ఏఎఫ్ఆర్సీ సూచనల ప్రకారమే ఫీజులు
Published Thu, Sep 14 2017 3:50 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
- ప్రొఫెషనల్ కోర్సుల ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత ఇచ్చిన ఎస్సీ శాఖ
- ఉన్నత విద్యాశాఖ ఆదేశాలను అనుసరిస్తూ ఉత్తర్వులు
సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద వృత్తి విద్యా కోర్సుల ఫీజుల చెల్లింపులపై స్పష్టత వచ్చింది. 2016–17 నుంచి 2018–19 విద్యా సంవత్సరం మధ్య కాలంలో బీటెక్, బీ– ఫార్మసీ, బీ–ఆర్క్, ఎంటెక్, ఎం–ఆర్క్ తదితర వృత్తి విద్యా కోర్సులకు ఏఎఫ్ఆర్సీ (అడ్మిషన్ అండ్ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ) ఇటీవల ఫీజులు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కింద చెల్లించే అంశంపై సమీక్షించిన ఎస్సీ అభివృద్ధి శాఖ.. ఏఎఫ్ఆర్సీ సూచనల ఆధారంగా ఫీజులు ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఉపకార వేతనాలు మాత్రం పాత విధానాన్నే అనుసరిస్తుండగా.. ఫీజులు మాత్రం 2016–17 నుంచి 2018–19 మధ్యనున్న బ్లాక్ పీరియడ్కు కొత్తగా నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించనుంది. ప్రస్తుతం 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది.
వసతుల ఆధారంగానే ఫీజులు
ఇంటర్, డిగ్రీ కోర్సులకు సంబంధించి ఫీజుల్లో పెద్దగా మార్పులు లేనప్పటికీ వృత్తివిద్యా కోర్సుల ఫీజుల్లో భారీ వ్యత్యాసముంది. సాధారణ కాలేజీల్లో ఫీజులతో పోల్చుకుంటే టాప్ కాలేజీల్లో ఎక్కువ మొత్తంలో ఫీజులున్నాయి. దీంతో ఏఎఫ్ఆర్సీ బృందం తనిఖీల తర్వాత అక్కడ కల్పిస్తున్న మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు నిర్దేశించింది. ఉన్నత విద్యా మండలి నిబంధనల మేరకు ఏఎఫ్ఆర్సీ ధ్రువీకరించిన ఫీజులను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆమోదించింది. ఫీజుల వివరాలను ఈ పాస్ వెబ్సైట్లో పొందుపర్చింది. తాజాగా నిర్ధారించిన ఫీజులు 2018–19 వరకు చెల్లిస్తారు.
Advertisement
Advertisement