రెండు రోజుల్లో రుతు‘రాగాలు’ | Rains in two days | Sakshi
Sakshi News home page

రెండు రోజుల్లో రుతు‘రాగాలు’

Published Thu, Jun 8 2017 3:40 AM | Last Updated on Tue, Sep 4 2018 5:02 PM

Rains in two days

సాక్షి, హైదరాబాద్‌: ఎండ తీవ్రత తగ్గి కొద్ది రోజులుగా ఊపిరి పీల్చుకుంటున్న రాష్ట్ర ప్రజలకు మరింత ఉపశమనం! ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న నైరుతి రుతుపవనాలు రెండు మూడు రోజుల్లో రాష్ట్రంలోకి ప్రవేశించనున్నాయి. హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం డైరెక్టర్‌ వై.కె.రెడ్డి బుధవారం ఈ మేరకు వెల్లడించారు. అవిప్పటికే ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లోకి ప్రవేశించాయని ఆయన వెల్లడించారు. 10, 12 తేదీల మధ్య తెలంగాణలోకి ప్రవేశించే అవకాశముందని వివరించారు. అయితే, ‘రుతుపవనాలు రాయలసీమలో ప్రవేశించినంత మాత్రాన అనుకున్న సమయంలోగా తెలంగాణలోకీ ప్రవేశించాలనేమీ లేదు.

ఒక్కోసారి కాస్త ఆలస్యమూ కావచ్చు. ప్రస్తుతానికైతే రాష్ట్రంలోకి వాటి ఆగమనానికి ఎలాంటి అడ్డంకులూ లేవు’’అని ఆయన చెప్పారు. మరోవైపు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గత 24 గంటల్లో జగిత్యాలలో 11 సెంటీమీటర్ల భారీ వర్షం కురిసింది. ధర్పల్లి, గట్టుల్లో 7 సెంటీమీటర్లు, జక్రాన్‌పల్లి, నవీపేట్, గంగాధర, మాగ్నూరు, మాక్లూరుల్లో 6 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మద్దూరు, నిజామాబాద్, జూరాల, మెట్‌పల్లి, రెంజల్, భీంగల్, మల్యాల్, బోథ్‌ల్లో 5 సెంటీమీటర్లు కురిసింది. వచ్చే నాలుగు రోజులు రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement