
సాక్షి, హైదరాబాద్: రైల్వేస్టేషన్లో కౌంటర్ వద్ద టికెట్ కొంటున్నారా? క్రెడిట్ కార్డుతోనో, డెబిట్ కార్డుతోనో డబ్బు చెల్లించాలనుకుంటున్నారా? అయితే ప్రయాణ వివరాలు రాసే పత్రంతోపాటే మీ డెబిట్/క్రెడిట్ కార్డును కూడా కౌంటర్ సిబ్బందికి ఇవ్వండి. లేదంటే నగదు చెల్లించక తప్పదు. టికెట్ల కోసం కార్డులతో సొమ్ము చెల్లిస్తే.. ఆ కార్డు వివరాలను కంప్యూటర్ లో ముందుగానే నమోదు చేయాల్సి రావడమే దీనికి కారణం. ఈ విషయమై ప్రయాణికులు, రైల్వే సిబ్బంది మధ్య ఘర్షణలు కూడా జరుగుతున్నాయి.
ఎందుకిలా..?
నగదు రహిత లావాదేవీలను ప్రోత్సహించే క్రమంలో రైల్వే శాఖ ప్రధాన స్టేషన్ల టికెట్ కౌంటర్లలో కార్డు స్వైపింగ్ యం త్రాలను అందుబాటులో ఉంచింది. కార్డు స్వైప్ చేయటం ద్వారా టికెట్ కొనాలంటే.. ఆ కార్డు నంబర్ను ముందుగానే కంప్యూటర్లో పొందుపరచాల్సి ఉంటుంది. ఇలా ముందుగా నమోదు చేయకుండా టికెట్లు బుకింగ్ చేస్తే నగదుగానే చెల్లిం చాల్సి వస్తుంది.
టికెట్ కౌంటర్లలోని కొందరు సిబ్బంది.. ఈ విషయంలో ప్రయాణికులకు ముందస్తు సమాచారం ఇవ్వడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. టికెట్ బుకింగ్ కోసం వివరాల పత్రం తీసుకునేప్పుడే.. ఆ ధర మేరకు నగదుగానీ, క్రెడిట్/డెబిట్ కార్డుగానీ అడిగి తీసుకోవాల్సి ఉంటుంది. కానీ కొందరు సిబ్బంది ఇలా తీసుకోకుండానే ప్రయాణికుల వివ రాలు నమోదు చేసి టికెట్ బుక్ చేస్తున్నారు. డబ్బు చెల్లించేందుకు ప్రయాణికులు కార్డు ఇస్తే.. ముందుగా కంప్యూటర్లో నమోదు చేయనందున కార్డు చెల్లింపు సాధ్యం కాదని, నగదు చెల్లించాల్సిందేనని చెబుతున్నారు.
రద్దు చార్జీల మోతలు..
ఒకవేళ ప్రయాణికుల వద్ద నగదు లేక కార్డు ద్వారానే చెల్లించాలంటే.. అప్పటికే బుక్ చేసిన టికెట్లను రద్దు చేసి, మళ్లీ బుక్ చేయాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. రద్దు చేసిన చార్జీలనూ వసూలు చేస్తున్నారు. కాదంటే నగదు చెల్లించి టికెట్ తీసుకోవాలని వాదిస్తున్నారు.
సూచన బోర్డులు లేవు..
టికెట్ల చార్జీలను కార్డు ద్వారా చెల్లించాలంటే.. ముందుగానే చెప్పాలంటూ సూచన బోర్డులను కూడా కౌంటర్ల వద్ద ఏర్పా టు చేయలేదు. దీనిపై సిబ్బందిని నిలదీస్తే దురుసు సమాధానాలు వస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. కాగా, సమస్య పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని రైల్వే ప్రజా సంబంధాల విభాగం అధికారులు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment