ఇక తెగదెంపులే! | election results effect: bjp plans to break up with tdp? | Sakshi

ఇక తెగదెంపులే!

Feb 19 2016 1:56 AM | Updated on Mar 29 2019 9:31 PM

ఇక తెగదెంపులే! - Sakshi

ఇక తెగదెంపులే!

తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర విభాగం భావిస్తోంది.

టీడీపీతో పొత్తు వద్దంటున్న బీజేపీ నేతలు

 సాక్షి, హైదరాబాద్: తెలుగుదేశం పార్టీతో తెగదెంపులు చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర విభాగం భావిస్తోంది. ఈ మేరకు అధినాయకత్వానికి సూచనప్రాయంగా తెలియజేసింది. గత శాసనసభ ఎన్నికల నాటి నుంచి తాజాగా నారాయణ్‌ఖేడ్ ఉప ఎన్నిక దాకా వచ్చిన ఫలితాలను సమగ్రంగా విశ్లేషించి... బీజేపీ అధినాయకత్వానికి ఒక నివేదిక కూడా సమర్పించినట్లు తెలిసింది. తెలంగాణలో టీడీపీకి కేడర్ కూడా లేదని.. ఆ పార్టీ ఎమ్మెల్యేలంతా దాదాపుగా టీఆర్‌ఎస్‌లో చేరిపోయారని అందులో పేర్కొన్నట్లు సమాచారం.

మరోవైపు తెలుగుదేశం పార్టీతో పొత్తు కారణంగా బీజేపీ దెబ్బతిన్నదని... పార్టీ శ్రేణులు ఇతర పార్టీల్లోకి వలస పోతున్నారని పేర్కొంటూ వరంగల్ జిల్లాకు చెందిన కొన్ని ఘటనలను నివేదికలో ఉదహరించినట్లు తెలిసింది. వరంగల్ జిల్లాకు చెందిన బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా టీడీపీతో పొత్తును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పొత్తు కొనసాగితే తమ దారి చూసుకుంటామని ఇప్పటికే హెచ్చరించారు. కొందరు కాంగ్రెస్‌లో, మరికొందరు టీఆర్‌ఎస్‌లో చేరారు కూడా. త్వరలో జరగనున్న కొన్ని కార్పొరేషన్లు, పురపాలక సంఘాల ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దంటూ వరంగల్ బీజేపీ నేతలు రాష్ట్ర నాయకత్వానికి తెగేసి చెప్పారు.

 జేఎన్‌యూ ఘటనపై  20న మేధావుల సదస్సు
 జేఎన్‌యూలో జరిగిన ఘటనలు, వాటిపై ఇతర పార్టీలు స్పందించిన తీరును ఎండగట్టాలని బీజేపీ నిర్ణయిం చింది. ఈ నెల 20న పార్టీ లీగల్‌సెల్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో మేధావుల సదస్సు నిర్వహించాలని కోర్ కమిటీ నిర్ణయించింది. ఈ నెల 22న బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నారు. సుందరయ్య విజ్ఞాన కేంద్రం నుంచి ఎన్టీఆర్ స్టేడియం వరకు జరిగే ఈ ర్యాలీలో రాష్ట్ర అగ్రనేతలంతా పాల్గొనాలని నిర్ణయించారు.

 కోర్ కమిటీ భేటీలో స్పష్టం చేసిన నేతలు..
 వరంగల్, ఖమ్మం, అచ్చంపేట, సిద్దిపేట మున్సిపల్ ఎన్నికలపై గురువారం బీజేపీ రాష్ట్ర కోర్ కమిటీ సమావేశమైంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అధ్యక్షతన పార్టీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎమ్మెల్సీ ఎన్.రామచందర్‌రావు, పార్టీ ముఖ్య నేతలు పేరాల చంద్రశేఖర్, ఎన్.ఆచారి, ప్రదీప్‌కుమార్, జి.ప్రేమేందర్‌రెడ్డి, మంత్రి శ్రీనివాస్, చింతా సాంబమూర్తి తదితరులు పాల్గొన్నారు. ఇందులో మున్సిపల్ ఎన్నికల్లో పొత్తులు, అభ్యర్థుల ఎంపిక, ప్రచార వ్యూహం, పార్టీ సంస్థాగత ఎన్నికలు తదితర అంశాలపై చర్చించారు.

ఈ సందర్భంగా మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు వద్దని వరంగల్ నేతలు పార్టీ రాష్ట్ర కమిటీకి తమ అభిప్రాయాన్ని స్పష్టంగా చెప్పారు. ఖమ్మం, అచ్చంపేటలో సర్దుబాటు చేసుకుంటామని అక్కడి నేతలు నివేదించారు. ఇక సిద్దిపేట పరిస్థితిపై స్థానిక నేతల అభిప్రాయాలు రాష్ట్ర కమిటీకి అందలేదు. మొత్తంగా జిల్లాల నుంచి వచ్చిన అభిప్రాయాలకు, రాష్ట్ర స్థాయిలో వచ్చిన అభిప్రాయాలను జోడించి జాతీయ నాయకత్వానికి నివేదిక పంపాలని... జాతీయ పార్టీ ఇచ్చే సూచనల ప్రకారం నడుచుకోవాలని నిర్ణయించారు.

మార్చి తొలి వారంలో బీజేపీకి కొత్త సారథి?
సంస్థాగత ఎన్నికలకు ఈనెల 29 వరకు గడువు

  మార్చి మొదటివారంలో రాష్ట్ర బీజేపీకి కొత్త సారథిని జాతీయ కమిటీ ప్రకటించనుంది. ఈ నెల 21లోగా జిల్లాలకు సంస్థాగత ఎన్నికలు పూర్తికావాల్సి ఉండగా ఈ నెల 29 దాకా గడువును పొడిగించింది. జిల్లా స్థాయి సంస్థాగత ఎన్నికలు ఈ నెలలో పూర్తయితే రాష్ట్ర కమిటీకి అధ్యక్షుడి నియామక ప్రక్రియను మార్చి మొదటి వారంలో పూర్తిచేయనుంది. రాష్ట్ర అధ్యక్ష పదవిపై బహిరంగ ప్రకటన, చర్చ మొదలు పెట్టకున్నా నాయకుల వ్యక్తిగత అభిప్రాయాలను జాతీయ పార్టీ తీసుకుంటోందని పార్టీ రాష్ట్ర ముఖ్య నాయకుడొకరు వెల్లడించారు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పార్టీ ముఖ్య నేతలు చాలా మంది పోటీపడుతున్నా ఎన్నికలు లేకుండానే రాష్ట్ర అధ్యక్షుడిని జాతీయ పార్టీ నియమించనుందని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement