హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సోదరి వైఎస్ షర్మిల వరంగల్ జిల్లాలో చేపట్టిన రెండోదశ పరామర్శయాత్ర రెండో రోజు కొనసాగుతోంది. యాత్రలో భాగంగా మంగళవారం మహబూబాబాద్ నియోజక వర్గంలోని ఏడు కుటుంబాలను షర్మిల పరామర్శిస్తారు. తొర్రూరు నుంచి ప్రారంభమైన యాత్రలో మొదటగా నెల్లికుదురు మండలం ఎర్రబెల్లి గూడెం లోని కమ్మజర్ల సాయమ్మ కుటుంబాన్ని షర్మిల పరామర్శించారు. వారి బాగోగులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం తార్సింగ్ బాయితండాలోని గుగులోత్ బబ్బి కుటుంబాన్ని కలుసుకుంటారు. అక్కడ నుంచి చిన్నముప్పారంలో కె.వెంకట్రాం నర్సయ్య కుటుంబాన్ని పరామర్శిస్తారు. అనంతరం మహబూబాబాద్ చేరుకుని పట్టణంలోని కరయ్య కుటుంబాన్ని ఓదార్చుతారు. అనంతరం అదే మండలంలోని గాంధీపురం గ్రామానికి చెందిన షేక్ బికారి కుటుంబానికి భరోసా ఇచ్చి, బ్రాహ్మణపల్లి లక్ష్మీపురంలోని ఆలకుంట్ల లక్ష్మయ్య కుటుంబాన్ని ఓదార్చుతారు. చివరగా గూడూరు మండలం ఊట్లలోని సబావట్ మంగమ్మ కుటుంబాన్ని పరామర్శిస్తారు. మంగళవారం పరామర్శ యాత్రలో భాగంగా షర్మిల 119.5 కిలోమీటర్లు ప్రయాణించనున్నారు.