హైకోర్టునే మోసగించే కుట్ర
- లేని వ్యక్తుల పేర్లతో భూమిని కాజేసేందుకు దీపక్రెడ్డి, సక్సేనా యత్నం
- వరుసగా తప్పుడు పిటిషన్లు దాఖలు
- అనుమానంతో వారి హాజరుకు కోర్టు ఆదేశం
- వారెవరూ రాకపోవడంతో మోసం గ్రహించిన హైకోర్టు
- 14 పిటిషన్ల కొట్టివేత.. సక్సేనాపై ఫిర్యాదు చేయాలని ఆదేశం
సాక్షి, హైదరాబాద్: విలువైన భూములు కాజేసేందుకు ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ దీపక్రెడ్డి, ఆయన అనుచరుడు బి.శైలేష్ సక్సేనాల బండారం హైకోర్టు సాక్షిగా బట్టబయలైంది. లేని వ్యక్తుల పేర్లను తెరపైకి తీసుకొచ్చి, వారి పేర్లతో తప్పుడు పిటిషన్లు వేసి నడిపించిన కుట్ర భగ్నమైంది. దీపక్రెడ్డి, సక్సేనాల చర్యలపై సందేహం వచ్చిన హైకోర్టు.. భూము ల హక్కుదారులుగా పిటిషన్లు వేసిన వారిని స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించింది. వారెవరూ కోర్టు ఎదుట హాజరు కాకపోవడంతో ఇదంతా మోసమని గ్రహించి.. లేని వ్యక్తుల పేర్లతో దాఖలైన 14 పిటిషన్లను కొట్టివేసింది. తప్పుడు పిటిషన్లు దాఖలు చేసిన సక్సేనాపై పోలీసులకు ఫిర్యాదు చేయా లని రిజిస్ట్రార్ (జ్యుడీషియల్) వెంకటేశ్వర రెడ్డిని ఆదేశించింది. ఈ కేసులకు సంబంధిం చిన ఫైళ్లు మాయమైపోవడంలో హైకోర్టు సిబ్బంది ప్రమేయంపైనా విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రామలింగేశ్వర రావు మంగళవారం తీర్పు వెలువరించారు.
విలువైన భూములపై కన్ను
హైదరాబాద్లోని గుడిమల్కాపూర్, భోజగుట్ట ప్రాంతంలోని భూమిని ప్రభుత్వం అయోధ్య నగర్ మ్యూచువల్ ఎయిడెడ్ కో–ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్కి కేటాయిస్తూ 2008లో జీవో 455 జారీ చేసింది. అయితే ఆ భూమిపై కన్నేసిన దీపక్రెడ్డి, సక్సేనాలు.. కాజేసేందుకు కుట్రకు తెరలేపారు. ఆ భూమి అసలు యజ మాని జస్టిస్ సర్దార్ అలీఖాన్ వారసులంటూ ఇక్బాల్ ఇస్లాంఖాన్, నజీముద్దీన్ ఇస్లాంఖాన్, హబీద్ ఇస్లాంఖాన్, ఇప్తేకర్ ఇస్లాంఖాన్, షకీల్ ఇస్లాంఖాన్ పేర్లతో కొందరిని తెరపైకి తెచ్చా రు. శివభూషణం అనే వ్యక్తిని ఇక్బాల్ ఇస్లాం ఖాన్గా నటించేందుకు ఒప్పించి.. భోజగుట్ట భూమికి సంబంధించి భూ ఆక్రమణల నిరోదక న్యాయస్థానంలో పిటిషన్ వేశారు.
తర్వాత ఇక్బాల్ వారసుడిగా షకీల్ ఇస్లాంఖాన్ను తెర పైకి తెచ్చారు. బషీర్ అనే వ్యక్తిని షకీల్గా నటింపజేశారు. అతడితో భోజగుట్ట భూమి తనదంటూ 2008, 2009, 2012లో హైకోర్టులో వేర్వేరు పిటిషన్లు దాఖలు చేయించారు. తరువాత షకీల్ తమకు భూమిని విక్రయిం చాడని, అందువల్ల అయోధ్య సొసైటీకి జరి పిన కేటాయింపులు రద్దు చేయాలంటూ... సక్సేనా తండ్రికి చెందిన జై హనుమాన్ ఎస్టేట్స్ సంస్థ, దీపక్రెడ్డి, మరొకరు 2014లో దాఖలు చేసిన పిటిషన్లపై విచారణ కొనసాగింది.
ఆ పిటిషనర్లు లేనే లేరు..
ఇటీవల దీపక్రెడ్డి, శైలేష్ సక్సేనాల భూ భాగోతాలపై పత్రికల్లో పెద్ద ఎత్తున కథనాలు వచ్చాయి. దీంతో విచారణ జరిపిన అయోధ్యనగర్ సొసైటీ ప్రతినిధులు.. వాస్తవాలను తమ న్యాయవాది ద్వారా కోర్టు ముందుంచారు. అసలు పిటిషన్లు దాఖలు చేసిన ఇక్బాల్, షకీల్ తదితర వ్యక్తులెవరూ లేరని, వారంతా దీపక్రెడ్డి, శైలేష్ సక్సేనాల సృష్టి అని కోర్టుకు నివేదించారు. కావాలంటే ఆయా పిటిషనర్లను ఆధార్కార్డులతో సహా కోర్టు ముందు హాజరయ్యేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును కోరారు. దీనిని పరిగణనలోకి తీసుకున్న న్యాయమూర్తి... షకీల్, నజీముద్దీన్, హబీద్, ఇప్తేకర్ తదితరులు స్వయంగా కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశించారు.
వారికి నోటీసులు పంపాలని రిజిస్ట్రీకి సూచించారు. ఈ మేరకు నోటీసులు అందచేయడానికి వెళ్లిన హైకోర్టు ఉద్యోగులకు పిటిషనర్ల పేరిట ఇచ్చిన చిరునామాలు నకిలీవని తెలిసింది. తాజాగా మంగళవారం జరిగిన విచారణ సందర్భంగా హైకోర్టు రిజిస్ట్రీ ఈ విషయాన్ని న్యాయమూర్తికి వివరించారు. దీంతో దీపక్రెడ్డి, శైలేష్ సక్సేనాల కుట్రను గుర్తించిన న్యాయమూర్తి.. షకీల్, ఇక్బాల్ తదితర పేర్లతో దాఖలు చేసిన వ్యాజ్యాలన్నింటినీ కొట్టివేశారు. తప్పుడు పేర్లతో పిటిషన్లు దాఖలు చేసిన శైలేష్ సక్సేనాపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని రిజిస్ట్రార్ను ఆదేశించారు.