
క్యాబ్లు బంద్...
తమ సమస్యలు వివరించేందుకు ఓలా క్యాబ్ సంస్థకు వెళితే బౌన్సర్లతో క్యాబ్ డ్రైవర్లపై దాడి చేయించినందుకు నిరసనగా శుక్రవారం అర్ధరాత్రి నుండి జనవరి 4
- తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్– ఓనర్స్ అసోసియేషన్ పిలుపు
- శుక్రవారం అర్థరాత్రి నుంచి నిలిచిపోయిన సేవలు
హైదరాబాద్: తమ సమస్యలు వివరించేందుకు ఓలా క్యాబ్ సంస్థకు వెళితే బౌన్సర్లతో క్యాబ్ డ్రైవర్లపై దాడి చేయించినందుకు నిరసనగా శుక్రవారం అర్ధరాత్రి నుండి జనవరి 4 వరకు రాష్ట్ర వ్యాప్తంగా క్యాబ్ల బంద్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ క్యాబ్స్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఉల్కుందకోర్ తెలిపారు. అసోసియేషన్లో ఉన్న ఏడు వేల మందితో పాటు అన్ని సం ఘాల క్యాబ్ డ్రైవర్స్, ఓనర్స్ కూడా బంద్ లో పాల్గొంటారన్నారు. శుక్రవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరులతో శివ మాట్లాడుతూ.. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పిస్తామని ఓలా, ఉబర్ కార్పొరేట్ సంస్థలు ప్రకటనలు చేసి నెలకు రూ.70 వేల నుండి రూ.లక్ష సంపాదించవచ్చని నమ్మబలికి ఈఎంఐ పద్ధతిలో కార్లు కొనేలా చేశారన్నారు.
లక్ష మంది వరకు ఈ సంస్థల్లో డ్రైవర్లుగా కొనసాగుతున్నారని, తమకు సరి పడా వ్యాపారం ఇవ్వకుండా రోజుకో కొత్త స్కీం పెట్టి మానసిక వేదనకు గురిచేస్తు న్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం కుటుంబాన్ని పోషించుకోలేక, ఈఎంఐలు కట్టలేక అవస్థలు పడుతున్నామన్నారు. ఎన్నోసార్లు ఆయా సంస్థల యాజమాన్యాల కు విన్నవించినా స్పందించలేదన్నారు. వెంటనే తమ సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనిల్ కుమార్గౌడ్, ఉపాధ్యక్షులు సర్వేష్, రెడ్డి శ్యామ్, సురేష్, ప్రధాన కార్యదర్శి సత్య నారాయణ, పాల్గొన్నారు.