SC Welfare Department
-
అట్టడుగు వర్గాలకు సాయంలో.. 'ఏపీ అద్వితీయం'
సాక్షి, అమరావతి: ఎస్సీ ఉప ప్రణాళిక అమలుతో పాటు ఎస్సీ కుటుంబాలకు సహాయం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో నిలిచింది. దేశంలోని మరే ఇతర రాష్ట్రం అమలుచేయని విధంగా ఎస్సీ ఉప ప్రణాళికను గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు ఏపీ అమలు చేసినట్లు కేంద్ర గణాంకాలు, కార్యక్రమాలు అమలు మంత్రిత్వ శాఖ నివేదిక వెల్లడించింది. 2022–23 మూడో త్రైమాసికం వరకు(ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) దేశంలోని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో వివిధ పథకాల అమలు పురోగతిపై నివేదికను ఆ శాఖ శనివారం విడుదల చేసింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా ఆ కుటుంబాలకు సాయం అందించడం, రైతుల వ్యవసాయ పంపుసెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడం, పట్టణ పేదలకు సాయం అందించడంలోనూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘చాలామంచి’ పనితీరు కనబరించిందని ఆ నివేదిక కితాబిచ్చింది. లక్ష్యాల్లో 90 శాతానికి పైగా అమలుచేసిన రాష్ట్రాలను చాలామంచి పనితీరు కనబరిచినట్లు, 80–90 శాతం మేర అమలుచేసిన రాష్ట్రాలు ‘మంచి పనితీరు’ కనబరిచినట్లు.. అలాగే 80 శాతం లోపల అమలుచేసిన రాష్ట్రాల పనితీరు బాగోలేని రాష్ట్రాలుగా నివేదిక వర్గీకరించింది. ఏపీలో 33.57 లక్షల కుటుంబాలకు సాయం.. ఎస్సీ ఉప ప్రణాళిక కింద దేశంలోని ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు మొత్తం 34,68,986 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించినట్లు ఆ నివేదిక పేర్కొంది. అయితే.. అందులో ఒక్క ఏపీలోనే ఏకంగా 33,57,052 కుటుంబాలకు సహాయం అందించారు. అలాగే, గతంలో కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల మంత్రిత్వ శాఖ ఏప్రిల్ నుంచి సెప్టెంబరు వరకు విడుదల చేసిన నివేదికలో ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా 29,10,944 కుటుంబాలకు సాయం అందించగా.. అదే ఇప్పుడు ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు విడుదల చేసిన నివేదికలో ఆ సంఖ్య 33,57,052కు పెరిగింది. అంటే.. మూడునెలల వ్యవధిలో అదనంగా 4,46,108 ఎస్సీ కుటుంబాలకు సాయం అందించింది. మిగతా మరే ఇతర రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనూ లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం చేయలేదని నివేదిక స్పష్టంచేసింది. ఒక్క కర్ణాటకలో మాత్రమే 22,884 కుటుంబాలకు ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా సాయం అందించగా మిగతా రాష్ట్రాలు అంతకన్నా తక్కువగా వేల, వందల సంఖ్యలోనే సహాయం అందించాయి. పట్టణ పేదలకు సాయంలో కూడా.. అలాగే, గత ఆర్థిక ఏడాది ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, పట్టణాల్లోని 5,98,194 పట్టణ పేద కుటుంబాలకు సాయం అందించగా అందులో ఒక్క ఏపీలోనే 5,05,962 పేద కుటుంబాలకు సాయం అందించినట్లు నివేదిక వెల్లడించింది. ఇదే గతంలో ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఇచ్చిన నివేదికలో రాష్ట్రంలోని పట్టణ ప్రాంతంలోని 3.47 లక్షల మందికి సాయం అందించినట్లు పేర్కొనగా ఇప్పుడు డిసెంబర్ వరకు ఇచ్చిన నివేదికలో ఆ సంఖ్య 5,05,962కు పెరిగినట్లు పేర్కొంది. అంటే మూడు నెలల వ్యవధిలో పట్టణాల్లోని 1.58 లక్షల పేద కుటుంబాలకు అదనంగా సాయం అందించినట్లు తెలిపింది. పట్టణ ప్రాంతాల్లో పేదలకు సాయం అందించడంలోనూ ఏపీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ‘వ్యవసాయ’ విద్యుత్ కనెక్షన్లలోనూ అగ్రగామి.. అంతేకాక.. రాష్ట్రంలో రైతుల వ్యవసాయ పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వడంలోనూ ఆంధ్రప్రదేశ్ ‘చాలామంచి’ పనితీరు కనబరిచినట్లు నివేదిక తెలిపింది. 2022–23లో 24,852 విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకోగా మూడో త్రైమాసికం నాటికి (ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు) లక్ష్యానికి మించి 98,447 వ్యవసాయ పంపు సెట్లకు ఏపీ విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేసినట్లు నివేదిక తెలిపింది. మరే ఇతర రాష్ట్రంలోనూ ఇంత పెద్ద సంఖ్యలో విద్యుత్ కనెక్షన్లు మంజూరు చేయలేదు. ఉపాధి హామీ కింద రాష్ట్రంలో గత ఏప్రిల్ నుంచి డిసెంబర్ వరకు 1,78,182 మందికి కొత్తగా జాబ్కార్డులను మంజూరు చేసినట్లు నివేదిక పేర్కొంది. అలాగే, ఆ సమయంలో కూలీలకు వేతనాల రూపంలో రూ.3,898.20 కోట్లు చెల్లించినట్లు నివేదిక వెల్లడించింది. ఏపీలోని 55,607 అంగన్వాడీలతో పాటు 257 ఐసీడీఎస్లు నూటికి నూరు శాతం పనిచేస్తున్నట్లు నివేదిక స్పష్టంచేసింది. -
ఎస్సీలకు సాయంలో ఏపీ ఫస్ట్
సాక్షి, అమరావతి: ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ నివేదిక స్పష్టం చేసింది. 2021–22 ఆర్థిక ఏడాదిలో దేశంలోని వివిధ రాష్ట్రాల్లో వివిధ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతిపై కేంద్రం విశ్లేషణాత్మక నివేదికను విడుదల చేసింది. లక్ష్యాల కన్నా 90 శాతంపైగా అమలు చేసిన రాష్ట్రాల పనితీరు చాలా బాగుందని, లక్ష్యాల కన్నా 80 శాతం లోపు ఉంటే ఆ రాష్ట్రాల పనితీరు బాగోలేదని నివేదిక విశ్లేషించింది. ఎస్సీ ఉప ప్రణాళిక ద్వారా దేశంలోని 20 రాష్ట్రాల్లో 37,64,308 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందించగా, ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే 35,92,860 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందిందని నివేదిక స్పష్టం చేసింది. మరే రాష్ట్రం కనీసం లక్ష మంది ఎస్సీ కుటుంబాలకు కూడా సహాయం అందించలేదని చెప్పింది. ఆంధ్రప్రదేశ్ తర్వాత అత్యధికంగా తమిళనాడులో 29,706 ఎస్సీ కుటుంబాలకు సహాయం అందిందని నివేదిక పేర్కొంది. ఈ నివేదిక ఇంకా ఏం చెప్పిందంటే.. స్వయం సహాయక సంఘాలకు భరోసా ► 2021–22 ఆర్థిక ఏడాదిలో లక్ష్యానికి మించి 8,336 శాతం మేర కొత్తగా మహిళా స్వయం సహాయక సంఘాలను ఆంధ్రప్రదేశ్ ప్రోత్సహించింది. దేశ వ్యాప్తంగా 12.41 లక్షల సంఘాలను కొత్తగా ప్రోత్సహిస్తే, అందులో 8.54 లక్షలు ఒక్క ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి. ► ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో1.46 లక్షలు, ఇతర రాష్ట్రాలు వేల సంఖ్యలో కొత్త సంఘాలను ప్రోత్సహించాయి. రాజస్థాన్లో 48,979, గుజరాత్లో 38,028, ఛత్తీస్గఢ్లో 25,427, ఒడిశాలో 37,777 సంఘాలను ప్రోత్సహించారు. ► ఏపీలో 55,607 అంగన్వాడీ కేంద్రాలు నూటికి నూరు శాతం మంచి పనీతీరు కనపరిచాయి. 257 ఐసీడీఎస్ బ్లాక్లు (సమగ్ర శిశు అభివృద్ధి కేంద్రాలు) వంద శాతం బాగా పని చేశాయి. వ్యవసాయ పంపు సెట్లకు లక్ష్యానికి మించి 272 శాతం విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. ► 2021–22 ఆర్థిక ఏడాదిలో 24,852 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలన్నది లక్ష్యం కాగా, ఏకంగా 67,506 పంపు సెట్లకు విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. పీఎంజీఎస్వై కింద రాష్ట్రంలో 1,241 కిలోమీటర్ల మేర గ్రామీణ రహదారుల నిర్మాణం చేపట్టారు. -
పీఎంఏజీవై అవార్డులకు ఏపీలోని రెండు జిల్లాలు ఎంపిక
సాక్షి, అమరావతి: షెడ్యూల్ కులాల సమగ్ర అభివృద్ధి పథకం అమలుకు సంబంధించి కేంద్రం ప్రకటించిన అవార్డులకు ఆంధ్రప్రదేశ్లోని రెండు జిల్లాలు ఎంపికయ్యాయి. ఈ పథకం అమలులో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చిన మూడు జిల్లాలకు ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ్ యోజన (పీఎంఏజీవై) అవార్డులను అందిస్తున్నారు. దేశంలోని మూడు జిల్లాలను ఈ అవార్డుల కోసం ఎంపిక చేయగా.. అందులో రెండు జిల్లాలు రాష్ట్రానివే కావడం విశేషం. పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా రెండో స్థానం, తూర్పు గోదావరి జిల్లా మూడో స్థానం దక్కించుకున్నాయి. చదవండి: Gold News: బంగారం కొనుగోళ్లు.. తెలుగు రాష్ట్రాల్లో కొత్త పద్దతిలో -
వివాదంలో ఎస్సీ సంక్షేమ శాఖ!
సాక్షి, నిజామాబాద్: కక్ష సాధింపులు.. వేధింపులు.. వసూళ్లు.. ఈ మూడు అంశాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలను కుదిపేస్తున్నాయి. ఆయా శాఖలను వివాదాల్లోకి లాగుతున్నాయి. తరచూ అధికారులకు, హాస్టల్ వార్డెన్ల నడుమ ఏర్పడుతున్న గొడవలు రచ్చకెక్కుతున్నాయి. సంక్షేమ శాఖల పాలనను పక్కన పెట్టి పోటాపోటీగా కలెక్టర్కు, ఆయా శాఖల ఉన్నతాధికారులకు పరస్పర ఫిర్యాదులు చేసుకుంటున్నారు. ఇంతటితో పోకుండా నువ్వా.. నేనా అన్నట్లుగా ప్రత్యక్ష పంచాయితీలకూ కాలు దువ్వుతున్నారు. అయితే ప్రతీ చిన్న విషయానికి యూనియన్ నేతలను కలుపుకొని వివాదాలను రచ్చకెక్కిస్తున్న తీరు తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. ఇటు ఉన్నతాధికారులకు సైతం ఈ సంక్షేమ శాఖల గొడవలు విసుగు పుట్టిస్తున్నాయి. ప్రస్తుతం పాలన గాడి తప్పి ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా పరిస్థితి తయారైంది. ఐదారు నెలల క్రితం బీసీ సంక్షేమ శాఖలో ఓ అధికారికి, హాస్టల్ వార్డెన్ల నడుమ చాలా సినిమానే నడిచింది. సదరు అధికారి తమ నుంచి డబ్బులు వసూలు చేస్తున్నారని, ఇవ్వని వారిపై వేధింపులకు పాల్పడుతున్నారని వార్డెన్లు కలెక్టర్తో పాటు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారికి కూడా ఫిర్యాదు చేశారు. ఇటు సదరు అధికారి కూడా వార్డెన్లపై పలు ఆరోపణలు చేశారు. అయితే, సదరు అధికారి ఉంటే తాము పని చేయలేమని, సెలవుల్లో వెళ్తామని వార్డెన్లు ముక్త కంఠంతో చెప్పాగా, ఓ ఉన్నతాధికారి ఎదుట విచారణ కూడా జరిగింది. కానీ చివరికి యూనియన్ నేతల జోక్యంతో వివాదం సద్దుమణిగింది. కొన్ని వాస్తవాలున్నప్పటికీ ఎవరిపై ఎలాంటి చర్యలు లేకుండానే చివరికి కథ ముగిసింది. ట్రైబల్ వెల్ఫేర్లో.. జిల్లా గిరిజన సంక్షేమ శాఖలో కూడా ఇటీవల ఓ ద్వితీయ శ్రేణి అధికారి తీరుతో వేగలేక పోయిన హాస్టల్ వార్డెన్లు, ఆ శాఖ ఉద్యోగులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. తమను వేధిస్తున్నారని, వసూళ్లకు పాల్పడుతున్నారని వార్డెన్లు, శాఖ ఉద్యోగులు ఫిర్యాదు చేశారు. గిరిజన సంక్షేమ శాఖకు మచ్చ తెస్తున్న సదరు ద్వితీయ శ్రేణి అధికారిని పిలిపించి ఓ ఉన్నతాధికారి మందలించారు. కానీ ప్రస్తుతం కూడా సదరు అధికారి తీరు విమర్శలకు దారి తీస్తోంది. ఇప్పుడు ఎస్సీ సంక్షేమ శాఖలో.. బీసీ, ఎస్టీ సంక్షేమ శాఖల్లో అధికారులకు, వార్డెన్ల మధ్య వివాదాలను మరిచిపోక ముందే జిల్లా ఎస్సీ అభివృద్ధి సంక్షేమ శాఖలో కొత్త లొల్లి మొదలైంది. ఓ అధికారి తమను వేధిస్తున్నారంటూ కొంత మంది వార్డెన్లు యూనియన్ నాయకులతో కలిసి ఆ శాఖ అధికారితో పాటు కలెక్టర్కు కొన్ని రోజుల క్రితం ఫిర్యాదు చేశారు. ఇన్ని సంవత్సరాల పాటు ఆ అధికారితో కలిసి మెలిసి పని చేసిన వారే వ్యతిరేకంగా ఫిర్యాదు చేయడం చర్చకు దారి తీసింది. కావాలనే టార్గెట్ చేసి ఇలా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం కూడా రచ్చకెక్కింది. వారిదే పెత్తనం.. మూడు సంక్షేమ శాఖలకు కలిపి నాయకులుగా పిలవబడే కొంత మంది తీరుతోనే ఆయా శాఖల పరువు బజారున పడుతోందని తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఏ అధికారైనా సరే తాము చెప్పినట్లు నడుచుకోవాలని, చెప్పిన పని చేయాలని ఆర్డర్లు వేసి మరీ పనులు చేయిస్తున్నారని ఆరోపణలున్నాయి. ఒక వేళ అడ్డు చెబితే ఇక సదరు అధికారి పని అంతేనని, కక్ష సాధింపులకు దిగుతారని, అవసరమైతే సరెండర్ చేయిస్తారనే పేరుంది. కాగా తమ వర్గానికి చెందిన, మచ్చిక చేసుకున్న అధికారులుంటే వారిపై ఎన్ని అవినీతి, ఆరోపణలున్నా సరే వారిని రక్షించడానికి ఎలాంటి పనికైనా సిద్ధపడుతారనే మాట ప్రచారంలో ఉంది. ఫిర్యాదు అందింది.. ఎస్సీ సంక్షేమ శాఖలోని ఓ అధికారిపై వార్డెన్ల సంఘ నాయకులు చేసిన ఫిర్యాదు నాకు అందింది. అయితే, ఈ వివాదం ఇరువురి మధ్య నెలకొంది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఏది వాస్తవమో విచారణ జరిపి తేలుస్తాం. – రాములు, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ ఇన్చార్జి అధికారి -
‘పది’కి పదే లక్ష్యం
జిల్లాలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ వసతి గృహాల్లో పదో తరగతి చదువున్న విద్యార్థులు వార్షిక పరీక్షల్లో వందశాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఆయా శాఖల అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. జనవరి నుంచి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. జిల్లా షెడ్యుల్డు కులాల అభివృద్ధి శాఖ, గిరిజన అభివృద్ధి శాఖ, వెనుకబడిన(బీసీ) తరగతుల అభివృద్ధి శాఖల అధికారుల ఆదేశాల మేరకు ప్రత్యేక మెనూ తయారు చేశారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది ఫలితాలు మరింత మెరుగ్గా ఉండాలనే సంకల్పంతో అనేక కార్యక్రమాలు చేపడుతున్నారు. సదాశివపేట(సంగారెడ్డి): జిల్లాలో అన్ని శాఖల బాలుర, బాలికల వసతి గృహాలు ఎస్సీ 37, ఎస్టీ 10, బీసీ 22 ఉన్నాయి. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎస్సీ బాలికల, బాలుర వసతి గృహాల్లో 713 మంది, ఎస్టీ బాలికల బాలుర వసతి గృహాల్లో 170 మంది, బీసీ బాలికల, బాలుర వసతి గృహాల్లో 362 మంది ఉన్నారు. విద్యార్థుల ప్రతిభ, సామర్థ్యాలపై జిల్లా అధికారులు రిపోర్టులు తెప్పించుకుంటున్నారు. అంతే కాకుండా తనిఖీలు నిర్వహిస్తూ విద్యార్థుల ప్రతిభను అంచనా వేస్తున్నారు. ప్రత్యేక తరగతులు.. అల్పాహారం పదో తరగతి విద్యార్థులకు ఉదయం 6 గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం7 నుంచి రాత్రి 9 గంటల వరకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. వంద శాతం ఫలితాలు సాధించాలనే సంకల్పంతో వసతి గృహాల సంక్షేమ అధికారులు పదోతరగతి విద్యార్ధుల కోసం రాత్రి 12 గంటల వరకు స్టడీ అవర్లను నిర్వహిస్తున్నారు. నీరస పడకుండా ఉండటానికి రాత్రి 10.30 అల్పాహారం, టీ అందజేస్తున్నారు. వీటీ కోసం ప్రత్యేక నిధులు కేటాయించారు. సబ్జెక్టు నిపుణులను అందుబాటులో ఉంచారు. రాత్రి సమయంలో విద్యార్థులతో పాటు అధికారులు వసతి గృహాల్లో నిద్రించాలని నిర్ణయించారు. విద్యార్థులపై పర్యవేక్షణ మార్చి 19న పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తుండటంతో విద్యార్థులపై పర్యవేక్షణ పెంచడానికి వసతి గృహాల సంక్షేమ అధికారులు వారంలో రెండు సార్లు వసతి గృహంలో విద్యార్థులతో కలసి భోజనం చేసి అక్కడే నిద్రించాలని ఆదేశాలు జారీ చేశారు. దీంతో విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరిగి ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే వసతి గృహాల సంక్షేమాధికారులను సంబంధిత అధికారులు 100 శాతం ఫలితాలు సాధించడానికి ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ వసతి గృహాల్లో ఉంటూ పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ వంద శాతం ఉత్తీర్ణత సాధించడానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. చదువులో వెనుకబడిన విద్యార్ధులపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు, ఏ, బీ, సీ, డీ గ్రూపులుగా విభజించి సీ, డీ విభాగాలపై సంబంధిత సబ్జెక్టు అధ్యాపకులు ఎక్కువ సమయం కేటాయించి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేస్తున్నారు. పదికి పది జీపీఏ సాధిస్తా ఆయా సబ్జెక్టుల అధ్యాపకులు పదో తరగతి విద్యార్థులకు వసతి గృహంలోనే ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నారు. రాత్రి 12 గంటల వరకు చదివిస్తున్నారు. మధ్యలో స్నాక్స్, టీ ఇస్తున్నారు. పదో తరగతి ఫలితాల్లో పదికి పది జీపీఏ సాధిస్తానని నమ్మకుముంది. – బి.రమేశ్, ఎస్సీ వసతి గృహం, సదాశివపేట -
వారికి పాకెట్ మనీ రూ.500 ..
సాక్షి, నిర్మల్ : విద్యతోనే ప్రగతి సాధ్యం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎస్సీ విద్యార్థుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా వారికి ఎస్సీ వసతి గృహాల్లో ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నారు. ట్యూషన్ ఫీజు, మెస్బిల్లు, పరీక్ష ఫీజు ఇలా ఎన్నో మినహాయింపు ఇస్తున్నారు. అయితే విద్యార్థి దశ నుంచి కళాశాల స్థాయికి వచ్చే సరికి ఆర్థిక సమస్యలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. జేబు ఖర్చులు కూడా ఇంటి నుంచి తెచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో లోలోన మదనపడుతున్నారు. వీరి ఇబ్బందులు ఇక దూరం కానున్నాయి. కళాశాల విద్యార్థులకు నెలకు రూ.500 కళాశాల వసతి గృహాల్లో చదువుతున్న ఎస్సీ విద్యార్థులకు జేబు ఖర్చుల కింద సాయం అందించే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇక నుంచి వీరికి ప్రతి నెల ఠంచన్గా నెలకు రూ.500చొప్పున అందజేయనుంది. ప్రస్తుతం వసతి గృహాల్లో కేవలం పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు మాత్రమే కాస్మోటిక్ చార్జీ లు అందిస్తున్నారు. బాలురకు రూ.62, బాలికలకు 3 నుంచి 7వ తరగతి చదివేవారికి రూ.55, అలాగే 8,9,10 తరగతుల వారికి రూ.75 అందిస్తున్నారు. కేవలం పదో తరగతి వరకు విద్యనభ్యసించి, మధ్యలో ఆపివేయకుండా ప్రభుత్వం కళాశాల విద్యార్థులకు సైతం నియోజకవర్గాలు, జిల్లా కేంద్రాల్లో వసతి ఏర్పాటు చేసింది. ఈ మేరకు షెడ్యూల్డు కులాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కళాశాల వసతి గృహాలను జిల్లాలో ఇదివరకే ఏర్పాటు చేశారు. జిల్లాలో ఇలా అమలు.. నిర్మల్ జిల్లాలో మొత్తం ఐదు ఎస్సీ కళాశాలల వసతి గృహాలు ఉన్నాయి. నిర్మల్లో రెండు బాలికల, ఒకటి బాలుర వసతి గృహం ఉండగా, భైంసాలో ఒకటి బాలికల, ఒకటి బాలుర వసతి గృహం ఉంది. ఇందులో మొత్తం 366మంది విద్యార్థులు ఉంటున్నారు. ఈ వసతి గృహాల్లో పారామెడికల్, నర్సింగ్, ఐటీఐ, ఇంటర్, డిగ్రీ విద్యార్థులు చదువుకుంటున్నారు. కళాశాల వసతి గృహంలో విద్యార్థులకు ప్రభుత్వం కేవలం ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి వేళల్లో భోజనం అందిస్తోంది. కాస్మోటిక్ చార్జీలు ఇవ్వడం లేదు. దీంతో విద్యార్థులు ఇంటి వద్ద నుంచి డబ్బులు తెచ్చుకుని ఇతర అవసరాలకు ఖర్చు చేసుకుంటున్నారు. తల్లిదండ్రులకు ఆర్థికభారం కావడంతో నెలనెలా అవసరాలను తీర్చుకోలేకపోతున్నారు. దీనిని గుర్తించిన ప్రభుత్వం ఎస్సీ కళాశాల వసతిగృహాల్లో చదువుతున్న విద్యార్థులందరికీ నెలకు రూ.500 చొప్పున సాయం అందించనుంది. నేరుగా విద్యార్థి బ్యాంకు ఖాతాకే ఈ సొమ్ము జ మ చేయనుంది. అయితే ప్రతి నెలా ఈ డబ్బు లు పొందాలంటే 75శాతం హాజరు, 20 రోజు ల పాటు వసతి గృహంలో ఉండాలన్న నిబంధనలు విధించింది. ఇందుకోసం విద్యార్థి ప్రతి నెలా హాజరుకు సంబంధించి ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. 75శాతం హాజరు తప్పనిసరి విద్యార్థులకు పాకెట్ మనీ కింద ప్రతినెలా డబ్బులు జమచేసేందుకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. కళాశాలల్లో 75శాతం హాజరు తప్పనిసరిగా ఉండాలి. ఈ విద్యా సంవత్సరం జూన్ నుంచి విద్యార్థుల అకౌంట్లో డబ్బులు జమకానున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా సాయం అందిస్తున్న నేపథ్యంలో విద్యార్థులు అవసరాలకు మాత్రమే వినియోగించుకుని ఉత్తమ ఫలితాలపై దృష్టి సారించాలి. – కిషన్, జిల్లా ఎస్సీ సంక్షేమ అధికారి -
స్కిల్ @ హాస్టల్
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాలు ఇకపై నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా మారనున్నాయి. ఇప్పటివరకు హాస్టళ్లంటే కేవలం విద్యార్థులకు వసతితో పాటు రెండు పూటలా భోజన సౌకర్యాన్ని కల్పించేవనే మనకు తెలుసు. తాజాగా ఈ కేంద్రాల్లో వసతి పొందే విద్యార్థులకు వివిధ అంశాల్లో శిక్షణ ఇచ్చేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ముందుగా కళాశాల వసతి గృహాల్లో (కాలేజీ హాస్టల్స్) ఈ కార్యక్రమాన్ని ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టాలని భావిస్తోంది. ప్రస్తుతం వసతి గృహాల్లోని విద్యార్థుల్లో ఎక్కువ మంది విద్యార్థులు కాలేజీ తరగతులు పూర్తికాగానే సంక్షేమ వసతిగృహానికి చేరుకోవడం, కాలేజీల్లో జరిగిన పాఠశాలను పునశ్చరణ చేయడం లాంటివి చేస్తున్నారు. దీంతో కేవలం సబ్జెక్టుపరంగా వారికి కొంత అవగాహన పెరుగుతున్నప్పటికీ ఇతర అంశాల్లో పరిజ్ఞానం మాత్రం అంతంతమాత్రం గానే ఉంటుంది. ఈ పరిస్థితిని అధిగమించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ సంకల్పించింది. ఇందులో భాగంగా తొలుత నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లోని వసతి గృహాల్లో ప్రయోగాత్మకంగా ఈ కార్యక్రమాలకు శ్రీకారం చుడుతోంది. ఇంగ్లిష్లో మాట్లాడేలా.. వసతి గృహాల్లోని విద్యార్థులకు కమ్యూనికేషన్ స్కిల్స్ పెంచడంతో పాటు కంప్యూటర్స్లో ప్రాథమికాంశాలపై (బేసిక్స్) అవగాహన కల్పించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులు నిర్వహించబోతోంది. హాస్టల్లో రోజువారీ కార్యక్రమాల్లో భాగంగా ఇంగ్లిష్ వాడకాన్ని వృద్ధిచేస్తే భాషపై పట్టు పెరుగుతుందని అధికారులు భావిస్తున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్ తరగతులతో పాటు కొంతసేపు కరెంట్ అఫైర్స్ తదితర అంశాలపై అవగాహన కల్పిస్తారు. దీంతో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే విద్యార్థులకు ఈ తరగతులు ఎంతో ఉపయోగపడతాయని అధికారులు భావిస్తున్నారు. ఈ తరగతుల బోధనకు క్షేత్రస్థాయిలో నిపుణులైన ట్యూటర్లను ఎంగేజ్ చేసుకోవాలని నిర్ణయించింది. ప్రస్తుత పరిస్థితుల్లో కంప్యూటర్ పరిజ్ఞానం ప్రతి ఒక్కరికి అవసరమనే భావన ఉంది. ఈ నేపథ్యంలో కంప్యూటర్స్ బేసిక్స్పైనా అవగాహన కల్పించి సర్టిఫికెట్ కూడా ఇచ్చేలా మరో స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని అమల్లోకి తెస్తోంది. ఈమేరకు ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేకంగా నిధులను ఖర్చు చేయనుంది. ఇప్పటికే నల్లగొండ జిల్లాలో దాదాపు రూ.1.5 కోట్లు ఖర్చు చేసి కంప్యూటర్లను కొనుగోలు చేసింది. ఒక కంప్యూటర్పై పది మంది విద్యార్థులు ప్రాక్టీస్ చేసేలా టైమ్షెడ్యూల్ను సంబంధిత వసతి గృహ సంక్షేమాధికారి రూపొందిస్తారు. త్వరలో నల్లగొండ, నాగర్కర్నూల్ జిల్లాల్లో ఈ కార్యక్రమాలను ప్రారంభించేలా అధికారులు చర్యలు వేగిరం చేశారు. ప్రస్తుతం రెండు జిల్లాల్లో ఈ కార్యక్రమాలను ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నప్పటికీ... వచ్చే ఏడాది నుంచి అన్ని వసతిగృహాల్లో అమలుచేసేలా చర్యలు తీసుకోనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. -
ప్రతి జిల్లాకు ఓ స్టడీ సర్కిల్!
సాక్షి, హైదరాబాద్: ప్రతి జిల్లాలో ఓ స్టడీ సర్కిల్ ఏర్పాటు చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 11 జిల్లాలో ఈ కేంద్రాలున్నాయి. కొత్తగా 23 జిల్లాలు ఏర్పాటు కావడంతో అన్ని జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ఈమేరకు కార్యాచరణ రూపొందించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఎక్కడెక్కడ స్టడీ సర్కిళ్లు ఏర్పాటు చేసే అవకాశముందనే అంశంపై కసరత్తు చేపట్టింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో ప్రధాన స్టడీ సర్కిళ్లను హైదరాబాద్లో నిర్వహిస్తోంది. దీంతోపాటు నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. సివిల్ సర్వీసెస్, గ్రూప్ సర్వీసులు తదితర ప్రధాన శిక్షణ కార్యక్రమాలకు హైదరాబాద్ స్టడీ సర్కిల్లో శిక్షణ ఇస్తుండగా.. మిగతా చోట్ల ఇతర కేటగిరీల్లోని ఉద్యోగాలకు శిక్షణ నిర్వహిస్తున్నారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి పలు రకాల శిక్షణలు ఇవ్వగా.. దాదాపు 2వేల మంది అభ్యర్థులు ఉద్యోగాలు సాధించారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో దాదాపు 15% మందికి కొలువులు వచ్చాయి. స్టడీ సర్కిల్ శిక్షణలతో సత్ఫలితాలు వస్తుండటంతో ప్రతి జిల్లా కేంద్రంలోనూ స్టడీ సర్కిల్ ఏర్పాటుకు డిమాండ్ పెరిగింది. ఈనేపథ్యంలో స్టడీ సర్కిళ్ల ఏర్పాటు, ఆవశ్యకతను పరిశీలించాలని ఈశ్వర్ ఆదేశించడంతో ఆ శాఖ చర్యలకు ఉపక్రమించింది. స్టడీ సర్కిళ్ల ద్వారా ఎస్సీ నిరుద్యోగ యువతకు వివిధ రకాల పోటీ పరీక్షలకు శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖ..వీటిని మరింత విస్తృతం చేయాలని నిర్ణయిం చింది. ఇకపై ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించిన శిక్షణే కాకుండా ప్రైవేటు రంగంలో కీలక ఉద్యోగాలకు శిక్షణ కార్యక్రమాలు చేపట్టే అంశంతో పాటు డిమాండ్ ఉన్న ఉద్యోగాలకు ఎలా శిక్షణ ఇవ్వొచ్చనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. -
పేరెక్కదాయె.. బిల్లు రాదాయె..
సాక్షి, ఖమ్మం : సాంఘిక సంక్షేమ శాఖ ఆన్లైన్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. వసతి గృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల లెక్క పక్కాగా ఉంచడంతోపాటు.. వారి వివరాలను పూర్తిస్థాయిలో ఆన్లైన్లో నమోదు చేసేందుకు పూనుకుంది. వసతి గృహంలో చేరిన ప్రతి విద్యార్థి వివరాలను ఆన్లైన్లో పొందుపరిచేలా గత ఏడాది నుంచి చర్యలు చేపట్టింది. అయితే కొత్త విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకోవాలంటే ఆధార్ కార్డుతోపాటు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉంటే.. వాటిని సంక్షేమాధికారులు ఎస్సీ సంక్షేమ వెబ్సైట్లో నమోదు చేస్తారు. ఆ ప్రకారం వారికి ప్రభుత్వం నుంచి సమకూరే సౌకర్యాలు కల్పిస్తోంది. అయితే కొత్త విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో వసతి గృహ సంక్షేమాధికారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విధానం ఒక్క ఎస్సీ సంక్షేమ శాఖలోనే ఉండడం, బీసీ, గిరిజన సంక్షేమ శాఖల్లో ఇలాంటి విధానం లేకపోవడంతో ఆ శాఖల్లో విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. జిల్లాలో 39 ప్రీ మెట్రిక్(పాఠశాలల విద్యార్థుల) వసతి గృహాలు ఉండగా.. వాటిలో మొత్తం 3,699 మంది విద్యార్థులు ఉన్నారు. వీరంతా 3వ నుంచి 10వ తరగతి వరకు చదువుతున్న వారే. గత ఏడాది నుంచి ఆయా వసతి గృహాల్లో రెన్యూవల్ అయిన విద్యార్థులు 2,420 మంది ఉండగా.. కొత్తగా 1,279 మంది విద్యార్థులు వసతి గృహాల్లో చేరారు. అయితే పాత విద్యార్థుల వివరాలను రెన్యూవల్ చేయడమే కాబట్టి వారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తడం లేదు. కొత్తగా చేరిన విద్యార్థుల విషయంలోనే సమస్యలు తలెత్తుతున్నాయి. పత్రాల కోసం ఎదురుచూపులు.. ఎస్సీ వసతి గృహాల్లో చేరిన ప్రతి విద్యార్థి తమ వివరాలను ఆన్లైన్లో నమోదు చేసుకోవాలి. పాఠశాల, కళాశాల విద్యార్థులు తమ వివరాలను నమోదు చేసుకుంటేనే వసతి గృహంలో డైట్, సోప్, ఆయిల్ బిల్లులు విద్యార్థులవారీగా విడుదలవుతాయి. కొత్తగా వసతి గృహాల్లో చేరిన విద్యార్థులకు స్టడీ, కండక్ట్తోపాటు ఆధార్, కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలి. అయితే విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల కోసం వారి ప్రాంతాల్లోని మీసేవ కేంద్రాల్లో దరఖాస్తు చేసుకున్నప్పటికీ.. రెవెన్యూ అధికారులు వాటిని జారీ చేయడంలో జాప్యం చేస్తున్నారు. దీంతో విద్యార్థులు తమ కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను వసతి గృహాల సంక్షేమాధికారులకు అందజేయలేకపోతున్నారు. ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు దరఖాస్తు చేసుకొని నెలలు గడుస్తున్నా అవి ఇంతవరకు జారీ కాకపోవడంతో వసతి గృహాల్లో ప్రవేశాల కోసం విద్యార్థులు పత్రాల కోసం దరఖాస్తు చేసుకున్న రశీదు చూపించి చేరుతున్నారు. అయితే ఆన్లైన్లో విద్యార్థుల వివరాల నమోదు కోసం ధ్రువీకరణ పత్రాలు తప్పక అవసరం ఉండడంతో విద్యార్థుల తల్లిదండ్రులు తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రెండు నెలలుగా నిలిచిన బిల్లులు.. ఈ విద్యా సంవత్సరం పాఠశాలలు జూన్ 12వ తేదీన ప్రారంభం కాగా.. ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పాఠశాలలు ప్రారంభమైన కొద్ది రోజుల్లోనే విద్యార్థులు చేరారు. గత ఏడాది వసతి గృహాల్లో ఉన్న విద్యార్థుల వివరాలు రెన్యూవల్ కావడంతో వారికి ప్రభుత్వం నుంచి డైట్, సోప్ అండ్ ఆయిల్ బిల్లులు మంజూరవుతున్నాయి. అయితే కొత్త విద్యార్థుల వివరా లు ఆన్లైన్లో నమోదు కాకపోవడంతో రెండు నెలలుగా వారికి విడుదల కావాల్సిన డైట్, సోప్, ఆయిల్ బిల్లులు మంజూరు కావడం లేదు. దీంతో వసతి గృహ సంక్షేమాధికారులు అప్పు తెచ్చి మరి వారికి డైట్ను అందించడంతోపాటు పలు వసతి గృహాల్లో సోప్, ఆయిల్ బిల్లులను చెల్లిస్తున్నారు. ఒక్కో విద్యార్థికి డైట్ కింద నెలకు రూ.950, సబ్బులు, ఆయిల్ కింద రూ.75 చొప్పున అందించాలి. విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదైతేనే వారికి బిల్లులు విడుదల కానుండడంతో వసతి గృహ సంక్షేమాధికారులు ఆందోళన చెందుతున్నారు. ఇంకా ఎన్ని రోజులు అప్పు తెచ్చి డైట్ను నిర్వహించాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్లో నమోదు చేయాలి.. ఎస్సీ సంక్షేమ శాఖ వసతి గృహాల్లో చేరిన ప్రతి విద్యార్థి వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో నమోదైన విద్యార్థికే డైట్, ఇతర బిల్లులు చెల్లిస్తారు. కొత్తగా చేరిన విద్యార్థులకు ఇలాంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ధ్రువీకరణ పత్రాలు సకాలంలో అందక విద్యార్థులు వివరాలు నమోదు కావడం లేదని సంక్షేమాధికారులు పేర్కొంటున్నారు. విద్యార్థుల వివరాలు ఆన్లైన్లో నమోదు కాగానే సదరు విద్యార్థులకు సంబంధించిన బిల్లులు చెల్లిస్తాం. – కస్తాల సత్యనారాయణ, ఎస్సీ వెల్ఫేర్ డీడీ సడలింపు ఇవ్వాలి.. ఎస్సీ వసతి గృహాల్లో ఉండి విద్యనభ్యసిస్తున్న విద్యార్థుల వివరాలను ఆన్లైన్ చేస్తేనే బిల్లులు చెల్లిస్తారు. పలు కారణాలతో వసతి గృహాల్లో కొత్తగా చేరిన విద్యార్థుల వివరాలు సకాలంలో ఆన్లైన్లో నమోదు కావడం లేదు. కొంత సడలింపు ఇచ్చి వివరాలు నమోదయ్యేలా కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల నిబంధనను తొలగించి, బిల్లులను విడుదల చేసి ఇబ్బందులను తొలగించాలి. అవసరమైన కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలు త్వరగా అందేలా చర్యలు చేపట్టాలి. – తుమ్మలపల్లి రామారావు, తెలంగాణ వసతి గృహాల సంక్షేమాధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
బయోమెట్రిక్తో అక్రమాలకు చెల్లు..!
సాక్షి, నల్లగొండ: హాస్టళ్లలో అక్రమాలకు చెక్ పడనుంది. సాంఘిక సంక్షేమ శాఖ వసతి గృహాల్లో ప్రభుత్వం బయోమెట్రిక్ యంత్రాలను ఏర్పాటు చేస్తోంది. ఇకనుంచి పిల్లల హాజరు అంతా బయోమెట్రిక్ పద్ధతిలోనే తీసుకుంటారు. ఏరోజు ఎంతమంది విద్యార్థులు బయోమెట్రిక్ ద్వారా హాజరువేస్తారో వారికే ప్రభుత్వం బిల్లు చెల్లిస్తుంది. తద్వారా అక్రమాలకు చెక్ పడనుంది. గతంలో రిజిష్టర్ల ద్వారా హాజరు తీసుకునేవారు. దాంతో పిల్లలు ఉన్నా లేకున్నా ఎక్కువ రాసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ యంత్రాల కారణంగా అలాంటి వాటికి అవకాశాలు ఉండవు. ప్రస్తుతం కళాశాలల్లో చదవని విద్యార్థులు కూడా హాస్టళ్లలో ఉంటూ వస్తున్నారు. అలాంటి వారికి కూడా ఇక నుంచి చెక్ పడనుంది. ప్రభుత్వానికి కూడా ఆదాయం మిగలనుంది. జిల్లాలో 61 ఎస్సీ హాస్టళ్లు జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ పరిధిలో 61 హాస్టళ్లు ఉన్నాయి. అందులో 46 ప్రీమెట్రిక్ హాస్టళ్లు ఉండగా 15 కళాశాల హాస్టళ్లు ఉన్నాయి. వీటన్నింటికీ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బయోమెట్రిక్ యంత్రాలను బిగించాలని నిర్ణయించారు. ఇప్పటికే జిల్లాకు యంత్రాలను పంపించారు. జిల్లాలోని నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లలోని హాస్టళ్లన్నింటికీ బ యోమెట్రిక్ మిషన్లను బిగించగా దేవరకొండ డివిజన్లో ఇంకా కొనసాగుతోంది. వారం రోజుల్లోగా అన్ని హాస్టళ్లకు బయోమెట్రిక్ మిషన్లను బిగించనున్నారు. బయోమెట్రిక్ ద్వారానే హాజరు.. గతంలో హాస్టళ్లలో విద్యార్థుల హాజరు రిజిస్టర్ల ద్వా రా కొనసాగేది. హాస్టల్లో ఉన్న విద్యార్థుల కంటే ఎ క్కువ మంది విద్యార్థులు ఉన్నట్లుగా పేర్లు రాసుకోవడం.. వారు ఇళ్లకు వెళ్లినా ఉన్నట్లుగా నమోదు చేసి.. కొం దరు హాస్టల్ వెల్ఫేర్ అధికారులు తప్పుడు బిల్లులు పొందేవారు. తద్వారా ప్రభుత్వ ఆదాయానికి ఎంతో గండి పడేది. ప్రస్తుతం ఈ బయోమెట్రిక్ మిషన్ల కారణంగా అలాంటి వాటికి చెక్ పడనున్నాయి. ఏరోజు బిల్లు ఆరోజే జనరేట్ హాస్టల్లో విద్యార్థి బయోమెట్రిక్ ద్వారా హాజరు వేస్తారు. దాంతో ఆరోజులో ఎంతమంది విద్యార్థులు ఆ హాస్టల్ నుంచి బయోమెట్రిక్ ద్వారా వేలి ముద్రవేస్తారో వారికి హాజరు ఆన్లైన్లో రికార్డు అవుతుంది. ఆ రోజే పిల్లలు చేసిన భోజనానికి సంబంధించిన బిల్లు జనరేట్ అవుతుంది. అలా నెల రోజులపాటు హాజరైనటువంటి విద్యార్థులకు సంబంధించి బిల్లులను నెలనాడు సంబంధింత హాస్టల్ వెల్ఫేర్ అధికారి తీసుకొని బిల్లుకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. చదివే పిల్లలకే భోజనం.. ప్రస్తుతం మాన్యువల్ పద్ధతిన హాజరు తీసుకోవడం వల్ల కొన్ని హాస్టళ్లలో వార్డెన్లకు నచ్చజెప్పి కొందరు విద్యార్థులు ఉంటున్నారు. కొందరు చదువుకుంటుండగా మరికొందరు ఊరికే హాస్టల్లో ఉంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కొందరు హాస్టల్ అధికారులను కూడా బెదిరించిన హాస్టల్లో ఉంటున్నారని ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. బయోమెట్రిక్ విధానం అమలైతే.. ఇక బయటి వ్యక్తులు హాస్టల్లో ఉంటే వారికి భోజనం పెట్టలేని పరిస్థితి. ఒకవేళ పెట్టినా అతనికి సంబంధించిన బిల్లురాదు. దాంతో అధికారే జేబు లో నుంచి కట్టాల్సి రావచ్చు. ఈ పరిస్థితుల్లో వారు హాస్టల్లో భోజనం పెట్టే పరిస్థితి ఉండదు. చదువుకునే పిల్లలే హాస్టల్లో ఉండే అవకాశం రానుంది. బయోమెట్రిక్ యంత్రాలు బిగిస్తున్నారు.. జిల్లాలోని అన్ని సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో బయోమెట్రిక్ యంత్రాలను బిగిస్తున్నారు. ఇప్పటికే నల్లగొండ, మిర్యాలగూడ డివిజన్లలో యాంత్రాల బిగింపు పూర్తయింది. దేవరకొండ డివిజన్లలో ఏర్పాటు చేస్తున్నారు. అన్నీ పూర్తి కాగానే విద్యార్థులకు నెంబర్ అలాట్ చేసి ఆతర్వాత బయోమెట్రిక్ ద్వారా ప్రతి రోజూ హాజరు నమోదు చేస్తాం. – రాజ్కుమార్, డీడీ, సాంఘిక సంక్షేమ శాఖ -
నిరుద్యోగుల ధైర్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎస్సీ స్టడీ సర్కిల్ నిరుద్యోగుల్లో ధైర్యం నింపుతోంది. ఇక్కడ శిక్షణ తీసుకున్న వారిలో మెజార్టీ మందికి ప్రభుత్వ ఉద్యోగాలు లభిస్తున్నాయి. గత ఐదేళ్లలో వివిధ ప్రభుత్వ శాఖల్లో 779 మందికి ఉద్యోగాలు దక్కడం గమనార్హం. ఐదేళ్లలో 6,818 మంది శిక్షణ పొందితే వీరిలో 12శాతం మందిని సర్కారు కొలువులు వరించాయి. ఇతర స్టడీ సర్కిళ్లతో పోలిస్తే ఈ సంఖ్య మెరుగ్గా ఉందని ఎస్సీ అభివృద్ధి శాఖ పేర్కొంటోంది. స్టడీ సర్కిళ్లలో శిక్షణల నిర్వహణ వ్యూహాత్మకంగా, పకడ్బందీగా నిర్వహిస్తుండటంతో సత్ఫలితాలు వస్తున్నట్లు ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. సివిల్ సర్వీసెస్కు ఐదుగురు.. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 11 స్టడీ సర్కిళ్లున్నాయి. హైదరాబాద్లో మెయిన్ సెంటర్ ఉండగా, మిగతావి నల్లగొండ, వరంగల్, కరీంనగర్, మహబూబ్నగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, సిద్దిపేట, సూర్యాపేట జిల్లా కేంద్రాల్లో ఉన్నాయి. సివిల్స్ తదితర ప్రతిష్టాత్మక పరీక్షలకు సంబంధించిన శిక్షణలు మాత్రం హైదరాబాద్లో జరుగుతాయి. పబ్లిక్ సర్వీస్ కమిషన్తోపాటు వివిధ నియామక బోర్డులు నిర్వహించే పరీక్షలకు విద్యార్థుల సంఖ్య, సౌకర్యం తదితర అంశాలను ప్రాతిపదికన తీసుకుని జిల్లా కేంద్రాల్లో శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు నుంచి ఇప్పటివరకు 779 మందికి సర్కారు కొలువులు దక్కాయి. ఇందులో అత్యధికంగా 454 మంది పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలు పొందారు. టీజీటీ/పీజీటీ/టీఆర్టీ కేటగిరీలో 46 మంది కొలువులు సాధించారు. మరో 46 మందికి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, 39 మంది సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఉద్యోగాలు సాధించారు. మొత్తంగా 45 రకాల విభాగాల్లో ఉద్యోగాలు సాధించినట్లు స్టడీ సర్కిల్ అధికారులు చెబుతున్నారు. ఐదేళ్లలో హైదరాబాద్ స్టడీ సర్కిల్లో 1,278 మంది అభ్యర్థులు శిక్షణ తీసుకోగా.. మిగతా 10 స్టడీ సర్కిళ్లలో 5,540 మంది శిక్షణ తీసుకున్నట్లు ఆ శాఖ గణాంకాలు చెబుతున్నాయి. తాజా నిర్ణయంతో మరింత మేలు.. శిక్షణ తరగతుల నిర్వహణ, అభ్యర్థుల వసతి, స్టడీ మెటీరియల్, భోజన సౌకర్యం వాటికి ఐదేళ్లలో స్టడీ సర్కిళ్లకు చేసిన ఖర్చు రూ.37.71 కోట్లు. తాజాగా ఫౌండేషన్ కోర్సు నిర్వహించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఇందులో భాగంగా అభ్యర్థుల ఎంపికను మొదలుపెట్టింది. ఫలానా ఉద్యోగాల కోసం కాకుండా జనరల్ అంశాలతో రూపొందించిన శిక్షణ కోసం ఈ కోర్సును నిర్వహిస్తున్నారు. ఇందులో శిక్షణ పొందిన అభ్యర్థులు దాదాపు ప్రతి ఉద్యోగానికి 50 శాతం సిద్ధంగా ఉంటారని, నోటిఫికేషన్లు వెలువడిన తర్వాత సబ్జెక్టు పరంగా శిక్షణ తీసుకుంటే మెరుగైన ఫలితాలుంటాయని భావించి ఈ నిర్ణయం తీసుకుంది. సివిల్స్ అభ్యర్థులకు అభినందన సభ ఎస్సీ స్టడీ సర్కిల్ ద్వారా 779 మందికి ఉద్యోగాలు రావడం గర్వంగా ఉంది. శాఖాధికారులు, ఉద్యోగులు, ఫ్యాకల్టీ కృషి, అభ్యర్థుల పట్టుదలతో ఈ ఉద్యోగాలు దక్కాయి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఇప్పటివరకు ఎక్కువగా దృష్టి పెట్టాం. ఇకపై కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లను అనుసరిస్తాం. గత ఐదేళ్లలో ఐదుగురికి సివిల్ సర్వెంట్ ఉద్యోగాలు దక్కాయి. వచ్చే నెలలో ఆయా అభ్యర్థులకు అభినందన సభ నిర్వహించాలని భావిస్తున్నాం. –పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు -
ఫలించిన పాలిసెట్ శిక్షణ
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యాభివృద్ధి కార్యక్రమంలో భాగంగా పదో తరగతి తర్వాత డిప్లొమా కోర్సుల వైపు తీసుకెళ్లేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చేసిన ప్రయత్నం ఫలించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని వసతిగృహాల్లో ఉంటున్న పదో తరగతి విద్యార్థుల్లో ప్రతిభావంతులను గుర్తించి పాలిసెట్కు ప్రత్యేక శిక్షణ ఇచ్చింది. జిల్లాకో కేంద్రం చొప్పున రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో 1,250 మందిని శిక్షణకు ఎంపిక చేసింది. ఈ క్రమంలో 988 మంది విద్యార్థులు పాలిసెట్–2019 పరీక్షకు హాజరయ్యారు. ఇందులో ఏకంగా 949 మంది విద్యార్థులు అర్హత సాధించారు. పరీక్ష రాసిన వారిలో దాదాపు 96 శాతం మంది అర్హత సాధించడం పట్ల ఆ శాఖ సంచాలకులు పి.కరుణాకర్ హర్షం వ్యక్తంచేశారు. త్వరలో మరిన్ని సెట్లకు.. ఎస్సీ అభివృద్ధి శాఖ 2018–19 విద్యా సంవత్సరంలో కొత్తగా పాలిసెట్ శిక్షణ నిర్వహించింది. శిక్షణ ఇచ్చేందుకు ప్రత్యేకంగా అధ్యాపకులను ఎంపిక చేసింది. వారితో దాదాపు నెలరోజుల పాటు శిక్షణ ఇప్పించింది. అదేవిధంగా పాలిసెట్కు సంబంధించిన మెటీరియల్ను ఉచితంగా పంపిణీ చేసింది. శిక్షణ సమయంలో విద్యార్థులకు ఉచిత వసతి, భోజన సదుపాయాలను సైతం ప్రభుత్వమే కల్పించింది. ఇందుకోసం రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 24.75 లక్షలు ఖర్చు చేసింది. వీటన్నిటి కారణంగా విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించారు. దీంతో ఇతర ప్రవేశ పరీక్షలకు సైతం శిక్షణ ఇచ్చే అంశంపై ఆ శాఖ దృష్టి సారించింది. పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో ఉంటున్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు ఎంసెట్, డిగ్రీ విద్యార్థులకు పీజీసెట్పై అవగాహన కల్పిస్తే ఎలా ఉంటుందనే అంశాన్ని పరిశీలిస్తోంది. -
ఎస్సీలకు కార్పొరేట్ విద్య!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ విద్యార్థులకు కార్పొరేట్ స్థాయిలో విద్యనందించేందుకు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ (బీఏఎస్) కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ఇదివరకు తెలంగాణ రాష్ట్రంలో పది జిల్లాలు ఉండటంతో జిల్లాకు 100 మంది చొప్పున విద్యార్థులను ఎంపిక చేసి వారికి ఉచితంగా రెసిడెన్షియల్ విద్యను అందిస్తోంది. తాజాగా జిల్లాల సంఖ్య పెరగడంతో ఈ కార్యక్రమాన్ని మరింత విస్తృతం చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ సన్నాహాలు చేస్తోంది. గురుకుల పాఠశాలలు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా ఎక్కువ మందికి నాణ్యమైన విద్యను అందించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపడుతోంది. జిల్లాను యూనిట్గా.. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాలు కావడంతో.. జిల్లాను యూనిట్గా తీసుకుని అన్ని జిల్లాలకూ ఈ పథకాన్ని వర్తింపజేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. దీంతో లబ్ధిదారుల సంఖ్య 1,000 నుంచి 3,300కు పెరగనుంది. జిల్లా స్థాయిలో బీఏఎస్ లబ్ధిదారుల ఎంపిక, బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల ఎంపిక కూడా కలెక్టర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఎంపిక చేసిన పాఠశాలల్లో విద్యార్థులకు అడ్మిషన్లు కల్పించడంతో పాటు ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రెసిడెన్షియల్ విద్యను కూడా అందిస్తారు. ఫీజులు పెంపు... బీఏఎస్ కింద ఎంపికైన వారిలో ఏడో తరగతిలోపు విద్యార్థులకు రూ. 20 వేలు, ఆపై తరగతుల వారికి రూ. 30 వేల చొప్పున ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుంది. నిర్వహణ భారీగా పెరగడంతో ఫీజులు పెంచాలని ఎస్సీ అభివృద్ధి శాఖ భావిస్తోంది. ప్రస్తు త ఫీజులకు రెట్టింపు ఫీజులిచ్చేలా ప్రతిపాదనలు సిద్ధం చేసింది. వీటిని త్వరలో ప్రభుత్వానికి పంపనుంది. ప్రభుత్వం ఆమోదిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచే వీటిని అమలు చేయనున్నట్లు ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ అన్నారు. -
‘ఉపకార’ గడువు పెంచండి
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు సంబంధించి దరఖాస్తు నమోదు గడువును నెలరోజుల పాటు పొడిగించాలని సంబంధిత సంక్షేమ శాఖలు ప్రభుత్వాన్ని కోరాయి. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాయి. ఈ నెల 31తో పోస్టుమెట్రిక్ విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలకు దరఖాస్తు గడువు ముగియనుంది. వాస్తవానికి ఈ దరఖాస్తుల ప్రక్రియ జూలై రెండో వారంలో మొదలవ్వగా అక్టోబర్ నెలాఖరుతో గడువు ముగిసింది. కానీ ఆలోపు కేవలం 4.72లక్షల మంది విద్యార్థులు మాత్రమే నమోదు చేసుకోవడంతో డిసెంబర్ నెలాఖరు వరకు గడువును పొడిగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా దరఖాస్తు గడువును మరో నెల రోజుల పాటు పెంచాలని సంక్షేమ శాఖ లు యోచిస్తున్నాయి. ఆ మేరకు గడువు తేదీ పెంపునకు అనుమతులు కోరుతూ ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు పి.కరుణాకర్ ప్రభుత్వానికి లేఖ రాశారు. దరఖాస్తులు 10.45 లక్షలే.. పోస్టుమెట్రిక్ కోర్సులకు సంబంధించి రాష్ట్రంలో 13.5 లక్షల మంది విద్యార్థులుంటారని సంక్షేమ శాఖలు అంచనా వేశాయి. ఈ మేరకు విద్యార్థుల నుంచి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి దరఖాస్తుల స్వీకరణ చేపట్టాయి. ఇందులో భాగంగా ఇప్పటివరకు కేవలం 10.45 లక్షల మంది విద్యార్థులు మాత్రమే ఈ పాస్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకున్నారు. మరో 3 లక్షల మందికి పైగా విద్యార్థులు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంది. రెండ్రోజుల్లో దరఖాస్తు గడువు ముగియనుండగా.. ఆ మేర దరఖాస్తులు వచ్చే అవకాశం లేదు. దీంతో దరఖాస్తు స్వీకరణను మరో నెల పాటు కొనసాగించాలని ఎస్సీ అభివృద్ధి శాఖ ఈ మేరకు భావించి ప్రభుత్వానికి నివేదించింది. ఒకట్రెండు రోజుల్లో ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే ఈ పాస్ సర్వర్లో స్వీకరణ గడువును అధికారులు పొడిగించనున్నారు. -
ఎస్సీ హాస్టళ్లకు సర్కారు కానుక
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధులను వినియోగించుకుని వసతిగృహ విద్యార్థులకు ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. అదనపు కోటాకింద ప్రత్యేక సరుకులు పంపిణీ చేస్తోంది. ప్రస్తుతం చలికాలాన్ని దృష్టి లో పెట్టుకుని పిల్లలు ఇబ్బంది పడకుండా నాణ్యమైన దుప్పట్లు, పరుపులు ఎస్సీ అభివృద్ధి శాఖ పంపిణీ చేస్తోంది. అలాగే 2 రకాల బూట్లు, స్కూల్ బ్యాగులనూ అందిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 865 వసతి గృహాలున్నాయి. వీటిలో 677 ప్రీమెట్రిక్, 188 పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో దాదాపు 40వేల మంది పిల్లలు వసతి పొందుతున్నారు. తాజాగా ఈ విద్యార్థులకు 2 రకాల వస్తువులను ఆ శాఖ అందించింది. దాదాపు 12.5 కోట్లు ఖర్చు చేసి మెటీరియల్ను కొనుగోలు చేసి వసతి గృహాలకు అందజేసింది. ప్రస్తుతం వసతి గృహ సంక్షేమాధికారులు పంపిణీని మొదలుపెట్టారు. రెండ్రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తవుతుందని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. -
వసతి గృహాల ప్రారంభమెప్పుడో..?
కరీంనగర్ఎడ్యుకేషన్: ఎస్సీ, బీసీ సంక్షేమ శాఖల కళాశాలస్థాయి వసతి గృహాలు ప్రారంభానికి నోచుకోక వందలాది మంది విద్యార్థులు ప్రవేశాల కోసం నిరీక్షిస్తున్నారు. ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి బాలురు, బాలికలకు రెండు కళాశాల స్థాయి వసతి గృహాలు, బీసీ సంక్షేమ శాఖ నుంచి రెండు బాలురు, ఒకటి బాలికల కళాశాలస్థాయి వసతి గృహాలు 40 రోజుల క్రితం మంజూరు కాగా ఇప్పటివరకు ప్రారంభానికి నోచుకోకపోవడం గమనార్హం. దీంతో జిల్లా వ్యాప్తంగా ఆయా కళాశాలల్లో చదువుతున్న నిరుపేద బీసీ, ఎస్సీ విద్యార్థులు కళాశాలలో ప్రవేశాలు, వసతి లేకపోవడంతో చదువులను అర్ధంతరంగా ఆపివేయాల్సిన దుస్థితి నెలకొంది. జిల్లా కేంద్రానికి 16 మండలాల్లోని ఆయా గ్రామాలకు చెందిన నిరుపేద బీసీ, ఎస్సీ విద్యార్థులు చదువు నిమిత్తం జిల్లా కేంద్రానికి రోజూ వచ్చి పోవడంతో బస్సు చార్జీలతో బెంబేలెత్తిపోతున్నా రు. సంక్షేమ వసతి గృహాలకు అద్దెకివ్వడానికి భవ న యజమానులు ముందుకు రాకపోవడం ఒక కారణమైతే.. అద్దెకు దొరికిన భవనాల కిరాయిల అద్దె రేట్లు ప్రభుత్వానికి గుదిబండగా మారడంతో వసతి గృహాల ప్రారంభానికి గ్రహణం పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వ అద్దె ధరలు తక్కువగా ఉండటం, స్థానిక అవసరాలకు అనుగుణంగా అద్దె ధరలు పెంచే అధికారం సంక్షేమ అధికారులకు లేకపోవడంతో ప్రస్తుత పరిస్థితిని వివరిస్తూ కలెక్టర్కు నివేదిక సమర్పించినట్లు సమాచారం. పోటాపోటీ దరఖాస్తులు.. బీసీ, ఎస్సీ వసతి గృహాల్లో ప్రవేశాలకు విద్యార్థులు పోటాపోటీగా దరఖాస్తులు చేసుకున్నారు. నిబంధనల ప్రకారం వంద మంది విద్యార్థులు ఉండాల్సిన వసతి గృహాల్లో ఇప్పటికే 150కి మించి విద్యార్థులు ఉండడంతో ఏం చేయాలో పాలుపోక సంక్షేమ శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. బీసీ, ఎస్సీ వసతి గృహాలకు విద్యార్థుల ప్రవేశాల తాకిడి అధికమవ్వడంతో కలెక్టర్ సర్ఫరాజ్ అహ్మద్ ఉన్న వసతి గృహాలకు తోడు ఎస్సీ సంక్షేమ శాఖ నుంచి రెండు (బాలురు, బాలికలు), బీసీ సంక్షేమ శాఖ నుంచి విద్యార్థులు తక్కువగా ఉన్నారనే నెపంతో చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి, వీణవంక, చొప్పదండి మండల కేంద్రాల్లోని ప్రీమెట్రిక్ హాస్టళ్లను పోస్టుమెట్రిక్ హాస్టళ్లుగా మారుస్తూ జిల్లా కేంద్రానికి తరలించారు. ఐదు కళాశాల స్థాయి వసతి గృహాల్లో ప్రవేశాల కోసం 540 మందికిపైగా విద్యార్థులు దరఖాస్తులు చేసుకొని ఎదురుచూస్తున్నారు. ఐదు హా స్టళ్లను నెలకొల్పుతూ తీసుకున్న నిర్ణయం 40 రోజు లు గడుస్తున్నా భవనాలు లభించకపోవడం, లభిం చిన చోట కిరాయి రేట్లు నిబంధనల ప్రకారం పొం తన లేకుండా ఉండడంతో వసతి గృహాల ప్రారంభంపై నీలినీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వ నిబం ధనల ప్రకారం ఒక చదరపు అడుగుకు రూ.5.50 చెల్లించే అవకాశం ఉంది. నగరంలో అద్దెలు ఉంటే ప్రభుత్వం ఇచ్చే ధర మాత్రం తక్కువగా ఉంది. దీనికితోడు ఖాళీ స్థలం, కారిడార్తోపాటు మరుగుదొడ్లు, మూత్రశాలలకు అద్దె కోసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. రహదారులు, భవనాల శాఖ అధికారులు ఇంటి నిర్మాణం కొలతలు చూసి అద్దె నిర్ణయిస్తారు. అధికారుల లెక్కలకు క్షేత్రస్థాయిలో భవన నిర్మాణాల యజమానుల కిరాయి రేట్లకు పొంతన లేకుండా పోవడంతో వసతి గృహాల ప్రా రంభం కొలిక్కి రావడం లేదు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకోని సంక్షేమ శాఖల కళాశాల స్థాయి వసతి గృహాల ప్రారంభానికి కసరత్తు ముమ్మరం చేయాలని విద్యార్థి సంఘాల నాయకులు,విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు. ‘వసతి గృహాల భవనాల ప్రారంభానికి త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నాం. అద్దె భవనాల రేట్లు అధికంగా ఉండటం, ప్రభుత్వ నిబంధనలు సరిపోక పరిస్థితిని పైఅధికారులకు విన్నవించాం. విద్యార్థుల నుంచి పెద్దఎత్తున దరఖాస్తులు వచ్చాయి’ అని ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి వినోద్కుమార్ తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీలకు శుభవార్త
కొత్తపల్లి(కరీంనగర్): తెలంగాణ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వరం ప్రకటించింది. ఇప్పటికే రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తూ.. విద్యుత్శాఖలో అనేక సంస్కరణలకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం మరో అడుగు ముందుకేసి నిరుపేద షెడ్యూల్డ్ కులాలకు అండగా నిలవాలని భావించింది. రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీల గృహ అవసరాల కోసం వినియోగించే విద్యుత్ను 101 యూనిట్ల వరకు ఉచితంగా సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. దీంతో ఆ వర్గాల్లో ఆనందం నెలకొంది. ప్రస్తుతం ఎస్సీ, ఎస్టీలకు 50 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తున్న ప్రభుత్వం తాజాగా 101యూనిట్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. టీవీలు, ఇతర విద్యుత్ గృహోపకరణాలు పెరిగినందున విద్యుత్ వినియోగం ఎక్కువైందని భావించిన సీఎం ఈ నిర్ణయం తీసుకోవడం ఎస్సీ, ఎస్టీ వర్గాల్లో సంతోషాన్ని నింపుతోంది. 101 యూనిట్లకయ్యే విద్యుత్చార్జీలను డిస్కంలకు ప్రభుత్వం చెల్లించనున్నట్లు తెలిపింది. దీంతో టీఎస్ ఎన్పీడీసీఎల్ కరీంనగర్ ఉమ్మడి సర్కిల్ పరిధిలో 26,069 సర్వీసులకు ప్రయోజనం చేకూరనుండగా.. ఇందుకయ్యే నెలకయ్యే రూ.50,60,101 విద్యుత్ చార్జీలను ప్రభుత్వం చెల్లించనుంది. 26,069 సర్వీసులకు ప్రయోజనం కరీంనగర్ ఉమ్మడి సర్కిల్ పరిధిలోని 26,069 విద్యుత్ సర్వీసులకు ప్రయోజనం చేకూరుతుండగా.. ఇందుకు సంబంధించిన రూ.50,60,101 విద్యుత్ చార్జీలను ప్రభుత్వం భరించనుంది. ఎస్సీ 24,778 సర్వీసులకు గాను రూ.47,88,299లు, ఎస్టీ 1291 సర్వీసులకు గాను రూ.2,71,802ల మొత్తాన్ని డిస్కంలకు ప్రభుత్వం చెల్లించనుంది. ఆదేశాలు రాగానే అమలు: కె.మాధవరావు, ఎస్ఈ, కరీంనగర్ సర్కిల్ ఎస్సీ, ఎస్టీలకు ప్రయోజనం చేకూర్చుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 101 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ను టీఎస్ ఎన్పీడీసీఎల్ నుంచి ఆర్డర్ రాగానే అమలు చేస్తాం. ఇంకా పేర్లు నమోదు చేసుకోని వినియోగదారులు కుల ధ్రువీకరణ పత్రంతో సంబంధిత ఏఈలకు దరఖాస్తు చేసుకోవాలి. -
విద్యానిధి.. ప్రతిభకు పెన్నిధి
20 లక్షలు - ఏఓవీఎన్ కింద పీజీ, పీహెచ్డీ కోర్సులకు.. 465 మంది - నాలుగేళ్లలో లబ్ధిపొందిన విద్యార్థులు 81.10 కోట్లు - మొత్తం అయిన ఖర్చు సాక్షి, హైదరాబాద్: సంపన్నులకే సాధ్యమయ్యే విదేశీ చదువు సామాన్యుడి చెంతకు చేరింది. తెలంగాణ ప్రభు త్వం తలపెట్టిన అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యా నిధి (ఏఓవీఎన్) పథకంతో వందలాది దళిత ప్రతిభావంతులు విదేశాల్లో పట్టభద్రులయ్యారు. అంతేకాదు, అక్కడున్న బహుళజాతీయ సంస్థల్లో ఉన్నత కొలువులు సంపాదించి తోటివారికిమార్గదర్శకులయ్యారు. నాలుగేళ్లలో ఏకంగా 465 మంది తెలంగాణ బిడ్డలు అమె రికా, కెనడా, జర్మనీ, ఫ్రాన్స్, జపాన్, న్యూజిలాండ్, సింగపూర్, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియాలో ఉన్నత చదువులు పూర్తి చేసి ఉన్నత ఉద్యోగాలలో స్థిరపడ్డారు. ఎస్సీ అభివృద్ధి శాఖ ద్వారా అమలవుతున్న అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి పథకంతో లబ్ధిపొందిన వారి పరిస్థితి ఎలా ఉందనే కోణంలో ఆ శాఖ ఇటీవల పరిశీలన చేపట్టింది. ఎంపిక చేసిన జాబితా ఆధారంగా దాదాపు 65 మందితో మాట్లాడారు. ఇందులో దాదాపు 50 మంది అభ్యర్థులు కోర్సు పూర్తి చేసి బహుళజాతి సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలు చేస్తుండటంతో అధికారులు సైతం హర్షం వ్యక్తం చేస్తున్నారు. రెట్టింపు సాయంతో... 2013–14 విద్యా సంవత్సరంలో అమల్లోకి వచ్చిన ఏఓవీఎన్ కింద రూ.10 లక్షల ఆర్థిక సాయం చేసేవారు. విదేశీ విద్యకు ఆ మొత్తం సరిపోయేది కాదు. దీంతో సింగిల్ డిజిట్లోనే అభ్యర్థులు లబ్ధిపొందేవారు. ఈ క్రమంలో తెలంగాణ ప్రభుత్వం ఆ మొత్తాన్ని రూ.20 లక్షలకు పెంచింది. దీంతో పదుల సంఖ్యలో విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు. తాజాగా ఎస్సీ, బీసీ, ఈబీసీలకు వేర్వేరు పేర్లతో విదేశీ విద్యానిధి పథకాన్ని అమలు చేస్తున్నారు. తొలుత ఎస్సీలకు ఈ పథకాన్ని అమలుచేసిన క్రమంలో వారి పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవాలని భావించిన ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్, క్షేత్రస్థాయిలో అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏఓవీఎన్ పథకం కింద 465 మంది ఎంపిక కాగా, రూ.81.10 కోట్లను ప్రభుత్వం ఆర్థిక సాయం రూపంలో అందించింది. లక్ష్యాన్ని సాధించా... హైదరాబాద్లో మాది మధ్యతరగతి కుటుంబం. అమెరికాలో పీజీ చదవాలనేది నా కోరిక. బీటెక్ పూర్తి చేసిన తర్వాత అంబేడ్కర్ ఓవర్సీస్ విద్యానిధి కింద దరఖాస్తు చేశా. డల్లాస్లోని బాప్టిస్ట్ యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ పూర్తి చేశా. తొలి ప్రయత్నంలోనే డెల్ కంపెనీలో ప్రాజెక్టు మేనేజ్మెంట్ విభాగంలో ఉద్యోగం వచ్చింది. ఈ పథకం ద్వారా లబ్ధి పొందకుంటే విదేశీ విద్య అభ్యసించేదాన్ని కాదు. – కొల్లాబత్తుల సింధూజ ఉత్తమమైన పథకం ఇది.. ప్రభుత్వం అమలు చేస్తున్న విద్యానిధి పథకం ఎస్సీలకు వరమే. ఈ పథకం కింద రూ.20లక్షల ఆర్థిక సాయం అందుతుంది. వీసా ఖర్చు, యూనివర్సిటీలో ప్రవేశం, ట్యూషన్ ఫీజు, ఫ్లైట్ చార్జీలు సైతం ఈ నిధుల నుంచే వినియోగించుకున్నా. ప్రతిభగల విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఈ పథకం ఉత్తమమైనది. నా కుటుంబం ఎప్పటికీ తెలంగాణ ప్రభుత్వానికి రుణపడి ఉంటుంది. – నీరటి భాస్కర్ పథకంతో దశ తిరిగింది.. నాన్న అరకొర వేతనంతో మా జీవితం అంతంతమాత్రంగానే ఉండేది. డిగ్రీ వరకు ఎలా గోలా నెట్టుకొచ్చినా ఎమ్మెస్ చేయలేనని భావించా. అప్పుడే ఈ పథకం గురించి తెలిసింది. దరఖాస్తు ప్రక్రియంతా పారదర్శకంగా జరిగింది. ప్రభుత్వ కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధిశాఖ డైరెక్టర్ ఆధ్వర్యంలో ఇంటర్వ్యూలో పాల్గొన్నా. మంచి మార్కులు రావడంతో అమెరికాలోని బ్రిడ్జిపోర్ట్ యూనివర్సిటీలో కంప్యూ టర్ సైన్స్లో ఎంఎస్లో చేరా. డిస్టింక్షన్లో పాసై అబ్వీ అండ్ ఇన్ఫినిటీ ఫార్మాస్యూటికల్స్ అనే కంపెనీలో ఐటీ అనలిస్ట్గా ఉద్యోగం సంపాదించా. – వూట్ల దివ్యశాంతి అపరిమిత సంఖ్యలో ఎంపిక.. ఏఓవీఎన్ పథకానికి ప్రస్తుతం ఎలాంటి సీలింగ్ లేదు. అర్హులు ఎంత మంది ఉన్నా వారికి ఆర్థిక సాయం అందిస్తాం. యూనివర్సిటీ ప్రవేశాలు, ఫీజుల ఆధారంగా ఒక్కో లబ్ధిదారుకు గరిష్టంగా రూ.20 లక్షల ఆర్థిక సాయం ఇస్తున్నాం. అర్హత సాధించిన అనంతరం యూనివర్సిటీలో ప్రవేశం తీసుకున్నట్లు అడ్మిట్ కార్డును ఆన్లైన్లో అప్డేట్ చేసిన వెంటనే రెండు వాయిదాల్లో ఫీజులు చెల్లిస్తున్నాం. వందశాతంపారదర్శకంగా నిర్వహిస్తున్నాం. – పి.కరుణాకర్, ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు -
‘కాస్మొటిక్’ వెతలు!
ఆదిలాబాద్రూరల్: అమ్మానాన్నలకు దూరంగా ఉండి.. చదువే లక్ష్యంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు సంక్షేమ వసతి గృహాల విద్యార్థులు. ప్రభుత్వం హాస్టళ్లలో వసతులు కల్పిస్తున్నట్లు పేర్కొనడం కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. ప్రభుత్వం విద్యార్థులకు సరిపడా కాస్మొటిక్ చార్జీలు చెల్లించకపోవడంతో ఆయా వసతిగృహ విద్యార్థులు విద్యపై దృష్టి సారించలేకపోతున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా చార్జీలేవి..! ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహాల్లో ప్రైవేటుకు దీటుగా కార్పొరేట్ స్థాయిలో నాణ్యమైన విద్యతో పాటు సౌకర్యాలు కల్పిస్తామని చెబుతున్నా ఆచరణలో అవి కనిపించడం లేదని విద్యార్థి సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా ఆయా వసతిగృహాల్లో చదువుతున్న పేద విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీలు ప్రభుత్వం చెల్లించడం లేదు. దీంతో వారు అనేక ఇబ్బందులకు గురై చదువుపై శ్రద్ధ పెట్టలేకపోతున్నారు. ప్రభుత్వం విద్యార్థుల ఖర్చులకు సరిపడా చార్జీలు అందించకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతినెలా వాటిని కొనుగోలు చేస్తుండడంతో విద్యార్థుల తల్లిదండ్రులపై అదనపు భారం పడుతోంది. కడు పేదరికంతో కొట్టుమిట్టాడుతున్న కొంతమంది తల్లిదండ్రులు పిల్లల జీవితాలు చదువుతోనే బాగుపడుతాయని భావించి ప్రభుత్వ వసతిగృహాల్లో చేర్పిస్తున్నారు. అక్కడ విద్యార్థుల ఖర్చులకు నెలనెలా డబ్బులు పంపించాల్సి వస్తుండడంతో ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాస్మొటిక్ చార్జీలు ఇలా.. జిల్లాలో ఎస్సీ బాలుర 19 వసతి గృహాలు ఉండగా, ఇందులో 821 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బీసీ ప్రీమెట్రిక్ 9 వసతిగృహాలు ఉండగా 573 మంది చదువుతున్నారు. గిరిజన వసతి గృహాలు 38 ఉండగా ఇందులో 10,621 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. బాలురకు కాస్మొటిక్ చార్జీల కింద నెలకు రూ.62 చెల్లిస్తున్నారు. ఆయా వసతి గృహాల్లో చదువుతున్న బాలుర విద్యార్థులకు కాస్మొటిక్ చార్జీల కింద ప్రభుత్వం నెలకు రూ.62 అందజేస్తుంది. ఇందులో విద్యార్థి రూ.50 తో సబ్బులు, నూనెలు, టూత్పేస్ట్, పౌడర్ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీంతోపాటు హెయిర్ కటింగ్కు రూ.12 చెల్లిస్తుంది. ఎస్సీ, బీసీ వసతిగృహాల కాస్మొటిక్ చార్జీలను నేరుగా విద్యార్థులకు అందజేస్తారు. కాగా ఐటీడీఏ పరిధిలోని వసతి గృహాల విద్యార్థులకు సంబంధించి కాస్మొటిక్ చార్జీలను టెండర్ ద్వారా అందజేస్తారు. కటింగ్ చార్జీలకు సంబంధించిన సొమ్మును సంబంధిత వసతిగృహ ప్రధానోపాధ్యాయుడి ఖాతాలో జమ చేస్తారు. అయితే ప్రభుత్వం చెల్లిస్తున్న చార్జీలతో నాయీ బ్రాహ్మణులు హెయిర్ కటింగ్ చేయడానికి ముందుకు రావడం లేదు. ప్రభుత్వం చెల్లిస్తున్న డబ్బులు నిత్యవసర వస్తువుల ధరలకు అనుగుణంగా లేకపోవడం, బయట మార్కెట్లో హెయిర్ కటింగ్కు ఒక విద్యార్థికి రూ.40 నుంచి రూ.50 తీసుకుంటుండడంతో ఇవి ఎటూ సరిపోవడం లేదని విద్యార్థులు పేర్కొంటున్నారు. ఈ విషయమై ఆయా వసతి గృహ నిర్వాహకులకు తెలియజేసినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఇటీవల జిల్లా కేంద్రంలోని ఓ వసతిగృహ విద్యార్థులు ఒకరికొకరు క్షవరం (హెయిర్ కటింగ్) చేసుకోవడం సంచలనం కలిగించింది. లోపిస్తున్న నాణ్యత.. ఐటీడీఏ పరిధిలోని గిరిజన సంక్షేమ వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు కాంట్రాక్టర్ల ద్వారా సరఫరా చేస్తున్న కాస్మొటిక్లలో నాణ్యత లోపిస్తోందనే విమర్శలున్నాయి. కాంట్రాక్టు దక్కించుకునే సమయంలో నాణ్యతగల వస్తువులను చూపించిన కాంట్రాక్టర్లు తీరా నాసిరకం వస్తువులు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అధికారులు సైతం చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాస్మొటిక్ కిట్ మాదిరిగా పంపిణీ చేయాలి.. వసతి గృహాల్లోని విద్యార్థులకు కేసీఆర్ కిట్ అందిస్తున్న విధంగానే బాలుర వసతిగృహ విద్యార్థులకు సైతం కిట్లాగా అందజేస్తే బాగుంటుంది. ప్రభుత్వం చెల్లిస్తున్న చార్జీలు విద్యార్థులకు సరిపోవడం లేదు. ఈ విషయంపై ప్రభుత్వం దృష్టిసారించాలి. – శివకుమార్, హెచ్డబ్ల్యూవో, బీసీ హాస్టల్, ఆదిలాబాద్ చార్జీలు సరిపోవడంలేదు ప్రస్తుతం ప్రభుత్వం అందజేస్తున్న కాస్మొటిక్ చార్జీలు రూ.62 సరిపోవడంలేదు. పెరిగిన నిత్యవసర ధరలకు అనుగుణంగా చార్జీలు పెంచాలి. హెయిర్ కటింగ్ కోసం ప్రభుత్వం రూ.12 మాత్రమే చెల్లిస్తుంది. కటింగ్ కోసం బయట రూ.40 నుంచి రూ.50 చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఆర్థికంగా భారమవుతోంది. – సాయికృష్ణ, బీసీ హాస్టల్ విద్యార్థి, ఆదిలాబాద్ ప్రతిపాదనలు పంపించాం ప్రీమెట్రిక్ బాలుర వసతి గృహాల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రస్తుతం కాస్మొటిక్ చా ర్జీల కింద ఒక్కొక్కరికి నెలకు రూ.62 అందజేస్తున్నాం. ఇందులో హెయిర్ కటింగ్ కోసం రూ.12, మిగితా రూ.50తో సబ్బులు, పౌడర్, నూనె కొనుగోలు చేసేందుకు అం దిస్తుంది. విద్యార్థినులకు కాస్మొటిక్ కిట్లు అందజేస్తున్నట్లుగా బాలురకు కూడా అందించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించాం. – ఆశన్న, జిల్లా బీసీ అభివృద్ధి శాఖ అధికారి -
డేటా లేకుండా రిజర్వేషన్లు ఎలా?
న్యూఢిల్లీ: ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు తక్కువ ప్రాతినిధ్యం ఉందని నిరూపించే సమాచారంతో రాష్ట్రాలు ఎందుకు ముందుకు రావడంలేదని సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. నియామకాలు, పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించేందుకు పరిమాణాత్మక సమాచారమే కీలకమని ఉద్ఘాటించింది. పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు క్రీమీలేయర్ను వర్తింపజేయాలన్న 12 ఏళ్ల నాటి కోర్టు తీర్పును కేంద్రం సవాలుచేయడం తెల్సిందే. ఆ పిటిషన్ను విచారిస్తూ సుప్రీం పైవిధంగా స్పందించింది. పదోన్నతుల్లో దళితులకు 23 శాతం కోటా ఉండాలని కేంద్రం ఉద్ఘాటించింది. 2006 నాటి ఎం.నాగరాజ్ కేసులో ఎస్సీ, ఎస్టీల పదోన్నతులకు వెనకబాటుతనం, తక్కువ ప్రాతినిధ్యాన్ని కోర్టు ప్రాదిపదికగా నిర్ధారించడం తెల్సిందే. దీంతో వారికి పదోన్నతులు దాదాపు నిలిచిపోయాయని, ఆ తీర్పును ఏడుగురు సభ్యుల బెంచ్ పునఃపరిశీలించాలని కేంద్రం కోరింది. ‘క్రీమీలేయర్పై 12 ఏళ్ల క్రితం వెలువడిన తీర్పు తప్పని నిరూపించాలంటే, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగిందనే సమాచారాన్ని గణాంకాలతో సహా సమర్పించాలి. ఇన్నేళ్లయినా ఆ వివరాలను రాష్ట్రాలు ఇంకా ఎందుకు సేకరించలేదు?’ అని కోర్టు కేంద్రాన్ని ప్రశ్నించింది. కేంద్రం తరఫున విచారణకు హాజరైన అటార్నీ జనరల్ వేణుగోపాల్ వాదిస్తూ..వెనకబడిన తరగతులుగా భావిస్తున్న ఎస్సీ, ఎస్టీలు వెనకబడిన వాళ్లమని ప్రత్యేకంగా నిరూపించుకోవాల్సిన అవసరంలేదన్న 1992 నాటి ఇందిరా సహానీ కేసును ఉదహరించారు. పరిమాణాత్మక సమాచారం అందుబాటులో ఉంటే నియామకాల్లో రిజర్వేషన్లు కల్పించే అధికారాలు రాష్ట్రాల పరిధిలోనే ఉంటాయని కోర్టు బదులిచ్చింది. వారికి తగిన ప్రాతినిధ్యం లేదని భావిస్తే, వేగంగా పదోన్నతులు కల్పించే బాధ్యత రాష్ట్రాలదే అని పేర్కొంది. -
ఎస్సీ, ఎస్టీ చట్టాలపై అవగాహన కలిగిఉండాలి
ములుగు రూరల్ వరంగల్ : సమాజంలో అంటరానితనాన్ని రూపుమాపాలని కలెక్టర్ దుగ్యాల అమయ్కుమార్ పిలుపునిచ్చారు. పౌరహక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని(సివిల్ రైట్స్ డే) పురస్కరించుకొని ఇంచర్ల గ్రామ ఎస్సీ కాలనీలో తహసీల్దార్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ప్రతి పౌరుడు తన హక్కులను వినియోగించుకోవడంతోపాటు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాలపై అవగాహన కలిగిఉండాలని సూచించారు. నిమ్న జాతుల వారిని కించపరిచినట్లు మాట్లాడితే చట్ట ప్రకారం శిక్ష అర్హులవుతారని పేర్కొన్నారు. ప్రతి నెలా చివరి రోజున గ్రామాలలో సివిల్ రైట్స్ డే కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులకు సూచించారు. నిరుద్యోగ యువత కోసం ప్రత్యేక ఏర్పాటు చేయనున్న శిక్షణ శిబిరాలను సద్వినియోగం చేసుకొని ఆర్థికాభివృద్ధి సాధిం చాలని కోరారు. స్కిల్ డెవలప్మెంట్ శిక్షణ ఇచ్చి పర్యాటక ప్రాంతాలలో ఆర్ధిక వనరులను కల్పిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా దళితులకు మూడెకరాల భూమిని కేటాయించాలని, డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూ చేయాలని, సీసీ రోడ్లను నిర్మించాలని గ్రామస్తులు కలెక్టర్ కోరగా.. పంపిణీకి ప్రభుత్వ భూమి లేదని, అమ్మేవారు ఉంటే తహసీల్దార్ దృష్టిఇ తీసుకువెళ్లాలని సూచించారు. మంత్రి చందూలాల్తో మాట్లాడి డబుల్ బెడ్రూం ఇళ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే సీసీరోడ్ల ఏర్పాటుకు నివేదికలు తయారు చేయాలని ఎంపీడీఓ విజయ్ స్వరూప్ను ఆదేశించారు. తన కూతురు కళ్యాణలక్ష్మీ దరఖాస్తును అధికారులు తిరస్కరించారని గ్రామానికి చెందిన వ్యక్తి కలెక్టర్కు ఫిర్యాదు చేయగా పరిశీలించి పథకం వర్తింపజేయాలని తహసీల్దార్ను ఆవేశించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ రవికిరణ్, ఎస్సై బండారి రాజు, జెడ్పీటీసీ సకినాల శోభన్, సర్పంచ్ ముడతనపల్లి కవితకుమార్, ఎంపీటీసీ సభ్యుడు శానబోయిన అశోక్, ఆర్ఐ అఫ్రీన్, యుగంధర్రెడ్డి, వీఆర్వో సూరయ్య పాల్గొన్నారు. -
సబ్ప్లాన్ చట్టానికి తూట్లు..!
ఒంగోలు టూటౌన్ : జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక చట్టం అమలుకు అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఎన్నో పోరాటాలు చేసి సాధించుకున్న ఉప ప్రణాళిక నిధుల వినియోగంపై నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. నోడల్ ఏజెన్సీ ద్వారా వివిధ శాఖల నుంచి జనాభా ప్రతిపాదికన ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన నిధులను రాబట్టి వాటిని సకాలంలో ఖర్చు చేయడంతోపాటు ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి అవకతవకలు లేకుండా చూడాల్సిన జిల్లా మానిటరింగ్ కమిటీ అందుకు తగినంతగా పనిచేయడం లేదన్న విమర్శలు దళిత, గిరిజన సంఘాల నుంచి వినిపిస్తున్నాయి. చట్టం ఏర్పాటు ఇలా.. దశాబ్దాలుగా ఆర్థికంగా, సామాజికంగా వెనుకబడిన దళిత, గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేక నిధులు అవసరంపై అనేక పోరాటల ఫలితంగా జనవరి 1, 2013లో ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక చట్టం వచ్చింది. దేశంలో దళితులు 17.08 శాతం, గిరిజనులు 6 శాతం ఉన్నారు. ఈ చట్ట ప్రకారం దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాధికన బడ్జెట్లో నిధులు కేటాయింపు జరగాలి. కేటాయించిన నిధులను ఈ రెండు సామాజిక వర్గాల అభివృద్ధికి ఖర్చు చేయాలి. చట్టం ఏం చెబుతోంది..? ముఖ్యమంత్రి అధ్యక్షతన రాష్ట్ర కౌన్సిల్ ఏర్పాటు చేయడంతో ఏటా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జీవో నంబర్ 8, 23.12.2013 ప్రకారం నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి. ఈ నోడల్ ఏజెన్సీకి చీఫ్ మినిస్టర్ చైర్మన్ కాగా 35 మందిని మెంబర్లుగా నియమిస్తారు. కన్వీనర్గా ప్లానింగ్ కమిషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఉంటారు. ఈ నోడల్ ఏజెన్సీకి ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాదికన బడ్జెట్లో నిధుల కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. జిల్లాలో నోడల్ ఏజెన్సీ ఏర్పాటు.. జీవో నంబర్ 34 ప్రకారం జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటిలో 22 మంది సభ్యులు ఉన్నారు. ఈ కమిటికి జిల్లా కలెక్టర్ చైర్మన్ కాగా ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మెంబర్ కన్వీనర్గా ఉంటారని జీవో చెబుతుంది. ఈ జీవోని 01.11.2013న ప్రభుత్వం విడుదల చేసింది. అప్పటి నుంచి ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక నిధులపై సమీక్షించిన దఖాలాలు ఏ మాత్రం కనిపించడంలేదని తెలుస్తోంది. ఆ తరువాత ప్రభుత్వం జీవో నంబర్ 6 ని 2014లో విడుదల చేసింది. దీనిలో జిల్లా కలెక్టర్ చైర్మన్ కాగా ఐటీడీఏ ఉన్న ప్రాంతాలలో ఆ శాఖ జిల్లా అధికారి కన్వీనర్గా ఉండగా మిగిలిన శాఖల అధికారులు మెంబర్లుగా ఉంటారని స్పష్టం చేసింది. ఐటీడీఏ లేని ప్రాంతాలలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటి డైరెక్టర్ మెంబర్ కన్వీనర్గా నోడల్ ఏజెన్సీ ఏర్పాటు చేయాలి. ఈ నోడల్ ఏజెన్సీ జిల్లాలో ఉన్న ప్రభుత్వం శాఖల నుంచి ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాదికన నిధులు కేటాయింపునకు చర్యలు తీసుకోవాలి. ఇంకా బడ్జెట్ ప్రతిపాదనలు, నిధుల సమీకరణ, వాటికి ఖర్చుకు సంబంధించిన మానిటరింగ్ను చేయాల్సి ఉంది. అంతే కాకుండా ఏటా సామాజిక తనిఖీలు నిర్వహించి అభివృద్ధి పథకాల అమలలో అవకతవకలు జరగకుండా పర్యవేక్షించాల్సి ఉంది. అలాంటి పనులు జిల్లాలో ఏమాత్రం జరగటం లేదు. ఇంకా జిల్లా స్థాయిలో మానిటరింగ్ కమిటీలకు జిల్లా కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీ వేసి ఉప ప్రణాళిక అమల తీరును పర్యవేక్షించాల్సి ఉంది. రెండు నెలలకొకసారి సమావేశాలు జరపాల్సి ఉందని జీవ 34 చెబుతుంది. మౌలిక సదుపాయలు లేక దళిత, గిరిజన గ్రామాలు విలవిల.. జిల్లాలో 56 మండలాలు ఉండగా కందుకూరు, మార్కాపురం, ఒంగోలు రెవెన్యూ డివిజన్లుగా పరిపాలన సాగుతుంది. మొత్తం 1028 గ్రామపంచాయితీలు వీటి పరిధిలో ఉన్నాయి. 33 లక్షల జనాభా ఉన్న జిల్లాలో అత్యధిక శాతం దళిత, గిరిజనులే ఉన్నారు. వీరిలో 50 శాతానికి పైగా భూములు లేని కుటుంబాలు ఉండి, కేవలం దినసరి కూలీపైనే ఆధారి పడి జీవిస్తున్నాయి. మట్టి రోడ్లకు నోచుకోని పల్లెలతో పాటు, తాగునీరు, వీధిలైట్లు ఇలాకనీస మౌళిక సదుపాయాలు లేని గ్రామాలు దశాబ్ధాలుగా అభివృద్ధికి నోచుకోకుండా ఉన్నాయి. ఇంకా స్మశానాలు లేని గ్రామాలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి దళిత, గిరిజన ప్రజాప్రతినిధులు కూడా పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు. ఉపప్రణాళిక నిధుల జమఖర్చులపై ప్రశ్నించిన నాధుడు లేడు. చట్టం రాకముందు దళిత, గిరిజన నిధులు దారిమళ్లుతున్నాయని ఘోషించిన దళిత, గిరిజన నాయకులు చట్టం వచ్చిన తరువాత నోరుమెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లా కలెక్టర్, జేసీలకు ఫిర్యాదులు.. జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక కమిటీ సమావేశాలు, నిధుల ఖర్చు, సమావేశాలు ఏమి జరగటం లేదని అంబేద్కర్ ఫీపుల్స్ జేఏసీ నాయకులు ఎం.కిషోర్కుమార్, మిట్నసల బెంజిమెన్ ఇటీవల జిల్లా కలెక్టర్కు విన్నవించారు. తరువాత జాయింట్ కలెక్టర్–2 మార్కెండేయులకు పిర్యాదు చేశారు. సంబధిత నోడల్ ఏజెన్సీ కన్వీనర్ని పిలిపించి జిల్లా స్థాయి మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపినట్లు తెలిపారు. -
ఎవరికి ఏమిచ్చాం
సాక్షి, హైదరాబాద్ : రాబోయే సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా అధికార తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్) అస్త్రశస్త్రాలు సిద్ధం చేసుకుంటోంది. అభివృద్ధి, సంక్షేమం నినాదంతో ఎన్నికలకు వెళ్లే వ్యూహంతో అన్ని ఏర్పాట్లూ చేసుకుంటోంది. దేశానికే ఆదర్శంగా నిలిచే సంక్షేమ పథకాలను అమలు చేశామని చెబుతున్న అధికార పార్టీ దానికి తగినట్లుగానే వివరాలన్నీ సేకరిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం కొలువుదీరిన రోజు నుంచి అమలు చేస్తున్న అన్ని సంక్షేమ పథకాలను, ఆ పథకాల వారీగా లబ్ధిదారుల వివరాలను సేకరించే పనిలో నిమగ్నమైంది. సమగ్ర సమాచార నిధి.. రాష్ట్రవ్యాప్తంగా, జిల్లాలవారీగా, అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా, మండలాలవారీగా, గ్రామ స్థాయిలో లబ్ధిదారుల సంఖ్య, వారి వివరాలను సేకరించే ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే 80 శాతం వివరాలు ప్రభుత్వ శాఖల వద్ద ఉన్నాయి. మిగిలిన వివరాలను సేకరించడంతోపాటు, ఉన్న వివరాలను సరిచూసుకుని తప్పులు లేని విధంగా సంక్షేమ సమాచార నిధి ఏర్పాటే లక్ష్యంగా ముందుకెళుతోంది. ప్రభుత్వ పెద్దల సూచన మేరకు.. ఉన్నతాధికారులు ఈ వివరాలను సేకరిస్తున్నారు. ఎన్నికల ప్రచారం కోసమే కాక రాష్ట్రంలో అమలవుతున్న పథకాల వివరాలను పొందుపరిచే లక్ష్యంతో అధికారులు ఈ పని చేస్తున్నారు. ఎస్సీ అభివృద్ధి, గిరిజన, మైనారిటీ సంక్షేమ శాఖాల వారీగా వివరాలను పొందుపరుస్తున్నారు. ఈ శాఖల్లో అమలు చేసే సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను పూర్తి స్థాయిలో సేకరించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) ఎస్కే జోషి ఆయా శాఖల అధికారులను ఇటీవల ఆదేశించారు. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాలను సేకరించి పూర్తిస్థాయి డాటాబేస్ను రూపొందించాలని సూచించారు. డాటాబేస్ రూపకల్పన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ వెబ్సైట్లో ప్రత్యేకంగా ఒక పేజీలో ఈ వివరాలు అందిరికీ తెలిసేలా ఉంచనున్నారు. వంద శాతం స్పష్టత.. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎక్కువగా సంక్షేమ శాఖల ఆధర్యంలోనే అమలవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలకు ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉంది. ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్, విదేశీ విద్యానిధి తదితర కార్యక్రమాలు అమలవుతున్నాయి. ఆర్థిక చేయూత కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్లు, బీసీ ఫెడరేషన్లు సబ్సిడీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. కేజీటు పీజీ కార్యక్రమంలో గురుకుల పాఠశాలలను ప్రారంభించి 2.5 లక్షల మంది పిల్లలకు ఉచిత వసతితో కూడిన విద్యను అందిస్తున్నారు. గ్రామీణాభివద్ధి శాఖ లక్షలాది మందికి ఆసరా పింఛన్లు ఇస్తోంది. వైద్య, ఆరోగ్య శాఖ కేసీఆర్ కిట్లు, అంగన్వాడీల ద్వారా పౌష్టికాహారం పంపిణీ చేస్తోంది. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మక పెట్టుబడి సాయం, రైతు బీమా పథకాలు అమలవుతున్నాయి. ఆపద్భంధు, ఫ్యామిలీ బెనిఫిట్ పథకాలు రెవెన్యూ శాఖ అమలు చేస్తోంది. పశుసంవర్ధక శాఖ గొర్రెల పంపిణీ, డెయిరీ యూనిట్లు, మత్సశాఖ ద్వారా చేప పిల్లల పంపిణీ.. ఇలా పెద్ద సంఖ్యలో పథకాలు అమలవుతున్నాయి. అయితే అన్ని పథకాల సమగ్ర వివరాలు ప్రస్తుతం అందుబాటులో లేవు. దీన్ని సరి చేసేందుకు శాఖల వారీగా పథకాలు, కార్యక్రమాలు.. వీటి లబ్ధిదారుల వివరాలను సేకరిస్తున్నారు. వంద శాతం సరైన గణాంకాలు, వివరాలు ఉండేలా ఈ ప్రక్రియ సాగుతోంది. సామాజిక వర్గాల వారీగా.. సంక్షేమ పథకాల లబ్ధిదారుల వివరాల నమోదు పక్కా ప్రణాళికతో సాగుతోంది. గ్రామాలు, మండలాలు, నియోజకవర్గాలు, జిల్లాల వారీగా నమోదు చేయడంతోపాటు సామాజిక వర్గాల వారీ వివరాలనూ సేకరిస్తున్నారు. వ్యక్తిగత, కుటుంబాల వారీగానూ క్రోడీకరిస్తున్నారు. పథకాల వారీగా చేసిన ఖర్చు, లబ్ధిదారుల సంఖ్య తెలిసేలా ప్రభుత్వ వెబ్సైట్లో ఈ వివరాలను అందుబాటులో పెట్టనున్నారు. కచ్చితమైన సమాచారంతో ప్రజల్లోకి వెళ్లడం వల్ల పారదర్శకతతోపాటు, ప్రభుత్వానికి ప్రజలలో ఆదరణ ఉంటుందనే లక్ష్యంతో ఈ ప్రక్రియ చేపట్టారు. ఎస్సీ అభివృద్ధి శాఖ వివరాలు ఇప్పటికే దాదాపుగా నమోదయ్యాయి. రెవెన్యూ, వ్యవసాయ, పశుసంర్ధక, మైనారిటీ, బీసీ సంక్షేమ శాఖలు వివరాలను సేకరిస్తున్నాయి. ఎస్సీ అభివృద్ధి శాఖ వివరాలు.. రాష్ట్రంలో ఎస్సీ జనాభా : 54 లక్షలు కళ్యాణలక్ష్మీ లబ్ధిదారులు : 88,786 చేసిన ఖర్చు : రూ.504 కోట్లు పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్ లబ్ధిదారులు : 8,74,443 ప్రీమెట్రిక్ స్కాలర్షిప్ లబ్ధిదారులు : 2.50 లక్షలు ప్రీమెట్రిక్, పోస్టుమెట్రిక్ హాస్టళ్లలో విద్యార్థులు : 2.67 లక్షలు ఆర్థిక చేయూత(ఈఎస్ఎస్) పథకం లబ్ధిదారులు : 1,04,980 ఆర్థిక చేయూత(ఈఎస్ఎస్) పథకానికి మంజూరు : రూ.1,136 కోట్లు ఎస్సీ గురుకులాల్లో విద్యార్థులు : 57,500 -
జనసేనలో లుకలుకలు
ఏలూరు టౌన్ : సమాజంలో మార్పుకోసమంటూ...పేద, బలహీన, దళిత వర్గాల అభ్యుదయవాదిగా చెప్పుకుంటూ పవన్ కళ్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ప్రజా క్షేత్రంలో తనదైన శైలిలో ముందుకు వెళుతున్నారు. ఇక రెండురోజుల్లో పశ్చిమలో పవన్ పర్యటన సైతం ఖరారైంది. ఈ నేపథ్యంలో పార్టీ నేతల తీరుపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే మొదటి నుంచి పవన్ కళ్యాణ్ అభిమానులుగా, కాపు సామాజికవర్గంలో నాయకుడిగా ఉన్న జల్లా హరికృష్ణ ఆ పార్టీ నేతలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తూ జనసేనకు ఝలక్ ఇచ్చి టీడీపీలో చేరిపోగా, తాజాగా ఎస్సీ సామాజివర్గానికి చెందిన యువనేత సైతం తీవ్ర అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఆదివారం సాయంత్రం ఏలూరులోని జనసేన పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన సమావేశం రసాభాసగా మారింది. ఎప్పటినుంచో వపన్కళ్యాణ్కు వీరాభిమానిగా ఉంటూ ప్రతి కార్యక్రమంలోనూ ముందుంటే ఏలూరు వన్టౌన్ ప్రాంతానికి చెందిన ఒక ఎస్సీ యువ నాయకుడికి సమావేశంలో ఏ మాత్రం ప్రాధాన్యం ఇవ్వకపోగా, అధినేత సామాజికవర్గానికి చెందిన నేతలు అతనిపై గొడవ దిగి బయటకు నెట్టి వేసినట్లు తెలుస్తోంది. తాను ఎస్సీ కావటం వల్లే చిన్నచూపు చూస్తున్నారని ఆ యువ నాయకుడు ఆవేదన చెందినట్లు తెలుస్తోంది. ఇక మరో యువనేతపైనా పార్టీ నేతలు బెదిరింపులకు పాల్పడడం, కేసులు పెట్టేందుకు ప్రయత్నాలు చేయటంపై పార్టీలో విభేదాలకు అద్దం పడుతున్నాయి. -
పదోన్నతులపై నితీష్ కీలక నిర్ణయం
పాట్నా : ఎస్సీ, ఎస్టీ ప్రభుత్వ ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని బిహార్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం అధికారిక ప్రకటన విడుదల చేసింది. ప్రభుత్వ అధికారుల సలహా మేరకు సుప్రీంకోర్టు ఆదేశాలకు లోబడి ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది. గత కొంత కాలంగా రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలకు ఉద్యోగాల్లో ప్రమోషన్లు కల్పించాలని ప్రభుత్వ భావిస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఉన్నత స్థాయి కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కమిటీ సిపారసులకు మేరకు ప్రభుత్వం రిజర్వేషన్లలను కల్పిస్తూ ప్రకటన విడుదల చేసింది. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బిహార్ సీఎం నితీష్ కుమార్ తీసుకున్న ఈ నిర్ణయం ఏమేరకు ప్రతిఫలం ఇస్తుందో వేచి చూడాలి. -
మరింత ‘బెస్ట్’గా..
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ విద్యార్థులకు శుభవార్త. ఎక్కువ మంది నిరుపేద విద్యార్థులకు ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత వసతితో బోధన అందించేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రస్తుతం అమల్లో ఉన్న బెస్ట్ అవైలబుల్ స్కూల్ (బీఏఎస్) పథకానికి మరిన్ని హంగులు అద్దుతోంది. పరిమిత స్థాయిలో అమలు చేస్తున్న ఈ కార్యక్రమాన్ని విస్తృతం చేయాలని భావిస్తోంది. ఏటా గరిష్టంగా 5 వేల మంది విద్యార్థులను ఎంపిక చేసి ప్రైవేటు పాఠశాలల్లో ప్రవేశాలు కల్పించాలని యోచిస్తోంది. కేజీ టు పీజీ విద్యలో భాగంగా ప్రారంభించిన గురుకుల పాఠశాలలకు క్రేజ్ పెరగడం.. దరఖాస్తు చేసుకున్న వారందరికీ సీట్లు ఇవ్వడం కష్టమవడంతో ఈ ప్రత్యామ్నాయ పద్ధతికి శ్రీకారం చుట్టింది. బీఏఎస్ ద్వారా మరింత మంది విద్యార్థులకు ఉచిత విద్య అందించేందుకు ఉపక్రమించింది. ఒకటో తరగతి నుంచే.. రాష్ట్రంలో 185 పాఠశాలలను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లుగా ఎస్సీ అభివృద్ధి శాఖ గుర్తించింది. పదేళ్లలో వచ్చిన ఫలితాలు, పాఠశాలల నిర్వహణ, బోధన సిబ్బంది సామర్థ్యం ఆధారంగా ఈ పాఠశాలలను ఎంపిక చేస్తారు. కొత్త రాష్ట్రం ఏర్పాటు తర్వాత నుంచి ఇప్పటివరకు ఈ పథకం కింద 8,390 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. వివిధ తరగతుల్లో రెసిడెన్షియల్ పద్ధతిలో విద్యను అభ్యసిస్తున్నారు. 2017–18లో 785 మంది పదో తరగతి పరీక్షలు రాయగా.. 91.97 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 27 మంది 9.5 కంటే ఎక్కువ జీపీఏ సాధించారు. బీఏఎస్ పథకం సత్ఫలితాలు ఇస్తుండటంతో మరింత విస్తృతం చేయాలని ఆ శాఖ నిర్ణయించింది. ఏటా 5 వేల మందికి అవకాశం ఇచ్చేలా స్కూళ్ల సంఖ్య పెంచాలని భావిస్తోంది. అత్యుత్తమ పనితీరు కనబరిచిన పాఠశాలల గుర్తింపునకు చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు ఐదో తరగతి నుంచే రెసిడెన్షియల్ పద్ధతిలో ప్రవేశాలు కల్పించారు. తాజాగా ఒకటో తరగతి నుంచే ప్రవేశాలు కల్పించనున్నారు. విద్యార్థికి ఏటా రూ. 35 వేలు బీఏఎస్ స్కూళ్లలో ప్రవేశం పొందిన విద్యార్థికి ఏటా రూ. 35 వేలు సర్కారు ఖర్చు చేస్తోంది. ఇప్పుడు పెద్ద సంఖ్యలో అడ్మిషన్లు తీసుకోవాలని భావిస్తుండటంతో ఫీజుల పైనా పరిశీలన చేయాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ఈ మేరకు జిల్లాల వారీ పాఠశాలల వివరాల సేకరణతో పాటు అక్కడి ఫీజులను అంచనా వేస్తోంది. జిల్లాలో విద్యార్థి చెల్లిస్తున్న సగటు ఫీజులు అంచనా వేసి నిపుణుల కమిటీ సూచనల ప్రకారం ఫీజు ఖరారు చేయనుంది. -
చెల్లుబాటు ఖాతాకే స్కాలర్షిప్
సాక్షి, హైదరాబాద్: పోస్టుమెట్రిక్ విద్యార్థుల ఉపకారవేతనాల పంపిణీలో కొత్త సంస్కరణలను ఎస్సీ అభివృద్ధి శాఖ తీసుకొస్తోంది. స్కాలర్షిప్ల పంపిణీలో రివర్స్ ట్రాన్సాక్షన్ల సమస్యను అధిగమించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని నిర్ణయించింది. ఇందుకోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)తో అవగాహన ఒప్పందం చేసుకుంది. ఆ ప్రకారం విద్యార్థుల ఖాతాలను పరిశీలించి చెల్లుబాటు ఖాతాలున్న వారికే ఉపకారవేతనాలు విడుదల చేయనున్నారు. ఖాతా సరైనది కాకుంటే.. ఒప్పందం ప్రకారం స్కాలర్షిప్ కోసం విద్యార్థులిచ్చిన ఖాతా సరైనదో కాదో ఎస్బీఐ అధికారులు తేల్చుతారు. బ్యాంకు ఖాతా నిర్వహిస్తున్నారా లేక నిర్వహణ లోపంతో ఖాతా స్తంభించిపోయిందా నిర్ధారిస్తారు. అలాంటి ఖాతాలన్నీ సేకరించి సంబంధిత కళాశాలలకు ఎస్ఎంఎస్ల ద్వారా సమాచారమిచ్చి ఆయా విద్యార్థులకు తెలియజేస్తారు. ఇతర బ్యాంకు ఖాతాల నిర్వహణను ఎన్పీసీఐ (నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా) సహకారంతో తేల్చనున్నారు. ఈ మేరకు గత వారం ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్బీఐ, ఎన్పీసీఐ అధికారులు సమావేశమై నిర్ణయం తీసుకున్నారు. ఏటా 10 శాతం రద్దు రాష్ట్రంలో సగటున 13 లక్షల మంది ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్కు ఆన్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకుంటున్నారు. వీరిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, వికలాంగ విద్యార్థులు 12 లక్షలకు పైమాటే. అయితే సగటున 10 శాతం మంది తప్పుడు వివరాలు నమోదు చేయడం, లావాదేవీలు నిర్వహించకపోవడంతో ఆ ఖాతాలు స్తంభిస్తున్నాయి. దీంతో వారికి ఉపకార వేతనాలు పంపిణీ చేస్తున్నా ఆ మొత్తం తిరిగి ప్రభుత్వ ఖాతాలో జమవుతోంది. దీంతో సంక్షేమాధికారులు వారి ఖాతా నంబర్లను మళ్లీ సేకరించి మళ్లీ బిల్లులు రూపొందించి వాటిని ఖజానా శాఖకు సమర్పించి విడుదల చేయడం ప్రహసనమవుతోంది. దీంతో ఖాతాల పరిశీలనపై పర్యవేక్షణ ఉంటే మేలని భావించిన అధికారులు ఎస్బీఐతో అవగాహన కుదుర్చుకున్నారు. ఇందులో భాగంగా ఖాతాల పరిశీలన పూర్తయితేనే సంక్షేమాధికారులు బిల్లులు రూపొందిస్తారని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకుడు కరుణాకర్ తెలిపారు. -
21న గుంటూరులో మిలియన్ మార్చ్
వేపాడ: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్ట పరిరక్షణకు ఈ నెల 21న రాష్ట్ర రాజధాని గుంటూరులో నిర్వహించే మిలియన్ మార్చ్ను జయప్రదం చేయాలని పూలే అంబేద్కర్ విజ్ఞాన కేంద్రం జిల్లా కన్వీనర్ ఆతవ ఉదయ్భాస్కర్ పిలుపునిచ్చారు. స్థానిక విలేకరులతో ఆయన గురువారం మాట్లాడారు. మార్చి 20న సుప్రీంకోర్టు తీర్పు దళిత ఆదీవాసీ ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని, దీనిపై పాలక ప్రతిపక్షాలు మాట్లాడకపోవడం బాధాకరమన్నారు. భారత్ బంద్లో 11 మంది దళిత యువకులు చనిపోయారని, ఇది కేంద్రంలోని కాషాయ పాలకులకు కనిపించకపోవడం విచారకరమన్నారు. గుంటూరు నాగార్జున యూనివర్సిటీ నుంచి మంగళగిరి వరకు నిర్వహించే మిలియన్మార్చ్కు లక్షలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో దళిత నేతలు కెర్రి దేముడు, డప్పురాజు, ఎ.నాగరాజు, సీహెచ్ నూకరాజు పాల్గొన్నారు. -
ఏఎంయూలో దళితుల కోటాపై..
లక్నో : అలీఘడ్ ముస్లిం యూనివర్సిటీ (ఏఎంయూ) మైనారిటీ సంస్థ కాదని, అడ్మిషన్లలో ఎస్సీ, ఎస్టీ విద్యార్ధులకు ఎందుకు రిజర్వేషన్లు వర్తింపచేయడం లేదని యూపీ ఎస్సీ,ఎస్టీ కమిషన్ బుధవారం వర్సిటీని ప్రశ్నించింది. దీనిపై వివరణను కోరుతూ ఆగస్ట్ 8లోగా బదులివ్వాలని ఏఎంయూకు కమిషన్ నోటీసు జారీ చేసింది. ఏఎంయూలో ప్రవేశాలకు దళితుల కోటాను ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తూ వర్సిటీకి తాను నోటీసు జారీ చేశానని యూపీ ఎస్సీ,ఎస్టి కమిషన్ బ్రిజల్ వెల్లడించారు. వచ్చేనెల 8లోగా దీనిపై వివరణ ఇవ్వాలని వర్సిటీ రిజిస్ర్టార్ను కోరానని తెలిపారు. ఏ ప్రాతిపదికన ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రిజర్వేషన్ల ప్రయోజనాలను అందించడం లేదని తాము కోరామని, రిజర్వేషన్ల ప్రయోజనాలకు నిరాకరించాలని ఏఎంయూను ఆదేశిస్తూ సుప్రీం కోర్టు ఇప్పటివరకూ ఎలాంటి ఉత్తర్వులూ జారీ చేయలేదని అన్నారు. ఏఎంయూ ఇతర వర్సిటీల తరహాలోనే కేంద్ర చట్టం కింద సెంట్రల్ యూనివర్సిటీయేనని, కోటాను వర్సిటీ అమలుపరచాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. ఏఎంయూ తమ నోటీసుకు స్పందించని పక్షంలో తమ అధికారాలను ఉపయోగించి చర్యలు చేపడతామని, అవసరమైతే సమన్లు జారీ చేస్తామని తెలిపారు. -
దళిత తేజం ఇదేనా..?
ఎస్సీలుగా పుట్టాలని ఎవరు కోరుకుంటారు.. ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యాఖ్య దళితులు చదువుకోరు.. శుభ్రంగా ఉండరు.. మంత్రి ఆదినారాయణరెడ్డి ఆగస్టు 15న అన్న మాటలు మాదిగ (నా..కొ..)లు అస్సలు చదవరు.. బాగుపడరు.. పరీక్ష రాసి వస్తున్న ఓ దళిత విద్యార్థిని ఉద్దేశించి మే 10న ఆర్టీసీ చైర్మన్ వర్ల రామయ్య చేసిన వివాదాస్పద కామెంట్.. సీఎంకి, ఆయన సహచరులకు దళితులపై ఉన్న ప్రేమకు ఈ వ్యాఖ్యలే నిదర్శనాలు.. - పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితులపై సాంఘిక బహిష్కరణ విధించారు.. - విశాఖ జిల్లా జర్రిపోతులపాలెంలో దళిత మహిళ ఇల్లు ఖాళీచేయలేదన్న సాకుతో అందరూ చూస్తుండగా వీధుల్లో దుస్తులు ఊడిపోయేలా ఈడ్చి ఈడ్చి కొట్టారు. - కర్నూలు జిల్లాలోని ఒక ఊరిలో శ్మశానంలో గొయ్యి తవ్వలేదని ఎస్సీ కాలనీలో రోడ్లు ధ్వంసం చేసి, కుళాయిలు పీకేశారు..రాష్ట్రంలో దళితుల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఇవి మచ్చుతునకలు..కానీ దళితులపై తమకు అపారమైన ప్రేమ ఉందని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి తహతహలాడుతున్నారు. నెల్లూరు జిల్లాలో ‘దళిత తేజం’ పేరుతో రాష్ట్రప్రభుత్వం శనివారం ఓ కార్యక్రమం నిర్వహిస్తోంది. సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతీ దళిత వాడలో దళితుల్లో చైతన్యం రగిలించేందుకు, వారి కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమ పథకాలను వివరించేందుకు ఉద్దేశించిన ‘దళిత తేజం’ కార్యక్రమం శనివారం నెల్లూరులో జరగనుంది. సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎస్సీ, ఎస్టీలపై దాడులు ఎక్కువయ్యాయని అంబేడ్కర్ను సైతం అవమానపర్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ఎంతోమంది దళిత ఉద్యోగులు వేదనకు గురవుతున్నారని ఆ వర్గాలకు చెందిన నేతలు మండిపడుతున్నారు. ఇందుకు నాలుగేళ్లలో చోటుచేసుకున్న అనేక సంఘటనలను సైతం ఉదహరిస్తున్నారు. - పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో దళితులను సాంఘిక బహిష్కరణ చేశారు. - శ్రీకాకుళం జిల్లా కొత్తూరులో దళిత యువకుడిని ఎస్సై కొట్టి హింసించారు. - విజయనగరం జిల్లా ముదువలసలో జన్మభూమి సభలో సమర్పించేందుకు అర్జీలు రాసుకుంటున్న దళితులను టీడీపీ వారు కొట్టారు. ఇందులో ఎమ్మెల్యే నారాయణస్వామి కుమారుడు నిందితుడు. - అలాగే, విశాఖ జిల్లా జర్రిపోతులపాలెంలో ఒక దళిత మహిళ ఇల్లు ఖాళీచేయలేదని తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తులు అందరూ చూస్తుండగా వీధుల్లో దుస్తులు ఊడిపోయాలా ఈడ్చి ఈడ్చి కొట్టారు. - కృష్ణాజిల్లా బందరులో ఈనెల 9, 10, 11 తేదీల్లో ప్రభుత్వం నిర్వహించిన బీచ్ ఫెస్టివల్లో ఆటలు ఆడుతున్న మల్లేశం గ్రామానికి చెందిన కొందరు దళిత యువకులను పోలీసులు నాలుగు రోజులు స్టేషన్లు మార్చి మార్చి మరీ కొట్టారు. - ప్రకాశం జిల్లా పర్చూరు మండలం దేవరపల్లిలో 20 దళిత కుటుంబాలకు చెందిన భూమిని నీరు–చెట్టు కార్యక్రమం కింద స్వాధీనం చేసుకుని రాత్రికి రాత్రి మట్టి తోలారు. టీడీపీ ఎమ్మెల్యే అనుచరులు బలవంతంగా ఈ పనిచేయించినట్లు దళితులు కేసు పెట్టారు. - చిత్తూరు జిల్లా మునగపాలెం ఎస్సీ కాలనీలో బైక్ హారన్ కొట్టారని ఒక యువకుడిని గ్రామంలోని కొందరు కొట్టగా కేసు పెట్టారు. దీంతో దళితవాడను సాంఘిక బహిష్కరణకు గురిచేశారు. - అనంతపురం జిల్లా పరిగి మండలం వన్నంపల్లి గ్రామంలో అన్ని కులాల వారు చందాలు వేసుకుని గుడి నిర్మించారు. గుడిలో విగ్రహ ప్రతిష్టాపనకు దళితులు వచ్చేందుకు వీల్లేదని అడ్డుకోవడంతో ఎదురుతిరిగిన దళితులను సాంఘిక బíßహిష్కరణకు గురిచేశారు. - కర్నూలు జిల్లా నక్కలదిన్నె శ్మశానంలో గొయ్యి తవ్వేందుకు దళితులు రాలేదని ఎస్సీ కాలనీలో రోడ్లు ధ్వంసం చేసి, తాగునీటి కుళాయిలు పీకేశారు. ఈ సంఘటనలన్నీ ఎస్సీ, ఎస్టీ కమిషన్లో నమోదయ్యాయి. అలాగే, నాలుగేళ్లుగా ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగకపోవడం గమనార్హం. స్మృతివనం పేరుతో అంబేడ్కర్కు అవమానం అమరావతిలో 25 ఎకరాల స్థలంలో అంబేడ్కర్ స్మృతివనం నిర్మిస్తున్నామని, అక్కడ 125 అడుగుల ఎత్తులో అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటుచేస్తున్నామని సీఎం ఘనంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఇందుకు గతేడాది ఏప్రిల్ 14న భూమి పూజ చేశారు. ఈ ఏడాది ఏప్రిల్ 14న శంకుస్థాపన చేశారు. కానీ ఇప్పటివరకు ఒక్క ఇటుకా పడలేదు. అలాగే, రెండేళ్లుగా ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్లలో రిజర్వేషన్లు ఇవ్వాలన్న ఆదేశాలు గాలిలో కలిసిపోయాయి. గుంటూరుకు చెందిన వైద్య ఆరోగ్య శాఖ ఉద్యోగి రవి ఎంతోకాలం కోర్టుల చుట్టూ తిరిగి ప్రమోషన్ రాకపోవడంతో ఆత్మహత్య చేసుకున్నాడు. సబ్ప్లాన్ నిధులు పక్కదోవ సబ్ప్లాన్ నిధులు పక్కదోవ పడుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయానికి నిధులు అవసరమైనప్పుడల్లా సబ్ప్లాన్ నుంచి వినియోగిస్తున్నారు. వివిధ ప్రాంతాలకు ముఖ్యమంత్రి విమానంలో వెళ్ళిన ఖర్చులు కూడా సబ్ప్లాన్ నిధులనే వెచ్చించడం విశేషం. ఇదిలా ఉంటే.. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు ఏర్పాటుచేసిన సంక్షేమ హాస్టళ్లను ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో ఎంతోమంది పేద దళిత విద్యార్థులు విద్యకు దూరమయ్యారు. అలాగే, రెండువేల వరకు ఎస్సీ, ఎస్టీ బ్యాక్లాగ్ పోస్టులు ఉన్నప్పటికీ నాలుగేళ్లుగా అవి భర్తీకి నోచుకోలేదు. ఈ నేపథ్యంలో దళిత తేజం పేరుతో శనివారం నెల్లూరు జిల్లాలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తుండడంపై ఆయా వర్గాల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. పలుచోట్ల దళితులపై జరిగిన దాడుల్లో నిందితులను అరెస్టుచేయని టీడీపీ సర్కార్ శనివారం నెల్లూరులో ‘దళిత తేజం’ నిర్వహించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దళిత తేజం సిగ్గుచేటు దళితులపై ఇటీవల జరుగుతున్న దాడులు, అత్యాచారాలు, హత్యలు, సాంఘిక బహిష్కరణలు చేస్తున్నా ప్రధాన నిందితులను అరెస్టు చేయని టీడీపీ ప్రభుత్వం దళిత తేజం నిర్వహించడం సిగ్గుచేటు. – ఆండ్ర మాల్యాద్రి,ప్రధాన కార్యదర్శి, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం దళిత నిస్తేజం ఏంచేశారని దళిత తేజం నిర్వహిస్తున్నారు? ఎన్ఆర్ఈజీఎస్, 14వ ఆర్థిక సంఘం నిధులు ఖర్చుచేసి రోడ్లు, డ్రైనేజీ కాలువలు అక్కడక్కడ కట్టిస్తే దళిత తేజం అవుతుందా? ఎస్సీ, ఎస్టీ కాలనీల్లోని సుమారు ఆరువేల స్కూళ్లు మూసివేశారు. విద్య, వైద్యం నిర్వీర్యమైంది. దళితులు ఉండే ప్రాంతాల్లో ఉచిత వైద్యం లేదు. – ఆదిమూలం సురేష్, ఎమ్మెల్యే, సంతనూతపాడు, ప్రకాశం జిల్లా. గాడాంధకారమే.. రాష్ట్రంలో దళిత తేజం లేదు, దళిత గాడాంధకారమే ఉంది. దళితుల్లో ఒక్కరికి కూడా ఎకరా పొలం ఇవ్వలేదు. ఇళ్లు, ఇళ్ళ స్థలాలు ఇవ్వలేదు. కృష్ణానది ఒడ్డున ఉన్న అనేకమంది దళితులను అక్కడి నుంచి ఖాళీ చేయించి రోడ్డున పడేశారు. టీడీపీకి దళితులు అందమైన సమాధి కడతారు. – దారా సాంబయ్య, బీజేపీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు -
కలెక్టర్లుగా పనికిరామా?
సాక్షి, హైదరాబాద్ : ఉద్యోగ జీవితంలో ఒక్కసారైనా జిల్లా కలెక్టర్గా పనిచేయాలని ప్రతి ఐఏఎస్ అధికారి కోరుకుంటారని.. కానీ సీనియారిటీ, అర్హతలు ఉన్నా కూడా తమకు ఆ అవకాశం రావడం లేదని రాష్ట్రానికి చెందిన పలువురు ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము జిల్లా కలెక్టర్ పోస్టుకు పనికిరామా? అంటూ వాపోయారు. ఈ మేరకు బుధవారం సచివాలయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలసి తమ బాధను వెళ్లగక్కారు. పోస్టింగుల కేటాయింపుల్లో తమకు జరుగుతున్న అన్యాయాన్ని సీఎస్ దృష్టికి తీసుకెళ్లారు. జాయింట్ కలెక్టర్గా పనిచేసిన తమను కాదని, అనుభవం లేని జూనియర్ ఐఏఎస్లను జిల్లా కలెక్టర్లుగా నియమించారని వారు పేర్కొన్నట్టు తెలిసింది. ఉమ్మడి రాష్ట్రంలో కనీసం 25 శాతం జిల్లాలకు ఎస్సీ, ఎస్టీ కలెక్టర్లను నియమించడం ఆనవాయితీగా ఉండేదని.. ప్రస్తుతం రాష్ట్రంలోని 31 జిల్లాల్లో కేవలం నాలుగు చోట్ల మాత్రమే ఎస్సీ, ఎస్టీ కలెక్టర్లు పనిచేస్తున్నారని వివరించినట్టు సమాచారం. ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్లను సీనియారిటీతో సంబంధం లేకుండా అప్రాధాన్య పోస్టులకు పరిమితం చేస్తున్నారని, తక్కువ స్థాయి కలిగిన పోస్టుల్లో నియమిస్తున్నారని వాపోయినట్టు తెలిసింది. ఈ అంశాలన్నీ విన్న సీఎస్.. సమస్యలను వ్యక్తిగతంగా వినతిపత్రం రూపంలో అందజేస్తే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు. సీఎస్ను కలసిన వారిలో ఎస్టీ, ఎస్సీ ఐఏఎస్లు మురళి, భారతి లక్పతి నాయక్, శర్మన్ చవాన్ తదితరులు ఉన్నారు. సీఎంవోలో అండ లేదు! ముఖ్యమంత్రి కార్యాలయంలో గతంలో కనీసం ఒకరైనా ఎస్సీ లేదా ఎస్టీ ఐఏఎస్ అధికారిని నియమించేవారని... ఆ అధికారి ద్వారా తమ గోడును ప్రభుత్వాధినేత దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉండేదని ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం సీఎంవోలో ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ అధికారులెవరూ లేకపోవడంతో తమ ఆవేదనను ఎవరితో పంచుకునే అవకాశం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన సీనియర్ ఐఏఎస్లు భారతి లక్పతి నాయక్, టీ విజయ్, విజయేంద్ర, యాకుబ్ నాయక్, శర్మన్, శివకుమార్ నాయుడు, హరిచందన, ఎంఏ అజీమ్ తదితరులు కలెక్టర్ పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్నారని.. వారితో పోల్చితే పదేళ్లు జూనియర్లు ప్రస్తుతం కలెక్టర్లుగా పనిచేస్తున్నారని అంటున్నారు. రాష్ట్రం ఏర్పాటయ్యాక 2015 జనవరిలో భారీ స్థాయిలో జరిగిన ఐఏఎస్ల బదిలీల్లో చాలా మంది ఎస్సీ, ఎస్టీ అధికారులను అదనపు కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి వంటి పోస్టులకు పరిమితం చేశారని చెబుతున్నారు. జూనియర్ ఐఏఎస్లు ఫార్చునర్ కార్లలో తిరుగుతున్నారని, తాము మాత్రం టాటా ఇండికా కారుకు పరిమితం కావాల్సి వచ్చిందని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఓ అధికారి వ్యాఖ్యానించారు. పెద్దగా పనిలేని పోస్టింగుల్లో ఉండి, పనిచేయకపోయినా ప్రతి నెలా రూ.లక్షలకు పైగా జీతం తీసుకోవడం అపరాధ భావన కలిగిస్తోందని ఆ అధికారి పేర్కొన్నారు. చాలా ప్రభుత్వ శాఖల్లో అవసరం లేకున్నా కేవలం ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్ల కోసం ఎక్స్ కేడర్ పోస్టులు సృష్టించి, నియమించారని.. అక్కడ పనిలేక ఖాళీగా కూర్చోవాల్సి వస్తోందని మరో అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. తమకు అవకాశమిస్తే పూర్తి శక్తి సామర్థ్యాల మేరకు పనిచేసి సమర్థత నిరూపించుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. న్యాయం జరగకపోతే ఎస్సీ, ఎస్టీ కమిషన్కు.. ఐఏఎస్ అధికారులైన తమకు తండ్రి లాంటి వారనే భావనతో సీఎస్ ఎస్కే జోషిని కలసి సమస్యలు విన్నవించుకున్నామని ఎస్సీ, ఎస్టీ ఐఏఎస్లు పేర్కొన్నారు. ఆయన తమకు న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ తమ సమస్యలను పరిష్కరించని పక్షంలో.. జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ఆశ్రయించే యోచన ఉందని ఓ అధికారి తెలిపారు. -
ఎన్టీఆర్ ఇచ్చిన స్థలానికి బాబు డబ్బులు కట్టమంటున్నారు
బీచ్ రోడ్డు(విశాఖ తూర్పు): అప్పటి ముఖ్యమంత్రి, టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు ఉచితంగా స్థలం ఇస్తే.. అదే టీడీపీ ప్రస్తుత అధినేత చంద్రబాబు ఇప్పుడు ఆ స్థలానికి డబ్బులు కట్టాలని నోటీసులు ఇవ్వడంతో వారికి ఏం చేయాలో పాలుపోవడంతో లేదు. సొమ్ములు కూడా తక్కువేమి కాదు.. ప్రతి కుటుంబం రూ. 90 వేలు నుంచి రూ.2 లక్షల కట్టాలంటున్నారు. చివరికి ఏం చేయాలో తెలియక సోమవారం జరిగిన గ్రీవెన్స్లో కలెక్టర్ ప్రవీణ్కుమార్కు మొరపెట్టుకున్నారు. జీవీఎంసీ 6వ వార్డు ఎం డాడ ప్రాంతంలోని ఎస్సీ కుటుంబాలు కో సం 1982లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ 103 సెంట్లు కేటాయించారు. అప్పటి నుంచి అý్కడ సుమారు 56 కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. అయితే ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు భూక్రమబద్ధీకరణలో భాగంగా ఆ కాలనీ ప్రజలు డబ్బులు కట్టాలని నోటీసులు జారీ చే శారు. అంత మొత్తంలో డబ్బులు చెల్లించా లంటే తమవల్ల కాదని వారంతా వాపోతున్నారు. స్థలం సమానమే.. చెల్లింపు డబ్బుల్లో వ్యత్యాసం అక్కడ నివాసం ఉంటున్న కుటుంబాల ఇళ్ల స్థలాలు అన్నీ సమానంగానే ఉన్నాయి. కానీ ప్రభుత్వం జారీ చేసీన నోటీసుల్లో మాత్రం ఒక్కో కుటుంబానికి ఒక్కో రకంగా డబ్బులు కట్టాలని చూపించారు. రూ.90 వేల నుంచి రూ.2 లక్షల వరకు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అన్నీ ఇళ్ల స్థలాలు సమానంగా ఉన్నా ఈ సొమ్ముల్లో మార్పు చూసి ప్రజలు అసలు ఏమీ జరుగుతుందో కూడా అర్ధం కావటం లేదని వారు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. రోజు కూలీ పనులు చేసుకునే తాము అంత డబ్బులు కట్టలేమని కలెక్టర్ స్పందించి ఉచితంగా పట్టాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని వారంతా కోరుతున్నారు. అంతా డబ్బు ఎట్టా చెల్లించేది? ఇప్పటికిప్పుడు రూ. 1.62 లక్షలు చెల్లిస్తే ప్ర భుత్వం పట్టా ఇస్తుం దని నోటీసు ఇచ్చారు. రోజు కూలి పని చేసుకుని జీవిస్తున్నాం. మా కు అంత డబ్బు ఎక్కడ నుంచి వస్తుంది. ఎన్టీ ఆర్ ఉచితంగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ఇప్పుడ మే పట్టాలు ఇవ్వడానికి డబ్బులు చెల్లించాలని చెప్పడం దారుణం.– సర్వసతి, కాలనీవాసి అందరికీ సమానంగా రాలేదు మా కాలనీలో నివాసం ఉంటున్న అన్నీ కుటుం బాల ఇళ్ల స్థలాలు సమానంగానే ఉన్నాయి. అయితే క్రమబద్ధీకరణ కోసం చెల్లించవలసిన డబ్బులు మాత్రం ఒక్కొక్కరికి ఒక్కోలా వచ్చింది. మేము అంత మొత్తం చెల్లించే పరిస్థితిలో కూడా లేము. ప్రభుత్వం ఉచితంగానే పట్టాలు ఇవ్వాలి. – పద్మ, కాలనీవాసి ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు ఎండాడ ఎస్సీ కాలనీ అభివృద్ధిని ప్రజా ప్రతినిధులు పట్టించుకోవడం లేదు. శ్రీదేవి విజ్ఞాన పరిష్కర వేదిక ద్వారా ఇక్కడ ప్రజల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి కొంత మేర పరిష్కరిస్తున్నాం. ఇళ్ల పట్టాల కోసం అంత డబ్బులు చెల్లించాలంటే వీరి వల్ల అయ్యే పని కాదు. అందుకే కలెక్టర్ దృష్టికి సమస్యను తీసుకెళ్లాం. – కీర్తి, అధ్యక్షురాలు, శ్రీదేవి విజ్ఞాన పరిష్కర వేదిక -
‘ప్రత్యేక కోర్టులకోసం సీఎంతో మాట్లాడతా’
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీలపై జరిగే దాడుల్లో సత్వర న్యాయం కోసం ప్రత్యేక కోర్టును ఏర్పాటు చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్తో మాట్లాడతానని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ అన్నారు. మంగళవారం హైదరాబాద్లో కలెక్టర్ ఆధ్వర్యంలో జరిగిన జిల్లా స్థాయి విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలపై దాడులకు సంబంధించిన కేసుల పురోగతిపై అసహనం వ్యక్తం చేశారు. తన ఆఫీస్ నుంచి లేఖలు రాసినా కేసులను ముందుకు తీసుకెళ్లలేదన్నారు.ఎస్సీ, ఎస్టీ కమిషన్ గత 10 సంవత్సరాలుగా చేయని ఎన్నో పనులు ఈ మూడు నెలలుగా తాము చేస్తున్నామన్నారు. -
కేంద్రంపై పోరాటం చేయాలి
కొత్తగూడ(ములుగు): దళిత, గిరిజనులు ఏకమై కేంద్రంపై పోరాటం చేయాలని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం రాత్రి మండల కేంద్రంలోని ఆశ్రమ పాఠశాలలో జరిగిన సింహగర్జన సన్నాహక సదస్సులో ఆయన మాట్లాడారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగాన్ని నేడు హరిస్తున్నారన్నారు. రిజర్వేషన్లకు అణుగునంగా భద్రత, స్వేచ్ఛగా జీవించే హక్కులు కల్పించారన్నారు. దళిత, గిరిజనులు చదువువుకు దూరం చేయాలని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే ప్రైవేట్ విద్యాసంస్థలను ప్రోత్సహించడం జరిగిందన్నారు. దళిత, గిరిజనులపై అత్యాచారా లు జరుగుతున్నా పట్టించుకునే వారు లేరన్నారు. అట్రాసిటీ చట్టాన్ని నీరుగార్చేందుకు సుప్రీం కోర్టును అగ్రవర్ణాలు ఉపయోగించుకున్నాయన్నారు. రక్షణ కవచం లాంటి చట్ట రక్షణకు దళిత, గిరిజనులు ఏకమై ఉద్యమించాలని సూచించారు. ఈనెల 10 తలపెట్టిన సింహ గర్జనకు తరలి రావాలన్నారు. మాలమహానాడు జాతీయ అధ్యక్షుడు చెన్నయ్య, జెన్కో భూపాలపల్లి జిల్లా ఎస్ఈ జనగం నరేష్, నర్సంపేట డీఈ విజయ్, తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు వట్టం ఉపేందర్, బూర్క యాదగిరి, సీపీఐ(ఎంఎల్), న్యూడెమోక్రసీ రాష్ట్ర నాయకుడు బూర్క వెంకటయ్య, శ్రీశైలం ఎమ్మార్పీస్ జాతీయ ప్రధాన కార్యదర్శి గుగ్గిళ్ల పీరయ్య, మిడుతపల్లి యాకయ్య, వజ్జ సారయ్య,రేణుక, వివిధ సంఘాల నాయకులు బాబూరావు, నర్స య్య, ప్రేమ్సాగర్, రాజం సారంగం, కల్తి ఎల్లయ్య, గుమ్మడి లక్ష్మినారాయణ, కంగాల లచ్చయ్య, చెన్నూరి మహేందర్, విజయ్, గంగిరెడ్లు, బుడిగ జంగాల సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు. అట్రాసిటీ చట్టం కవచం లాంటిది మరిపెడ: అట్రాసిటీ చట్టం ఎస్సీ, ఎస్టీలకు ఒక కవచంలాంటిది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. మరిపెడ లోని కనకదుర్గ ఫంక్షన్ హాల్లో ఆదివారం ఎల్హెచ్పీఎస్ నియోజక వర్గ ఇన్చార్జి భూక్యా రామ్మూర్తినాయక్ అధ్యక్షతన సింహగర్జన సన్నాహక సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొని మంద కృష్ణ మాట్లాడుతూ.. ఎస్సీ, ఎస్టీలను అణగదొక్కేందుకు కేంద్ర ప్రభుత్వ కుట్ర చేస్తోందని ఆరోపించారు. బానిస బతుకుల నుంచి విముక్తి కావాలంటే దళిత, గిరిజనులు తరలిరావాలన్నారు. 1989లో ఎస్సీ, ఎస్టీ అట్రాసి టీ యాక్ట్ చట్టాన్ని రూపొందించారన్నారు. ఈనెల 10న వరంగల్లో జరిగే దళిత, గిరిజన సింహగర్జన సభను విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో హలావత్ శంకర్ నాయక్, రామన్ననాయక్, అల్వాల వీరయ్య, బానాల రాజన్న, చెన్నయ్య, కనకయ్య, లక్ష్మి, భీమానాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమోషన్లలో కోటా కోసం సుప్రీంకు కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ ఉద్యోగాల ప్రమోషన్లలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు రిజర్వేషన్ అమలు దిశగా కేంద్రం చర్యలు చేపట్టింది. ఆర్డినెన్స్ రూపంలో ప్రమోషన్లలో కోటా అమలుకు సన్నాహాలు చేస్తోంది. ప్రమోషన్లలో ఈ వర్గాలకు రిజర్వేషన్ అమలుకు అవరోధంగా ఉన్న గతంలో న్యాయస్ధానం ఇచ్చిన ఉత్తర్వులను ఎత్తివేయాలని కోరుతూ ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్ధానాన్ని ఆశ్రయిస్తుందని కేంద్ర మంత్రి రాం విలాస్ పాశ్వాన్ పేర్కొన్నారు. కోటా కోసం ఆర్డినెన్స్ తీసుకువచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగానే ఉన్నా ముందుగా సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామని దళితుల అంశాలపై ఏర్పాటైన మంత్రుల బృందంలో సభ్యుడైన పాశ్వాన్ స్పష్టం చేశారు. ఎస్సీ, ఎస్టీల ప్రయోజనాలకు విఘాతం కలిగించేలా ఉన్న రెండు సుప్రీం కోర్టు ఉత్తర్వులపై అప్పీల్కు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించిన క్రమంలో పాశ్వాన్ ఈ వివరాలు వెల్లడించారు. ఎస్సీ, ఎస్టీలకు ప్రమోషన్లలో రిజర్వేషన్లకు సుప్రీం సమ్మతించినా పలు షరతులు విధించడంతో కోటా మార్గదర్శకాలు అమలుకు నోచుకోలేకపోతున్నాయని పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. -
జనసేన పార్టీలో సం‘కుల’ సమరం
జిల్లా జనసేనలో సం‘కుల’ సమరం మొదలైంది. పార్టీ వ్యవహారాల్లో ఒకే సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇస్తూ, మిగతా వర్గాల నాయకులను పార్టీ అధిష్టానం విస్మరిస్తోందన్న విమర్శలు తెరమీదకు వచ్చాయి. పార్టీ సంస్థాగత నిర్మాణానికి కీలకంగా వ్యవహరించే తిరుపతి పట్టణంలో నేతలు రెండు గ్రూపులుగా చీలిపోయారు. ప్రస్తుతం ఎవరికి వారు పార్టీలో ఆధిపత్యం కోసం పోటీ పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, తిరుపతి : జిల్లా జనసేనలో ఆధిపత్య రగడ మొదలైంది. గుంటూరులో పార్టీ అధినేత ఆత్మగౌరవ సభ పెట్టకు ముందు నుంచే ఈ పోరు కొనసాగుతోంది. రెండు గ్రూపులుగా చీలిపోయిన నాయకులు ఎవరికి వారే యమునాతీరే అన్న చందాన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. పార్టీ పిలుపు మేరకు ఉమ్మడిగా నిర్వహించాల్సిన కార్యక్రమాలను సైతం వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఒక గ్రూపునకు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్, రెండో గ్రూపునకు కిరణ్రాయల్ నేతృత్వం వహిస్తున్నారు. పవన్ కల్యాణ్కు ఇద్దరూ సన్నిహితులే అయినప్పటికీ పార్టీ వ్యవహారాల్లో డాక్టర్ హరిప్రసాద్ ఒకడుగు ముందంజలో ఉన్నారు. పవన్ కల్యాణ్ ఆశీస్సుల కారణంగానే ఇంతకు ముందు టీటీడీ పాలక మండలి సభ్యుడిగా కొనసాగిన డాక్టర్ హరిప్రసాద్ రెండు నెలల నుంచి పార్టీలో కీలక వ్యక్తిగా మారారు. ఇకపోతే తిరుపతి నగరంలో పార్టీని నడిపించడం, ఇతరత్రా కార్యక్రమాల్లో కిరణ్రాయల్ కీలకంగా మారారు. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే భారత్ బంద్ను విజయవంతం చేసేందుకు పార్టీ పిలుపునిచ్చింది. ఇందుకోసం పార్టీ అధిష్టానం జిల్లాకు చెందిన ఏడుగురు నాయకులను ఆదివారం విజయవాడలో జరిగే సమావేశానికి ఆహ్వానించడంతో పాటు మెంబర్షిప్ కార్డుల కోసం ఎంపిక చేసింది. దీంతో ఆహ్వానం లేని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ నాయకులు రగిలిపోయారు. తమకు సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం సాయంత్రం ఎయిర్బైపాస్ రోడ్లోని ఓ ప్రయివేటు హోటల్లో సమావేశమైన పార్టీ నాయకులు కో–ఆర్డినేటర్ కిరణ్రాయల్, హరిశంకర్పై ధ్వజమెత్తారు. ఒకే ఒక సామాజిక వర్గానికి మాత్రమే పార్టీలో ప్రాధాన్యం ఇవ్వడం మిగతా వారిని పట్టించుకోకపోవడం ఏమిటని పార్టీ యువనేత బాబ్జీ సమావేశంలో ప్రశ్నించారు. డాక్టర్ హరిప్రసాద్ తనకు అనుకూలమైన వారినే మెంబర్షిప్ కోసం ఎంపిక చేయడం ఎంత వరకూ న్యాయమని నిలదీశారు. ఈనెల 22, 23 తేదీల్లో పవన్కల్యాణ్ తిరుపతి వచ్చినపుడు ఈ విషయంపై తేల్చుకుంటామని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
జనరల్ కేటగిరీల కన్నా వేగంగా..
సాక్షి, హైదరాబాద్ : జనరల్ కేటగిరీ విద్యార్థుల కంటే వేగంగా షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తరగతులు, ఓబీసీ వర్గాలకు చెందిన ఇంజనీరింగ్ విద్యార్థులు నేర్చుకుంటున్నారు. ఇంజనీరింగ్ విద్యార్థుల నేర్చుకునే సామర్థ్యాన్ని వివిధ కొలమానాలకు అనుగుణంగా పరీక్షించినపుడు ఆసక్తి రేకెత్తించే ఈ అంశం వెల్లడైంది. అంతేకాకుండా ఎస్సీ విద్యార్థుల కంటే ఎస్టీ విద్యార్థులు త్వరగా నేర్చుకుంటున్నట్టు, ఓబీసీ విద్యార్థుల కంటే ఎస్సీ విద్యార్థులు మెరుగైన స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది. అమెరికాకు చెందిన స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ దేశవ్యాప్తంగా విస్తతస్థాయిలో నిర్వహించిన ఓ సర్వేలో ఇది వెలుగులోకి వచ్చింది. ఈ విశ్వవిద్యాలయంతో అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) గతేడాది కుదుర్చుకున్న ఒప్పందంలో భాగంగా ఈ అధ్యయనం జరిగింది. రెండు భాగాలుగా పరిశీలన... 2017 అక్టోబర్, నవంబర్లలో విద్యా సంబంధిత అంశాలు, ఉన్నతస్థాయి ఆలోచన ధోరణిలపై రెండు భాగాలుగా దీనిని నిర్వహించారు. ఇందులో గణితం, భౌతికశాస్త్రం తదితరాల్లో పరీక్షలతో పాటు, సృజనాత్మకత, తార్కితతో కూడిన హేతుబద్ధత, శాస్త్రీయ ధోరణి వంటి అంశాలను పరిశీలించారు. ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం నుంచి మూడో సంవత్సరం వరకు చదువుతున్న విద్యార్థుల్లో అణగారిన వర్గాలకు చెందిన వారు ఈ అంశాల్లో పరిణామాత్మక ప్రదర్శన కనబరిచారు. అణగారిన వర్గాలకు చెందిన విద్యార్థుల్లో నేర్చుకోవాలనే తపనే వారిని తామున్న ఇబ్బందికర పరిస్థితులను అధిగమించేందుకు పురిగొల్పుతోందని ఏఐసీటీఈ చైర్మన్ అనిల్ సహస్రబుద్ధే పేర్కొన్నారు. ఉన్నతవర్గాల పిల్లలు చదువుకునే విద్యాసంస్థల్లో కాకుండా ఇతర కాలేజీల్లో ఇంజనీరింగ్ అభ్యసిస్తున్న వారిలోనూ ఈ వర్గాల వారు థర్డ్ ఇయర్కు ఇచ్చేప్పటికీ గణితం, భౌతికశాస్త్రం, పరిణామాత్మక అక్షరాస్యతలోనూ ఒకస్థాయికి చేరుకుంటున్నారని ఓ అధికారి వెల్లడించారు. దేశవ్యాప్తంగా 50 విద్యాసంస్థల్లో... దేశవ్యాప్తంగా ఒక క్రమపద్ధతి లేకుండా మొత్తం 50 సాంకేతిక విద్యా సంస్థలు వాటిలో ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీ వంటి 8 ఉన్నతస్థాయి, ఈ కోవలోకి రాని 42 విద్యాసంస్థలను స్టాన్ఫోర్డ్ వర్సిటీ ఎంపిక చేసింది. అన్ని వర్గాలకు తగిన ప్రాతినిధ్యం ఉండేలా గతేడాది మొదటి ఏడాది, 2019లో మూడో ఏడాది కూడా ఇదే గ్రూపుల విద్యార్థులను పరీక్షిస్తారు. ఐఐటీ వంటి ఉన్నతస్థాయి సంస్థల్లోని స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మేథమెటిక్స్) కోర్సుల్లో అమ్మాయిల ప్రాతినిధ్యం తక్కువగా ఉన్నట్టుగా, మిగతా వాటిలో అమ్మాయిల సంఖ్య గణనీయంగా పెరిగినట్టుగా ఈ పరిశీలనలో గుర్తించారు. సంపూర్ణస్థాయిలో చూస్తే చైనా, రష్యాల కంటే వీరు వెనకబడినట్టు, అయితే ఈ దేశాల విద్యార్థుల కంటే భార త ఇంజనీరింగ్ విద్యార్థులు వేగంగా నేర్చుకున్నట్టు ఈ అధ్యయనంలో తేలింది. ఈ రెండుదేశాల్లోని ఇంజనీరింగ్ విద్యార్థులపై సైతం స్టాన్ఫోర్డ్ వర్సిటీ ఇదే విధమైన పరిశీలన నిర్వహించిన నేపథ్యంలో ఆయా అంశాలు వెల్లడయ్యాయి. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఎస్సీనని ఆలయంలోకి రానివ్వడం లేదు
సిద్దిపేటరూరల్: ఎస్సీ అయిన తనపై ఇతర కులానికి చెందిన కొందరు వివక్ష చూపుతున్నారని లక్ష్మిదేవిపల్లి సర్పంచ్ పెద్ది ఎల్లవ్వ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం ఆమె మాట్లాడుతూ..రెండేళ్లుగా గ్రామంలో శ్రీరామనవమి ఉత్సవాలను చేయడం ప్రారంభించామన్నారు. నాటి నుంచి ఏటా ఉత్సవాలకు రూ. 10 వేల చొప్పున అందించినా, ఉపసర్పంచ్ ఆంజనేయులు ఇంటి నుంచే శ్రీరామ కల్యాణానికి కావాల్సిన పుస్తెమట్టెలను డప్పుచప్పుల్లతో ఆలయానికి తీసుకెళ్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఆలయం వద్దకు వెళ్లినా ప్రసాదం సైతం పెట్టేవారు కాదన్నారు. ఈ సంవత్సరం గ్రామంలో నిర్మించిన భక్తాంజనేయ ఆలయంలో వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు నిర్వహించడానికి నిర్ణయించామన్నారు. కానీ ఓ వ్యక్తి సహాకారంతో గ్రామ పెద్దలు తనకు సమాచారం ఇవ్వకుండానే వేడుకలను జరిపించారని వాపోయారు. -
పేదల అభ్యున్నతికి కృషి
సూర్యాపేట : పేదల అభ్యున్నతికి సీఎం కేసీఆర్ నిరంతరం కృషి చేస్తున్నారని రాష్ట్ర విద్యుత్, ఎస్సీ కులాల అభివృద్ధి శాఖామాత్యులు గుంటకండ్ల జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన బడుగుల లింగయ్యయాదవ్ తొలిసారిగా సూర్యాపేటకు రావడంతో ఆయన ఆత్మీయ ఆహ్వానం పలికారు. అనంతరం స్థానిక తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి మాట్లాడారు. పక్క రాష్ట్రంలో రాజ్యసభ ఎన్నికలు అంటేనే వందల కోట్ల రూపాయలు చేతులు మారాయన్నారు. శాసనసభ ఎన్నికల్లో పోటీ చేయాలంటేనే ఆర్థికంగా భయపడే వారినే ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంపిక చేశారని చెప్పారు. ఇంటి పేరులోనే బడుగుల ఉన్న బడుగు బలహీన వర్గాలకు టీఆర్ఎస్ పార్టీ ప్రాధాన్యం కల్పిస్తుందనడానికి బడుగుల లింగయ్యయాదవ్ ఎంపికే నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు. మరో అభ్యర్థి బండా ప్రకాష్ కూడా బడుగు బలహీన వర్గానికి చెందిన అది ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తే అన్నారు. కేసీ ఆర్కు నీడలా ఉండే జోగినేపల్లి సంతో ష్కుమార్ మూడో అభ్యర్థని చెప్పారు. రాజ్యసభకు ఈ తరహా అభ్యర్థులను ఎంపిక చేసి రాజకీయాల్లో పారదర్శకతను నిరూపించుకున్నారని పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావంలోనే ఏర్పాటు చేసుకున్న రాజ్యాంగంలో 51 శాతం బడుగు, బలహీన , హరిజన, గిరిజన మైనార్టీ వర్గాలకు రిజర్వేషన్లను రూపొందించుకున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ మాత్రమే అని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివా స్గౌడ్, మున్సిపల్ చైర్పర్సన్ గండూరి ప్రవళిక, మార్కెట్ చైర్మన్ వైవి, నాయకులు గండూరి ప్రకాష్, మారిపెద్ది శ్రీనివాస్గౌడ్, వర్ధెల్లి శ్రీహరి, వట్టె జానయ్యయాదవ్, పోలెబోయిన నర్సయ్యయాదవ్, చనగాని రాంబాబుగౌడ్, ఉప్పల ఆనంద్, బైరు దుర్గయ్యగౌడ్, కక్కిరేణి నాగయ్యగౌడ్, జీడి భిక్షం, బైరబోయిన శ్రీనివాస్, గోదల రంగారెడ్డి, పుట్టా కిషోర్నాయు డు, రమాకిరణ్గౌడ్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ఎస్కే పాలెంలో డయేరియా!
పెరిశేపల్లి (పామర్రు) : మండల పరిధిలోని పెరిశేపల్లి గ్రామ శివారు ప్రాంతమైన సబ్ధర్ఖాన్ పాలెంలో మూడు రోజులుగా డయేరియా వ్యాధి లక్షణాలతో ప్రజలు అల్లాడుతున్నారు. ఆదివారం రాత్రి గ్రామానికి దగ్గరలో జుఝవరం ఎస్సీ కాలనీలో ఉంటున్న నిల్వ కూలీలు ఎస్కే పాలెంలోని బావి నీరు తాగటం కారణంగా ముగ్గురికి వాంతులు, విరేచనాలు అయ్యాయి. దీంతో వారిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అక్కడి నుంచి గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు మెరుగైన వైద్యం కోసం తీసుకెళ్లారు. అలాగే, సోమవారం ఎస్కే పాలెంలోని ప్రజలు అదే బావి నీటిని తాగడంతో కొందరు అనారోగ్యానికి గురయ్యారు. గ్రామానికి చెందిన జె దినేష్, జె సౌజన్య, కె కళ్యాణి, వీ ఉషారాణి, కె రామ్చరణ్లకు వాంతులు, విరేచనాలు కావడంతో పామర్రులో ఓ ప్రయివేటు వైద్యశాలకు తరలించారు. అక్కడి ఫీజులకు భయపడి స్థానికంగా ఉన్న ప్రభుత్వ వైద్యశాలకు గ్రామ ప్రముఖుడు వీరిని తరలించారు. వీరిలో ఉషారాణిని మెరుగైన వైద్యం కోసం గుడివాడ ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో బుధవారం వైద్య సిబ్బంది గ్రామంలో పర్యటించి మొర్ల సరస్వతి, సిరిపురపు సత్యనారాయణ, మొర్ల పైడమ్మలతో పాటు మరో ముగ్గురికి విరేచనాలు అవ్వడం గుర్తించి వారిని కూడా పామర్రులో ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అందరూ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. వీరిలో జె దినేష్ అనే చిన్నారిని మంగళవారం వైద్యశాలలో చేర్పించి సాయంత్రం తగ్గిపోయిందని ఇంటికి పంపించారు. అయితే, బుధవారం ఉదయం మరలా విరేచనాలు అవ్వడంతో తిరిగి వైద్యశాలకు తరలించారు. కాగా, పామర్రులోని మరో ప్రయివేటు వైద్యశాలలో కొందరు బాధితులు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. కప్పి పుచ్చిన స్థానిక నేతలు మూడు రోజులుగా గ్రామస్తులు డయేరియాతో ఇబ్బందులు పడుతున్న విషయాన్ని బయటకు పొక్కనీయకుండా అధికార పార్టీ నేతలు కప్పిపుచ్చారు. ఏఎన్ఎంలు, ఆశాల ద్వారా మందు బిళ్లలను, ఓఆర్ఎస్ ప్యాకెట్లను పంపిణీ చేయిస్తున్నారు. కలుషిత తాగునీటి విషయాన్ని ఫుడ్ పాయిజన్గా ప్రచారం చేస్తున్నారు. ఫుడ్ పాయిజన్ అయితే ఓ ఇంటికే పరిమితం అవుతుంది. కానీ, ఇక్కడ గ్రామంలో చాలామంది అనారోగ్యానికి గురయ్యారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి తగు చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. నారా లోకేష్ దత్తత గ్రామంలో కూడా.. వారం రోజుల క్రితం మంత్రి నారా లోకేష్ దత్తత గ్రామమైన నిమ్మకూరులోని ఓ రైతు శ్రీకాకుళం నుంచి నిల్వ కూలీలను తీసుకువచ్చారు. వీరిలో కొందరు గ్రామంలో నిర్వహించిన ఓ వివాహ వేడుకలలో వాడుకోగా మిగిలిన ఆహారాన్ని నిల్వ ఉంచి తిన్న కారణంగా ఫుడ్ పాయిజనింగ్కు గురై అనారోగ్యం పాలయ్యారు. హుటాహుటిన ఆ రైతు కూలీలను మచిలీపట్నం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి వైద్య పరీక్షలు చేయించారు. వారిని అక్కడి నుంచి నిమ్మకూరు రాకుండా శ్రీకాకుళం పంపించి వేసి విషయం బయటకు రాకుండా జాగ్రత్తపడ్డారని సమాచారం. నీటి శాంపుల్స్ సేకరణ తాగునీటికి వినియోగించే బావి నీటిని సేకరించి పరీక్షల నిమిత్తం పంపించామని వైద్యురాలు ఆర్ఎన్ జ్యోత్న్స తెలిపారు. రిపోర్టులు వస్తే కాని ఏ విషయమూ నిర్ధారించలేమన్నారు. నిమ్మకూరు పీహెచ్సీ వైద్యురాలు పద్మజ, పీçహెచ్ఎన్ ఇందిరాకుమారి, ఏఎన్ఎం ధనలక్ష్మి గ్రామంలో వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రామంలో తహసీల్దార్ పర్యటన పెరిశేపల్లి (పామర్రు) : గ్రామ శివారు ప్రాంతమైన ఎస్కే పాలెంలో బుధవారం తహసీల్దార్ ఎం. పద్మకుమారి పర్యటించారు. గ్రామంలో వైద్య సిబ్బందితోపాటు ఇంటింటికి తిరిగి అక్కడి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ గ్రామంలో వ్యవసాయ పనుల నిమిత్తం పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన వారిలో ముగ్గురికి అనారోగ్యం రావడంతో పామర్రు పీహెచ్సీలో వైద్య సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. ఇదే పరిస్థితి ఎస్కే పాలెంలోని మరి కొందరికి ఏర్పడిందని, వారికి కూడా వైద్య సేవలు అందుతున్నాయని, పరిస్థితి అదుపులో ఉన్నదని తెలిపారు. ఎవరికి ప్రాణహాని లేదని పేర్కొన్నారు. గ్రామంలోని నూతి నీటిని పరీక్షలకు పంపగా ఏమీ లేదని రిపోర్టు వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
వసతి గృహాల్లో ‘బ్రాండ్’ బాజా!
సాక్షి, హైదరాబాద్: సంక్షేమ వసతి గృహాల్లోని విద్యార్థులు కార్పొరేట్ హాస్టల్ స్థాయి సేవలందుకోబోతున్నారు. ఇప్పటివరకు అరకొర వసతులతో ఇబ్బందులు పడ్డ వసతి గృహాల్లోని విద్యార్థులకు ఇకపై బ్రాండెడ్ వస్తువులివ్వాలని ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయించింది. ప్రస్తుత వార్షిక సంవత్సరం ప్రారంభం నుంచి వసతి గృహాల్లో భోజన మెనూలో ప్రభుత్వం భారీ మార్పులు తీసుకొచ్చింది. చార్జీలు పెంచడంతో 3 పూటలా సంపూర్ణ పౌష్టికాహారం అందుతోంది. నెలలో 4 సార్లు చికెన్, రెండుసార్లు మటన్ భోజనంతోపాటు ప్రతి రోజూ కోడిగుడ్డును అందిస్తున్నారు. ఇదే తరహాలో రోజువారీ వినియోగించే వస్తువులను బ్రాండెడ్ కంపెనీల నుంచి కొనుగోలు చేయాలని ఎస్సీ శాఖ తాజాగా నిర్ణయం తీసుకుంది. రూ.69.52 కోట్ల ఖర్చు రాష్ట్రంలో 687 సంక్షేమ వసతి గృహాలున్నాయి. ఇందులో 568 ప్రీ మెట్రిక్ హాస్టళ్లు, 119 పోస్టు మెట్రిక్ హాస్టళ్లున్నాయి. ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో 58,160 మంది, పోస్టు మెట్రిక్ హాస్టళ్లలో 22,623 మంది విద్యార్థులున్నారు. పదో తరగతి వరకు ప్రభుత్వమే యూనిఫాం ఇస్తోంది. కాలేజీ విద్యార్థులకు డ్రెస్ కోడ్ లేదు. దీంతో వారే వ్యక్తిగతంగా డ్రెస్లు కొనుగోలు చేసుకుంటున్నారు. వీరికి కాస్మొటిక్ చార్జీల కింద బ్రాండెడ్ సబ్బులు, సౌందర్య సాధనాలు ఇస్తోంది. మిగిలిన వాటిని కూడా బ్రాండెడ్ వస్తువులే ఇవ్వనుంది. కాలేజీ విద్యార్థులకు లాన్సర్ స్పోర్ట్స్ షూస్, స్కూల్ పిల్లలకు బాటా స్కూల్ షూస్ పంపిణీ చేయనుంది. ప్రతి వసతి గృహంలో బ్లూస్టార్ ఆర్వో ప్లాంట్ (నీటి శుద్ధి యంత్రం) ఏర్పాటు చేయనుంది. స్కూల్ బ్యాగులు, బంకర్ బెడ్లు ప్రముఖ కంపెనీలకే ఆర్డర్ ఇచ్చి తయారు చేయించనుంది. స్లీప్వెల్ బ్రాండ్కు చెందిన మాట్రిసెస్, పిల్లోస్ను పిల్లలకు ఇవ్వనున్నారు. నిఘా కట్టుదిట్టం చేసేందు కు ఒక్కో హాస్టల్లో ఆరు సీసీ కెమెరాలు, ఒక డీవీఆర్ యంత్రాలను అమరుస్తారు. వీటన్నిం టి కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ రూ.69.52 కోట్లు ఖర్చు చేస్తోంది. జిల్లా కమిటీలకు కొనుగోలు బాధ్యతలు ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలోని సంక్షేమ వసతి గృహాల్లో కొత్తగా ఇవ్వనున్న బ్రాండెడ్ వస్తువుల కొనుగోలు బాధ్యతలను కలెక్టర్ చైర్మన్గా ఉన్న కొనుగోలు కమిటీలకు అప్పగించింది. రాష్ట్రస్థాయిలో కేటగిరీలు, ధరలు నిర్ణయించి.. ఆ మేరకు వస్తువులను కొనుగోలు చేయాలని స్పష్టం చేసింది. కేవలం కొనుగోలే కాకుండా ప్రతి వస్తువుకు గ్యారంటీ ఉండాలనే నిబంధన విధించింది. ఈ ప్రక్రియలో భాగంగా రెండ్రోజుల క్రితం ఖమ్మం జిల్లా కమిటీ వస్తువులు కొనుగోలు చేసింది. మిగతా జిల్లాల్లోనూ కొనుగోలు ప్రక్రియ వీలైనంత వేగంగా పూర్తి చేస్తామని, అనంతరం విద్యార్థులకు పంపిణీ చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్ ‘సాక్షి’కి తెలిపారు. -
దోపిడీకి ప్లాన్
పాలకొల్లుటౌన్ : ఎస్సీ సబ్ప్లాన్ నిధులు తెలుగుదేశం నాయకులకు కల్పతరువుగా మారాయి. కాంట్రాక్టర్లు, అధికారులకు కాసులవర్షం కురిపిస్తున్నాయి. ఇది పాలకొల్లు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతికి అద్దం పడుతోంది. పాలకొల్లు మున్సిపాలిటీకి ప్రభుత్వం ఎస్సీ సబ్ప్లాన్ ద్వారా రూ.18 కోట్లు మంజూరు చేసింది. 2017–18లో ఈ నిధులు ఖర్చు చేయాలి. అయితే మున్సిపల్ అధికారులు పనులకు టెండర్లు ఖరారు చేసి ఏడాది పూర్తవుతున్నా ఇప్పటివరకు ఆ పనులను పూర్తి చేయలేదు. మార్చి నెలాఖరు సమీపిస్తుండడంతో నిధులు తిరిగి వెనక్కు మళ్లుతాయనే భయంతో హడావుడిగా టీడీపీ నాయకులు పనులను వేగవంతం చేశారు. సబ్ప్లాన్ చట్టాన్ని కూడా అతిక్రమించి నాణ్యతా ప్రమాణాలకు తిలోదకాలిచ్చి భారీ అవినీతికి పాల్పడుతున్నారు. పాలకొల్లు బెత్లహాంపేటలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో నాణ్యత లేకుండా నిర్మిస్తున్న సీసీ డ్రెయిన్ 7 ఎస్సీ వార్డులు పాలకొల్లులో మొత్తం 31 వార్డులు ఉన్నాయి. వీటిలో ఏడు ఎస్సీ వార్డులు. ఈ వార్డుల్లో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో డ్రెయినేజీ, రోడ్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పిం చాల్సిన బాధ్యత మున్సిపాలిటీపై ఉంది. జనాభాలో 40శాతం ఎస్సీలు ఉన్న ప్రాంతాల్లో ఈ నిధులు వాడాలి. టీడీపీ నేతల కోసం రోడ్డు అయితే ఎస్సీలు 10శాతం కూడా లేని ప్రాంతాల్లో పనులు చేపడుతున్నారు. వాస్తవానికి 17, 18 వార్డుల్లో ఎస్సీలు పదిశాతం కూడా ఉండరు. ఇలాంటిచోట పలువురు టీడీపీ నాయకులు వారి పొలాలను రియల్ఎస్టేట్ వ్యాపారంగా మార్చుకోవడానికి రూ.50లక్షల సబ్ప్లాన్ నిధులతో నిబంధనలకు విరుద్ధంగా బీటీ రోడ్డు నిర్మించారు. దీంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రోడ్డు నిర్మాణంతో ఇప్పటికే ఈ ప్రాంతంలో అనేక పొలాలు, కొబ్బరితోటలు తొలగించి చకాచకా లేఅవుట్లకు సిద్ధం చేస్తున్నారు. నాసిరకంగా పనులు ఇదిలా ఉంటే 18వ వార్డు బెత్లహాంపేట, 16వ వార్డులో ఎస్సీ సబ్ప్లాన్, మున్సిపల్ జనరల్ ఫండ్ దాదాపు రూ.4కోట్లతో నిర్మితమవుతున్న రోడ్లు, సీసీ డ్రెయిన్ నిర్మాణ పనులు నాసిరకంగా జరుగుతున్నాయి. దీనిలో భారీ అవినీతి జరుగుతున్నట్టు సమాచారం. కాంట్రాక్టర్లు, అధికారులు కుమ్మక్కైనట్టు తెలుస్తోంది. నాసిరకం సిమెంటు వినియోగిస్తున్నట్టు సమాచారం. ఇసుకపాళ్లు ఎక్కువ వేసి తూతూమంత్రంగా పనులు చేపట్టినట్టు స్థానికులు విమర్శిస్తున్నారు. ఫలితంగా వేసిన 2రోజులకే రోడ్డు, డ్రెయిన్లు బీటలు తీశాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరికొన్ని ఎస్సీవార్డుల్లో డ్రెయినేజీ నిర్మాణం లేకుండా హడావుడిగా రోడ్డు నిర్మాణాలు చేపట్టారని స్థానికులు చెబుతున్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎస్సీ సబ్ప్లాన్ నిధులు రూ.కోటి వ్యయంతో 16వ వార్డులో నిర్మిస్తున్న డ్రెయిన్ దృశ్యం టీడీపీ నేతల కనుసన్నల్లోనే పట్టణంలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో చేపట్టిన పనులన్నీ టీడీపీ నేతల కనుసన్నల్లోనే జరుగుతున్నట్టు సమాచారం. నాసిరకంగా పనులు చేపట్టడంపై దళిత సంఘాలు మండిపడుతున్నాయి. అయినా ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదు. పనులు జరుగుతున్న ఎస్సీ వార్డుల్లో ఆ ప్రాంతాలకు చెందిన కొంతమంది టీడీపీ వార్డు కౌన్సిలర్లు నాయకులు కాంట్రాక్టర్లు తమను ప్రసన్నం చేసుకోకపోతే బిల్లులు నిలిపేస్తామని బెదిరింపులకు దిగుతున్నట్టు సమాచారం. కొంతమంది టీడీపీ నేతలు డబ్బులు చేతిలో పడితేగానీ పనులు సాగనీయడం లేదని ™ లుస్తోంది. వీటిపై మున్సిపల్ కౌన్సిల్ సమావేశాల్లో ప్రతిపక్ష నేత యడ్ల తాతాజీ అనేకసార్లు మున్సిపల్ చైర్మన్ వల్లభు నారాయణమూర్తి, కొందరు టీడీపీ నేతలపై ధ్వజమెత్తారు. వారు రియల్ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడానికి రూ.50లక్షలు సబ్ప్లాన్ నిధులతో రోడ్డు నిర్మించారని విమర్శించారు. దీనిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పోరాడినా ఫలితం లేదు. 7 వార్డుల్లో 86 పనులు పాలకొల్లు మున్సిపాలిటీలో 7వార్డుల్లో 86 పనులను చేపట్టారు. ప్రస్తుతం 48పనులు నూరుశాతం పూర్తికాగా మరో 38 పనులు 75శాతం పూర్తయ్యాయని మున్సిపల్ ఇంజినీరింగ్ అధికారులు చెబుతున్నారు. మార్చి 15లోపు మిగిలిన పనులు పూర్తిచేస్తామని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం 10, 11, 15, 21, 31 వార్డుల్లో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతాప్రమాణాలకు కాంట్రాక్టర్లు తిలోదకాలిచ్చినా అధికారులు పట్టించుకోని దుస్థితి నెలకొంది. రెండు రోజులకే బీటలు బెత్లహాంపేటలో డ్రెయిన్ నిర్మాణం చేపట్టారు. అయితే 2రోజులకే ఎక్కడికక్కడ కాంక్రీటు రాలిపోయింది. ప్లాస్టరింగ్ కూడా చేయలేదు. డ్రెయిన్ మార్జిన్ పూడ్చమని అడిగితే ఎవరింటిముందు వాళ్లే పూడ్చుకోవాలని చెబుతున్నారు. ఇది చాలా దారుణం. అధికారులు తక్షణ చర్యలు తీసుకోవాలి. – షేక్ మీరాఉద్దీన్, బెత్లహాంపేట, డ్రెయిన్ లేకుండానే రోడ్డు మా వార్డులో అధికారులు సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అయితే డ్రెయినేజీ లేకుండా రోడ్డు ఎలా నిర్మిస్తారని అడిగితే రోడ్డు పూర్తయ్యాక డ్రెయిన్ నిర్మిస్తామని అధికారులు చెబుతున్నారు. డ్రెయిన్ నిర్మాణం లేకుండా రోడ్డువేస్తే కుంగిపోతుంది. డ్రెయినేజీ లేకపోవడం వల్ల ఎక్కడి మురుగు అక్కడే ఉంటుంది. పందులు, దోమలు పెరిగి అనారోగ్యం పాలవుతున్నాం. ఇది చాలా దారుణం. అధికారులు ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలి. – నగరపు సత్తెమ్మ, రాజీవ్నగర్ కాలనీ, పర్యవేక్షిస్తున్నారు పాలకొల్లు మున్సిపాలిటీలో ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో రోడ్లు, డ్రెయినేజీల నిర్మాణం జరుగుతోంది. ఈ పనుల్లో నాణ్యతాప్రమాణాలను ఎప్పటికప్పుడు ఇంజినీరింగ్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు. పనుల్లో ఎక్కడైనే నాణ్యత లోపించినట్లు గుర్తిస్తే ఆ పనులకు బిల్లులు నిలిపివేస్తాం. క్వాలిటీ కంట్రోల్, థర్డ్ పార్టీతో నాణ్యత ప్రమాణాల పరిశీలన అనంతరమే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లిస్తాం. నాణ్యత ప్రమాణాలు లోపించిన చోట ప్రజలు గమనించి తమ దృష్టికి తీసుకొస్తే చర్యలు తీసుకుంటాం. – ఎ.రామ్మోహనరావు, మున్సిపల్ కమీషనర్, పాలకొల్లు -
ఎస్సీ, ఎస్టీ చట్టాల బాధ్యత కమిషన్దే
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల కోసం రూపొందించిన చట్టాలను అమలు చేయడంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ పాత్ర కీలకమని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలు తీరునూ అధ్యయనం చేయాలని, ప్రతి లబ్ధిదారుకు సంక్షేమ ఫలాలు అందేలా చూడాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియమితులైన ఎర్రోళ్ల శ్రీనివాస్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా రవీంద్రభారతిలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కడియం మాట్లాడుతూ.. ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతను శ్రీనివాస్ సమర్థవంతంగా నిర్వహించాలని సూచించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా ఎస్సీ, ఎస్టీల కోసం సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరికీ అవకాశం టీఆర్ఎస్ పార్టీలో ప్రతి కార్యకర్తకు అవకాశం వస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో కష్టపడ్డ శ్రీనివాస్కు సీఎం కేసీఆర్ ఈ బాధ్యతలు అప్పగించారన్నారు. ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో దళితులపై జరుగుతున్న దాడులను కమిషన్ అరికట్టాలని సూచించారు. ఈ సందర్భంగా ఎర్రోళ్ల శ్రీనివాస్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే కమిషన్ సహించదని, ఫోన్లో లేదా ఎస్సెమ్మెస్ పెట్టినా కమిషన్ స్పందిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, నాయిని నర్సింహారెడ్డి, జోగు రామన్న, తలసాని శ్రీనివాస్యాదవ్, నగర మేయర్ బొంతు రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
వన్మ్యాన్ షో
మంత్రి నారాయణ వన్మ్యాన్ షోకు తెరతీశారు. నగరంలో మేయర్తో సహా అధికారపార్టీ నేతలు అనేక మంది ఉన్నారు. ప్రతిపక్ష పార్టీల నుంచి జంప్ అయిన కార్పొరేటర్లు ఉన్నారు. ఏ ఒక్కరితో సంబంధం లేకుండా నగరంలో అన్ని తానై మంత్రి వ్యవహరించటం వివాదంగా మారుతోంది. ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో పనుల నిర్వహించే విషయంలో నేరుగా కాంట్రాక్ట్ కంపెనీ మంత్రి నారాయణ మినహా మధ్యలో మరెవరికీ చోటు ఇవ్వకపోవటం చర్చనీయాంశంగా మారింది. సాక్షి ప్రతినిధి, నెల్లూరు: రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ తనకు అడ్డు ఏమీ లేదనే రీతిలో టెండర్ కేటాయించకుండానే ఎస్సీ సబ్ప్లాన్కు సంబంధించిన అభివృద్ధి పనులను మొదలు పెట్టించారు. పర్యవసానంగా నగరంలో అసలు ఏం జరగుతుందో కూడా అధికారపార్టీ నేతలకు తెలియని పరిస్థితి. రూ.55 కోట్లతో పనులు 2017–18 వార్షిక సంవత్సరానికి సంబంధించి ఉన్న ఎస్సీ సబ్ప్లాన్ నిధులతో నగరంలోని దళితవాడల్లో అభివృద్ధి పనులు నిర్వహించాలని నిర్ణయించారు. రూ.75 కోట్ల నిధులకు గానూ రూ.55 కోట్లతో నగరంలోని దళితవాడల్లో 167 పనులు నిర్వహించాలని ప్రణాళికలు సిద్ధం చేశారు. వాస్తవానికి అయితే నిధులను ప్రభుత్వం విడుదల చేస్తే స్థానిక సంస్థలు వాటికి సంబంధించి అంచనాలు సిద్ధం చేసుకోవాలి. అనంతరం నివేదికలు పంపి వాటిని ఆమోదించాక టెండర్లు పిలిచి తక్కువ టెండర్ కోట్ చేసిన వారికి కేటాయిస్తారు. ఈ అయితే నిబంధనలు ఏమీ తనకు వర్తించవు అనే రీతిలో మంత్రి నారాయణ వ్యవహరించారు. నగరంలో మెత్తం 167 పనులకు సంబంధించి ఒకే ప్యాకేజ్గా సిద్ధం చేసి ఈ నెల 17వ తేదీన టెండర్లను ఖరారు చేశారు. అది కూడా పనులన్నీ కలిపి సింగల్ టెండర్ రూపంలో ఎన్సీసీ లిమిటెడ్ ఆఫ్ హైదరాబాద్ కంపెనీకి కట్టబెట్టారు. ఈ వ్యవహరం అంతా నెల్లూరుతో సంబంధం లేకుండా అమరావతిలోని మంత్రి నారాయణ పేషీ నుంచి జరగటం విశేషం. నగరంలో గుర్తించిన 55 ఎస్సీ కాలనీల్లో సీసీ రోడ్లు, డ్రెయిన్ల నిర్మాణం పనులు దీనిలో భాగంగా నిర్వహించనున్నారు. అలాగే మిగిలిన రూ.20 కోట్ల నిధులతో పాఠశాలలకు కాంపౌండ్ వాల్స్ నిర్మాణం ఇతర అభివృద్ధి పనులు నిర్వహించనున్నారు. గత ఏడాది సబ్ ప్లాన్ ని«ధులు నగరానికి రూ.42 కోట్లు మంజూరు కావటంతో పనుల పంపకాల్లో అధికారపార్టీ కార్పొరేటర్ల మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ క్రమంలో పనుల్లో ఎవరి జోక్యం లేకుం డా మంత్రి నారాయణ అన్నీ తానై చూసుకోవటంతో పాటు నేరుగా కాంట్రాక్టర్లతో మాట్లాడుకుని వారికి సహకరించాలనిని అధికారులను ఆదేశించారు. టెండర్కు ముందేపనుల ప్రారంభం ఇదిలా ఉంటే ఈనెల 17న టెండర్లను ఎన్సీసీ కంపెనీకి కట్టబెట్టారు. అయితే దీని కంటే 20 రోజుల మందు నుంచే నగరంలో టెండర్లకు సంబంధించిన పనులు నిర్వహించడం గమనార్హం. కనీసం ఆయా డివిజన్లలో జరిగే పనులకు సంబంధించి కార్పొరేటర్లకు కూడా తెలయని పరిస్థితి. మరోవైపు రూ.55 కోట్ల విలువైన పనులను కేటాయించటంతో పాటు కాంట్రాక్టర్ కు అదనపు లబ్ధి కూడా చేకూరేలా జీఓ జారీ చేశారు. రూ.55కోట్ల పనులకు 2.27 శాతం అదనంగా అంటే మరో రూ.2.27 కోట్లు అదనంగా ఇచ్చేలే జీఓ జారీ చేశారు. వచ్చే నెలాఖరులో సబ్ప్లాన్ ని«ధుల కాలం చెల్లనున్న క్రమంలో ఆఘమేఘాల మీద పనులు మొదలుపెట్టారు. నెల రోజుల వ్యవధిలో పూర్తి చేయాలంటే ఎంతమేరకు నాణ్యత ఉంటుందనే ప్రశ్న సర్వత్రా వ్యక్తమవుతోంది. ఎస్సీసీతో పాటు మరికొన్ని కార్పొరేట్ కంపెనీలను రంగంలోకి దింపి వారికి సబ్ కాంట్రాక్ట్ కూడా ఇచ్చేలా మంత్రి వ్యవహరించారు. ఈ క్రమంలో మంగళవారం చీఫ్ ఇంజినీర్ చంద్రయ్య పనులను పరిశీలించారు. -
ఫర్నిచర్ పేరిట దోపిడీ!
నల్లగొండ : ఎస్సీ సంక్షేమ వసతి గృహాలకు కొనుగోలు చేసిన ఫర్నిచర్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది. హాస్టళ్లలో వార్డెన్లకు అవసరమయ్యే వీల్ చైర్, ఆఫీసు టేబుల్, కంప్యూటర్ టే బుల్, స్టీల్ బీరువాలు, ఐరన్ టేబుల్స్, విద్యార్థులకు మంచాలు, బెడ్స్, ర్యాక్స్, డైనింగ్ టేబుల్స్ తదితర వస్తువులను కొనుగోలు చేసేందుకు జిల్లాకు రూ.1.13 కోట్లు మంజూరయ్యాయి. అయితే ఫర్నిచర్ కొనుగోలుకు సంబం ధించి అధికారులు వ్యవహరించిన తీరు విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ ఏజెన్సీల నుంచి ఫర్నిచర్ కొనాలనే నిబంధన ఉన్నప్పటికీ వస్తువుల ధరలు ఖరారు చేయడం.. నాణ్యత పరిశీలించడంలో అధికారులు తప్పులో కాలేశారు. సాధారణంగా ప్రైవేట్ ఏజెన్సీలకు కాంట్రాక్టు అప్పగించే క్రమంలో అనేక రకాల నిబంధనలు వర్తింపజేసే అధికారులు ఈ వ్యవహారంలో అవేమీ పాటించలేదు. జైల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలనే ఉత్తర్వులను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నారు. రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ జారీ చేసిన ఉత్తర్వుల మేరకు చర్లపల్లి సెంట్రల్ జైలుకు రూ.1.13 కోట్ల ఆర్డర్ ఏకపక్షంగా కట్టబెట్టారు. జైలు అధికారులు ఖరారు చేసిన ధరలనే జిల్లా అధికారులు ఏకగీవ్రంగా ఆమోదించారు. కనీసం వస్తువులకు సంబంధించిన శాంపిళ్లను కూడా ముందుగా పరిశీలించలేదు. ప్రైవేట్ ఏజెన్సీలు సప్లయ్ చేసే వస్తువుల్లో సాంకేతికరమైన లోపాలను గుర్తించడంలో జిల్లా కొనుగోలు కమిటీలో పరిశ్రమల శాఖ ప్రమేయం తప్పనిసరి. కానీ చర్లపల్లి జైలు నుంచి సప్లయ్ చేసిన ఫర్నిచర్ విషయంలో పరిశ్రమల శాఖ ప్రమేయం లేదనే చెప్పాలి. అధికారులు తాము అనుకున్నదే తడవుగా జైలు అధికారులు చెప్పిన ప్రతీదానికీ తలూపారు. దీంతో సప్లయ్ చేసిన వస్తువుల ధరలు, నాణ్యత పరిశీలిస్తే...ఓపెన్ మార్కెట్లో వాటి ధరలకు భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. ఓపెన్ మార్కెట్లో చూస్తే.. హాస్టళ్లలో ఫర్నిచర్ పరిశీలిస్తే అంత ధర ఉండదని చిన్నతరహా పరిశ్రమ అధికారులు చెబుతున్నారు. ఫర్నిచర్ వ్యాపారంలో అపార అనుభవం కలిగిన వారు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. వస్తువుల నాణ్యతలో రాజీపడలేదు కానీ ధరల్లోనే భారీ వ్యత్యాసం ఉందని అంటున్నారు. బయటి మార్కెట్లో ఆఫీసు టేబుల్ ధర రూ.5 వేలకు మించి ఉండదని పరిశ్రమ వర్గాలు పేర్కొంటున్నాయి. కానీ జైలు అధికారులు ఆ టేబుల్ను రూ.14,500లకు సప్లయ్ చేశారు. జిల్లాలోని జనరల్, కాలేజీ హాస్టళ్లకు 61 టేబుల్స్ సరఫరా చేశారు. ఈ లెక్కన 61 టేబుళ్లకు అధికారులు చెల్లించింది రూ.8,84,500. అదే ఓపెన్ మార్కెట్ ధర ప్రకారం చూస్తే 61 టేబుళ్ల ధర కేవలం రూ.3,05,000 మాత్రమే. అంటే ఒక్క ఆఫీసు టేబుల్ ధరలోనే సుమారు రూ. 5,79,500 వ్యత్యాసం కనిపిస్తోంది. సప్లయ్ చేసిన వీల్చైర్ కూడా సాధారణ రకానికి చెందినదనే అన్నారు. జైల్ నుంచి సప్లయ్ చేసిన వీల్ చైర్ ధర రూ.6,095. అంతే క్వాలిటీ కలిగిన చైర్ ధర ఓపెన్ మార్కెట్లో రూ.3 వేలకు మించదని పరిశ్రమల అధికారులు తెలిపారు. జిల్లాకు 61 చైర్లు సప్లయ్ చేశారు. ఈ లెక్కన 61 వీల్ చైర్లకు ఎస్సీ సంక్షేమ శాఖ రూ.3,71,795 చెల్లించింది. ఓపెన్ మార్కెట్ ధరలతో పోల్చినప్పుడు 61 చైర్ల ధర కేవలం రూ.1,83,000 మాత్రమే. ఈ రెండింటి మధ్య వ్యత్యాసం రూ.1,88,795 . ఇదేరకమైన తేడా మిగిలిన వస్తువుల ధరల్లోనూ కనిపిస్తోంది. సాధారణంగా జైలులో తయారు చేసే వస్తువుల పై పన్నులు ఉండవు. అలాంటప్పుడు మరింత రేటు తగ్గాల్సి ఉన్నా.. అధిక ధరలకు ఆర్డర్ ఇవ్వడం గమనార్హం. నిరుపయోగంగా ఫర్నిచర్.. సొంత భవనాలు కలిగిన హాస్టళ్లను మినహాయిస్తే అద్దె భవనాల్లోని హాస్టళ్లలో ఫర్నిచర్ నిరుపయోగంగా దర్శనమిస్తోంది. అద్దెభవనాల్లో స్థల సమస్య వల్ల కొంత మంది వార్డెన్లు ఫర్నిచర్ను తిప్పిపంపించారు. నల్లగొండలోని బాయ్స్ హాస్టల్ ‘ఏ’కు స్థలాభావం వల్ల నాలుగు లాంగ్ బేంచీలను తిప్పి పంపారు. హాస్టళ్లకు ఫర్నిచర్ చేరిందా..? లేదా..? అనేది కూడా అధికారులు పట్టించుకోలేదు. మొత్తం ఫర్నిచర్కు బిల్లులు మాత్రం చెల్లించారు. ఇక ప్రస్తుతం ఏ హాస్టల్కు కూడా కంప్యూటర్లు లేవు. బయోమెట్రిక్ మిషన్లు పనిచేయడం లేదు. సొంత భవనాల్లో కంప్యూటర్ టేబుళ్లు గతంలోనే ఉన్నాయి. కానీ మళ్లీ కొత్తగా టేబుళ్లు కొనుగోలు చేశారు. అద్దె భవనాలకు సప్లయ్ చేసిన టేబుళ్లు వృథాగా పడేశారు. హాస్టళ్లలో ఉన్నటువంటి పరిస్థితులను ముందుగా అంచనా వేయకుండా అడ్డగోలుగా ఫర్నిచర్ కొనుగోలు చేయడంలో లక్షల రూపాయల నిధులు వృథా అయ్యాయి. రెండు రకాల ధరలు.. జైలు అధికారులు ముందుగా నిర్ణయించిన ధరలు కాకుండా రెండో సారి మార్పు చేశారు. ముందుగా ఖరారు చేసిన ధరల ప్రకారం ఆఫీసు టేబుల్ ధర రూ.18 వేలు ఉండగా.. ఆ త ర్వాత సవరించిన ధరల ప్రకారం టేబుల్ ధర రూ.14,500. ఇదేరకంగా స్టీలు అల్మారాల ధర రూ.15 వేలు ఉంటే దానిని రూ.11,900లకు తగ్గించారు. ఇలా అన్ని రకాల వస్తువుల్లోనే జరిగింది. ధరలు పెంచడం, ఆ తర్వాత వాటిని సవరించే అంతిమ నిర్ణయం కూడా జైలు అధికారులదే. అయితే ధరలు సవరించడాని కంటే ముందుగానే పాత ధరల ప్రకారమే చర్లపల్లి జైలుకు రూ.1,37,24,000 బిల్లు చెల్లించారు. ఆ తర్వాత ధరలు సవరించడంతో రూ. 1,13,21, 020ల బడ్జెట్ తగ్గింది. ఈ రెండింటి ధరల మధ్య వ్యత్యాసం రూ.24 లక్షలు. మిగిలిన బ్యాలెన్స్ రూ.24 లక్షలు వెనక్కి తెప్పించుకోవాల్సిన అధికారులు అలా చేయకుండా అదనంగా మరికొంత ఫర్నిచర్ తెప్పించారు. నిజంగానే చర్లపల్లి జైల్లోనే ఫర్నిచర్ తయారు చేస్తున్నారా..? లేదంటే కొనుగోళ్ల పేరిట మధ్య వర్తులను అడ్డంపెట్టుకుని బయటి నుంచి కొనుగోలు చేసి సప్లయ్ చేస్తున్నారా..? అనేది అధికారులకు అంతు చిక్కడం లేదు. ట్రంక్ పెట్టెలు జైల్లో తయారు కావనే విషయం కూడా తెలుసుకోకుండా అధికారులు వర్క్ఆర్డర్ ఇవ్వడం అందుకు నిదర్శనం. కలెక్టర్ ఆదేశాల మేరకు ఆర్డర్ ఇచ్చాం ప్రభుత్వ ఏజెన్సీ కావడంతో కలెక్టర్ ఆదేశాల మేరకు చర్లపల్లి జైలుకు ఆర్డర్ ఇచ్చాం. జైలు నుంచి సప్లయ్ చేసిన వస్తువులు నాణ్యంగానే ఉన్నాయని వార్డెన్లు చెప్పారు. స్వయంగా పరిశీలన కూడా చేశాం. జైలు అధికారుల వద్ద కూడా ప్రైస్ లిస్ట్ ఉంటుంది. ఎప్పటికప్పుడు ధరలను సవరిస్తుంటారు. వర్క్ ఆర్డర్ ఇచ్చినప్పుడు ధర ఒకరకంగా ఉంటే ఫర్నిచర్ సప్లయ్ చేసే నాటికి వాటి ధర తగ్గింది. దీంతో తగ్గిన ధర ప్రకారమే సప్లయ్ చేశారు. మిగిలిన బ్యాలెన్స్ నిధులతో అదనంగా ఫర్నిచర్ తెప్పించాం. నేను ఇన్చార్జిగా చేరకముందు నుంచే ఎస్సీ సంక్షేమ శాఖలో ఫర్నిచర్ ఫైల్ పెండింగ్లో ఉంది. ట్రెజరీ నుంచి నిధులు వెనక్కి Ððవెళ్లిపోతాయన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు ఫైల్ తెప్పించి ఫర్నిచర్ కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం. – నరోత్తమ్ రెడ్డి, ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి -
గురుకుల్ సెట్ నోటిఫికేషన్ జారీ
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖలతో పాటు విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి ప్రవేశాలకు గురుకుల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్–2018ను ప్రభుత్వం నిర్వహించనుంది. అర్హత పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా అడ్మిషన్లు చేపట్టనుంది. ఈ మేరకు ప్రభుత్వం టీజీ గురుకుల్ సెట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ పరీక్ష నిర్వహణ బాధ్యతలను తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి అప్పగించింది. అర్హతలివే... గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి ప్రవేశాలకు విద్యార్థుల వయసు 01.09.2018 నాటికి 9 నుంచి 11 ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు వయోపరిమితి రెండేళ్లు సడలించింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల/విద్యాసంస్థలో నాల్గోతరగతి ఉత్తీర్ణులై ఉండాలి. విద్యార్థి తల్లిదండ్రుల వార్షికాదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.5లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2లక్షలు మించకుండా ఉండాలి. దరఖాస్తు కోసం http:/tgcet. cgg.gov.in వెబ్సైట్లో సంప్రదించవచ్చు. దరఖాస్తు ప్రక్రియ 19 నుంచి మార్చి 16 దాకా కొనసాగుతుందని టీఎస్డబ్ల్యూఆర్ఈఐఎస్ కార్యదర్శి ఆర్.ఎస్.ప్రవీణ్కుమార్ తెలిపారు. టీజీ గురుకుల్ సెట్ పరీక్ష ఏప్రిల్ 8న ఉదయం 11గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు నిర్వహించనున్నారు. మరిన్ని వివరాలకు www.tswreis.in వెబ్సైట్లో లేదా 1800 425 45678 హెల్ప్లైన్ ఫోన్ నంబర్లో సంప్రదించవచ్చు. -
గడువులోగా నిధుల ఖర్చు: జగదీశ్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీ ఎస్డీఎఫ్)కి ప్రభుత్వం కేటాయించిన నిధులను నిర్ణీత గడువులోగా ఖర్చు చేస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి అన్నారు. 2017–18 వార్షిక సంవత్సరం ముగియడానికి నెలన్నర గడువుందని ఆలోపు శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. సోమవారం సచివాలయంలో ఎస్సీ ఎస్డీఎఫ్ అమలుపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. 2017–18 వార్షిక సంవత్సరంలో ఎస్సీఎస్డీఎఫ్ కింద రూ.14,375 కోట్లు కేటాయించినట్లు జగదీశ్రెడ్డి చెప్పారు. జనవరి ఆఖరు నాటికి రూ.6,689 కోట్లు ఖర్చయ్యాయన్నారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో పూర్తిస్థాయిలో నిధులు ఖర్చు చేయాల్సిందిగా అధికారులను ఆదేశించామన్నారు. దళితుల అభివృద్ధికి 197 సంక్షేమ పథకాలతో పాటు 219 ఉప సంక్షేమ పథకాలను చేపడుతున్నట్లు తెలిపారు. -
ఉన్నత విద్య అభ్యసించే ఎస్సీ, ఎస్టీలకు ఉపకార వేతనాలు
నిడమర్రు : ఉన్నత విద్యారంగంలో పలు కోర్సులు అభ్యసిస్తున్న ప్రతిభగల విద్యార్థులను అర్థికంగా ప్రోత్సహించేందుకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) పోస్ట్ గ్రాడ్యుయేషన్(పీజీ) విద్యార్థులకు పలు రకాల ఉపకార వేతనాలు అందిస్తుంది. ఎస్సీ/ఎస్టీ విద్యార్థుల్లో ఇంజనీరింగ్, టెక్నాలజీ, ఫార్మసీ వంటి వృత్తి విద్యా కోర్సుల్లో పీజీ స్థాయిలో చేరే విధంగా ప్రోత్సహించేందుకు ‘పీజీ స్కాలర్షిప్స్ ఫర్ ఎస్టీ, ఎస్సీ స్టూడెంట్స్ ఫర్ ఫ్రొఫెషనల్ కోర్సెస్’ అనే పేరుతో ఉపకార వేతనాలు యూజీసీ అందిస్తుంది. ఈ ఉపకార వేతనాల కోసం ఈ నెల 15వ తేదీలోపు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది. ఆ వివరాలు తెలుసుకుందాం. ♦ ఉపకార వేతనం మొత్తం: రూ.50 వేలు (నెలకు రూ.5 వేల చొప్పున) ♦ దరఖాస్తు చేసుకునేందుకు ఆఖరి తేదీ: ఈ నెల 15 అర్హతలు ఇవి.. ♦ ఎస్సీ/ఎస్టీ సామాజిక వర్గాలకు చెందిన పీజీ స్థాయిలో విద్యా కోర్సులు చేస్తున్న విద్యార్థులు ♦ వయోపరిమితి : పురుషులకు 45 ఏళ్లు, మహిళలకు 50 ఏళ్లు( 2018 జులై నాటికి ) ♦ స్కాలర్షిప్ వ్యవధి : రెండు/మూడేళ్లు (కోర్సు కాలాన్ని బట్టి) ♦ మొదటి సెమిస్టర్లో 60 శాతం మార్కులు తçప్పనిసరిగా సాధించాల్సి ఉంటుంది. ♦ సంబంధిత కోర్సుల్లో సెమిస్టర్ విధానంలో ఉపకార వేతనాలు అందిస్తారు. యూజీసీ నిర్దేశించిన విధంగా మార్కులు సాధిస్తేనే స్కాలర్షిప్ను కొనసాగిస్తారు. ఈ క్రమంలో రెండో సెమిస్టర్కు అర్హత పొందాలంటే మొదటి సెమిస్టర్లో 60 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్(జీసీఏ) సాధించాలి. ఇదే విధంగా మూడో సెమిస్టర్లో, నాలుగో సెమిస్టర్ కోసం మూడో సెమిస్టర్లో ప్రతిభ చూపించాల్సి ఉంటుంది. ప్రతి సెమిస్టర్లో సాధించిన మార్కుల ఆధారంగానే ఉపకార వేతనాన్ని కొనసాగిస్తారు. అలాగే కోర్సు మధ్యలో మానేయకుండా డిక్లరేషన్ సమర్పించాల్సి ఉంటుంది. ఏదైనా సెమిస్టర్లో ఉత్తీర్ణులు కాకపోతే స్కాలర్షిప్ను రద్దు చేస్తారు. నగదు ఇలా.. ఉపకార వేతనం మొత్తాన్ని మెరిట్ ఆధారంగానే విద్యార్థి బ్యాంక్ ఖాతాలో జమచేస్తారు. మొదటి, రెండో, మూడో సెమిస్టర్లో ప్ర«థమ శ్రేణి మార్కులు/తత్సమాన జీపీఏ సాధించిన విద్యార్థులకు నెలకు రూ.5 వేలు ఉపకారవేతనంగా చెల్లిస్తారు. 60 శాతం కంటే మార్కులు వస్తే నెలకు రూ.1000 మాత్రమే స్కాలర్షిప్ రూపంలో చెల్లిస్తారు. అనర్హులు ♦ కేంద్ర ప్రభుత్వ కుల జాబితాలో బీసీ/ఓసీ సామాజిక వర్గాల విద్యార్థులు ♦ ఎస్సీ/ఎస్టీ విద్యార్థులై కరస్పాండెట్ కోర్సులు, దూరవిద్య కోర్సులు చేస్తున్న విద్యార్థులు ♦ వృత్తి విద్యా కోర్సుల్లో పీజీ చదువుతున్న మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రమే. ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తుకు అనర్హులు ♦ సంబంధిత ప్రొఫెషనల్ డిగ్రీ రెండో సంవత్సరం (మూడో సెమిస్టర్)లో గేట్ పరీక్షల్లో అర్హత సాధించిన వారికి ఈ ఉపకారవేతనం అప్పటి నుంచి రద్దు చేస్తారు. ఆన్లైన్లో ఇలా.. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉపకార వేతనాల పోర్టల్ https://scholarships.gov.in/ లాగిన్ అవ్వాలి. కనిపించే ముఖచిత్రంలో యూజీసీ స్కీమ్స్ కాలం క్లిక్ చేయాలి. అక్కడ పీజీ స్కాలర్షిప్స్ ఫర్ ఎస్సీ/ఎస్టీ స్డూడెంట్స్ ఫర్ ప్రొఫెషనల్ కోర్సెస్ వద్ద క్లిక్ చేయాలి. ♦ లాగిన్ పక్కన న్యూ స్టూడెంట్స్ రిజిస్ట్రేషన్ వద్ద క్లిక్ చేయాలి. విద్యార్థి, కోర్సు, బ్యాంక్ ఖాతా సంఖ్య, మొబైల్ సంఖ్య, పుట్టిన తేదీ తదితర వివరాలు నమోదు చేసి ఈ నెల 15వ తేదీలోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. -
అభ్యున్నతి ఓ నాటకం!
ఒంగోలు టూటౌన్: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ ఔత్సాహిక పారిశ్రమిక వేత్తలకు రుణాలు అందని ద్రాక్షగా మారాయి. పరిశ్రమ ఏర్పాటుకు సొంత స్థలం ఉన్నప్పటికీ పెట్టుబడి (మార్జీన్మనీ)లేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఫలితంగా అటు ఉద్యోగం రాక ఇటు ఎలాంటి వ్యాపారం చేయలేక జీవితంలో ఎదగలేకపోతున్నారు. ఔత్సాహిక ఎస్సీ, ఎస్టీ నిరుద్యోగులను ప్రోత్సాహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2016 డిసెంబర్లో మార్జిన్ మనీ స్కీంకు సంబంధించిన 108 జీఓ విడుదల చేసింది. అయితే వయస్సు మెలిక పెట్టి (50 సంవత్సరాల వరకు ఈ మార్జీన్ మనీ స్కీమ్ అమలు చేయడాన్ని తేల్చకుండా) ఆ జీఓని ఇప్పటి వరకు కాగితాలకే పరిమితం చేశారు. ఒక వేళ అమలు చేస్తే ఎస్సీ, ఎస్టీ ఔత్సాహికులు, సొంత పెట్టుబడి లేని నిరుద్యోగులు ఎంతోమందికి వెసులుబాటు కలిగేది. పరిశ్రమలు పెట్టుకొని తమకాళ్లపై నిలబడగలిగే అవకాశం కలిగేది. అలాగే గ్రామాల్లో మరికొంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే అవకాశం కలుగుతుంది. అయితే కేవలం లబ్ధిదారుని కాంట్రిబ్యూషన్ (సొంత పెట్టుబడి) లేకపోవడంతో ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అందుకోలేపోతున్నారు. ఒక్క శాతం కూడా ఖర్చు కాక.. ఏటా బడ్జెట్లో ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులు పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు కేటాయిస్తున్న నిధులు రాష్ట్ర వ్యాప్తంగా ఒక శాతం కూడా ఖర్చు కాని పరిస్థితి నెలకొంది. ఒక్క ఎస్సీ, ఎస్టీ ఔత్సాహికులను ప్రోత్సహించేందకే 2015–16 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం రూ. 400 కోట్ల సబ్ప్లాన్ నిధులను కేటాయించింది. ఈ నిధులను ఒక శాతం కూడా ఉపయోగించుకోలేకపోవడంతో మరుసటి ఏడాది రూ.270 కోట్లకు కుదించింది. అప్పటికీ మార్జిన్ మనీ స్కీమ్కు సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేయకపోవడంతో రూ.270 కోట్ల నిధులు దాదాపు 90 శాతం నిధులు మిగిలిపోయినట్లు చైతన్య ఆక్వా ఇండస్ట్రీస్ అధినేత ఎం. చైతన్య ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ఏడాది ఆ నిధులను రూ.170 కోట్లకు కుదించారు. ఇప్పటికీ మార్జిన్మనీకి సంబంధించిన జీఓని ఇచ్చి మార్గదర్శకాలు ఇవ్వకపోవడంతో ప్రభుత్వం కేటాయించిన రాయితీలను సద్వినియోగం చేసుకునే అవకాశం కనిపించడంలేదు. వాస్తవంగా 2015–20 పారిశ్రామిక విధానం మంచిదైనప్పటికీ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునే ఎస్సీ, ఎస్టీలకు రాయితీలను అందిపుచ్చులేకపోతున్నారు. బ్యాంకుల సహకారం లేకపోవడం, సొంతపెట్టుబడి పెట్టే స్థోమత లేకపోవడం వంటి కారణాలతో ఎన్ని రాయితీలు కాగితాలకే పరిమితమవుతున్నాయి. ఇప్పటి వరకు జిల్లాలో కొద్దోగొప్పో ఆర్థిక స్థోమత, పలుకుబడి ఉన్న ఎస్సీ,ఎస్టీ నిరుద్యోగులు కేవలం రూ.6.29 కోట్ల రాయితీలను మాత్రమే ఉపయోగించుకున్నారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. అదే 108 జీఓకి సంబంధించిన మార్గదర్శకాలు విడుదల చేసి ఉంటే కొత్తగా పరిశ్రమలు పెట్టుకునే ఔత్సాహికులు మరో రూ.50 కోట్ల వరకు రాయితీలను జిల్లాలో పొంది ఉండేవారు. ప్రస్తుతం 108 జీఓ ప్రిన్సిపాల్ సెక్రటరీ వద్ద ఉందని డిక్కీ జిల్లా కో–ఆర్డినేటర్ వి. భక్తవత్సలం తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఎలాంటి షరతులు లేకుండా మార్గదర్శకాలు విడుదల చేసి, ఈఏడాది కేటాయించిన రాయితీలైనా సద్వినియోగం చేసుకునేవిధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. వయసుతో నిమిత్తం లేకుండా పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి అరకొరే..
సాక్షి, న్యూఢిల్లీ : ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టిన 2018-19 బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి చేసిన కేటాయింపులు అరకొరగానే ఉన్నాయి. 2017-18తో పోల్చితే ఈ రంగానికి కేటాయింపులు నామమాత్రంగానే పెరిగాయి. గత బడ్జెట్లో ఎస్సీ సంక్షేమానికి రూ. 52,393 కోట్లు, ఎస్టీ సంక్షేమానికి రూ. 31,920 కోట్లు కేటాయించగా తాజా బడ్జెట్లో ఈ రంగాలకు రూ. 56,619, రూ. 39,135 కోట్లు కేటాయించారు. ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి నిధుల కేటాయింపు స్వల్పంగా పెరగడం గమనార్హం. గ్రామీణ, వ్యవసాయ రంగానికి ప్రాధాన్యత కల్పిస్తున్నామని చెబుతూనే కీలక ఎస్సీ, ఎస్టీ సంక్షేమానికి సంక్షేమానికి మొక్కుబడి కేటాయింపులు జరిపారు. -
తీరని వ్యథలు.. కన్నీటి కథలు
అనంతపురం సిటీ: జిల్లాలో దళిత, గిరిజనుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఎదుట వందల మంది బాధితులు కన్నీటి పర్యంతమయ్యారు. జిల్లా ఉన్నతాధికారి మొదలు ఆయా శాఖల అధికారుల దృష్టికి సమస్యలను తీసుకువెళ్లినా పరిష్కారానికి నోచుకోవడం లేదని వాపోయారు. బుధవారం స్థానిక జిల్లా పరిషత్ ఆవరణలోని సమావేశ భవనంలో నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ కమిషన్ ప్రత్యేక గ్రీవెన్స్కు వేలాది మంది దళితులు, గిరిజనులతో పాటు ఆయా కుల సంఘాల నేతలు హాజరయ్యారు. ఎస్సీ, ఎస్టీ కమిషన్ రాష్ట్ర అధ్యక్షుడు కారెం శివాజీతో పాటు జిల్లా కలెక్టర్ వీరపాండియన్, పరిషత్ చైర్మన్ పూల నాగరాజు, కమిషన్ సభ్యులు రవీంద్ర, సుబ్బరావులు ప్రజలనుంచి వినతులు స్వీకరించారు. మాదిగలకే అధిక ప్రాధాన్యత ప్రతి ప్రభుత్వ పథకంలోనూ మాదిగలకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారని ఆంధ్రప్రదేశ్ మాల మహానాడు నేతలు ఓబులేసు, మరిదయ్యలు కమిషన్కు తెలిపారు. ఎస్సీ కార్పొరేషన్ ఇచ్చే రుణాలు కూడా 82 యూనిట్లకుగాను 73 మాదిగలకే ఇచ్చారన్నారు. 2017లో ఎన్ఎస్కెఎఫ్డీసీ పథకం కింద 6 కార్లు వస్తే...అన్నీ మాదిగలకే ఇచ్చారన్నారు. ఇలా ప్రతి పథకంలో మాదిగలకే ప్రా«ధాన్యతనివ్వడం బాధాకరమని తెలిపారు. తక్షణం అధికారులతో చర్చించి మాలల హక్కులను కూడా కాపాడాలని కోరారు. శాశ్వత ఉద్యోగులుగా గుర్తించాలి ఆరోగ్యశాఖలో పనిచేసే కాంట్రాక్టు, పార్టుటైం కింద చేస్తున్న 353 మందిని శాశ్వత ఉద్యోగులుగా గుర్తించేలా చర్యలు తీసుకోవాలని ప్రగత శీల పారిశుద్ధ్య కార్మికుల సంఘం నేతలు కల్లూరి చంగయ్య కమిషన్ను కోరారు. అనారోగ్యమే శాపమైంది 2007లో ఆర్టీసీలో కండెక్టర్గా చేరిన తాను పక్షవాతముతో మంచాన పడ్డాననీ, ఆరోగ్యం కుదుట పడ్డా పూర్తి స్థాయిలో పనిచేసేందుకు అవయవాలు సహకరించడం లేదని గుత్తికి చెందిన ఆర్టీసీ కండక్టర్ వెంకటేశ్ కమిషన్ ఎదుట వాపోయారు. అతికష్టమ్మీద ఎడమ చేతితో రాయడం నేర్చుకున్నాననీ, అయినా 13 నెలలుగా తనకు డ్యూటీ వేయకుండా అధికారులు ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తన కుటుంబ పరిస్థితి అర్థం చేసుకుని రెగ్యులర్గా డ్యూటీ వేయించాలని కోరారు. స్పందించిన కమిషన్ సభ్యులు తప్పకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీసీలుగా చిత్రీకరించారు ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న నేపథ్యంలో తనకున్న ఇంటిని బీడీల ఫ్యాక్టరీ యజమానికి తాకట్టు పెడితే... అతను మరొకరికి విక్రయించాడని తాడిపత్రికి చెందిన కాంతమ్మ వాపోయింది. పోలీసులకు ఫిర్యాదు చేస్తే తమపైనే దాడి చేశారని కన్నీటిపర్యంతమైంది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెడితే స్థానిక ఎమ్మార్వోకు డబ్బు ఆశ చూపి మేము ఎస్సీలము కాదని, బీసీలమని సర్టిఫికెట్లు పుట్టించారని కమిషన్ సభ్యులకు విన్నవించింది. స్పందించిన కమిషన్ సభ్యులు తహశీల్దార్తో మాట్లాడుతామని హామీ ఇచ్చారు. ∙ఇక ఆర్టీసీలో 20 మంది నకిలీ ఎస్సీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు చేస్తున్నారని ఎస్సీ, ఎస్టీ విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సభ్యులు ఎం.ఓబులేసు కమిషన్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ విషయంపై ఫిర్యాదు చేసినా ఆర్టీసీ అధికారుల్లో చలనం లేదన్నారు. స్పందించిన కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటామన్నారు. ∙పోలీసు శాఖలో 2003 హెచ్సీ, ఏఎస్ఐల పదోన్నతుల్లో ఎస్సీ, ఎస్టీలకు తీరని అన్యాయం చేశారని పోలీసు అధికారుల సంఘం మాజీ అధ్యక్షుడు శివానంద కమిషన్ సభ్యుల దృష్టికి తీసుకువచ్చారు. పరిశీలించిన కమిషన్ సభ్యులు చర్యలు తీసుకుంటామన్నారు. -
ప్రైమరీ స్థాయిలో మినీ గురుకులాలు!
సాక్షి, హైదరాబాద్: గురుకుల పాఠశాలల్లో ప్రాథమిక స్థాయి తరగతులను ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుతం గురుకుల పాఠశాలలు ఐదో తరగతి స్థాయి నుంచి మొదలవుతున్నాయి. నాలుగో తరగతి వరకు ప్రభుత్వ లేదా ప్రైవేటు పాఠశాలల్లో చదివిన విద్యార్థులు, గురుకుల ప్రవేశ పరీక్షలు రాసి ఐదో తరగతి నుంచి ఆంగ్లమాధ్యమంలో అడ్మిషన్లు పొందుతున్నారు. నాణ్యతా ప్రమాణాలు పాటించిన స్కూళ్ల నుంచి వచ్చినవారు, పట్టణ ప్రాంతాల విద్యార్థులు ముందుకు వెళ్తుండగా... గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన విద్యార్థులు మాత్రం మిగిలిన వారితో పోటీ పడలేకపోతున్నారు. ఇది టీచర్లకు కొన్ని ఇబ్బందులు తెస్తోంది. దీంతో ప్రాథమిక స్థాయి నుంచే గురుకుల విద్యను ప్రవేశపెడితే విద్యార్థులు సమాన స్థాయిలో అభివృద్ధి చెందుతారని ప్రభుత్వం భావిస్తోంది. దీనిలో భాగంగానే మినీ గురుకులాల పేరిట కొత్త విద్యా సంస్థల్ని ప్రారంభించాలని యోచిస్తోంది. వీటిని ప్రస్తుత గురుకులాలకు అనుసంధానంగా నిర్వహించాలనే అంశంపై అధికారులు సమాలోచనలు చేస్తున్నారు. 29 మినీ గురుకులాలు ప్రస్తుతం గిరిజన అభివృద్ధి శాఖ పరిధిలో మినీ గురుకులాలను నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రాథమిక స్థాయి నుంచే ఆంగ్ల మాధ్యమంలో బోధన చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 29 మినీ గురుకులాల్లో 5వేల మంది పిల్లలున్నారు. మినీ గురుకులాల్లో చదివి, అనంతరం సాధారణ గురుకులాల్లో ప్రవేశాలు పొందిన విద్యార్థులు, ఇతరుల కంటే మెరుగ్గా ఉన్నట్లు గిరిజన అభివృద్ధి శాఖ పరిశీలనలో తేలింది. ఈ క్రమంలో వాటి సంఖ్యను పెంచాలని గిరిజన అభివృద్ధి శాఖ యోచిస్తోంది. అన్ని సంక్షేమ శాఖల పరిధిలో వీటిని ఏర్పాటు చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఎస్సీ అభివృద్ధి శాఖ సైతం ఈ తరహా పాఠశాలల ఏర్పాటుపై ఇటీవల పంపిన ప్రతిపాదనలపై ప్రభుత్వం సానుకూలంగా ఉంది. కొత్తగా రూపొందించే బడ్జెట్లో మినీ గురుకులాల అంశాన్ని ప్రతిపాదించేందుకు ఆయా సంక్షేమ శాఖ చర్యలు చేపట్టాయి. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే వచ్చే ఏడాది నుంచే మినీ గురుకులాలు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. -
లక్ష్యసాధనపై దృష్టిపెట్టండి
సాక్షి, హైదరాబాద్: ‘కొత్తగా ఏదైనా పని ప్రారంభిస్తే దానికి ప్రతికూల అంశాలే ఎక్కువగా ఎదురవుతాయి. ప్రోత్సహించే వాళ్లకంటే విమర్శించే వాళ్లే చాలా మంది ఉంటారు. అలాంటి వాటిని పట్టించుకోకుండా లక్ష్యంపైనే దృష్టి పెట్టండి. శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది’అని రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జి.జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జాతీయ ఎస్సీ, ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో హైదరాబాద్లో జరిగిన సదస్సుకు ఆయన గిరిజన అభివృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్తో కలసి హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు భారీ రాయితీలిచ్చి ప్రోత్సహిస్తోందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితులు, గిరిజనులను ప్రోత్సహించేందుకు రూ.కోటి నుంచి రూ.5 కోట్ల వరకు రాయితీలిస్తున్నాయని వివరించారు. బ్యాంకులతోనే ఇబ్బందులు... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న పలు కార్యక్రమాలు బ్యాంకులతో ముడిపడి ఉండటంతో లక్ష్యసాధన ఇబ్బందిగా మారుతోందని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. స్వయం ఉపాధి యూనిట్లపై ప్రభుత్వం భారీగా రాయితీలిస్తోందని, కానీ అవన్నీ బ్యాంకులతో ముడిపడి ఉండటంతో ఔత్సాహికులు బ్యాంకుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారన్నారు. బ్యాంకుల నిబంధనల్లో మార్పులు రావాలని, ఆమేరకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందని చెప్పారు. మంత్రి అజ్మీరా చందూలాల్ మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న రాయితీలను అందుకోవాలని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు పిలుపునిచ్చారు. తయారీ రంగాన్ని ప్రోత్సహించేందుకు ప్రభుత్వమే మార్కెటింగ్ సౌకర్యాన్ని కల్పిస్తోందని తెలిపారు. తెలుగు రాష్ట్రాలు స్పందించడంలేదు కేంద్ర ప్రభుత్వం ఎంఎస్ఎంఈ (మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రెన్యూర్) ద్వారా ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు గతంలో ఎన్నడూ లేనంతగా భారీ మొత్తంలో రాయితీలిస్తోందని ఎంఎస్ఎంఈ సంచాలకుడు పీజీఎస్ రావు పేర్కొన్నారు. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా ఖర్చు చేస్తోందని, కానీ వీటిని వినియోగించుకోవడంలో పలు రాష్ట్రాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలకు సమాచారం ఇచ్చినప్పటికీ స్పందించడంలేదని అన్నారు. -
బాండ్ రాసిస్తేనే బడిలోకి..
ఖమ్మం మయూరి సెంటర్: సంక్రాంతి సెలవులకు ఇళ్లకు వెళ్లిన ఎస్సీ గురుకుల పాఠశాల విద్యార్థులు ఒకరోజు ఆలస్యంగా వచ్చారని ఖమ్మం జిల్లాలో బాండ్ పేపర్లపై సంతకాలు చేయించిన ఘటన గురువారం చోటు చేసుకుంది. ఈ నెల 16 వరకు ఎస్సీ గురుకులాలకు సంక్రాంతి సెలవులు ఇవ్వగా, ఒకరోజు ఆలస్యంగా 18న (గురువారం) విద్యార్థులు తిరిగి వచ్చారు. మరోసారి ఇలా ఆలస్యం జరగనీయమని రూ. 20 స్టాంప్ పేపర్పై వివరణ రాసి, తల్లిదండ్రుల చేత సంతకాలు చేసి సమర్పించాలని హుకుం జారీ చేశారు. ఖమ్మం ఆర్సీవో పుల్లయ్య నుంచి అనుమతి తీసుకురావాలని వెనక్కి పంపించడంతో ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లోని ఎస్సీ గురుకులాల విద్యార్థులు ఇబ్బంది పడ్డారు. ఆర్సీవో కూడా అందుబాటులో లేకపోవడంతో.. ఆందోళన చేశారు. పీడీఎస్యూ నాయకులు మద్దతుగా నిలిచారు. దీంతో అధికారులు స్పందించి.. ఎలాంటి బాండ్లు లేకుండానే రెసిడెన్షియల్లోకి అనుమతించాలని ఆదేశించారు. -
ఉత్తీర్ణత పదిలమేనా..!
ఒంగోలు సెంట్రల్: జిల్లాలోని ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు విద్య సరిగా అందడం లేదు. మరో 70 రోజుల్లో పరీక్షలు ప్రారంభమవుతున్నా అధికారుల్లో చలనం లేదు. వసతి గృహ విద్యార్థుల విద్యలో మార్పు లేదు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకూ తిరిగి సాయంత్రం 6 నుంచి రాత్రి 9 గంటల వరకూ పదో తరగతి విద్యార్థులకు తప్పనిసరిగా స్టడీ అవర్స్ నిర్వహించాల్సి ఉన్నా వార్డెన్లు చదివించడం లేదు. వార్డెన్లు రెండు పూటలా వసతి గృహాలకు రావడం లేదు. కొంత మంది ఇతర దూర ప్రాంతాల్లో నివాసం ఉంటూ రైళ్లు, బస్సుల టైం టేబుల్ ప్రకారం వస్తున్నారు. వార్డన్లే వసతి గృహాలకు సరిగ్గా రాకపోతుండటంతో ట్యూటర్లు కూడా చుట్టపు చూపుగా వస్తున్నారు. పరీక్షలకు ఈ చివరి రోజుల్లో విద్యార్థులు చదువుతున్నారా, లేదా వార్డెన్లు పర్యవేక్షిస్తున్నారా అనే విషయం తెలుసుకోవడానికి టెలీ కాన్ఫరెన్సులు అధికారులు నిర్వహించడం లేదు. దీంతో వార్డెన్ల పని ఇష్టారాజ్యమైంది. గత ఏడాది అప్పటి కలెక్టర్ హాస్టళ్లలో విద్యార్థులు ఉత్తీర్ణత కాకపోతే వసతి గృహæ సంక్షేమ అధికారులను బాధ్యులను చేస్తామనడంతో కొంత వరకూ ఆశించిన ఫలితాలు వచ్చాయి. అయితే ఈ ఏడాది ఆ పరిస్థితులు కనపడటం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో ట్యూటర్లకు రూ.1500 గౌరవ వేతనంగా అందిస్తున్నారు. ట్యూటర్లు లెక్కలు, ఇంగ్లిషు, హిందీ, సైన్స్ సబ్జెక్ట్లను విద్యార్థులకు బోధిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఎస్సీ సంక్షేమ శాఖలో పదో తరగతి విద్యనభ్యసిస్తున్న విద్యార్థులు 71 వసతి గృహాల్లో ఉన్నారు. వీటి పరిధిలో 1100 మంది చదువుతున్నారు. వీరిలో 870 మంది బాలురు, 230 మంది బాలికలు. ఈ శాఖలో ట్యూటర్లకు ఏడాదికి రూ.41 లక్షలు వెచ్చిస్తున్నారు. 140 మంది ట్యూటర్లు విద్యార్థులకు ట్యూషన్లు చెబుతున్నారు. అదే ఎస్టీ సంక్షేమ శాఖలో 14 వసతి గృహాల్లో 162 మంది పదో తరగతి చదువుతున్నారు. ట్యూటర్లకు నెలకు రూ.1500 గౌరవ వేతనం కింద అందిస్తున్నారు. ఈ శాఖలో మొత్తం 43 మంది ట్యూటర్లు ఉన్నట్లు అధికా రులు అంటున్నారు. అదే వెనుకబడిన తరగతుల శాఖలో 76 వసతి గృహాల్లో 1100 మంది పదో తరగతి చదువుతున్నారు. వీరిలో 920 మంది బాలురు, 180 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్నారు. 150 మంది ట్యూటర్లను నియమించారు. ఇప్పటికీ అందని ఆల్ఇన్వన్ గైడ్లు, స్టడీ మెటీరియల్స్: ప్రభుత్వ వసతి గృహంలోని విద్యార్థులు పదో తరగతిలో మంచి మార్కులు సాధించేందుకు గతంలో అధికారులు ఆల్ఇన్వన్ గైడ్లు, స్టడీ మెటీరియల్స్ అందించేవారు. అయితే ప్రస్తుతం ఆ దిశగా ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థులు తమకు పాఠశాలలో చెప్పిన పాఠాలనే చదువుకుంటూ, సందేహాలు నివృత్తి చేసుకోలేకపోతున్నారు. గిరిజన సంక్షేమ శాఖలో ఆల్ఇన్వన్లు, గైడ్ల సరఫరా టెండర్లు, కొటేషన్ల దశలోనే ఉంది. ఎస్సీ హాస్టళ్లకు కూడా ఇంకా ఇవ్వలేదు. బీసీ హాస్టళ్లలో కొందరికి మాత్రమే పంపిణీ చేశారు. మిగిలిన వారికి ప్రింటింగ్ అయిన తరువాత పంపిణీ చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఏడాదిగా ట్యూటర్లకు ఏ సంక్షేమ శాఖలోనూ గౌరవ వేతనాలు విడుదల కాలేదు. దీంతో వారు కూడా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం లేదు. త్వరలో సమావేశం నిర్వహిస్తాం జిల్లాలోని వసతిగృహ అధికారులతో పదో తరగతి విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక సమావేశాన్ని త్వరలో నిర్వహిస్తాం. విద్యార్థులకు ఆల్ఇన్వన్ గైడ్లు, ప్రతి రోజు విద్యా ప్రణాళిక స్టడీ మెటీరియల్, విద్యార్థులకు ఓరియంటేషన్ తరగతులు, చదువులో పూర్తిగా వెనుకబడిన విద్యార్థులకు సంబంధించి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తాం. – మువ్వా లక్ష్మీ సుధ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డెప్యూటీ డైరక్టర్ -
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఏర్పాటు
హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రానికి కొత్తగా ఎస్సీ, ఎస్టీ కమిషన్ను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దీనికి సంబంధించిన ఫైలుపై మంగళవారం ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. చైర్మన్ గా సిద్దిపేట జిల్లా చిన్న కోడూరు మండలం గణపూర్ కు చెందిన ఎర్రోళ్ల శ్రీనివాస్ నియామకయ్యారు. సభ్యులుగా బోయిళ్ల విద్యాసాగర్ (సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం ఎడవల్లి), ఎం.రాంబాల్ నాయక్ ( రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం పోడగుట్ట తండా), కుర్సం నీలాదేవి (ఆదిలాబాద్ జిల్లా సిరికొండ మండలం రాయగూడ), సుంకపాక దేవయ్య ( హైదరాబాద్లోని రాంనగర్), చిలకమర్రి నర్సింహ (రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల) నియామకమయ్యారు. -
రిజర్వేషన్లకు అవి ముప్పే..
సాక్షి,న్యూఢిల్లీ: ప్రయివేటీకరణ, అవుట్సోర్సింగ్లను నిరసిస్తూ రాజధానిలోని రాంలీలా మైదానంలో అఖిల భారత ఎస్సీ, ఎస్టీ సంఘాల సమాఖ్య భారీ ఆందోళన చేపట్టింది. ప్రయివేటీకరణ, ఉద్యోగాల అవుట్సోర్సింగ్ రిజర్వేషన్ల విధానానికి ముప్పుగా పరిణమించాయని నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. దేశానికి స్వాతంత్ర్యం సమకూరి దశాబ్ధాలు గడిచినా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ వర్గాల జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని ఎంపీ ఉదిత్ రాజ్ అన్నారు. యూపీ, బీహార్, హర్యానా, గుజరాత్, తమిళనాడు, ఢిల్లీ తదితర రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో ఎస్సీ, ఎస్టీ, బీసీ సంఘాలకు చెందిన కార్యకర్తలు తరలివచ్చారు. -
అంబేడ్కర్ భవన్ల తుది డిజైన్లు
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ యువత ఉపాధికి బాటలు వేసేలా రాష్ట్ర ప్రభుత్వం అంబేడ్కర్ భవనాలను నిర్మిస్తోంది. ఇందులో స్టడీ సర్కిల్ తో పాటు కెరీర్గైడెన్స్ కార్యక్రమా లను చేపట్టనుంది. అంబేడ్కర్ భవనాల నిర్మాణానికి సంబంధిం చి సోమవారం తుది డిజైన్లు ఖరారయ్యాయి. ఒక్కో భవనాన్ని రూ.2 కోట్ల వ్యయంతో నిర్మించాలని నిర్ణయించారు. ఇందులో స్టడీ సర్కిల్తో పాటు కేరీర్ గైడెన్స్ సెంటర్, వెయ్యి మంది పట్టే సామర్థ్య మున్న ఆడిటోరియం ఉంటుంది. తొలి విడతగా ఆరు జిల్లాల్లో ఈ భవనాలు నిర్మించనున్నారు. డివిజన్, మండల కేంద్రాల్లోనూ.. జిల్లా కేంద్రాల్లో ఏర్పాటు చేసే అంబేడ్కర్ భవన్లతో పాటు రెవెన్యూ డివిజన్, మండల కేంద్రాల్లోనూ వీటిని ఏర్పాటు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో రూ.50 లక్షలు, మండల స్థాయిలో రూ.25 లక్షలు ఖర్చు చేయనుంది. వీటి నిర్మా ణానికి స్థలాలను గుర్తించాలని ఎస్సీ అభివృద్ధి శాఖను ఆదేశిం చింది. డివిజన్, మండల స్థాయి కార్యక్రమాలకు వేదికగా వినియోగించుకునేలా నిర్మాణా లు చేపట్టాలని సూచించింది. గ్రామ స్థాయి అంబేడ్కర్ భవనాలకు రూ.7లక్షలు ఖర్చు చేయాలని ఆ శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేసింది. ఈ క్రమంలోనే మంత్రి జగదీశ్రెడ్డి సోమవారం సచివాలయంలో ఇంజనీరింగ్ అధికారులతో సమావేశమయ్యారు. జిల్లా కేంద్రాల్లో నిర్మిం చే భవనాలకు ఏకకాలంలో త్వరగా టెండర్లు పిలవాలని.. నిర్మాణాలు ఒకేసారి పూర్తి చేయాలని ఆదేశించారు. -
విద్యార్థులకు దుప్పట్ల ‘వసతి’
సాక్షి, హైదరాబాద్/కరీంనగర్: దుప్పట్లు లేక సాంఘిక సంక్షేమ వసతి గృహ విద్యార్థులు పడుతున్న అవస్థలపై అధికార యంత్రాంగం ఎట్టకేలకు స్పందించింది. చలికాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా హాస్టళ్లల్లోని విద్యార్థులకు ఇవ్వాల్సిన దుప్పట్లు, బెడ్షీట్లు, కాస్మోటిక్ చార్జీలు అందని వైనాన్ని ‘సాక్షి’వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. ‘వణుకుతున్న వసతి’శీర్షికతో ఈనెల 17న సాక్షి ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనంతో అధికారుల్లో కదలిక వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రత్యేక చొరవ తీసుకుని హాస్టల్ విద్యార్థులకు ముందస్తుగా రగ్గులు, కార్పెట్ల (జంపఖానా)లను పంపిణీ చేసేందుకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపక్రమించింది. దుప్పట్ల పంపిణీకి చర్యల్ని మరింత వేగిరం చేసింది. శనివారం రాష్ట్రవ్యాప్తంగా పంపిణీ చేయనుంది. రాష్ట్రవ్యాప్తంగా 686 సంక్షేమ వసతి గృహాలుండగా.. వీటిలో 58 వేల మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. చలికాలాన్ని తట్టుకునే విధంగా నాణ్యమైన రగ్గులు, కార్పెట్లు అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఎస్సీ అభివృద్ధి శాఖ.. టెస్కోతో ఒప్పందం కుదుర్చుకుంది. వసతి గృహాల్లోని విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.750 విలువైన రగ్గు, కార్పెట్ను పంపిణీ చేసేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో విద్యార్థులకు అవసరమైన స్టాకును రెండు రోజుల క్రితం టెస్కో ప్రతినిధులు ఎస్సీ అభివృద్ధి శాఖకు అందజేశారు. ఈ నేపథ్యంలో విద్యార్థులకు పంపిణీ నిమిత్తం అధికారులు జిల్లాలకు తరలించారు. స్టాక్ను వెంటనే విద్యార్థులకు పంపిణీ చేయాల్సిందిగా సంక్షేమాధికారులను ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు పి.కరుణాకర్ ఆదేశించారు. శుక్రవారం నాటికి జిల్లా కేంద్రాలకు దుప్పట్లు చేరుకోగా.. కరీంనగర్ జిల్లాలోని హుజూరాబాద్, జమ్మికుంట పరిధిలో శుక్రవారం రాత్రే పంపిణీ చేశారు. -
నయా పైసా దారి మళ్లలేదు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ సబ్ప్లాన్ బిల్లు తెచ్చాక నయా పైసా నిధులు పక్కదారి పట్టలేదని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు శుక్రవారం అసెంబ్లీలో స్పష్టం చేశారు. గత మూడున్నరేళ్లలో రూ. 26 వేల కోట్లు దారిమళ్లాయంటూ శాసనసభ ప్రశ్నోత్తరాల్లో షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి వ్యయంపై పలువురు కాం గ్రెస్ సభ్యులు చేసిన ఆరోపణలపై ఆయన తీవ్ర అభ్యంతరం తెలిపారు. లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని హెచ్చరించారు. రాష్ట్రంలోని దళిత, గిరిజనుల అభివృధ్ధికి ప్రభుత్వం వంద శాతం కట్టుబడి ఉందని, దేశంలో ఎక్కడా లేనివిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీల అభివృధ్ధికి ప్రభుత్వం పాటుపడుతోందని ఈ అంశంపై ఆయన వివరణ ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ప్రతి పైసాను నిజాయతీగా ఖర్చు చేస్తున్నామని, వారి అభివృద్ధికి జిల్లా, మండల, గ్రా మ స్థాయిల్లో ఖర్చు చేసిన వ్యయ రికార్డులను పెన్డ్రైవ్లో సభ్యులకు అందజేశామని, అందు లో ప్రతిపైసా ఖర్చును చూసుకోవచ్చన్నారు. కాంగ్రెస్ హయాంలోనే నిధుల పక్కదారి... షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి వ్యయంపై కాంగ్రెస్ సభ్యులు టి.జీవన్రెడ్డి, గీతారెడ్డి, సంపత్కుమార్లు అడిగిన ప్రశ్నలపై సీఎం కేసీఆర్ స్పందిస్తూ రాష్ట్ర బడ్జెట్లో ప్రగతి పద్దు కింద మొత్తం కేటాయింపులు రూ. 88,071 కోట్లుకాగా ఇప్పటివరకు రూ. 33,462 కోట్లు (అంటే 37.99 శాతం) ఖర్చు చేశామన్నారు. అలాగే ఎస్సీల ప్రత్యేక నిధి కింద రూ. 14,375.13 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ. 5,475.02 కోట్లు (38.09 శాతం) ఖర్చు చేశామన్నారు. ఎస్టీ ప్రత్యేక నిధి కింద రూ. 8,165.87 కోట్లు కేటాయించగా ఇప్పటివరకు రూ. 3,359.37 కోట్లు (41.13 శాతం) ఖర్చుపెట్టామన్నారు. ప్రగతి పద్దు కింద ఖర్చు చేసిన మొత్తాలకన్నా ఎస్సీల అభివృద్ధికి అధికంగానే ఖర్చు చేశామన్నారు. కాంగ్రెస్ హయాంలో ఎస్సీ నిధులు పక్కదారి పట్టిన మాట వాస్తవమని, తమ ప్రభుత్వంలో అలా జరిగిందనడం అవాస్తవమని సీఎం స్పష్టం చేశారు. ఎస్సీల అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 2,651 కోట్లు ఖర్చు చేస్తే తమ ప్రభుత్వం మూడేళ్ల కాలంలో రూ. 6,711 కోట్లు ఖర్చు చేసిందన్నారు. ఎస్సీ విద్యార్థులకు ఓవర్సీస్ పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ. 20 లక్షలు ఇస్తున్నామని, టీఎస్ ప్రైడ్ కింద దళిత పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నామని, వంద శాతం సబ్సిడీతో ఎస్సీలకు రుణాలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఏ విషయంలోనైనా పారదర్శకంగా ఉండాలనుకుంటోంది తప్ప పారిపోవాలనుకోవట్లేదని వ్యాఖ్యానించారు. గడువులోగా పంచాయతీ ఎన్నికలు పెట్టాలంటే పంచాయతీరాజ్ చట్టాన్ని ఆమోదించుకోవాల్సి ఉందని, ఈ దృష్ట్యా సమావేశాలను ప్రొరోగ్ చేయకుండా గ్లోబల్ సమ్మిట్ ముగిశాక ఎస్సీ, ఎస్టీల అభివృద్ధిపై రెండు రోజులు, బీసీల నిధుల ఖర్చుపై ఒక రోజు కచ్చితంగా చర్చ చేపడదామని సీఎం ప్రతిపాదించారు. అప్పుడు ఎవరి హయాంలో ఎంత ఘనకార్యం జరిగిందో బయటకొస్తుందన్నారు. నిధుల ఖర్చులో అధికారుల అలసత్వం ఉందని తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్సీ నిధులు దారి మళ్లాయి: సంపత్, గీతారెడ్డి అంతకుముందు ఈ అంశంపై కాంగ్రెస్ ఎమ్మె ల్యే సంపత్కుమార్ మాట్లాడుతూ ‘‘ఎస్సీ రుణాలను 71 వేల మందికి ఇచ్చామని ప్రభుత్వం చెబుతున్నా ఇంకా 31,600 మందికి ఇవ్వనే లేదు. రాష్ట్రంలో ఇప్పటివరకు 9,966 ఎకరాల భూ పంపిణీ మాత్రమే జరిగింది. 3.30 లక్షల మందికి మిగతా భూ పంపిణీ ఎప్పుడు చేస్తారు? సబ్ప్లాన్ నిధులూ పక్కదారి పడుతున్నాయి. ఈ ప్రభుత్వంలో నేరెళ్ల, మానుకొండూరు వంటి సంఘటనలు జరిగాయి’’అని వ్యాఖ్యానించారు. ఈ సమయంలో సంపత్ మైక్ను స్పీకర్ మధుసూదనాచారి కట్ చేయడంతో తీవ్ర గందరగోళం నెలకొంది. అనంతరం సంపత్ వ్యాఖ్యలను సీఎం తప్పుబడుతూ ఎస్సీ నిధులు పక్కదారి పట్టలేదన్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ సభ్యురాలు గీతారెడ్డి మాట్లాడుతూ ‘‘ఎస్సీలకు నిధుల విడుదలలో అధికారులు జాప్యం చేస్తున్నారు. మా నిధులు మాకు ఖర్చుపెట్టడం లేదు. గత మూడున్నరేళ్లలో రూ. 26 వేల కోట్ల నిధులు దారి మళ్లాయి’’అని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపైనా అభ్యంతరం తెలిపిన సీఎం కేసీఆర్...లెక్కాపత్రం లేకుండా నిధులు మళ్లించారని విమర్శిస్తే సహించేది లేదని తేల్చిచెప్పారు. ఈ సమయంలో ఇరు పక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చివరగా టి.జీవన్రెడ్డి మాట్లాడుతూ ఎస్సీలకు ఎక్కడా లేని అన్యాయం జరుగుతోందని, వారి నిధులు దారిమళ్లాయని ఆరోపించగా సీఎం మరోమారు జోక్యం చేసుకున్నారు. ‘‘45 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించాక చివరి ఏడాదిలో ఎస్సీ బిల్లు తెచ్చారు. దానికి ఎలాంటి రూల్స్ నిర్ణయించలేదు. ఒక్క రూపాయి ఇవ్వలేదు. బిల్లు వచ్చాక ఎన్నికలకు వెళితే ఏం జరిగిందో అందరికీ తెలుసు. దీనిపై రెండ్రోజులు చర్చిస్తే అందరి ఘనకార్యాలు బయటకొస్తాయి’’అని వ్యాఖ్యానించారు. దీనిపై జీవన్రెడ్డి అభ్యం తరం తెలుపుతూ ‘‘మీరు మాట్లాడి మాకు అవకాశం ఇవ్వరా?’’అంటూ ప్రశ్నించారు. దీనిపై సీఎం స్పందిస్తూ అందరికీ అవకాశం ఇస్తామన్నారు. తనకు మైక్ ఇవ్వాలని కోరినా స్పీకర్ ఇవ్వకపోవడంతో జీవన్రెడ్డి ఆగ్రహించిన జీవన్రెడ్డి సభ నుంచి బయటకు వెళ్లిపోయారు. మీ పంచాయితీ నేనే తేల్చాలా? కాంగ్రెస్ సభ్యులకు సీఎం చురకలు ఇదే అంశంపై చర్చ సందర్భంగా కాంగ్రెస్ సభ్యుల మధ్య సమన్వయం కొరవడటం స్పష్టంగా కనిపించింది. సభలో సంపత్ మాట్లాడాక స్పీకర్ మధుసూదనాచారి గీతారెడ్డికి అవకాశం ఇవ్వగా సంపత్ మాత్రం తనకే అవకాశం ఇవ్వాలని పట్టుబట్టారు. దీంతో శాసనసభ వ్యవహారాల మంత్రి హరీశ్రావు జోక్యం చేసుకొని ‘‘మీ పార్టీ సీనియర్ సభ్యురాలు మాట్లాడుతుంటే గౌరవం లేదా?’’అని ప్రశ్నించారు. దీంతో కల్పించుకున్న గీతారెడ్డి తన సమయాన్ని సంపత్కే ఇవ్వాలని కోరగా స్పీకర్ అంగీకరించలేదు. మరోసారి గీతారెడ్డి మాట్లాడటం మొదలు పెట్టగానే సంపత్ మళ్లీ అడ్డుపడటంతో స్పీకర్ ఆమె మైక్ కట్ చేసి జీవన్రెడ్డికి అవకాశం ఇచ్చారు. అయినా సంపత్ పదేపదే తనకు అవకాశం ఇవ్వాలని కోరుతుండటంతో ముఖ్యమంత్రి లేచి ‘‘మీ పంచాయితీని మేమే తేల్చాలా. ఎవరో ఒకరు తేల్చుకొని మట్లాడండి’’అని చురకలంటించారు. అనంతరం సంపత్కు స్పీకర్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. -
ఎస్సీ వసతి గృహాలకు కొత్త మెనూ!
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ గురుకులాలు, హాస్టళ్లలో పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు వారంలో ఆరు రోజులపాటు కోడి గుడ్లు, ఒక రోజు చికెన్, సన్న బియ్యంతో వండిన భోజనం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ఇంటర్మీడియట్, ఆపై చదివే విద్యార్థులకు ప్రతిరోజు గుడ్డుతోపాటు వారంలో రెండు సార్లు చికెన్తో భోజనం అందించనుంది. ఈ మేరకు మంగళవారం అసెంబ్లీ ఆవరణలో కొత్త మెనూను ఎస్సీ సంక్షేమ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి విడుదల చేశారు. ఎస్సీ వసతి గృహాల్లోని అందరికీ వర్తింపు: జగదీశ్రెడ్డి ఇప్పటివరకు విద్యార్థులకు కోడిగుడ్లు వారానికి మూడు మాత్రమే పెడుతుండగా, ఇకపై వారానికి ఆరు కోడిగుడ్లు, ఒకరోజు కోడికూరతో కూడిన భోజనం అందించేలా ఏర్పాట్లు చేసినట్లు జగదీశ్రెడ్డి తెలిపారు. 3వ తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్థులకు ఆదివారం చికెన్తో భోజనం పెడతామని, ఇంటర్మీడియట్, ఆపై తరగుతులు చదివే విద్యార్థులకు ప్రతి బుధవారం, ఆదివారాల్లో కోడికూరతో భోజనం అందించనున్నట్లు వెల్లడించారు. ఎస్సీ వసతి గృహాల్లో చదువుకుంటున్న విద్యార్థులందరికి ఇది వర్తిస్తుందని చెప్పారు. అలాగే పోషక పదార్థాలు కలిగిన కాయగూరలతో భోజనం అందించేలా కొత్త మెనూను రూపొందించినట్లు వివరించారు. దళితుల పట్ల సీఎం కేసీఆర్కు ఉన్న దార్శనికతకు ఈ పథకం అద్దం పడుతోందన్నారు. అలాగే ప్రతిరోజు ఉదయం 6 గంటలకు విద్యార్థులకు టీ, బిస్కెట్ అందిస్తామని, 8 గంటలకు టిఫిన్ పెడతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్మిశ్రా, జీహెచ్ఎంసీ కమిషనర్ జనార్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మార్పీఎస్ కార్యకర్త మృతిపై అసెంబ్లీ విచారం..
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఎమ్మార్పీఎస్... హైదరాబాద్ కలెక్టరేట్ ముట్టడి సందర్భంగా పోలీసులతో జరిగిన తోపులాటలో భారతి అనే కార్యకర్త మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై సీఎం కేసీఆర్ సోమవారం సభలో మాట్లాడుతూ... ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మృతి దురదృష్టకరమన్నారు. ఆమె కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించారు. అర్హులుంటే భారతి కుటుంబసభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇస్తామని, ఒకవేళ పిల్లలుంటే ప్రభుత్వ ఖర్చుతో చదివిస్తామని కేసీఆర్ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. మరోవైపు ఉస్మానియా ఆస్పత్రిలో భారతి భౌతిక కాయంపై ఎమ్మార్పీఎస్ పతాకాన్ని కప్పారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, విద్యా శాఖ మంత్రి కడియం శ్రీహరి, బీజేపీ నేత కిషన్రెడ్డి, కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి తదితరులు ఉస్మానియా ఆస్పత్రిలోని ఆమె భౌతిక కాయాన్ని చూసి బాధితులను ఓదార్చారు. ఈ సందర్భంగా జానారెడ్డి మాట్లాడుతూ.. భారతి మృతి బాధాకరమని, ఆమె కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలన్నారు. -
బతుకు బుగ్గిపాలు
అగ్నిదేవుని ఆగ్రహానికి నిరుపేదల ఇళ్లు బూడిదయ్యాయి. కాయకష్టంతో నిర్మించుకున్న పూరిగుడెసెలు కళ్లముందే మంటల్లో కాలిపోయాయి. తిండిగింజలు, కాస్తో కూస్తో సంపాదన, దుస్తులు అగ్నికి ఆహుతయ్యాయి. బాధితులు కట్టుబట్టలతో రోడ్డున పడ్డారు. రాజాం నగరపంచాయతీ పరిధిలోని మెంటిపేట ఎస్సీకాలనీలో జరిగిన అగ్ని ప్రమాదంలో భారీ నష్టం సంభవించింది. శ్రీకాకుళం ,రాజాం సిటీ/రూరల్: రాజాం నగరపంచాయతీ పరిధిలోని మెంటిపేట ఎస్సీకాలనీలో మంగళవారం అగ్నిప్రమాదం సంభవించింది. సాయంత్రం నాలుగు గంటల సమయంలో మంటలు చెలరేగి ఒక్కసారిగా వ్యాపించడంతో 15 పూరిళ్లు చూస్తుండగా అగ్నికి ఆహుతయ్యాయి. ముందుగా రాగోలు మహేష్ ఇంటి వద్ద మంటలు చెలరేగినట్టు పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ సమయంలో మహేష్ ఇంట్లో ఆయన భార్య విమలతో పాటు పిల్లలు ఉన్నారు. నిద్రకు ఉపక్రమించిన విమల ప్రమాదాన్ని గుర్తించి ఇంట్లో ఉన్న తన పిల్లలతో సహా బయటకు వచ్చేసింది. మంటలు ఇల్లంతా వ్యాపించడంతో ఇంట్లో ఉన్న చిన్న గ్యాస్ సిలిండర్ పేలిపోయి మంటలు పెద్దవయ్యాయి. వీటికి గాలి తోడవడంతో పక్కనున్న మరో 14 ఇళ్లు కాలిబూడిదయ్యాయి. మంటలను అదుపుచేసేందుకు ఎవరూ ప్రయత్నించలేని పరిస్థితి సంఘటనా స్థలం వద్ద చోటుచేసుకుంది. పెద్ద ఎత్తున అగ్నికీలలు ఎగసిపడుతుండడంతో చుట్టుపక్కల ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకొని పరుగులు తీశారు. ఈ ఘటనలో తోలేటి దుర్గారావు, బెనెల ప్రభ, మాణిక్యం రమణ, తోట పోలయ్య, ఎర్రవరపు రత్న, మర్రి కుమార్, యందవ రమేష్, చల్లా కళావతి, తోట చిన్న, యందవ మారతమ్మ, రాగోలు మహేష్, కుప్పిలి రాజారావు, సిరిపురపు వెంకటి, యందవ ప్రతాప్, కుప్పిలి శంకరరావుకు చెందిన పూరిళ్లు మొత్తం కాలిపోయాయి. అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించడంతో హుటాహుటీన సంఘటనా స్థలానికి వచ్చిన అగ్నిపమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. అప్పటికే పరిస్థితి చేయిదాటిపోవడంతో ఇళ్లన్నీ బూడిదయ్యాయి. ఎమ్మెల్యే జోగులు ఆరా ఈ సంఘటనపై రాజాం ఎమ్మెల్యే కంబాల జోగులు ఆరాతీశారు. హైదరాబాద్ వెళుతున్న ఆయన ఘటన విషయం తెలుసుకున్న వెంటనే పార్టీ టౌన్ కన్వీనర్ పాలవలస శ్రీనివాసరావు, యూత్ కన్వీనర్ వంజరాపు విజయ్కుమార్ ద్వారా వివరాలు సేకరించారు. స్థానిక రెవెన్యూ అధికారులతో మాట్లాడారు. బాధితులను ఆదుకోవాలని సూచించారు. మరోవైపు రాజాం తహసీల్దార్ వై.శ్రీనివాసరావు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను పరామర్శించారు. బాధితుల ఒక్కో ఇంటికి రూ. 10 కిలోల బియ్యాన్ని అందించారు. నగరపంచాయతీ కమిషనర్ బి.రాముతో పాటు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితులను ఓదార్చారు. పెళ్లైన మూడోరోజునే... ఇదిలా ఉండగా తోట పోలయ్య తన కుమార్తె సీతకు రాజాంకు చెందిన యందవ గణపతితో ఈ నెల 8వ తేదీన పెళ్లిచేశాడు. పెళ్లి సందడి ఇంకా ముగియకముందే సారె సామగ్రి అత్తారింటికి సిద్ధం చేసే సమయంలో అగ్నిప్రమాదం జరగడంతో మొత్తం కాలిబూడిదైందని పోలయ్య లబోదిబోమంటున్నాడు. అల్లుడు మొదటిసారిగా ఇంటికి వచ్చిన ఆనందం కూడా వారిలో మిగలకుండా ఆవిరైపోయింది. అలాగే తోలేటి కుమారి కుమార్తె వివాహ నిమిత్తం సిద్ధం చేసిన రూ. 40 వేలు నగదు కాలిపోవడంతో వారి ఆవేదనకు అంతేలేకుండా పోయింది. ఇలా ప్రతి ఇంట్లోను నష్టం తీవ్రంగా జరగడంతో బాధితుల రోదన మిన్నంటింది. బాధితులంతా కూలీలే ♦ అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోయిన వారంతా రోజు కూలీలే. ఉదయాన్నే రాజాంలోని పలు ప్రాంతాల్లో కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి చేరుతుంటారు. వచ్చిన కాస్తోకూస్తో కూలి డబ్బుతో జీవనం సాగిస్తున్నారు. ఎప్పటిలాగే మంగళవారం కూడా పనులకు వెళ్లిన వీరు తమ ఇళ్లు కాలిపోతున్నాయని తెలుసుకుని పరుగులంకెంచుకుంటూ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ♦ అప్పటికే వీరి గుడిసెలు మొత్తం కాలిపోయి బుగ్గిమాత్రమే మిగిలింది. నగరపంచాయతీలో పక్కా ఇళ్ల నిర్మాణాలు లేకపోవడంతో పూరిగుడెసెలే వీరికి గత్యంతరంగా మారాయి. తొమ్మిది నెలల క్రితం రాజాం వచ్చిన సీఎం చంద్రబాబునాయుడు రాజాంలో ఇళ్ల నిర్మాణాలు జరిపి పేదలకు ఇస్తామని హామీ ఇవ్వగా ఆశతో చూసిన వీరికి నిరాశే మిగిలింది. కనీసం ఎన్టీఆర్ స్వగృహ కూడా వీరికి మంజూరు కాలేదు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు అగ్నిప్రమాదంలో ఇళ్లు కాలిపోవడంతో బాధితులు నిలువ నీడలేక బిక్కమొహాలతో దిక్కులు చూస్తున్నారు. ఆదుకునే నాథుడు కోసం అర్రులు చాస్తున్నారు. ఎవరి పంచలో తలదాచుకునేదిరా దేవుడా అంటూ రోదిస్తున్నారు. అగ్నిదేవుడు మాపై ఎందుకింత కక్షసాధించాడో అర్ధంకావడంలేదంటూ నిందిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి న్యాయం చేయాలని కోరుతున్నారు. -
‘ఇష్టముంటే ఉండొచ్చు..లేదంటే వెళ్లిపోవచ్చు’
సాక్షి, విజయవాడ : మాజీమంత్రి రావెల కిషోర్పై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రావెల కిషోర్ బాబు తన పరిధి దాటి మాట్లాడుతున్నారని ఆయన శుక్రవారమిక్కడ అన్నారు. ‘రావెలకు ఇష్టముంటే పార్టీలో ఉండొచ్చు...లేదంటే వెళ్లిపోవచ్చు’ అని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలోని అంశమని, చంద్రబాబును కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, వర్గీకరణపై టీడీపీకి ఓ సిద్ధాంతం ఉందని అన్నారు. ఆ వ్యాఖ్యలకు ఆయనే అర్థం చెప్పాలి ఎవరో చెప్పే మాటలు వినే పరిస్థితి ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదని మంత్రి కేఎస్ జవహర్ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ వ్యాఖ్యల్ని ఆయన తప్పుపట్టారు. మాదిగ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కల్పించింది టీడీపీనే అని అన్నారు. రావెల వ్యాఖ్యల వెనుక అర్ధం ఏంటో ఆయనే చెప్పాలని ...ఆ వ్యాఖ్యలు రావెల వ్యక్తిగతమన్నారు. ఆయన ఏదో మానసిక ఓత్తిడిలో ఉన్నట్లున్నారని జవహర్ అన్నారు. మాదిగలకు టీడీపీకి ఉన్న బంధాన్ని విడదీయాలని మందకృష్ణ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కుల పునాదులపై రాజకీయ పార్టీలు పెట్టాలనుకోవడం వారి అపరిపక్వతకు నిదర్శనమన్నారు. కాగా తనకు పదవుల కన్నా ఎస్సీ వర్గీకరణే ముఖ్యమని గుర్రం జాషువా జయంతి ఉత్సవాలలో గురువారం మాజీ మంత్రి రావెల కిషోర్బాబు చేసిన వ్యాఖ్యలు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. అంతేకాకుండా ఎస్సీ వర్గీకరణ కోసం తాను శాసనసభ్యత్వాన్ని కూడా వదులుకునేందుకు సిద్ధమన్న ఆయన...ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అడుగుజాడల్లో నడుస్తానని చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఆయన మంత్రిగా ఉన్న సమయంలో ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని, కేంద్ర పరిధిలోని అంశమని రావెల పేర్కొన్న విషయం విదితమే. -
ఏఎఫ్ఆర్సీ సూచనల ప్రకారమే ఫీజులు
- ప్రొఫెషనల్ కోర్సుల ఫీజు రీయింబర్స్మెంట్పై స్పష్టత ఇచ్చిన ఎస్సీ శాఖ - ఉన్నత విద్యాశాఖ ఆదేశాలను అనుసరిస్తూ ఉత్తర్వులు సాక్షి, హైదరాబాద్: ఫీజు రీయింబర్స్మెంట్ పథకం కింద వృత్తి విద్యా కోర్సుల ఫీజుల చెల్లింపులపై స్పష్టత వచ్చింది. 2016–17 నుంచి 2018–19 విద్యా సంవత్సరం మధ్య కాలంలో బీటెక్, బీ– ఫార్మసీ, బీ–ఆర్క్, ఎంటెక్, ఎం–ఆర్క్ తదితర వృత్తి విద్యా కోర్సులకు ఏఎఫ్ఆర్సీ (అడ్మిషన్ అండ్ ఫీజ్ రెగ్యులేటరీ కమిటీ) ఇటీవల ఫీజులు ఖరారు చేసింది. ఈ నేపథ్యంలో ఫీజు రీయింబర్స్ మెంట్ కింద చెల్లించే అంశంపై సమీక్షించిన ఎస్సీ అభివృద్ధి శాఖ.. ఏఎఫ్ఆర్సీ సూచనల ఆధారంగా ఫీజులు ఆమోదిస్తూ బుధవారం ఉత్తర్వులు ఇచ్చింది. ఉపకార వేతనాలు మాత్రం పాత విధానాన్నే అనుసరిస్తుండగా.. ఫీజులు మాత్రం 2016–17 నుంచి 2018–19 మధ్యనున్న బ్లాక్ పీరియడ్కు కొత్తగా నిర్దేశించిన మొత్తాన్ని చెల్లించనుంది. ప్రస్తుతం 2016–17 విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్మెంట్ దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోంది. వసతుల ఆధారంగానే ఫీజులు ఇంటర్, డిగ్రీ కోర్సులకు సంబంధించి ఫీజుల్లో పెద్దగా మార్పులు లేనప్పటికీ వృత్తివిద్యా కోర్సుల ఫీజుల్లో భారీ వ్యత్యాసముంది. సాధారణ కాలేజీల్లో ఫీజులతో పోల్చుకుంటే టాప్ కాలేజీల్లో ఎక్కువ మొత్తంలో ఫీజులున్నాయి. దీంతో ఏఎఫ్ఆర్సీ బృందం తనిఖీల తర్వాత అక్కడ కల్పిస్తున్న మౌలిక వసతుల ఆధారంగా ఫీజులు నిర్దేశించింది. ఉన్నత విద్యా మండలి నిబంధనల మేరకు ఏఎఫ్ఆర్సీ ధ్రువీకరించిన ఫీజులను ఎస్సీ అభివృద్ధి శాఖ ఆమోదించింది. ఫీజుల వివరాలను ఈ పాస్ వెబ్సైట్లో పొందుపర్చింది. తాజాగా నిర్ధారించిన ఫీజులు 2018–19 వరకు చెల్లిస్తారు. -
ఎస్సీ, ఎస్టీ ఎస్డీఎఫ్ మార్గదర్శకాలు ఖరారు
- ఫైలుపై సంతకం చేసిన సీఎం కేసీఆర్ - ఒకట్రెండు రోజుల్లో వెలువడనున్న ఉత్తర్వులు.. సాక్షి, హైదరాబాద్: షెడ్యూల్డ్ కులాల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్సీ ఎస్డీఎఫ్), షెడ్యూల్డ్ తెగల ప్రత్యేక అభివృద్ధి నిధి (ఎస్టీ ఎస్డీఎఫ్) మార్గదర్శకాలు ఖరారయ్యాయి. రెండున్నర నెలలుగా పెండింగ్లో ఉన్న ఈ ఫైలుకు మోక్షం కలిగింది. ప్రత్యేక అభివృద్ధి నిధి అమలుకు సంబంధించి మంత్రుల సంఘం రూపొందించిన మార్గదర్శకాలను సీఎం కె.చంద్రశేఖర్రావు ఆమోదించారు. ఒకట్రెండు రోజుల్లో ఇందుకు సంబంధించి ఉత్తర్వులు వెలువడనున్నాయి. దీంతో ప్రత్యేక అభివృద్ధి నిధి కార్యక్రమం అమలుతో పాటు నిఘాపైనా స్పష్టత రానుంది. ఎస్సీ, ఎస్టీలకోసం గతంలో ఉన్న ఉప ప్రణాళికను రద్దు చేస్తూ.. 2017– 18 వార్షిక సంవత్సరం నుంచి కొత్తగా ఎస్సీ ఎస్డీఎఫ్, ఎస్టీ ఎస్డీఎఫ్ను అమల్లోకి తీసుకొచ్చారు. ఈ నిధి కింద చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, వినియోగం తదితర అంశాలపై కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, గిరిజన అభిృవృద్ధి శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్, ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆధ్వర్యంలో కమిటీలు ఏర్పాటు చేసింది. దీంతో పలుమార్లు చర్చలు జరిపిన ఈ కమిటీలు కార్యాచరణ ప్రణాళికను రూపొందించాయి. నిధుల వినియోగంపైనా కఠిన నిబంధనలు తీసుకొచ్చి ప్రభుత్వానికి నివేదించాయి. తాజాగా రూల్స్ ఫైలును సీఎం ఆమోదించడంతో ఒకట్రెండు రోజుల్లో ఉత్తర్వు లు వెలువర్చే అవకాశం ఉందని ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. త్వరలో రాష్ట్రస్థాయి సమన్వయ సమావేశం ప్రత్యేక అభివృద్ధి నిధి మార్గదర్శకాలు వచ్చిన వెంటనే రాష్ట్ర స్థాయిలో సమన్వయ కమిటీ ఏర్పాటు కానుంది. వాస్తవానికి ఈ కమిటీ ప్రతి మూడు నెలలకోసారి సమావేశమై క్షేత్రస్థాయిలో ఎస్డీఎఫ్ అమలు తీరును పర్యవేక్షించాలి. కానీ ఆర్థిక సంవత్సరం ప్రారంభమై ఆర్నెల్లు కావస్తున్నా మార్గదర్శకాలు రూపొందించకపోవడంతో కమిటీ ఏర్పాటు కాలేదు. త్వరలో మార్గదర్శకాలు వెలువడనుండటంతో కమిటీ ఏర్పాటుతో పాటు సమావేశం కూడా జరగనుందని అధికారులు చెబుతున్నారు. -
అర్హులందరికీ ఉపకారవేతనాలు
సర్కారు బడిలో చదివే ఎస్సీ విద్యార్థులకు లబ్ధి ► 5 నుంచి 8 తరగతి చదివే బాలురకు రూ. 1,000, బాలికలకు రూ.1,500 ► 9, 10 తరగతి విద్యార్థులకు రూ.2,250 ► దరఖాస్తులు ఆహ్వానిస్తున్న ఎస్సీ అభివృద్ధి శాఖ ► ఈ–పాస్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తులు ► అర్హులందరికీ మంజూరు చేసేలా భారీ బడ్జెట్ కేటాయింపు సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న ఎస్సీ విద్యార్థులకు శుభవార్త. 5వ తరగతి నుంచి 10వ తరగతి పిల్లలకు ఎస్సీ అభివృద్ధి శాఖ ఉపకారవేతనాలు అందించేందుకు దరఖాస్తులను స్వీకరిస్తోంది. ప్రీ–మెట్రిక్ విద్యార్థుల ఉపకార వేతనాల కోసం ఆ శాఖ 2017–18 వార్షిక సంవత్సరానికి రూ.41 కోట్లు కేటాయించింది. విద్యార్థుల సంఖ్యతో సంబంధం లేకుండా అర్హులైన వారందరికీ ఉపకార వేతనాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆన్లైన్లో దరఖాస్తులు.. ప్రస్తుతం కాలేజీ విద్యార్థుల ఉపకారవేతనాల దరఖాస్తు మాదిరిగానే పాఠశాల విద్యార్థుల దరఖాస్తులను కూడా ఈ–పాస్ వెబ్సైట్ నుంచే స్వీకరిస్తోంది. 2017–18 విద్యాసంవత్సరానికి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభించింది. దరఖాస్తుపై విద్యార్థులకు పెద్దగా అవగాహన లేకపోవడంతో కీలక బాధ్యత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులపైనే ఉంది. ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదువుతూ.. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2లక్షల లోపు ఉన్నవారు మాత్రమే అర్హులు. విద్యార్థులు ముందుగా ఈ–పాస్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. అలా నమోదు చేసి, సబ్మిట్ చేసిన దరఖాస్తును ప్రింట్అవుట్ తీసి వాటికి కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలను జత చేసి డివిజన్ సంక్షేమాధికారికి సమర్పించాలి. అలా వచ్చిన దరఖాస్తులు డివిజన్ సంక్షేమాధికారి పరిశీలించి ఉపకారవేతన మంజూరు కోసం జిల్లా సంక్షేమాధికారికి సిఫార్సు చేయాలి. వెబ్సైట్లో వివరాల నమోదు, ప్రింట్అవుట్లను సంక్షేమాధికారులకు సమర్పించే బాధ్యతను ఉపాధ్యాయులు నిర్వహిస్తే లబ్ధిదారులకు ఉపకార మవుతుందని అధికారులు చెబుతున్నారు. రూ. 20 కోట్లు విడుదల.. ప్రీ–మెట్రిక్ కేటగిరీ కింద 5 నుంచి 10వ తరగతి వరకు ఇస్తున్న ఉపకారవేతనాలకు సంబంధించి ఎస్సీ అభివృద్ధి శాఖ రూ.20 కోట్లు విడుదల చేసింది. దరఖాస్తు చేసుకున్న వెంటనే పరిశీలన పూర్తిచేసి ఉపకారవేతనాలిచ్చేలా చర్యలు చేపట్టింది. అంతేకాకుండా గత రెండేళ్ల కింద ప్రీ–మెట్రిక్ స్కాలర్షిప్ కింద దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు సంబంధించిన బకాయిలు సైతం ఇవ్వాలని నిర్ణయించింది. కేటగిరీల వారీ వివరాలు... తరగతి ఉపకారవేతనం (రూపాయల్లో) 5–8 (బాలురు) 1,000 5–8 (బాలికలు) 1,500 9–10 2,250. -
జరిమానా కడతారా.. కోర్టుకొస్తారా..?
► ట్రాన్స్కో హుకుంతో దళితులు గజగజ ► పండుగపూట పరువు తీయడమేంటని ఆవేదన ► అప్పు చేసి అపరాధ రుసుం చెల్లించిన వైనం అనంతపురం: గుమ్మఘట్ట మండలం పూలకుంట ఎస్సీ కానీలో సోమవారం రాత్రి ముగ్గురు పోలీసులు హల్చల్ చేశారు. కాలనీకి చెందిన అంజినేయులు, రామాంజినేయులు, తిప్పక్క, దురుగప్ప, హనుమంతప్ప, తిప్పేస్వామి, శివణ్ణ, రాజణ్ణ తో పాటు మరో నలుగురిపై విద్యుత్ చౌర్యం కేసులు నమోదయ్యాయని, ఒకొక్కరు రూ. 500 చొప్పున అపరాధ రుసుం చెల్లించాలని హుకుం జారీ చేశారు. లేకుంటే కోర్టుకు హాజరు కావాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో కాలనీలో కాసేపు గందర గోళం నెలకొంది. ముందస్తు సమాచారం లేకుండా ఇలా ఉన్నపళంగా వస్తే తాము ఎక్కడి నుంచి తెచ్చికట్టాలని, ఒక రోజు గడువు ఇవ్వాలని ప్రాధేయ పడినా పోలీసులు ససేమిరా అన్నారు. దీంతో వారు పడరాని పాట్లు పడ్డారు. గ్రామంలో మారెమ్మ పండుగ జరుపుకుంటుండడంతో ఇళ్లనిండా బంధువులు వచ్చిన సమయంలో ఇలా పరువు తీయడం సరైన పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు. కాలనీలో 200 ఇళ్లు ఉన్నా తమపైనే ఎందుకు ఇలా చేస్తున్నారని ప్రశ్నించారు. పొట్ట కూటికోసం వలసలు వెళ్లి కొద్దొగొప్పో సంపాదించుకుని వచ్చిన తమపై ప్రభుత్వం ప్రతాపం చూపడం మంచిది కాదంటూ శాపనార్థాలు పెట్టారు. కోర్టు పేరు చెప్పగానే భయపడి ఇతరుల వద్ద అప్పుచేసి అపరాధ రుసుం చెల్లించారు. కొందరైతే పండుగ లేకున్నా ఫర్వాలేదని డబ్బు కట్టేశారు. ఈ విషయమై సంబంధిత హెడ్కానిస్టేబుల్ చలమయ్య, పోలీసులు ఓబుళపతి, మురళిలను ‘సాక్షి’ వివరణ కోరగా తాము ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే వసూళ్లకు వచ్చామని, స్థానిక ఏఈ వీరిపై విద్యుత్ చౌర్యం కేసులు నమోదు చేశారన్నారు. -
శుష్క వాగ్దానాలే సంక్షేమమా?
కొత్త కోణం మోదీ ప్రభుత్వం దేశంలో ఎస్సీ, ఎస్టీల ఉనికి ఉన్నట్టే భావించడంలేదు. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను పట్టించుకోవడం లేదు. ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి అంశమే మోదీ ప్రభుత్వం ఎజెండాలో లేకుండా పోయింది. పైగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న అరకొర నిధులు ఖర్చు కాకుండా మిగిలిపోతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి అంబేడ్కర్ పట్ల నిజంగానే గౌరవం, భక్తి ఉన్నట్లయితే ఆయన 40 ఏళ్లు శ్రమించి రూపొందించిన పథకాలను, అహర్నిశలు తపనపడి నిర్మించిన రాజ్యాంగాన్ని చిత్తశుద్ధితో అమలు చేయాలి. ‘‘స్వరాజ్యం నా జన్మహక్కు’’ బాలగంగాధర్ తిలక్ నినాదం. ఇప్పుడు స్వతంత్ర భారతంలో సురాజ్యం నా జన్మహక్కు అనేదే నినాదం కావాలి. ప్రభుత్వాలు బాధ్యతలను, పౌరులు తమ విధులను నిర్వర్తించాలి. దివ్య, భవ్య భారత నిర్మాణమే మనందరి ధ్యేయం కావాలి’’ భారత ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై నుంచి ఏడు పదుల స్వాతంత్య్ర దినోత్సవ సంబరాల సందర్భంగా పలికిన వ్యాఖ్యలివి. ఈ మాటలకీ, దేశంలో అమలు జరుగుతున్న అంశాలకీ ఏదైనా పొంతన ఉన్నదా? అని ఆలోచిస్తే, కచ్చితంగా లేదనే చెప్పాలి. అభివృద్ధి ధ్యేయంగా అదే ఏకైక నినాదంగా అ«ధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలు ఎంత మాత్రం ఆ దిశగా అమలు జరుగుతున్న దాఖలాల్లేవు. ముఖ్యంగా దళిత, ఆదివాసుల జీవితాలు మరింత దుర్భర పరిస్థితిలోకి కూరుకుపోతున్నాయి. గత ఎన్నో పోరాటాల ఫలితంగా, అంబేడ్కర్ లాంటి ఎందరో త్యాగధనుల ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న హక్కులనుసైతం నరేంద్రమోదీ ప్రభుత్వం రకరకాల పద్ధతుల్లో రద్దు చేసే ప్రయత్నం చేస్తున్నది. గత మూడేళ్ళలో నరేంద్రమోదీ ప్రభుత్వం దళిత, ఆదివాసీ ప్రజల కోసం ప్రత్యేకించి ఎటువంటి పథకాలు ప్రవేశపెట్టకపోగా, అంబేడ్కర్ నామజపంతోనే దళితులను బుజ్జగించే ప్రయత్నానికి ఒడిగడుతున్నది. నోటుమీది బొమ్మ ఆకలి చల్లార్చేనా? ఇటీవల కొంత మంది కరెన్సీ నోట్లపైన అంబేడ్కర్ బొమ్మని ముద్రించాలనే నినాదాన్ని ముందుకు తెస్తున్నారు. అందుకోసం క్యాంపెయిన్ను సైతం మొదలుపెట్టారు. దళితులు, ఆదివాసీల కోసం కేటాయించిన నిధులను కూడా సరిగా ఖర్చు చేయని మోదీ ప్రభుత్వం... అంబేడ్కర్ సంస్మరణార్థం ఐదు స్థలాలను అభివృద్ధి చేస్తామని ప్రకటించుకొన్నది. అంబేడ్కర్ జన్మించిన మవు, ఆయన ఢిల్లీ నివాసం, అలీపూర్ 26, ఆయన ముంబై నివాసం రాజగృహ, ఆయన బౌద్ధం స్వీకరించిన స్థలం నాగపూర్ దీక్షా భూమి, ఆయన సమాధి ఉన్న ముంబైలోని చైత్యభూమి. అంతేకాకుండా ఆయన లండన్లో ఉంటూ చదువుకున్న స్థలాన్ని కూడా స్మారక కేంద్రంగా ప్రకటించారు. దానిని భారత ప్రభుత్వం కొనుగోలు చేసింది. మూడేళ్లలో అంబేడ్కర్ను స్మరించడం, అప్పుడప్పుడు ఆయన పేరును ప్రస్తావించడం మాత్రమే నరేంద్ర మోదీ ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఎవరితోనో అంబేడ్కర్ బొమ్మ కరెన్సీ నోట్ల మీద ముద్రించాలనే చర్చ మొదలు పెట్టించారు. అయితే ఇవేవీ నిజమైన అంబేడ్కర్ భావజాలన్ని పరివ్యాప్తి చేయలేవన్నది నగ్న సత్యం. ఉదాహరణకు అమెరికా చరిత్రనే తీసుకుంటే అమెరికా కరెన్సీ 20 డాలర్ల నోటుపైన ఉన్న మాజీ అధ్యక్షులు ఆండ్రూ జాక్సన్ బొమ్మను తొలగించి, నల్లజాతి ప్రజల హక్కుల కోసం పరితపించిన, జీవితాంతం పోరాడిన పౌరహక్కుల నాయకురాలు హరియత్ ట్యూబ్మన్ బొమ్మను పెడుతున్నట్టు ఏప్రిల్ 20, 2016న అమెరికా ట్రెజరీ సెక్రటరీ జాకబ్ ల్యూ ప్రకటించారు. అయితే ఆ నిర్ణయం నల్లజాతి ప్రజల జీవితాల్లో ఎటువంటి మార్పులు తీసుకురాలేదనడానికి ఇప్పటి పరిస్థితే తార్కాణం. ఓట్ల కోసమే తప్ప, నిజంగా అణగారిన ప్రజలకోసం ప్రభుత్వాలు పనిచేస్తున్నట్టు లేదనడానికి నల్లజాతి ప్రజలు ఎదుర్కొం టున్న వివక్ష, ఆకలి అవమానాలే సాక్ష్యాలు. నూటికి 30 శాతం మంది నల్ల జాతి ప్రజలు తినడానికి రొట్టెముక్కకు కూడా నోచుకోలేకపోతున్నారని ‘‘బ్రెడ్ ఫర్ వరల్డ్ ’’అనే సంస్థ అధ్యయనం వెల్లడించింది. బతకడానికి వేరే దారే లేక పలువురు నల్లజాతి యువతీ యువకులు మత్తు మందు వ్యాపారంలో పావులుగా మారి జైళ్లలో మగ్గుతున్నారని పలు నివేదికలు తెలిపాయి. అంబేడ్కర్ జపం కాదు, ఆయన బాటన సాగండి అందుకే ఓ రచయిత చెప్పినట్టు అంబేడ్కర్ ఫొటోని కరెన్సీ నోట్లపై ముద్రిం చడం కాదు, కనీసం జీవితానికి సరిపోయేంత కరెన్సీ దళిత, ఆదివాసుల జేబుల్లో ఉండేటట్టు చేస్తే మంచిది. దళితుల ఆర్థిక, సామాజిక అభివృద్ధిని నిజంగానే కోరితే, అంబేడ్కర్ పూజలకు బదులు ఆయన నిర్దేశించిన మార్గాన్ని అనుసరిస్తే మంచిది. దళితుల సామాజిక సమానత్వం కోసం, రాజకీయ ఆర్థిక సాధికారత కోసం అంబేడ్కర్ తన జీవిత కాలాన్నంతటినీ వెచ్చించారు. దళితుల రాజకీయ సాధికారత కోసం బ్రిటిష్ ప్రభుత్వం ప్రకటించిన ప్రత్యేక ఓటింగ్ విధానం... దళితులను హిందువులపైన ఆధారపడకుండా స్వతంత్రులను చేయగలదన్న అభిప్రాయంతో గాంధీజీ దానికి గండికొట్టాలని యత్నించి, కృతకృత్యుడయ్యాడు. చివరకు మధ్యే మార్గంగా గాంధీజీ, అంబేడ్కర్ల మధ్య కుదిరిన పూనా ఒప్పందంలో తొమ్మిది అంశాలున్నాయి. ఎనిమిది అంశాలు ఓటింగ్, సీట్ల రిజర్వేషన్ తదితర అంశాల మీద ఉండగా, తొమ్మిదవ అంశం మాత్రం అంటరాని కులాల విద్యాభివృద్ధికి సంబంధించినది. ప్రతి రాష్ట్రం తమ బడ్జెట్లో తగు నిధులను అంటరాని కులాల విద్యాభివృద్ధికి కేటాయించి ఖర్చు చేయాలని పూనా ఒప్పందంలో స్పష్టంగా పేర్కొన్నారు. దాని ప్రకారమే 1935 భారత ప్రభుత్వ చట్టం అమలులోకి వచ్చిన తరువాత అంటరాని కులాలకు విద్యా, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు అమల్లోకి వచ్చాయి. అర్హతగల షెడ్యూల్డ్ కులాల విద్యార్థులను విదేశీ చదువులకు పంపించారు కూడా. ఇటువంటి విధానాన్ని స్వాతంత్య్రం తరువాత కూడా కొనసాగించడానికి భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 38, ఆర్టికల్ 46లను చేర్చారు. రాజ్యాంగంలోని 38వ ఆర్టికల్, ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నది. జాతీయ జన జీవితంలో భాగమైన అన్ని సంస్థలు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం కోసం కృషి చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కూడా ఆ ఆర్టికల్ స్పష్టం చేసింది. వివిధ వర్గాల ప్రజల మ«ధ్య, ప్రాంతాల మధ్య, వ్యక్తులు, సామాజిక వర్గాల మధ్య అసమానతలను నిర్మూలించాలని కూడా ఆర్టికల్ 38 సూటిగా ఆదేశించింది. అదేవిధంగా ఆర్టికల్ 46 బలహీన వర్గాల ప్రజల కోసం, ప్రత్యేకించి షెడ్యూల్డ్ కులాలు, తెగల ఆర్థిక విద్యారంగాల అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ వహించాలని, అందుకు ప్రభుత్వాలు తగు కార్యక్రమాలను రూపొందించాలని సూచించింది. ఈ ఆర్టికల్ వల్లనే, ఈ రోజు వెనుకబడిన కులాలుగా చెప్పబడుతున్న బీసీలకు రిజర్వేషన్లు కల్పించే అవకాశం లభించింది. సబ్ప్లాన్ను రద్దు చేసి... అయితే 1974 వరకు ప్రభుత్వాలు రాజ్యాంగంలో పేర్కొన్న విధంగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధికి ఎటువంటి విధానాలనూ చేపట్టలేదు. ఆయా వర్గాలకు ప్రత్యేకమైన శాఖలు కానీ, కార్యక్రమాలుగానీ రూపొందించలేకపోయాయి. 1960 దశకం చివరిభాగంలో, 1970 దశకం తొలి భాగంలో దేశవ్యాప్తంగా నక్సలైటు తిరుగుబాటు రూపంలో ఆదివాసులు, దళితుల పోరాటాలు వెల్లువెత్తాయి. ఆ తర్వాతనే నాటి ప్రధాని ఇందిరాగాంధీ ప్రభుత్వం ఈ వర్గాల సంక్షేమంపై దృష్టి సారించడం మొదలు పెట్టింది. అందులో భాగంగానే నాటి ప్రభుత్వం ట్రైబల్ సబ్ప్లాన్ పేరుతో బడ్జెట్లో ప్లాన్ పద్దు నుంచి జనాభా శాతం ఆధారంగా నిధులను కేటాయించడాన్ని 1974లో ప్రారంభించింది. ఆ తరువాత 1980 నుంచి ఎస్సీల కోసం స్పెషల్ కాంపొనెంట్ ప్లాన్ను అమలులోనికి తీసుకొచ్చారు. దాని ద్వారా కొంత మెరుగైన పథకాలు అమలులోకి వచ్చినప్పటికీ నూటికి నూరు శాతం ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ప్రభుత్వాలు ఖర్చు చేయలేదు. పేరుకు మాత్రమే కేటాయింపులు చేసి చేతులు దులుపుకున్నారు. దాదాపు రెండు దశాబ్దాల తరువాత 2001లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సబ్ప్లాన్ నిధుల అమలు కోసం ఉద్యమం ప్రారంభమైంది. ఆ సంస్థ చొరవతో అన్ని రాజకీయ పార్టీలు, సంఘాలు 11 ఏళ్ల పాటు జరిపిన ఉద్యమం వల్ల 2012 డిసెంబర్ 2న నిధుల ఖర్చు కోసం ఒక చట్టాన్ని తెచ్చారు. అయితే 2017లో ప్రవేశపెట్టిన బడ్జెట్లో నరేంద్రమోదీ ప్రభుత్వం ప్లాన్, నాన్ ప్లాన్ పద్దులను తొలగించడం వల్ల సబ్ప్లాన్ చట్టానికి గానీ, ఆ విధానానికి గానీ అర్థం లేకుండా పోయింది. కానీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు చొరవతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్ప్లాన్ చట్టం స్థానంలో ఎస్సీ, ఎస్టీ డెవలప్మెంట్ ఫండ్ యాక్ట్ను తీసుకొచ్చింది. దాని ద్వారా మరొక్కసారి జాతీయ స్థాయిలో ఎస్సీ, ఎస్టీ నిధుల చట్టం ఆవశ్యకత ముందుకొచ్చింది. నిధులను మురగబెడుతూ.. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న నరేంద్రమోదీ ప్రభుత్వంలో మాత్రం ఈ దేశంలో ఎస్సీ, ఎస్టీల ఉనికి ఉన్నట్టే భావించడంలేదు. రాజ్యాంగం నిర్దేశించిన లక్ష్యాలను పట్టించుకోవడం లేదు. దానితో ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, అభివృద్ధి అంశమే నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎజెండాలో లేకుండా పోయింది. అంతేకాకుండా ఎస్సీ, ఎస్టీల అభివృద్ధి కోసం కేటాయిస్తున్న అరకొర నిధులు కూడా ఖర్చు కాకుండా మిగిలిపోతున్నాయి. 2014–15 సంవత్సరంలో కేంద్ర బడ్జెట్ రూ. 17,63,214 కోట్లు కాగా వారికి కేటాయించింది రూ. రూ. 50,548 కోట్లు. వాస్తవానికి వారి వాటాకు రావాల్సింది రూ. 81,460 కోట్లు. వారికి కేటాయించిన నిధుల శాతం 2.87గా తేల్చారు. 2015–16లో అది 1.47 శాతం, 2016–17లో 1.96 శాతం, 2017–18లో 2.44 శాతం. అదేవిధంగా ఎస్టీ సబ్ప్లాన్ కూడా అంతకంటే దయనీయంగా ఉంది. 2014–15లో అది 1.84 శాతం, 2015–16లో 1.13 శాతం, 2016–17లో 1.21 శాతం, 2017–18లో 1.49 శాతం కేటాయించారు. ఈ కేటాయింపులను కూడా ప్రధానంగా ఎస్సీ, ఎస్టీల అవసరాలకు పెద్దగా ఉపయోగపడని శాఖలకే అధికంగా కేటాయించారు. ఫలితంగా, 2014–15లో రూ. 39,585 కోట్లు, 2015–16లో రూ. 21,730 కోట్లు, 2016–17లో రూ. 32,168 కోట్లు 2017–18లో రూ. 26,684 కోట్ల రూపాయల నిధులు వీరికి ఉపయోగపడకుండా మురిగిపోయాయి. ఇందులో 78 శాతం పైగా ఇటువంటి పథకాలకే కేటాయించినట్టు లెక్కలు చెపుతున్నాయి. గత మూడేళ్లలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీల సంక్షేమం పట్ల చూపుతున్న నిర్లక్ష్యం ఎలాంటిదో పై లెక్కల ద్వారా మనకు అర్థం అవుతుంది. బాబా సాహెబ్ అంబేడ్కర్ పట్ల గౌరవం, భక్తి ఉన్నట్లయితే, ఆయన నలభై సంవత్సరాల పాటు శ్రమించి రూపొందించిన పథకాలను, అహర్నిశలు తపనపడి నిర్మించిన రాజ్యాంగాన్ని అమలు చేయడం ఒక్కటే దళితులు, ఆది వాసుల నిజమైన విముక్తి మార్గం. మల్లెపల్లి లక్ష్మయ్య వ్యాసకర్త సామాజిక విశ్లేషకులు ‘ 97055 66213 -
కాలేజీ విద్యార్థులకు హాస్టళ్లు!
- ఇంటర్, డిగ్రీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు - దూర ప్రాంత విద్యార్థుల కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ నిర్ణయం - ఎస్సీ విద్యార్థులకు ప్రాధాన్యం.. 70 శాతం సీట్లు వారికే.. సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్, డిగ్రీ విద్యార్థులకు శుభవార్త. దూర ప్రాంతం నుంచి కాలేజీకి రాకపోకలు సాగించే వారి కోసం ఎస్సీ అభివృద్ధి శాఖ త్వరలో ప్రత్యేకంగా వసతి గృహాలను ఏర్పాటు చేయనుంది. ప్రస్తుతం నియోజకవర్గానికో వసతిగృహం ఉన్నప్పటికీ విద్యార్థుల సంఖ్యకు తగి నట్టుగా వీటిని నెలకొల్పాలని భావిస్తోంది. ఇందుకు సంబంధించి క్షేత్రస్థాయి నుంచి పలువురు ప్రజా ప్రతినిధులు సైతం హాస్టళ్ల ఆవశ్యకతపై లేఖలు పంపు తుండటంతో చర్యలు మొదలుపెట్టింది. ప్రస్తుతం ఎస్సీ అభివృద్ధి శాఖ పరిధిలో పాఠశాల విద్యార్థుల వసతి గృహాలు కొనసాగుతున్నాయి. తాజాగా గురుకుల పాఠశాలలను ప్రారంభించడంతో పలు హాస్టళ్లలో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. ఈ తరుణంలో పిల్లల సంఖ్య తక్కువగా ఉండి.. మౌలికవసతులు ఉన్న వాటిలో ఈ హాస్టళ్లను ప్రారంభించాలని భావిస్తోంది. ఈ మేరకు క్షేత్రస్థాయి అధికారుల నుంచి వివరాలను సేకరిస్తోంది. వంద మందికి ఒక హాస్టల్ కొత్తగా హాస్టళ్లు ప్రారంభించడం ఖర్చుతో కూడుకున్న పని. అంతేకాకుండా వాటిని పూర్తిచేసి అందుబాటులోకి తేవడానికి చాలా సమయం పడుతుంది. దీంతో విద్యార్థులు లేని, 40 కంటే తక్కువ విద్యార్థులున్న హాస్టళ్లను సమీప వసతి గృహాల్లో విలీనం చేయనున్నారు. అలా విలీనం చేసిన హాస్టల్ భవనంలోనే కొత్తగా కాలేజీ విద్యార్థుల కోసం వసతిగృహాన్ని ఏర్పాటు చేయాలని ఎస్సీ శాఖ ప్రాథమికంగా నిర్ణయించింది. దీంతో ఖర్చు తగ్గడంతో పాటే సిబ్బందికి స్థానచలనం కలిగించాల్సిన పని ఉండదని, వనరులు సద్వినియోగం చేసుకోవచ్చని అధికారులు భావిస్తున్నారు. పక్కా భవనం ఉండి కనీసం వంద మంది విద్యార్థులకు వసతి కలిగించే సామర్థ్యం ఉన్న భవనాలనే కాలేజీ హాస్టళ్లకు ఎంపిక చేయనున్నారు. వీటిని ఒకేసారి పెద్ద సంఖ్యలో కాకుండా ప్రాధాన్యత క్రమంలో ప్రారంభించనున్నారు. కరీంనగర్ జిల్లాలో కరీంనగర్, జమ్మికుంట తదితర మండలాల్లో బాలికలు, బాలుర కోసం వసతిగృహాలు ఏర్పాటు చేయాలని ఇటీవల ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్.. ఎస్సీ అభివృద్ధి శాఖకు లేఖ రాశారు. దాంతో అధికారులు ఆమేరకు చర్యలు చేపట్టి నివేదికను రూపొందించారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా విద్యార్థుల సంఖ్యను పరిగణనలోకి తీసుకుని వసతి గృహాలను ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంటర్ ప్రవేశాల ప్రక్రియ ముగియగా.. డిగ్రీ అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో ప్రవేశాలు ముగిసిన తర్వాత విద్యార్థుల సంఖ్యను బట్టి వసతి గృహాల ఆవశ్యకతపై అంచనాకు వస్తామని ఎస్సీ అభివృద్ధి శాఖ సంచాలకులు కరుణాకర్ ‘సాక్షి’తో అన్నారు. ఉపకార నిధులతో నిర్వహణ కొత్తగా ఏర్పాటు చేసే వసతి గృహాల నిర్వహణ భారాన్ని విద్యార్థుల ఉపకార వేతనాల నుంచి సర్దుబాటు చేయాలని ఎస్సీ శాఖ భావిస్తోంది. ప్రస్తుతం నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టుమెట్రిక్ వసతి గృహాలను నిర్వహిస్తోంది. వీటి మాదిరిగానే కొత్తగా ఏర్పాటు చేసే కాలేజీ హాస్టళ్లను నిర్వహించనుంది. ఒక హాస్టల్లో కనిష్టంగా వంద మంది విద్యార్థులుంటేనే నిర్వహణలో ఇబ్బందులుండవని అధికారులు చెబుతున్నారు. ఈ సంఖ్యను దృష్టిలో పెట్టుకుని బాలికలు, బాలుర హాస్టళ్ల ప్రణాళికలు రూపొందిస్తున్నారు. వీటిలో ఎస్సీ విద్యార్థులకు 70 శాతం సీట్లు కేటాయిస్తారు. మిగతా కోటాలో ప్రాధాన్యత క్రమంలో విద్యార్థులను చేర్చుకుంటారు. -
విన్నపాలు వినవలే..!
అనంతపురం రూరల్ : నా పేరిట ప్రభుత్వం మంజూరు చేసిన 2.68 ఎకారాల భూమిని మరో వ్యకి దౌర్జన్యంగా సాగు చేసుకుంటున్నాడు.. ఇదేమిటని ప్రశ్రిస్తే దాడి చేయడానికి వస్తున్నాడని కూడేరు మండలం కడదరకుంట గ్రామానికి చెందిన సాకే శివానంద బుధవారం ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్సులో ఇన్చార్జీ కలెక్టర్ రమామణికి వినతి పత్రం అందజేశాడు. బుధవారం కలెక్టరేట్ రెవెన్యూ భవన్లో ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్సు సెల్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఖాజామొహిద్దీన్, డీఆర్ఓ మల్లేశ్వరిదేవి పాల్గొన్నారు. ప్రజల నుంచి 206 అర్జీలను స్వీకరించారు. – ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్ నిధులను ఎస్సీ కాలనీల అభివృద్ధికి ఖర్చు చేయాలని దళిత సంఘాల నాయకులు చిన్న పెద్దన్న, రవికుమార్లు వినతి పత్రం అందజేశారు. జిల్లా వ్యాప్తంగా మౌలిక వసతులు లేని ఎస్సీ కాలనీలు అనేకం ఉన్నాయన్నారు. – 6వ విడత భూ పంపిణీలో ప్రభుత్వం భూమిని మంజూరు చేసింది. అయితే రెవెన్యూ అధికారులు 1బీ, అండంగళ్లోకి నమోదు చేయడం లేదని పెనుకొండ మండలానికి చెందిన కళావతి వినతి పత్రం అందజేశారు. మూడు నెలలుగా కార్యాలయం చుట్టు ప్రదక్షణలు చేస్తున్నా పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేసింది. – తనకల్లు మండలం రాగినేపల్లిలో ఫ్లోరైడ్ నీటితో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారు. తాగేందుకు మంచినీటి సౌకర్యం కల్పించాలని గ్రామస్తులు గ్రీవెన్సులో అర్జీని అందజేశారు. – కుందిర్పి మండల కేంద్రంలో దళితులకు సర్వేనెం 286–3లోని 4.23ఎకరాల విస్తీర్ణంలో 143 మందికి ఇంటి పట్టాలను మంజూరు చేశారు. ఆర్డీటీ సంస్థ సైతం ఇళ్లను నిర్మించింది. కాలనీలో కనీస వసతులైన వీధిలైట్లు , తాగునీరు, డ్రైనేజీ కాలువలను ఏర్పాటు చేయాలని కాలనీ వాసులు ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్సులో వినతి పత్రం అందజేశారు. -
దుర్గం మున్సిపాలిటీకి ఎస్సీ సబ్ప్లాన్ నిధులు మంజూరు
రాయదుర్గం అర్బన్ : రాయదుర్గం మున్సిపాలిటీకి రూ. 1.97 కోట్ల ఎస్సీ సబ్ప్లాన్ నిధులు మంజూరయ్యాయి. ఈ మేరకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు అందినట్లు మున్సిపల్ కమిషనర్ ఎం.కృష్ణ గురువారం తెలిపారు. దళితుల సంక్షేమం పట్టని ప్రభుత్వ వైఖరిపై గత నెల 29న ‘నిర్లక్ష్యానికి పరాకాష్ట’ శీర్షికన సాక్షిలో వెలువడిన కథనంపై అధికారులు స్పందించారు. నివేదికలను తక్షణమే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నిధులు రాబట్టుకున్నారు. మంజూరైన రూ. 1,97,79,000లో నుంచి రూ. 75.77 లక్షలతో తక్షణమే పనులు చేపట్టేందుకు శాఖాపరమైన అనుమతులు కూడా ఇచ్చేశారు. ఇప్పటికే ప్రతిపాదనలు సిద్దం చేసి, టెండర్లు సైతం పిలిచిన ఆరు పనులు తక్షణమే ప్రారంభించనున్నట్లు కమిషనర్ తెలిపారు. -
ఎస్సీ, ఎస్టీ కేసుల్లో పరిహార పత్రాల మంజూరు
ఒంగోలు టౌన్ : ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించి ముగ్గురు బాధితులకు కలెక్టర్ వి.వినయ్చంద్ బుధవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో పరిహార పత్రాలు మంజూరు చేశారు. 2011లో చినగంజాం అంబేడ్కర్ నగర్కు చెందిన తెలగతోటి చినగురవయ్య, మేడికొండ శ్రీను, గంటెనపల్లి కిషోర్బాబులను అదే గ్రామానికి చెందిన కొంతమంది అగ్రవర్ణాల వారు కులం పేరుతో దూషించి దాడి చేశారు. ఈ మేరకు బాధితులు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వం నుంచి అందాల్సిన పరిహారం ఇంతవరకూ ఇవ్వలేదంటూ బాధితులు ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన మీకోసం కార్యక్రమంలో జిల్లా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే కేసుకు సంబంధించి బాధితులు ఒక్కొక్కరికి 6250 రూపాయల పరిహారం మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కలెక్టర్ ఉత్తర్వుల మేరకు సదరు మొత్తాన్ని ఖజానా కార్యాలయం నుంచి డ్రా చేసి వెంటనే బాధితులకు అందజేయాలని చిన్నగంజాం మండల తహసీల్దార్ను కలెక్టర్ ఆదేశించా రు.బాధితులకు పరిహార పత్రాలు మంజూరు కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి డాక్టర్ ఎన్.ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. -
ఎస్సీ హాస్టళ్లకు మహర్దశ !
►సౌకర్యాల కల్పనపై కలెక్టర్ దృష్టి ►సుమారు రూ.2 కోట్ల వ్యయం ►ప్రతిపాదనలు పంపిన ఎస్సీ సంక్షేమ శాఖ ►60 పైగా టాయిలెట్లు, బాత్రూమ్ల నిర్మాణాలు ►ఎనిమిది హాస్టళ్లకు ప్రహరీలు ఇందూరు (నిజామాబాద్ అర్బన్): జిల్లాలోని ఎస్సీ హాస్టళ్ల దశ మారనుంది. విద్యార్థులకు సకల సౌకర్యాలు అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కలెక్టర్ యోగితా రాణా ప్రత్యేక దృష్టి సారించి హాస్లళ్లలో కావాల్సిన వసతులపై రెణ్నెళ్ల క్రితం అధికారులను నివేదిక సమర్పించాలని ఆదేశించారు. దీంతో ఎస్సీ సంక్షేమ శాఖ అధికారులు వార్డెన్ల నుంచి సంబంధిత హాస్టళ్లలో సౌకర్యాల లేమిపై వివరాలను తీసుకున్నారు. ఆ నివేదికలను క్రోడీకరించి కలెక్టర్తో పాటు ఎస్సీ సంక్షేమ శాఖ రాష్ట్ర డైరెక్టర్కు నివేదించారు. జిల్లాలో 36 పాఠశాల హాస్టళ్లు, 10 కళాశాల హాస్టళ్లు ఉండగా వీటిలో 4,900 మంది వరకు విద్యార్థులు వసతి పొందుతున్నారు. అయితే ఆయా హాస్టళ్లలో తలుపులు, కిటికీలు, విద్యుత్ సౌకర్యం, గోడలకు రంగులు, సున్నం, వాటర్ సప్లయి, బోర్వెల్, పంపు సెట్టు, సెప్టిక్ ట్యాంక్, తదితర మరమ్మతులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అన్ని హాస్టళ్లను కలుపుకుని దాదాపు 60 వరకు టాయ్టెట్లు, బాత్ రూంలు అదనంగా అవసరం ఉన్నాయని నివేదికలో చేర్చారు. ఎనిమిది హాస్టళ్లకు ప్రహరీలు, వాల్ గేట్లు అవసరం ఉందని పేర్కొన్నారు. మరమ్మతులు, నూతన నిర్మాణాలకు కలిపి దాదాపు రూ.2 కోట్ల 10 లక్షల వరకు నిధులు అవసరం అవుతాయని కలెక్టర్కు నివేదించారు. అయితే హాస్టళ్లకు అవసరమైన నిధులను ప్రభుత్వం నుంచి తెప్పిం చుకోవడం లేదా కలెక్టరే తన నిధుల నుంచి సమకూర్చుతారని సమాచారం. నిధుల అంశం కొలి క్కి రాగానే ఆర్అండ్బీ, లేదా పంచాయతీ రాజ్ అధికారులతో హాస్టళ్లకు మరమ్మతులు, టాయిలెట్లు, బాత్ రూంలు, ప్రహరీల నిర్మాణాలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ నెల 23 నుంచి హాస్టళ్లకు రెండు నెలల పాటు వేసవి సెలవులు ఉం టాయి. ఈ సమయంలో మరమ్మతులు, నిర్మాణాలు పూర్తి చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. విద్యా సంవత్సరం జూన్ రెండు లేదా మూడవ వారంలో ప్రారంభం కానుండగా సకల సౌకర్యాలతో హాస్టళ్లను తీర్చి దిద్ది విద్యార్థులకు అందిస్తే బాగుంటుందని పలువురు వార్డెన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు తీరుతాయ్.. దీర్ఘకాలికంగా లేదా మధ్యలో నెలకొన్న చిన్న చిన్న సమస్యలే హాస్టళ్లలో విద్యార్థులకు, వార్డెన్లను ఇబ్బందులకు గురి చేస్తాయి. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్ సరఫరా, బోరు మరమ్మతు లు, తలుపులు, కిటికీలు సక్రమంగా లేకపోవడం తో సమస్యలు ఏర్పడుతున్నాయి. వీటని అప్పటికప్పుడు సరి చేయడానికి నిధులు సమకూర్చడం వార్డెన్లకు సాధ్యం కాదు. ఇలాంటి సమస్యలను తీర్చి సంపూర్ణ పరిష్కారం చూపేందుకు కలెక్టర్ హాస్టళ్లపై దృష్టి సారించారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా టాయిలెట్లు, బాత్రూంలు లేక ఇబ్బందిగా మారిన క్రమంలో అదనంగా అవసరమైన టాయిలెట్ల నిర్మాణాలు జరగనున్నాయి.అవసరమైన వాటికి ప్రహరీలు కట్టించడానికి చర్యలు చేపట్టడంతో సమస్య తీరిపోనుంది. ప్రతిపాదనలు సమర్పించాం కలెక్టర్ ఆదేశాల ప్రకారం జిల్లాలోని అన్ని పోస్టు మెట్రిక్, ప్రీ మెట్రిక్ హాస్టళ్లలో అవసరమున్న సౌకర్యాలు, మరమ్మతులపై వార్డెన్లతో వివరాలను సేకరించాము.అందుకు అవసరమయ్యే నిధుల వివరాలను కూడా నివేదిక రూపంలో కలెక్టర్కు అందించాము. – జగదీశ్వర్ రెడ్డి, జిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ డీడీ -
బాహాబాహీ
- చైర్పర్సన్ కుటుంబ సభ్యులు, ఎస్సీకాలనీవాసుల మధ్య ఘర్షణ - ఇరు వర్గాలకు చెందిన పలువురికి స్వల్పగాయాలు - పోలీసుస్టేషన్, మునిపల్ కార్యాలయాల ముట్టడి గుత్తి : గుత్తి మునిసిపల్ చైర్పర్సన్ తులశమ్మ వర్గీయులు, ఎస్సీ కాలనీవాసుల మధ్య శనివారం ఘర్షణ చోటు చేసుకుంది. ఇరువర్గాల వారు పోలీసుల ఎదుటే పరస్పరం చెప్పులతో కొట్టుకున్నారు. అలాగే ఎస్సీ కాలనీవాసులు పోలీసుస్టేషన్, మునిపల్ కార్యాలయాలను ముట్టడించారు. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి. వారం క్రితం తనను ముగ్గురు ఎస్సీ యువకులు డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేస్తున్నారని చైర్పర్సన్ కుమారుడు దిల్కా శీనా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు ఐదు రోజుల క్రితం రాణాప్రతాప్, మల్లి, మురళీని స్టేషన్కు పిలిపించారు. ఇది తెలిసి ఎస్సీ కాలనీవాసులు సుమారు వంద మంది స్టేషన్కు వెళ్లారు. దిల్కా శీనా ఎస్సీ సబ్ప్లాన్ నిధులు రూ.1.20 కోట్లను కాజేసిన విషయాన్ని తాము బయట పెట్టామని, దీంతో కక్ష కట్టి తమ పిల్లలపై కేసు పెట్టాడని వారు ఆరోపించారు. దీంతో సీఐ మ«ధుసూదన్ గౌడ్, ఎస్ఐలు చాంద్బాషా, రామాంజనేయులు ఇరువర్గాలపై ఎలాంటి కేసులూ ఉండవని చెప్పి పంపారు. అయితే శనివారం ఆ ముగ్గురు యువకులను మళ్లీ స్టేషన్కు తీసుకెళ్లారు. దీంతో ఎస్సీలు స్టేషన్ను ముట్టడించారు. తమ పిల్లలు ఏ తప్పూ చేయలేదని, వారిని వదిలి పెట్టాలని ఎస్ఐ రామాంజనేయులును కోరారు. సీఐ వచ్చాక ఏ విషయమూ చెబుతామని ఆయన సమాధానమివ్వగా వారు వాగ్వాదానికి దిగారు. ఎస్ఐ వాహనానికి అడ్డు పడ్డారు. దీంతో ఎస్ఐ చేసేదేంలేక కిందకు దిగి ఇంటికి నడుచుకుంటూ వెళ్లిపోయారు. అయినా ఆందోళన కారులు అక్కడే బైఠాయించగా ఎస్ఐ తిరిగి స్టేషన్కు వచ్చి అదుపులోకి తీసుకున్న ముగ్గురు యువకులనూ వదిలిపెట్టారు. దీంతో ఆందోళనకారులు శాంతించారు. అయితే కాలనీకి తిరిగి వెళుతూ మార్గమధ్యంలో మునిసిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. ఆ సమయంలో అక్కడే ఉన్న చైర్పర్సన్ తులశమ్మ కోడళ్లు, కుమార్తెలు ఎస్సీ కాలనీవాసులతో ఘర్షణకు దిగారు. పరస్పరం చెప్పులతో కొట్టుకున్నారు. ఇరు వర్గాలకు చెందిన పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం తమపై చైర్పర్సన్ కుటుంబ సభ్యులు, వారి మద్దతుదారులు దాడి చేసి గాయపరిచారని ఎస్సీ కాలనీవాసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అలాగే తులశమ్మ వర్గీయులు, కుటుంబ సభ్యులు కూడా ప్రతిగా ఫిర్యాదు అందజేశారు. తిరిగి స్టేషన్లో కూడా ఇరు వర్గాల వారు ఘర్షణకు దిగారు. పోలీసులు హెచ్చరించినా లెక్కచేయలేదు. కాలనీవాసులు స్టేషన్ గేట్ వద్ద ధర్నా చేపట్టారు. చైర్పర్సన్ కుమారుడినిస్టేషన్కు పిలిపించే వరకు ధర్నా విరమించేది లేదని భీష్మించుకూర్చున్నారు. ఈ తతంగం సుమారు మూడు గంటల పాటు జరిగింది. విచారణ చేసి దోషులందరిపై చర్యలు తీసుకుంటామని సీఐ హామీ ఇవ్వడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది. నా కొడుకును బ్లాక్ మెయిల్ చేశారు తన కుమారుడు దిల్కా శీనాను బ్లాక్మెయిల్ చేశారని మునిసిపల్ చైర్పర్సన్ తులశమ్మ ఆరోపించారు. పోలీసు స్టేషన్ వద్ద ఆమె విలేకరులతో మాట్లాడారు. ముగ్గురు యువకులు గత నెల రోజులుగా డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడంతో పాటు వేధించారన్నారు. వేధింపులకు, బ్లాక్ మెయిల్కు తట్టుకోలేక పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. మిది కూడా తప్పన్నట్లు వారు ప్రవర్తించడం మంచిది కాదన్నారు. నన్ను చైర్పర్సన్ కుటుంబ సభ్యులు చితకబాదారు ఎస్సీ సబ్ ప్లాన్ నిధులపై ఆర్టీఏ యాక్ట్ కింద వివరాలు అడగడానికి మునిసిపల్ కార్యాలయానికి వెళ్లిన తనను చైర్ పర్సన్ కుటుంబ సభ్యులు చితకబాదారని రాణాప్రతాప్ అనే యువకుడు ఆరోపించారు. కుడి చెయ్యి విరిగిందన్నారు. తనపై దాడి చేసిన వారందరిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. -
రేపు ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్
అనంతపురం అర్బన్ : కలెక్టరేట్లో ఈ నెల 3వ తేదీ (సోమవారం) కలెక్టర్ కోనశశిధర్ ఆధ్వర్యంలో ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక గ్రీవెన్స్ నిర్వహిస్తున్నట్లు సాంఘీక సంక్షేమ శాఖ డీడీ ఎస్.రోషన్న శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 9 గంటలకు రెవెన్యూ భవన్లో ‘మీ కోసం’ కార్యక్రమంతో పాటు ఎస్సీ, ఎస్టీ గ్రీవెన్స్ కూడా జరుగుతుందని తెలియజేశారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలు, సంఘాల నాయకులు హాజరై సమస్యలపై అర్జీలు ఇచ్చుకుని పరిష్కారం పొందాలని తెలిపారు. -
ఎస్సీ శాఖలో రెవెన్యూ అధికారులు
సాక్షి, హైదరాబాద్: ఐదుగురు డిప్యూటీ కలె క్టర్లను ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారులుగా నియమించడం వివాదానికి దారి తీసింది. వారి నియామకంపై రెండ్రోజుల క్రితం ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీఆర్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి శాఖాపరంగా పదోన్నతులిచ్చి ఈ పోస్టులను భర్తీ చేయాలి. కానీ, ఎస్సీ అభివృద్ధి శాఖ సూచనలు కూడా తీసుకోకుండా నియామకా లు చేపట్టడంపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పాత 10 జిల్లాల్లో ఉప సంచాలకులు(డీడీ) జిల్లా ఎస్సీ అధికారులు గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. వారికి సహా యకులుగా జిల్లాకొకరు చొప్పున (హైదరా బాద్లో ఇద్దరు) 11 మంది జిల్లా సాంఘిక సంక్షేమాధికారులు(డీఎస్డబ్ల్యూవో) పనిచే స్తున్నారు. తాజాగా జిల్లాల సంఖ్య 31కి చేరడంతో పాత జిల్లాల్లోని డీడీలను అలాగే కొనసాగిస్తూ 11 మంది డీఎస్డబ్ల్యూవోలను కొత్త జిల్లాలకు ఎస్డీడీవో(ఎస్సీ అభివృద్ధి శాఖ అధికారి)గా నియమించింది. ఇలా 21 జిల్లాలకు అధికారులను సర్దుబాటు చేసిన ఎస్సీ అభివృద్ధి శాఖ మిగతా పది జిల్లాలో ఏఎస్డబ్ల్యూవో (సహాయ సాంఘిక సంక్షే మాధికారి)ని ఇన్చార్జ్లుగా నియమించింది. తాజాగా రెవెన్యూ శాఖకు చెందిన ఐదుగురు డిప్యూటీ కలెక్టర్లను నల్లగొండ, పెద్దపల్లి, వనపర్తి, సూర్యాపేట, జనగామ జిల్లాలకు ఎస్డీడీవోలుగా బదిలీ చేస్తూ ఉత్తర్వులిచ్చిం ది. మరోవైపు బీసీ సంక్షేమ శాఖలోనూ మరో డిప్యూటీ కలెక్టర్ను జిల్లా సంక్షేమాధి కారిగా నియమించింది. ఎస్సీ అభివృద్ధి శాఖ సూపరింటెండెంట్లు, ఏఎస్డబ్ల్యూవోల పదో న్నతులకు సంబంధించిన ఫైలు వద్ద పెండిం గ్లో ఉంది. ఈ క్రమంలో డిప్యూటీ కలెక్టర్లను నియమించడంపై తెలంగాణ ఏఎస్డబ్ల్యూ వో, సంక్షేమ శాఖ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఎస్సీ అభివృద్ధిశాఖ మంత్రి జగదీశ్రెడ్డి, బీసీ సంక్షే మశాఖ మంత్రి జోగు రామన్నలకు విజ్ఞాపన లిచ్చారు. ప్రభుత్వం స్పందించకుంటే ఒక ట్రెండు రోజుల్లో తదుపరి కార్యాచరణ ప్రకటించనున్నట్లు తెలంగాణ సహాయ సాంఘిక సంక్షేమాధికారుల సంఘం ప్రధాన కార్యదర్శి వినోద్కుమార్ తెలిపారు. -
సంక్షేమానికి పెద్దపీట
బడ్జెట్లో రూ.30,592.46 కోట్లు గతేడాదితో పోల్చితే 39 శాతం పెరిగిన కేటాయింపులు సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం 2017–18 బడ్జెట్లో సంక్షేమానికి పెద్దపీట వేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, వికలాంగ, మహిళాశిశు సంక్షేమ శాఖలకు కలిపి ఏకంగా రూ.30,592.46 కోట్లు కేటాయించింది. ఈ శాఖలకు గత బడ్జెట్ కేటాయింపులు రూ.21,949.64 కోట్లు కాగా.. తాజాగా 8,642.82 కోట్లు (39.37 శాతం) అదనంగా ఇచ్చారు. కొత్తగా ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి బడ్జెట్లో మార్పుల నేపథ్యంలో షెడ్యుల్డ్ కులాల (ఎస్సీ) సబ్ప్లాన్ స్థానంలో.. ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్సీఎస్డీఎఫ్) విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. సమగ్ర అభివృద్ధి చర్యల్లో భాగంగా ఈ కొత్త పథకాన్ని ప్రవేశపెడుతున్నామని, దీనికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తామని.. నిధులు మిగిలితే వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేస్తామని స్పష్టం చేసింది. తాజా బడ్జెట్లో ఎస్సీల కోసం రూ.14,375.12 కోట్లు కేటాయించారు. 43 ప్రభుత్వ శాఖల ద్వారా ఈ నిధులను ఖర్చు చేసి ఎస్సీల సమగ్ర అభివృద్ధికి పాటుపడతామని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అసెంబ్లీలో ప్రకటించారు. గతేడాది బడ్జెట్లో ఎస్సీ ఉప ప్రణాళిక కింద కేటాయించినది రూ.10,483.96 కోట్లుకాగా.. ఈ సారి కేటాయింపులు రూ.3,891.16 కోట్లు అదనం. గిరిజనాభివృద్ధికి పెరిగిన నిధులు గిరిజన ఉప ప్రణాళిక (సబ్ ప్లాన్) స్థానంలో కొత్తగా గిరిజన ప్రత్యేక అభివృద్ధి నిధి(ఎస్టీఎస్డీఎఫ్)ని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. గిరిజనుల సమగ్ర అభివృద్ధి కోసం కొత్త పథకాల్ని ప్రవేశపెడతామని, వారికి కేటాయించిన నిధులను పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తామని, మిగిలితే వచ్చే ఏడాదికి క్యారీ ఫార్వర్డ్ చేస్తామని ప్రకటించింది. తాజా బడ్జెట్లో ఎస్టీఎస్డీఎఫ్కు రూ.8,165.87 కోట్లు కేటాయించింది. ఇందులో కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల కింద రూ.1,766.16 కోట్లు అందుతాయని అంచనా వేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలకు రూ.5,579.5 కోట్లు, గ్రామీణ మౌలిక వసతుల అభివృద్ధి నిధికి రూ.9.28 కోట్లు కేటాయించింది. 2016–17 బడ్జెట్లో ఎస్టీ సబ్ప్లాన్ కింద ప్రభుత్వం రూ. 6,171.15 కోట్లు కేటాయించగా.. ఈ సారి రూ.1,994.72 కోట్లు అదనంగా ఇచ్చారు. బీసీలకు నిధులు డబుల్ రాష్ట్రంలో వెనుకబడిన తరగతుల సంక్షేమానికి నిధులను భారీగా పెంచింది. గతేడాది ఈ శాఖకు రూ. 2,537.51 కోట్లు మాత్రమే ఇవ్వగా.. తాజా బడ్జెట్లో అంతకు రెండింతలుగా రూ.5,070.36 కోట్లు కేటాయించారు. బీసీ సంక్షేమ శాఖ పరిధిలో కొత్తగా ఎంబీసీ (అత్యంత వెనుకబడిన కులాలు) కార్పొరేషన్ ఏర్పాటు చేస్తూ.. దానికి రూ.1,000 కోట్లు కేటాయించారు. కొత్తగా ప్రారంభం కానున్న బీసీ గురుకుల పాఠశాలల కోసం రూ. 161 కోట్లు ఇచ్చారు. బీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.753.31 కోట్లు, ఈబీసీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్కు రూ.252 కోట్లు కేటాయించారు. మహిళా, శిశు అభివృద్ధికి కొంతే ఊరట మహిళా, శిశు, వికలాంగ సంక్షేమ శాఖకు గతేడాది బడ్జెట్లో రూ.1,552.58 కోట్లు ఇవ్వగా.. ప్రస్తుతం రూ.1,731.50 కోట్లు కేటాయించారు. నిర్వహణ పద్దు కింద రూ.881.77 కోట్లు, ప్రగతి పద్దు కింద రూ.849.72 కోట్లు కేటాయించారు. మహిళల సామాజిక భద్రత, సంక్షేమం కోసం రూ.106.36 కోట్లు, పౌష్టికాహార పంపిణీకి రూ.675.02 కోట్లు ఇచ్చారు. ఐసీడీఎస్ పథకానికి రూ.12 కోట్లు, గర్ల్ చైల్డ్ పరిరక్షణ పథకానికి రూ.10 కోట్లు కేటాయించారు. మైనార్టీలకు అంతంతే! మైనారిటీ సంక్షేమ శాఖకు గతేడాది రూ. 1,204.44 కోట్లు ఇవ్వగా.. తాజాగా రూ. 1,249.66 కోట్లు కేటాయించారు. తాజా కేటాయిం పుల్లో మైనారిటీ విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కోసం రూ.180 కోట్లు, బ్యాంకుల ద్వారా ఇచ్చే రాయితీ రుణాలకు రూ.150 కోట్లు, ఉర్దూ అకాడమీకి రూ.23 కోట్లు, వక్ఫ్ బోర్డుకు రూ.50 కోట్లు కేటాయించారు. మైనారిటీ గురుకులాల కోసం రూ.425 కోట్లు, దావత్ ఏ ఇఫ్తార్, క్రిస్మస్కు రూ.30 కోట్లు, ఓవర్సీస్ విద్యానిధి పథకం కింద రూ.40 కోట్లు కేటాయించారు. -
ఇది మన ప్రతిజ్ఞ: శశికళ ఉద్వేగం
చెన్నై: సుప్రీంకోర్టు తీర్పుతో అన్నాడీఏంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ నటరాజన్ ఖిన్నురాలయ్యారు. ఎమ్మెల్యేల సమావేశంలో ఆమె కన్నీరు పెట్టుకున్నారు. మన పార్టీని, ప్రభుత్వాన్ని ఎవరూ కదపలేరంటూ ఎమ్మెల్యేలను ఉద్దేశించి ఉద్వేగంగా మాట్లాడారు. సంక్షోభానికి పన్నీర్ సెల్వమే కారణమని, మన వేళ్లతో మన కంటినే పొడుస్తున్నారని వాపోయారు. పార్టీని చీల్చడానికి నానా కుట్రలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ‘కచ్చితంగా మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తాం. ఆ తర్వాత అమ్మ సమాధి వద్ద ఫొటో దిగి ప్రపంచానికి చూపిద్దాం. ఇది మన ప్రతిజ్ఞ. మీరంతా కుటుంబంలా నాకు అండగా ఉంటే అన్నిటినీ సాధిస్తా. అమ్మ నాతో ఉన్నంత వరకు వెనుకడుగ వేసేది లేదు. 129 ఎమ్మెల్యేల మద్దతు నాకు ఉంది. విజయం సాధించాక దాన్ని అమ్మకు అంకితం ఇద్దాం. డీఎంకే కుట్రలను గెలిపించొద్దు. నేను మహిళను కాబట్టి నన్ను భయపెట్టాలనుకుంటున్నారు. ఈ ఆటలు సాగవ’ని శశికళ పేర్కొన్నారు. శశికళ కేసు.. మరిన్ని కథనాలు శశికళ దోషి: సీఎం పదవి ఆశలపై నీళ్లు జయలలిత ఉండి ఉంటే... సుప్రీం తీర్పుతో ఎన్నికలకు దూరం అమ్మ చివరి మాట కోసం పోరాటం! గవర్నర్ పిలుపు కోసం ఎదురుచూపులు! ఫుల్ జోష్గా పన్నీర్.. సంబురాల్లో శ్రేణులు శశికళ వద్ద ప్లాన్ బీ ఉందా? గవర్నర్ కు ముందే తెలుసా? ‘న్యాయం గెలిచింది’ శశికళ కేసు పూర్వాపరాలివి.. ఎమ్మెల్యేలను బయటికి రప్పించే యత్నాలు స్టాలిన్ సహా డీఎంకే శ్రేణుల సంబరాలు! 'తమిళనాడులో దీపావళి చేసుకుంటున్నారు' శశికళ దోషి: ట్విట్టర్ రియాక్షన్ ఎలా ఉందంటే... జయ నుంచి జైలు దాకా శశి పయనం? -
జనం లెక్క.. ధనం పక్కా!
జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా ఖరారు ♦ జనాభా ప్రాతిపదికన నిధుల ఖర్చు ♦ ఎస్సీ కేటగిరీలో మంచిర్యాల, ఎస్టీ కేటగిరీలో మహబూబాబాద్ జిల్లాకు అధిక నిధులు సాక్షి, హైదరాబాద్: జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీల జనాభా లెక్కలను అధికారులు తేల్చేశారు. ఉప ప్రణాళిక చట్టాన్ని సవరించే క్రమంలో జనాభా ప్రాతిపదికన నిధులు ఇవ్వాలని ఎస్సీ, ఎస్టీ కమిటీలు ఇప్పటికే నిర్ణయించిన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల్లోపు చట్ట సవరణలు, కొత్త పథకాలపై నివేదికలు ఇచ్చేందుకు కమిటీలు కసరత్తు చేస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖలు జిల్లాలవారీగా ఎస్సీ, ఎస్టీ జనాభా లెక్కలను సేకరించాయి. 2011 జనగ ణన ప్రకారం రాష్ట్రంలో పది జిల్లాలకు సంబం ధించి గణాంకాలు సిద్ధంగా ఉండగా.. కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటు కావడంతో ఆ మేరకు జనాభా లెక్కలను తేల్చేందుకు ఉపక్రమించా యి. ఈ నేపథ్యంలో మండలాలు, రెవెన్యూ డివిజన్లవారీగా ఎస్సీ, ఎస్టీ జనసంఖ్యను అధి కారులు నిర్ధారించారు. 2011 జనగణన ప్రకారం రాష్ట్రంలో జనాభా 3,50,03,674. వీరిలో ఎస్సీలు 54,08,800, ఎస్టీలు 31,77,940 మంది. మొత్తం జనాభా లో ఎస్సీలు 15.45 శాతం, ఎస్టీలు 9.08 శాతం ఉన్నారు. ఈ గణాంకాల ఆధారంగానే ఎస్సీ, ఎస్టీల ప్రత్యేక అభివృద్ధి నిధి కింద జిల్లాలవారీగా ఖర్చు చేయాలని భావిస్తున్నారు. మహబూబాబాద్, మంచిర్యాలకు.. ఎస్సీ అభివృద్ధి శాఖ, ఎస్టీ సంక్షేమ శాఖలు తేల్చిన గణాంకాల ప్రకారం ఎస్సీ ప్రత్యేక అభివృద్ధి నిధి కింద మంచిర్యాల జిల్లాకు అధిక నిధులు రానున్నాయి. ఈ జిల్లా సాధారణ జనాభాలో ఎస్సీలు 24.72 శాతం ఉన్నారు. ఆ తర్వాత నాగర్కర్నూల్ (21.32 శాతం), జనగామ(21.15 శాతం), ఖమ్మం (19.93శాతం) జిల్లాలకు అధిక నిధులు అందనున్నాయి. హైదరాబాద్తో పాటు మేడ్చల్ జిల్లాల్లో ఎస్సీ జనాభా తక్కువగా ఉంది. ఎస్టీ కేటగిరీలో మహబూబాబాద్ జిల్లాకు అధిక నిధులు కేటాయించనున్నారు. ఈ జిల్లాలో సగటు జనాభాలో 37.8శాతం గిరిజనులున్నారు. ఆ తర్వాత భద్రాద్రి– కొత్తగుడెం జిల్లా (36.66 శాతం), ఆదిలా బాద్ (31.68శాతం) జిల్లాలున్నాయి. హైదరాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో అతి తక్కువ సంఖ్యలో గిరిజనులున్నారు.