే ఈ పని కోసం ఓ కిరాయి హంతకుణ్ని నియమించాల్సి వుంటుంది. వృత్తిరీత్యా గతంలో రాంబాబుకి కొందరు కిరాయి హంతకులతో పరిచయముంది. ఇలాంటి హత్యల్ని వారు చిటికెలో చెయ్యగలరు.
కానీ ఈ పనిలో మరొకర్ని వాడుకోవడం రాంబాబుకి ఇష్టం లేదు. కిరాయి హంతకుడు ఏ చిన్న తప్పు చేసినా తన మెడకు చుట్టుకుంటుంది. ఒకవేళ అతను తప్పు చెయ్యకుండా పని ముగించినా తర్వాత తనని జీవితాంతం బ్లాక్మెయిల్ చెయ్యవచ్చు. అందువల్ల ఈ హత్య తనే చెయ్యాలనుకున్నాడు. కానీ ఒకే సమయంలో ఓ చోట హత్య చేసి మరో చోట తను వున్నట్లు ‘ఎలిబీ’ ఎలా సృష్టించుకోవాలి? అని చాలాసేపు దీర్ఘంగా ఆలోచించాక రాంబాబు బుర్రలో ఓ పథకం రూపుదిద్దుకుంది.కొద్దిరోజుల్లో ఆ పథకాన్ని అమలు చేసే అవకాశం కూడా వచ్చింది. ఓ దూరపు బంధువుల పెళ్లికి రమ్మని ముంబై నుంచి రాంబాబు దంపతులకు ఆహ్వానం వచ్చింది. కానీ కాంతం తను రాలేనని చెప్పి భర్తను ఒంటరిగానే వెళ్లమంది. రాంబాబు కోరుకున్నది కూడా అదే.
అతను హైదరాబాద్ నుంచి ముంబై వెళ్లే చార్మినార్ ఎక్స్ప్రెస్లో ముందే రిజర్వేషన్ చేయించుకొని శనివారం రాత్రి ట్రైనెక్కాడు. ఆ బోగీలో పెద్దగా జనం లేరు. రైలు నగరం దాటగానే రాంబాబు టాయిలెట్లోకి దూరి తన వేషం మార్చుకున్నాడు. ముఖానికి నకిలీ గడ్డం, మీసాలు తగిలించుకొని వేరే దుస్తులు, బూట్లు ధరించాడు. విడిచిన బట్టలు సూట్కేసులో వేసుకున్నాడు. తర్వాత తన ఫోన్ని స్విచాఫ్ చేసి ఓ స్టేషన్లో దిగిపోయాడు. అక్కడి నుంచి మరో ట్రైన్లో హైదరాబాద్కి తిరిగొచ్చాడు. ఓ ఆటో ఎక్కి తన ఇంటికి సమీపంలో దిగాడు.అప్పుడు సమయం అర్ధరాత్రి కావస్తోంది. రోడ్లన్నీ నిర్మానుష్యంగా ఉన్నాయి. అతను కాలినడకన తన ఇంటికి చేరుకున్నాడు. పెరట్లో వున్న పెంపుడు కుక్క యజమాని వాసనని గుర్తు పట్టింది. అందుకే మొరగలేదు. రాంబాబు సూట్కేసులోంచి విషం బిస్కెట్లు తీసి కుక్కకు తిన్పించి దాన్ని చంపేశాడు. తర్వాత పెరటి వాకిలి తెరిచి ఇంట్లోకి ప్రవేశించాడు.
నెట్టగానే తెరుచుకొనేలా అంతకు ముందే అతను పెరటివాకిలి బోల్టులు లూజ్గా చేసి ఉంచాడు. రాంబాబు ఇంట్లోకి ప్రవేశించాక చప్పుడు కాకుండా బెడ్రూం దగ్గరికెళ్లి లోపలికి తొంగి చూశాడు. మంచంపైన కాంతం ఆదమరచి నిద్రపోతోంది. రాంబాబు చేతులకు గ్లౌజులు ధరించి మంచాన్ని సమీపించాడు. ఓ తలగడను కాంతం ముఖంపై వుంచి బలంగా అదిమిపెట్టాడు. ఊపిరాడక కాంతం కాళ్లు చేతులు కొట్టుకుంది. రాంబాబు పట్టు వదల్లేదు. కాసేపట్లో కాంతంలో చలనం ఆగిపోయింది.రాంబాబు వెంటనే కాంతం ఒంటి మీది నగలతో పాటు ఇనుప పెట్టెలోని డబ్బు తీసుకొని తన బ్యాగులో వేసుకున్నాడు. గదిలో దోపిడీ జరిగిన వాతావరణం సృష్టించి వచ్చిన దారిలోనే ఇంట్లోంచి బయటపడ్డాడు. కన్పించిన ట్యాక్సీ ఎక్కి నేరుగా ఎయిర్పోర్టుకు చేరుకున్నాడు. మారు పేరుతో అంతకు ముందే బుక్ చేసిన టికెట్తో ముంబై ఫ్లైట్ ఎక్కాడు. చార్మినార్ ఎక్స్ప్రెస్ ముంబైకి చేరుకునే సమయానికల్లా ముంబైలో ఫ్లైట్ దిగాడు. ఎయిర్పోర్ట్ బయట ఓ నిర్జన ప్రదేశంలో మారువేషం తీసేసి మునుపటి దుస్తులు ధరించాడు. ట్యాక్సీలో పెళ్లి జరిగే చోటుకి చేరుకున్నాడు. అక్కడ తన సెల్ఫోన్ స్విచాన్ చేసి భార్య నంబర్కి డయిల్ చేశాడు. అతనూహించినట్లే ఎవరూ ఫోన్ లిఫ్ట్ చెయ్యలేదు.
ఆ తర్వాత అంతా రాంబాబు అనుకున్నట్లే జరిగింది. ఉదయం రాంబాబు ఇంటికొచ్చిన పని మనిషి జరిగింది చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించాక అది దోపిడీ కోసం జరిగిన హత్యగానే భావించారు. పోలీసులు ఫోన్ చేసి చెప్పగానే రాంబాబు ముంబై నుంచి వెంటనే ట్యాక్సీలో హైదరాబాద్కి తిరిగొచ్చాడు. తను ఊర్లో లేనందువల్లే ఈ ఘోరం జరిగిందని మొసలికన్నీరు కారుస్తూ పోలీసులకు స్టేట్మెంట్ ఇచ్చాడు. హత్య జరిగిన సమయంలో రాంబాబు ప్రయాణంలో వున్నట్లు స్పష్టమైన ఆధారాలుండటంతో పోలీసులు అతన్ని అనుమానించలేదు. రాంబాబు నిశ్చింతగా ఊపిరి పీల్చుకున్నాడు.కానీ ఒక్కరోజులో అంతా తారుమారైంది. భార్యను హత్య చేసినందుకు రాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. తప్పు ఎక్కడ జరిగిందో ఎంత ఆలోచించినా రాంబాబుకి అంతుపట్టలేదు.
చివరికి ఇన్స్పెక్టర్ విజయ్ ఆ గుట్టు విప్పాడు. ‘‘గతంలో నువ్వొక పోలీస్ ఆఫీసర్వి గనుక ఎంతో తెలివిగా నీ భార్యను చంపి అదే సమయంలో నువ్వు ట్రైన్లో ప్రయాణిస్తున్నట్లు ఎలిబీ సృష్టించుకున్నావ్. కానీ నువ్వు తప్పు చెయ్యకపోయినా నువ్వెక్కిన ట్రైన్ తప్పు చేసింది. సగం దారిలో అది పట్టాలు తప్పింది. దాంతో నీ ప్లాన్ కూడా పట్టాలు తప్పింది. ఆ సంగతి తెలియక నువ్వు రాత్రంతా ట్రైన్లో ప్రయాణించి ఉదయాన్నే ముంబైకి చేరుకున్నానని స్టేట్మెంట్ ఇచ్చేశావ్. కానీ ఆ ట్రైన్ పది గంటలు ఆలస్యంగా ముంబైకి చేరింది. నీ లొకేషన్ తెలియకూడదని నువ్వు తెలివిగా నీ ఫోన్ని స్విచాఫ్ చేశావ్. కనీసం ఫోన్ ఆన్ చేసిన తర్వాతైనా నెట్లో చూసి ఉంటే ట్రైన్ ఆగిన సంగతి నీకు తెల్సి ఉండేది. మొత్తం మీద నీ నిర్లక్ష్యమే నిన్ను చట్టానికి పట్టించింది.’’ అన్నాడు ఇనస్పెక్టర్ విజయ్. ఇన్స్పెక్టర్ మాటలకు రాంబాబు అసహనంగా జుట్టు పీక్కున్నాడు. ‘‘వెధవ ట్రైన్లు ఎప్పుడూ ఇంతే... ఈ దేశం ఎప్పుడు బాగుపడుతుందో..’’ అని కోపంగా గొణుక్కున్నాడు.
ఇంత చిన్న వయసులో ఆమెకు ఎటాక్ వచ్చిందంటే ఎవరూ నమ్మరు గనుక ఆ ఆలోచన విరమించుకున్నాడు రాంబాబు. కాంతంని కరెంట్ షాక్తో లేదా గ్యాస్ సిలిండర్ పేల్చటం ద్వారా హతమార్చి దాన్ని ప్రమాదంగా చిత్రించటం రెండో పద్ధతి.
Comments
Please login to add a commentAdd a comment